వరాహ మహా పురాణము
అధ్యాయము - 3
మహర్షీ! జ్ఞాన సంపన్నుడా! మరియుక జన్మ నందు జరిగిన ఆ విలాసమంతయు నాకు చెప్పుము. నాకెంతో వేడుకగా నున్నది.
రాజేంద్రా! నేనా వేద సరస్సున స్నాన మాడిన పిదప సావిత్రీ దేవి వాక్కులను విన్న పిదప నా వేయి జన్మముల స్మరణము ఒక్క పెట్టున కలిగెను. ఆ పాత్ర పుట్టుకల సంగతి వినుము.
రాజా! అవంతియను పుర మొకటి కలదు. మునుపు వేరొక కృత యుగమున నే నందొక బ్రాహ్మణ శ్రేష్ఠుడనై యుంటిని. అప్పటి నా పేరు సారస్వతుడు. వేద వేదాంగములను తుదముట్ట చదివితిని.
ఆ మరియొక కృత యుగమున నేను పెక్కండ్రు సేవకులు, పరివారము, గొప్ప ధాన్య సంపదయు కలవాడనై యుంటిని. గొప్ప బుద్ధి విశేషము కూడా నా కుండెడిది.
అంత నేను ఏకాంతమున నిట్లు చింతించితిని: నేనీ ద్వంద్వ భావముతో (సుఖ దుఃఖములు, లాభ నష్టములు మొదలగు దానితో) నేమి చేయ వలయును? దీని నంతటిని కొడుకుల కప్పగించి తపస్సునకు చెదరని సంకల్పము కలవాడనై సారస్వతమను సరస్సునకు వెను వెంటనే పోయెదను.
నే నిట్లు తలపోసి కేశవుని, శ్రాద్దములతో పితృ దేవతలను, యగ్నములతో ఇతర జీవులను అర్చించితిని.
రాజా! పిదప నేను తపస్సునకు నిశ్చయిచుకొని పుష్కరమని జనులు చెప్పు కొను సరస్వతమను పేరుగల సరస్సునకు బయలు దేరితిని.
అందేగి నేను పురాణ పురుషుడు, మంగళ స్వరూపుడు నగు విష్ణువును భక్తితో అరాధించితిని. శ్రీమన్నారాయణ జపము గావించితిని.
బ్రహ్మమే పరదైవ మనెడు తత్త్వముతో నిండిన ఆ మహా స్తోత్రమును నేను జపింపగా భగవంతుడు తుష్టుడై నాకు ప్రత్యక్ష మయ్యెను.
దేవర్షీ! మిక్కిలి ప్రసన్నమగు బుద్దికల నీవు నాయంద నుగ్రహముతో బ్రహ్మ పారమన నెట్టిదో నాకు చెప్పుము. వినగోరు చున్నాను.
పరముల కెల్ల పరముడు, అమృతుడు, పురాణుడు, చిట్ట చివరి వాడు, అంతు లేని శక్తి గల భావనలకు తుది గట్టు అయిన విష్ణువునకు మ్రొక్కు లిడుదును.
సర్వమునకు మునుపు ఉన్నవాడు, సాటి లేని వాడు, అతి దూరమున నుండు వాడు, అతి సమీపమున నుండు వాడు, జగముల కవ్వలి హద్దున నుండు వాడు, భరింప రాని తేజము గలవాడు, సకల ప్రజ్ఞల కంటె లోతైన ప్రజ్ఞ కల ప్రధాన పురుషుడు, ప్రభువు అగు హరి దేవునకు మ్రొక్కెదను.
పరమున కంటె పరమైన వాడు, తన కంటె ఉత్తముడు లేని వాడు, సర్వమునకు మూలమైన వాడు, పరులగు దేవజాతికి కూడా లక్ష్యమైన వాడు, పవిత్రమగు స్థానము, సర్వ జగత్తులను తనలో అణు స్వరూపముగా నిముడ్చు కొన్న విశాల స్వరూపుడు, పర దైవములకు కూడ పాలకుడు, పురాణ పురుషుడు అగు నారాయణుని విశుద్ధ భావముతో స్తుతింతును.
మును పిదియంతయు శూన్యముగా నుండగా నాతడు, అంతకు ముందే యున్న వాడు కావున, ఈ సమస్త లోకములను ప్రసిద్ద మాయెను. అట్టి ఏదోషములు లేని నారాయణుడు నాకు దిక్కగు గాక!
తుది దిక్కు, అనంతమైన రూపములు కలవాడు, నీతి మంతులలో ప్రధానుడు, సర్వ భూమికి పట్టుగొమ్మ, శాంతిని నెలకొల్పు వాడు, భూమికి ఏలిక, మంగళ స్వరూపుడు, మహానుభావుడు అగు విష్ణువు నెల్లవేళలా స్తుతింతును.
వేల కొలది శిరస్సులు, లెక్కిడ రాని పాదములు హస్తములు గలవాడు, సూర్య చంద్రులు కన్నులైన వాడు, క్షరుడు (నాశము పొందు వాడు) అక్షరుడు (నాశము లేని వాడు) పాల కడలిలో శయనించు వాడు, అమృత స్వరూపుడు, పరమేశ్వరుడు అగు శ్రీ విష్ణువును కొని యాడుదును.
ఋగ్యాజు స్సామములు అనెడు మూడు వేదముల వలననే యెరుగ దగిన వాడు, ఇరువది ఏడు తత్త్వములు ఒకే రూపమైన వాడు, మూడు విధములగు శుద్ధ వస్తువులలో నెలకొని యుండు వాడు, మూడగ్నుల స్వరూప మైన వాడు (దక్షిణాగ్ని, ఆహవానీ యాగ్ని, గార్హ పత్యగ్ని అనునవి మూడగ్నులు). సత్యము, జ్ఞానము, అనంతము అను మూడు తత్త్వములకు గుఱియైన వాడు, కృత, త్రేతా, ద్వాపరముల స్వరూపమైన వాడు, సూర్య చంద్రాగ్నులు కన్నులైన వాడు, ఇట్టివా డింత వాడని యూహింప నలవి కాని వాడు అగు నారాయణునకు నమస్కరింతును.
కృత యుగమున తెల్లనిదియు, త్రేతా యుగమున ఎర్రనిదియు, ద్వాపర యుగమున పసిమి వన్నె కలదియు, కలి యందు నల్లనిదియు నగు దేహ కాంతి కల ఆ హరికి కైమోడ్పు.
ముఖము నుండి బ్రాహ్మణులను, భుజముల నుండి క్షత్రియులను, తొడల నుండి వైశ్యులను, కాలి తుదల నుండి శూద్రులను సృజించిన విశ్వ రూపడగు ఆది దేవునకు నమస్కరింతును.
దూరముల కెల్ల దవ్వయిన వాడు, పారము ముట్టిన వాడు, వేద ప్రమాణముచే తెలియ దగిన వాడు, సర్వ యుద్దములకు నాయకుడు, ఆయా పనులు నిర్వహించుటకు కృష్ణుడై పుట్టిన వాడు, గద, ఖడ్గము, డాలు ధరించిన చేతులతో నిత్యము సిద్దముగా నుండు వాడు, ఊహల కందని వాడు నగు శ్రీనారాయణునికి మ్రొక్కు లిడుదును.
నే నిట్లు స్తుతింపగా ఆ దేవదేవుడు ప్రసన్నుడై ఉరుము వంటి కంఠ ధ్వనితో నాయనా! వరము కోరుకొమ్మని మరల మరల నాతో పలికెను. అంత నేను దేహము నందే లయ మగుటను కోరు కొంటిని.
అంత సనాతనుడగు ఆ దేవ దేవుడు నా మాట విని బ్రాహ్మణోత్తమా! ఈ నాశనము లేని ప్రకృతి లోనికి చొరబడు మని ఆనవెట్టెను.
బ్రహ్మ యొక్క వేయి యుగముల ఆయువు నీకు సిద్దించును. అట్లే అర్ధ వంతమగు పేరు కూడా నీ కేర్పడును.
నార మనగా త్రావు నీరు. నీ వెల్ల వేళల పితృ దేవతలకు, దాని నిత్తువు కనుక నీకు నారదుడను పేరు కలుగును.
ఇట్లా దేవుడు బిగ్గరగా పలికి కనబడ కుండ బోయెను. నేను తగు కాలమున ఆ దేహము విడచి తపస్సు మహిమ వలన బ్రహ్మ దేహమున లయ మైతిని. అట్లే మరల ఆతడు పుట్టిన దినమున అతని పది మంది పుత్రులలో నేనును పుట్టుక నొందితిని.
ఎందుండి పుట్టెనో ఎరుగని బ్రహ్మ దేవుని మొదటి దినము మొదలే సమస్త దేవతల సృష్టికి మొదలు. ఇందు సంశయము లేదు.
ఇదియే సర్వేశ్వరుని ధర్మమును బట్టి సమస్త జగత్తునకు సృష్టి, రాజా! నన్ను నీవడిగిన నా పూర్వ జన్మ వృత్తంత మిదియే.
నేనెట్లు నారాయణుని ధ్యానించి ఉత్తమ పదవి నందితినో యట్లె నీవును విష్ణు నందు సర్వము నెలకొల్పిన వాడవగుము.
