వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 44

వైశాఖ మాసమున కూడ జను డిట్లే సంకల్పించి, మునుపు చెప్పినట్లు స్నానము మొదలగు నది ఆచరించి దేవాలయమున కరుగ వలయును.

 

అచట భక్తితో హరిని ఈ మంత్రములతో నర్చింప వలయును. ‘ఓం నమో జామదగ్న్యాయ’ అని పాదములను, ‘సర్వ ధారిణే’ అని ఉదరమును, ‘మధుసూదనాయ’ అని నడుమును, ‘శ్రీవత్స ధారిణే’ అని రొమ్మును, ‘క్షత్రాంతకాయ’ అని భుజములను, ‘మణి కంఠాయ’ అని కంఠమును, వాని పేరులతో - అనగా ‘పాంచజన్యాయ’ అని శంఖమును, ‘సుదర్శనాయ’ అని చక్రమును, ‘బ్రహ్మాండ ధారిణే’ అని శిరస్సును నమస్కరింప వయును.

 

ఇట్లు కొలిచి బుద్ధిశాలి మునుపటి వలెనే జంట బట్టలు చుట్టి నదియు, మూసినదియు నగు ఘటమును ఆ దేవుని ముందు నిలుప వలయును.

 

జమదగ్ని తనయు డని పేరొందిన పరశురాముని, కష్టములు పోకార్చు వానిని వెదురు పాత్రతో నిర్మించి అందు ఉంచ వలయును.

 

అతని కుడిచేతి యందు గొడ్డలిని ఏర్పరుప వలయును. సుగంధములు గల పెక్కు విధములగు పూవులతో పూజింప వలయును.

 

పిదప ఆతని ముందు భక్తితో జాగరము చేయ వలయును. తెల్లవారిన పిదప (సూర్యోదయ మైన తరువాత) ఆ కుంభమును బ్రాహ్మణునకు సమర్పింప వలయును. ఇట్లు నియమముతో కూడి వ్రతము చేయు వాడు పొందు ఫలము చెప్పెదను. వినుము.

 

పూర్వము వీరసేనుడను మహా బలము గల రాజుండెడి వాడు. అతడు పుత్రులు లేనివాడు. గొప్ప శక్తితో తీవ్రమగు తపస్సు చేసెను.

 

అట్లు ఘోరమైన తపస్సు చేయుచున్న ఆతనిని అల్లంత దూరము నుండి చూచి యాజ్ఞవల్క్య మహాముని యను మహాయోగి ఆతని కడకు వచ్చెను.

 

గొప్ప ముఖ వర్చస్సు గల ఆ ఋషి వచ్చు చుండగా చూచి రాజు దోయిలొగ్గి ఆతని కెదురేగెను.

 

ఆతని పూజలంది ముని రాజా! ధర్మజ్ఞా! దేని కొరకు తపస్సు చేయు చున్నావు? నీవు సంకల్పించిన ఫలమేమి? అని అడిగెను.

 

పుణ్యాత్ముడా! నేను అపుత్రుడను. నాకు పుత్ర సంతానము లేదు. కావున తపస్సు చేత నా దేహమును కష్టపెట్టు చున్నాను.

 

యాజ్ఞవల్క్యుడు:

 

యాజ్ఞవల్క్యుడు:

రాజా! చాల కష్టమైన ఈ తపస్సు వలదు. నీకు కొంచెము పాటి క్లేశముతో పుత్రుడు లభించును. సంశ యింపకుము.

 

బ్రాహ్మణోత్తమా! తేలిక శ్రమతో నాకు పుత్రుడెట్లు కలుగును? నీకు మ్రొక్కెదను. నాయందు ప్రీతి కలవాడవై నాకు దానిని బోధింపుము.

 

ఆ రాజట్లు పలుకగా ఆ ముని అతనికి వైశాఖ మాసమున శుక్ల పక్షమున ద్వాదశి నాడు చేయ వలసిన ఆ పూజను గూర్చి వివరించెను.

 

పుత్రులను కోరిన ఆ రాజు విధానము ననుసరించి ఉపవాస ముండి ఆ వ్రత మాచరించి పరమ ధార్మికుడగు నల మహారాజును పుత్రునిగా పడసెను. ఈనాటికి ఆ నలుని పుణ్య శ్లోకుడని కీర్తించు చున్నారు.

 

ఓ మహామునీ! ఈ వ్రతము నాచరించు వానికి ధనము విద్య, చక్కని ముఖ కాంతి గల మంచి కుమారుడు కలుగును. ఇది ఒక అప్రధానమగు ఫలము.

 

ఈ లోకమున ఇట్టి ఫల మందుట ఏమి చిత్రము? పర లోకము మాట వినుము. ఒక కల్ప కాలము బ్రహ్మ లోకమున అప్సరసల గణములతో విలాసముగా గడపి మరు సృష్టి యందు చక్రవర్తియై జనించును. ముప్పది వేల సంవత్సరములు జీవించును. సంశయ మిందు లేదు.