వరాహ మహా పురాణము
అధ్యాయము - 8
ఆ వసురాజు దేహమున పుట్టిన వ్యాదు డుండెనే అతడు తన వృత్తితో నాలుగు వేల సంవత్సరముల కాలము గడపెను.
తన కుటుంబము కొఱకు దినమున కొక్కటి చొప్పున అడవి మృగమున చంపి పని వారలను, అతిథులను, అగ్నిని తృప్తి పరచెడివాడు.
ఓ సుందరీ! అతడు ప్రతి అమావాస్య నాడును మిథిల యందు పితృ దేవుల నుద్దేశించి తన ఆచారమును బట్టి వివేకముతో శ్రాద్దకర్మ మొనర్చెడి వాడు.
ప్రతి దినము అగ్ని నర్చించు చుండెడి వాడు. సత్యమునే చక్కగా పలుకుచు జీవయాత్ర సాగించుచు నతడు ఏ జంతువును కూలనేయ లేదు.
ఇట్లు జీవించు చుండగా అతనికి ధర్మ బుద్దియు, గొప్ప తపస్సు చేయు వాడును, ముని వంటి వాడును, ఇంద్రియముల పై అదుపు గలవాడును అగు అర్జునకుడను కొడకు పుట్టెను.
పెద్ద కాలము గడచిన పిదప సత్ర్పవర్తనతో బుద్ది మంతుడుగా మెలగిన ఆతనికి చక్కని రూపు రేఖలు గల ‘అర్జునకి’ యను కూతురును పుట్టెను.
ఆమెకు పెండ్లియీడు రాగా ఆ ధర్మాత్ముడు ఈమె నేవని కొసగుదును? అన్ని విధముల తగిన పురుషు డెవ్వడు? అని ఆలోచించెను.
ఇట్లు చింతించు చుండగా ఆతనికి మతంగుని కొడుకు, చక్కని తీరు తెన్నులు గలవాడు అగు ప్రసన్నుడను వాడు మదిలో మెదలెను.
ఇట్లు తలపోసి ఆతడు మతంగుని కొడుకగు ప్రసన్నుని గూర్చి నిశ్చయించు కొని ఆతని తండ్రితో ‘తాపస వరేణ్యా! మహాత్ముడగు ప్రసన్నునకు నా బిడ్డ నిచ్చితిని. నీవు దయతో స్వీకరింప వలయును’ అని పలికెను.
అయ్యా! వ్యాధవరేణ్యా! ఈ నా కుమారుడు ప్రసన్నుడు అన్ని శాస్త్రములలో ఆరితేరిన వాడు. నీ బిడ్డను అర్జునకిని నేను కోడలుగా కైకొందును.
మతంగు డిట్లనగా మహా తపస్వియగు ధర్మ వ్యాధుడు ప్రసన్నునకు కన్య నర్పించెను.
దర్మవ్యాధుడు అంత కన్య నొసగి తన యింటి కేగెను. ఆమెయు అత్త మామలకును భర్తకును సేవలు చేయుటలో ఆసక్తి కలదాయెను.
అంత పెద్ద కాలము గడచిన పిమ్మట ఉత్తము రాలగు ఆ అర్జునకితో అత్త, బిడ్డా! ప్రాణి హత్య గావించు వానికి బిడ్డవు. నీవును అట్టి దానవే.
తపస్సు చేయుట యెట్లో భర్తను కొలుచుట యెట్లో ఎరుగవు, అని పలికెను.
ఆమెయు చిన్న తప్పునకు అత్త తన్నిట్టు తిట్టగా తండ్రి యింటికి పోయి మాటిమాటికి ఏడ్వ దొడగెను.
తండ్రి ‘బిడ్డా! ఏడ్చుటకు కారణమేమి’ యని అడుగగా ఆమె ఇట్లు చెప్పెను.
నాయనా! మాయత్త మిక్కిలి తీవ్రమైన కోపముతో జీవ హింస చేయువాని కూతురవు. కటిక వాని బిడ్డవు అని పలుమారులు పెద్దగా తిట్టెను.
ఇది విని ధర్మాత్ముడగు ధర్మవ్యాధుడు కోపముతో పల్లె జనులతో నిండిన మతంగుని యింటి కరిగెను.
అట్లు వచ్చిన అతనికి వియ్యంకుడగు మతంగుడు కూర్చుండుటకు పీట వెట్టించి కాళ్ళకు నీరిచ్చి పూజా ద్రవ్యములను ఒసగి మన్నించి ‘నీ రాకకు కారణ మేమి? నేను నీకేమి చేయుదును? అని పలికెను.
ప్రాణము లేని బోజనము కొంత తిన గోరుదును. ఆ కోరికతో నేను నీ యింటికి వచ్చితిని.
తపోధనా! ధర్మములు తెలిసిన వారిలో ఉత్తముడవు. గోధుమలు, ఇతర ధాన్యములు వండిన పదార్దములు మా యింట గలవు. ఇచ్చ వచ్చినట్లు భుజింపుము.
పుణ్యాత్ముడా! ఆ గోధుమలు, ఆ బియ్యము, ఆ యవలు ఎట్టివో చూచెదను. అవి వాని స్వరూపము తోడనే యున్నవేమో నేను చూడ వలయును.
ఇట్లనగా మతంగుడు ధర్మ వ్యాధునకు గోదుమలతో నిండిన చేట నొక దానిని, బియ్యముతో నిండిన చేట నొక దానిని చూపెను.
ఆ గోధుమలను, వరి ధాన్యమును గాంచి ధర్మవ్యాధుడు ఆసనము నుండి లేచి పోవ దొడగెను. మతంగు డాతని నాపెను.
ఓయీ! మహామతీ! భోజనము చేయకయే బయలు దేరితివేల? మా యింట మంచి అన్నము వండించి సిద్దముగా నుంచితిని. నీవు ఏల భుజింపవు?
ప్రతి దినము వేలకొలది, కోట్ల కొలది జీవులను చంపు చున్నావు, ఇట్టి పాపాత్ముని కూడు సత్పురుషు డెవ్వడు తినును?
ప్రాణ శక్తి లేని పదార్థమేమైన నీ యింట నున్నచో వండి యా యన్నము చూపుము. ఇప్పుడిట నేను చూచిన పదార్థములు నీటి జంతువులే కదా! (వీరిని నాటినచో ఏడాదికి వేల కొలది గింజలగును కదా!)
నేనునా సంసారమునకై దినమున కొక్కటి చొప్పున అడవి లోని పశువులను చంపుదును. దానిని వండి పితృ దేవతల కర్పించి నావారితో పాటు తిందును.
ఇక నీవో జీవులను పెక్కింటిని చంపి నీ వారితో కలిసి తిను చున్నావు. ఇది తినరాని తిండి యని నా నిశ్చయము.
తొలత బ్రహ్మ చెట్టు చేమలను, తీగలను యజ్ఞము కొఱకు పుట్టించెను. అదియే ప్రాణులకు ఆహారమయ్యె నని శ్రుతి.
దేవ యజ్ఞము, భూత యజ్ఞము, పితృ యజ్ఞము, మనుష్య యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము అను నవి అయిదు మహా యజ్ఞములు, బ్రహ్మ తొలుత వీనిని ఏర్పరచెను.
బ్రాహ్మణులకు, వారి ద్వారమున ఇతరులకు మేలు జరుగుటకై ఈ యజ్ఞము లేర్పడెను. ఇతర వర్ణముల వారికై బ్రాహ్మణులు వీనిని రూపొందించిరి.
ఇట్లు పై యజ్ఞములకు ఏర్పరిచిన అన్నము ఉత్తమమగు అన్నమగును. అది పవిత్రమైన దగును. అట్లు కానిచో ధాన్యముల ఒక్కొక్క గింజయు మృగముల, పక్షుల వంటివే యగును. అట్టి ధాన్యపు గింజలు పెట్టు వానికి, తిను వానికి అది మహా మాంసముగా లెక్కకు వచ్చును.
దేవత వంటి రూపము గల నా బిడ్డను నీ పుత్రునకు సమర్పించితిని. ఆమెను నీ భార్య జంతువులను చంపు వాని బిడ్డ వని నొక్కి పలికినది.
కావున నేను నీ యింటిని, నీ ఆచారమును, దేవ పూజను, అతిథుల నాదరించుటను పరికించుటకై వచ్చితిని.
వీనిలో నే యొక్కటియు నీవు చేయు చున్నది కానరాదు. కావున పితృ దేవతలకు శ్రాద్ధము పెట్టు కోరికతో మా యింటికి పోగోరు చున్నాను.
పితృ కార్యము కనుక నేను నా యింటను భోజనము చేయను. ఇట్టి నేను ప్రాణిహింస చేయు వాడను! నీవు మాత్రము లోకమును హింసింపని వాడవు! (ఇది నెక్కిరింత)
ప్రాణి హింస చేయు నా బిడ్డను నీ కుమారుడు చేపట్టే ననగా అది గొప్పయే కదా! నా బిడ్డకు ప్రాయశ్చిత్త మైనట్లే కదా!
భూదేవీ! ఆ వ్యాధు డిట్లు పలికి అత్తకు కోడండ్రపై నమ్మకము లేకుండు గాక! కోడలు అత్త బ్రతికి యుండుటను ఇష్ట పడుకుండు గాక! అని శపించి తన యింటికి కేగెను.
అటుపై ఆ బుద్దిశాలి దేవతలను, పితృ దేవతలను భక్తితో పూజించి పుత్రుడగు అర్జునకుని తన కుటుంబమునకు పెద్దగా నిలిపి ముల్లోకముల పేరు గన్న పురుషోత్తమ మను తీర్ధమున కరిగి మనస్సు చెదరకుండ చేసికొని నిష్ఠతో ఈ స్తోత్రము చదువుచు తప మొనరించెను.
దేవతల పగ వారిని రూపుమాపు వాడును, వెడద అయిన రొమ్మున లక్ష్మీ దేవిని ధరించిన వాడును, నీతి నిష్ఠలతో బ్రదుకు వారికి పరమ గతి అయిన వాడును, మూడు పాదములతో సర్వమును వ్యాపించిన వాడును, మందర పర్వతమును ధరించిన వాడును అగు విష్ణువును ఎల్లవేళల మ్రొక్కుదును.
దామోదరుడును, భూతలము నలరించిన వాడును, కీర్తి కాంతులతో శుభ్రమైన వాడును, తుమ్మెదల వలె నిగనిగ లాడు నల్లని దేహకాంతి గలవాడును, భూమిని తాల్చు వాడును, నరకుని నాశము చేసిన వాడును, గొప్పగా స్తుతులందు కొనువాడును. అందరకు రక్షకుడైన వాడును జనార్ధనుడును అగు విష్ణువునకు ప్రణ మిల్లుదును. (దామోదరుడనగా దమము మొదలగు సాధనముల చేత సాధించిన జ్ఞానమునకు లభించు వాడనియు, దమములనగా లోకములు అన్ని పొట్ట యందు కల వాడనియు, యశోదచే త్రాటితో నడుమున కట్ట బడిన వాడనియు నర్థములు. జనార్దను డనగా = జనులను వారి వారి కర్మములను బట్టి నరకాదులకు చేర్చు వాడు, జనులు అభ్యుదయ నిః శ్రేయసముల కొఱకు ఈతనిని యాచింతురు అని యర్ధములు).
నర రూపుడు, నృసింహ రూపుడు, హరి, ఈశ్వరుడు, ప్రభువు, ముగ్గురు మూర్తులకు నెలవైన వాడు, అనంతమైన దేహశక్తి కలవాడు, అతి పవిత్రమగు ముఖము కలవాడు, రక్షకుడు, పురుషోత్తముడు అగు అచ్యుత దేవుని ఎల్లవేళల శరణు పొందుదును.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అను మూడు విధముల రూపములతో నుండు వాడు, వడియగు చక్రము చేత దాల్చిన వాడు, ధర్మ మార్గమున నెలకొని యుండు వాడు, మిక్కిలి యుత్తములగు గుణములతో ఆనంద స్వరూపుడై యుండు వాడు, నిశ్శ్రేయస నామము గలవాడు, తక్కిన దాని నెల్ల రూపుమాపు వాడు, గురువు అగు పురుషోత్తమునికి ప్రణ మిల్లుదును. (నిఃశ్రేయసము = పరసుఖము, మోక్షము.)
ప్రాత వారగు మధు కైటభులను రక్కసులను చంపిన వాడు, తలతో భూదేవిని ఎల్లవేళల తాల్చేడు వాడు అగు విష్ణువు నేను స్తుతించి నంతనే మహా సుఖమును నాకు ప్రసాదించు గాక.
మహా వరాహ స్వరూపుడు, హవిస్సనెడు ద్రవమే భోజనమైన వాడు, జనార్ధనుడు, నాకు మేలోనరించు వాడు, జ్ఞానముతో వెలుగొందు మోము కలవాడు, భూమి నుద్దరించు వాడు, సముద్రమే నివాసమైన వాడు నగు శ్రీ మహా విష్ణువు శరణు గోరి యున్న నన్ను కాపాడు గాక!
స్థావరము (కదలనిది) జంగమము (కదలునది) అగు జగత్తు అంతయు ఒకే అగ్నితో నిండి యున్నట్లు తన మాయతో నిండిన మూడు లోకములను ఏర్పరచిన వాడు, సమస్త ప్రపంచమునకు అన్నీ యెడల తానేయైన వాడు అగు జగత్పాలకుడు విష్ణువు నాకు రక్షకుడగు గాక!
ఆ ప్రభువు ప్రతి యుగము నందును బ్రహ్మను సృజించును ఆ బ్రహ్మ వలన చరాచరమైన ఈ జగత్తు ఏర్పడును. పిదప రుద్రుడను పేరు గల వాని యందు లీనమై పోవును. ఈ మువ్వురినే వరుసగా బ్రహ్మ, విష్ణువు, హరుడు అందురు.
ఆకాశము, చంద్రుడు, భూమి, వాయువు, అగ్ని, భాస్కరుడు, నీరు అనునవి తన ఆకారములుగా పుట్టు చుండును. అట్టి సనాతనుడగు భగవంతుడు, ఊహింప నలవి కాని రూపములు ధరించు విష్ణువు నాకు సుఖమును ప్రసాదించు గాక!
ఇట్లా ధర్మవ్యాధుడు స్తుతింపగా సనాతనుడైన భగవంతుడు, అంతు లేని పాదములు, ఉదరములు (పొట్టలు) చేతులు, మోములు గలవాడు అచ్చెరువు గొలుపు రూపుముతో కానవచ్చి వరము కోరు కొమ్మని పలికెను.
ఆ దైవమిట్లు పలుకగా ఉత్తమ వ్యాధుడు స్వామీ! నా పుత్రులు, నా కులమున పుట్టువారు. వారి ననుసరించి పుట్టువారు అందరు ఇట్లే సత్కర్మములతో అలరారు నట్టి వరమిమ్మని ప్రార్థించెను.
(ఎల్లవేళల నాకును నా తరముల వారికిని ధర్మ యుగము నందే పుట్టువు కలుగు గాక! కలి యుగమున పుట్టుక కలుగ కుండుగాకా!)
ఈ కులమునకు, ఎందున్నను, ఎందు బోయినను జ్ఞానము ఉదయించు గాక! ఓ సనాతనా! నేను బ్రహ్మము నందు లీన మగుదును గాక!
(ప్రభూ! నీ యనుగ్రహము పొందితిని. తప్పక నేను నీలో లయ మగుదును.)
వ్యాధుడిట్లు పలుకగా భగవానుడు ప్రసన్న బుద్దియై ‘నీ కీ వర మిచ్చితిని. నీ కులమునకును ఒసగితిని. నీకు శాశ్వత బ్రహ్మమున లయము కలుగును’ అని పలికెను.
దేవ దేవుడు ఇట్లు పలుకగా వ్యాధునకు తన దేహము నుండి వెలువడిన గొప్ప వెలు గొక్కటి కాన వచ్చెను. అంత నాతడు కవియు సనాతనుడును అగు దేవుని వీడుకొని యతనితో ఒక్కటిగా నయ్యెను.
భూదేవీ! ముఖ్యముగా ఏకాదశి నాడు ఉపవాస ముండి, హరి నారాధించి ఈ ఉత్తమ స్తోత్రమును పఠించు వాడును, విను వాడును డెబ్బది మన్వంతరముల కాలము కేశవుని కడ సుఖముగా నివసించును.
