వరాహ మహా పురాణము
అధ్యాయము - 68
ఓమునీ! పరుడు, అపరుడు, సర్వగతుడు అయిన ఈ విష్ణు దేవుడు నాలుగు యుగము లందు ఎట్టివాడు? ఆ పరమేశ్వరుని నెట్లు తెలిసికొన నగును.
మునీ! ప్రతి యుగము నందు ఆయా వర్ణముల వారి ఆచార మెట్టిది? ఇతర జాతుల స్త్రీలతో సంకర మేర్పడి నపుడు విప్రులకు శుద్ధి ఎట్లగును?
శ్రేష్ఠుడా! కృత యుగమున ఈ భూమిని దేవతలు వేద కర్మముతో అనుభవింతురు. త్రేత యందు అసురులు, దేవతలు యజ్ఞములు చేయుచు అనుభవింతురు. ద్వాపరమున సత్త్వ రజస్సులు అతిశయముగా నుండును. రాజు ధర్మమూర్తియై ఒప్పారును. అటుపై కలి రూపమున తమస్సు ఏర్పడును. ఆ కలి యుగము రాగా బ్రాహ్మణుడు తన మార్గము నుండి భ్రష్టుడగును.
రాజులు, వైశ్యులు, శూద్రులు తరచుగా జాతి భ్రష్టు లగుదురు. సత్యము, శుద్ధియు లేని వారగుదురు.
పొందరాని స్త్రీలను బ్రామ్మణులు పొందు చుందురు. వేద మార్గము నుండి భ్రష్టులై అబద్ధము లాడు చుందురు. తమ గోత్రముల వారితో, ఈడు కాని వారితో వివాహములను కూడ చేసికొను చుందురు.
ధనము లందు లోభము గల మూఢులగు రాజులు బ్రహ్మ జ్ఞాన సంపన్నులను హింసింతురు. శూద్రులును వర్తక వృత్తి యందు ఆసక్తి కలవారై వైశ్య వృత్తిని చేయు చుందురు. శూద్ర జాతుల యందు గర్వితులై అభిమానము కలవారై యుందురు.
బ్రాహ్మణులు శౌచమును పాటింపక సత్యమును వదలి వైచి అన్ని విధముల తిండిని తినువార గుదురు. మద్యము సేవింప దగినదని నొక్కి పలుకుదురు.
అంత లోకస్ధితి చెడి పోవును. వర్ణ ధర్మము నశించును.
పొంద రాని స్త్రీని పొంది బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, ఎట్లు శుద్ధి పొందును. పొందరాని తనమెట్లు కలుగును? నాకు చెప్పుము.
బ్రాహ్మణుడు నాలుగు వర్ణముల వారిని, క్షత్రియుడు మూడు వర్ణముల వారిని, వైశ్యుడు రెండు వర్గముల వారిని, శూద్రుడు తన వర్ణము వారిని గమ్యలుగా (భార్యలుగా) భావింప వచ్చును.
బ్రాహ్మణ స్త్రీ క్షత్రియునకు, క్షత్రియ కాంత వైశ్యునకు, వైశ్య కాంత శూద్రునకు అగమ్య అని చెప్పుదురు. క్రింది కులము వానికి పై కులపు కాంత అగమ్య అని మనువు చెప్పెను.
రాజా! తల్లియు, తల్లి సోదరియు, అత్తయు, వదినయు మరదలును, కోడలును, కూతురు, మిత్రుని భార్య, తన గోత్రము నందలి కాంతయు, రాజ పత్నియు, ‘రాజు’ బిడ్డయు నగు స్త్రీలు ముఖ్యముగా మనుజునకు పొందరాని వారు. అట్లే వృత్తి పని చేయునట్టి చాకలి మున్నగు స్త్రీలు కూడ అగమ్యలు. ఈ అగమ్యా గమనము వలన పాపము కలుగును.
బ్రాహ్మణుడు ఇతర స్త్రీని పొంది నంత మాత్రమున బ్రాహ్మణత్వము నుండి భ్రష్టుడగును. ఇతరునకు నూరు ప్రాణాయామముల వలన శుద్ధి ఏర్పడును.
పెక్కు కాలము నందు చేసిన పాపము వర్ణ సంకర సంబంధము, బ్రహ్మ హత్య మున్నగు మహా పాపము లన్నియు ప్రణవ పూర్వక మైన గాయత్రిని పది మారులు చేయుట చేతను, మూడు నూర్ల ప్రాణాయామముల చేతను బ్రాహ్మణునకు నశించును. ఇతర పాతకముల సంగతి చెప్పనేల?
మరియును బ్రాహ్మణ శ్రేష్ఠుడు వేదములను అధ్యయనము చేయువాడై పరమాత్మ స్వరూపము నెరిగినచో వందల కొలది పాపముల నుండియు ముక్తుడగును.
విష్ణువును స్మరించుచు, వేదమును పఠించుచు, దాన మొసగుచు, హరిని పూజించుచు బ్రాహ్మణుడు శుద్ధుడే యగును. ఇతరుని కూడ తరింప జేయును.
రాజా! నన్ను నీవడిగిన విషయ మంతటిని నీకు చెప్పితిని. దీని నంతటిని మనువు మున్నగు వారు విస్తరించి చెప్పుదురు. నేను నీకు సంగ్రహముగా చెప్పితిని.
