వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 96

 

వరాననా! ఇంక రుద్ర వ్రతము పుట్టుకను గూర్చి వినుము. ఆజ్ఞానముతో మానవుడు సర్వ పాపముల నుండియు ముక్తుడగును.

 

బ్రహ్మ మునుపు రుద్రుని సృజించెను. అది మూడవ జన్మము (1. విష్ణువు 2. బ్రహ్మ 3. రుద్రుడు.) ఆ రుద్రుడు పచ్చని కన్నులు కలవాడు, నలుపు ఎరువుల వన్నె కలవాడు. అప్పుడు బ్రహ్మ వేడుకతో ఆ బాలుని భుజము పై నెత్తు కొనెను. అవ్యక్తము నుండి పుట్టిన బ్రహ్మ భుజముపై నెక్కించు కొనగా ఆతని అయిదవ తల ఆధర్వణ మంత్రములను పలికెను. దాని వలన మనుజుడు అప్పటి కప్పుడు ముక్తి పొందును.

 

 

కపాలీ! రుద్ర! బభ్రు! భవ! కిరాత రూప! సువ్రత! విశాలాక్ష! కుమార వర! సర్వజ్ఞా! ఈ విశ్వము నంతటిని రక్షింపుము.

 

 

ఇట్లు బ్రహ్మ రానున్న నామములతో పిలువగా భవుడు కపాల శబ్దము వలన కోపించిన వాడై బ్రహ్మ యొక్క ఆ అయిదవ తలను ఎడమ చేతి వ్రేలి గోటితో తెగ గోసెను. ఆ తెగిన తల శివుని చేతి యందు తగులు కొని యుండెను.

 

ఆ ప్రజాపతి తల చేతి నుండగా ముక్కంటి వినయముతో బ్రహ్మతో నిట్లు పలికెను.

 

 

దేవా! ఈ పుఱ్ఱె నాచేతి నుండి ఎట్లు పడును? ఈ నా పాపము ఎట్లు నశించును? ఆలసింపక చెప్పుము.

 

 

దేవా! సమయా చారముతో కూడిన ఈ కాపాలిక వ్రతమునే నీదగు తేజస్సుతో ఆచరింపుము.

 

వ్యక్తము కాని రూపము కల బ్రహ్మ యిట్లు పలుకగా రుద్రడు అప్పుడు మిక్కిలి ఎత్తైనది, పాపములను పోకార్చునది యగు మహేంద్ర పర్వతమునకు ఏతెంచెను.

 

అందుండి మహా దేవుడు ఆ తలను మూడు ముక్కలు చేసెను. అది అట్లు పగులగా రుద్రుడు దాని కేశములను కైకొని జన్నిదముగా చేసి కొనెను. ఎముకలను అక్షమణులను కావించు కొనెను.

 

పుఱ్ఱ ముక్క నొక దానిని నెత్తురు నిండిన దానిని చేత నుంచు కొని మరొక ముక్క చేసి జుట్టు ముడిలో ఉంచెను.

 

ఇట్లు చేసి మహా దేవుడు ఏడు ద్వీపములు గల పుణ్యమైన భూమి నంతటిని, తీర్థములలో మునుగుచు, తిరిగెను.

 

మొదట సముద్రమున స్నానము చేసి తరువాత గంగలో మునిగెను. పిదప సరస్వతి కరిగి మరల యమునా సంగమ స్థానమున తాన మాడెను.

 

శతద్రువు, దేవిక, మహానది, వితస్త, చంద్రభాగ, గోమతి, సింధువు, తుంగభద్ర, గోదావరి, గండకి అను నదులలో స్నాన మాడెను.

 

పిదప పై సీమలకు వెళ్లెను. రుద్ర మహాలయము, దారువనము, కేదారము మొదలగు తీర్థములను సేవించెను.

 

 

భద్రేశ్వరమున కరిగి గయకు పోయెను. గయ కరిగి స్నానము చేసి యత్నముతో పితృ దేవతలకు తర్పణము చేసెను. పిదప వేగముగా సకల బ్రహ్మాండమును చుట్టి వచ్చెను. ఇట్లాతడు తిరుగు చుండగా ఆరవ ఏట ఆతని నడుమున నున్న గోచి గుడ్డ జారి పడెను. దేవీ! అది పడగా ఆతడు దిగంబరుడు ఆయెను. ఆ విధముగా కాపాలికుడు ఆయెను.

 

ప్రతి తీర్థము నందును హరుడు స్నానము చేసి పుఱ్ఱెను వదలించు కొనగోరెను. కాని అది అతని నుండి జారి పోకున్నది.

 

పిమ్మట మహాత్ముడగు ముక్కంటి ఒక్క ఏడు కాలము హిమవ త్పర్వతమున తిరిగెను. అట్లు తిరుగు చుండగా ఆతనికి కపిల వర్ణము కలిగెను.

 

మరల రెండేండ్లు పరమేష్ఠి, వృషాకపి యగు రుద్రుడు పురాణ ములగు తీర్థము లన్నింటిని చుట్టి వచ్చెను.

 

అంత కొంత కాలమునకు పండ్రెండవ యేట ఆ దేవుడు వారాణసి కరిగి అచట స్నాన మాచరించెను.

 

దేవదేవుడు గంగ యందు మునిగిన వెంటనే మునుపు తగులు కొనిన బ్రహ్మ కపాలము జారి పడెను.

 

భూదేవీ! అంతటి నుండి కాశీ నగరము నందలి ఉత్తమ మగు ఆ తీర్థము భూమిలో కపాల మోచనమను ఖ్యాతి గడించెను.

 

రుద్రుని చేతి నుండి పడిన కపాలమును చూచి బ్రహ్మ దేవతలతో పాటుగా వచ్చి ఇట్లు పలికెను.

 

 

భవా! రుద్రా! విరూపాక్షా! లోక మార్గమున మనసున్న వాడవై వ్రతములను ఆచరింపుము. మహాప్రభూ! ఈ వ్రతములు లోకమునకు ఉపయోగ పడును.

 

నీవు పుఱ్ఱెను గొని గోచితో తిరిగితివి. అది మనుజులకు మహా వ్రతమను పేరు గలది యగును.

 

బట్టలు లేక కపాలమును శ్రద్ధగా చేత నుంచుకొని తిరిగితివి. అది నగ్న కాపాలిక వ్రతముగా మనుష్యుల కగును.

 

నీకు హిమ పర్వతమున తిరుగు చుండగా ఒక విధమగు ఎరుపు వన్నె కలిగినది. దేవా! అది బాభ్రవ్యమను వ్రత మగును.

 

ఇప్పుడు ఈ తీర్థమున విశుద్ధుడవగు నీకు దేహ శుద్ధత ఏర్పడినది. పాప నాశన మగు ఆ వ్రతము ‘శుద్ధశైవము’ అగును.

 

నన్ను పురస్కరించుకొని దేవతలు నిన్ను పెక్కు విధములుగా పూజింతురు. ఆ అన్నింటి శాస్త్రములను నీవే చెప్ప గలవు. మరొక పద్ధతి లేదు.

 

కుమారా! నీవు చేసిన వ్రతము లన్నింటిని చేయు వాడు నీ ప్రసాదము వలన బ్రహ్మ హత్య చేయు వాడైనను పరిశుద్ధుడగును.

 

నగ్న కాపాలము, బాభ్రవ్యము, శుద్ధశైవము అను వ్రతములను చేయువారు ఆ యా నామములు కలవార గుదురు.

 

దేవా! నన్ను ముందుంచు కొని విధానము ననుసరించి నిన్ను అర్చించు వారికి ఆ శాస్త్రము లన్నింటిని, అట్లే పాశుపత శాస్త్రమును విధాన పూర్వకముగా మహాదేవా! ఉపదేశింపుము.

 

తెలియ రాని ఆకృతి గల బ్రహ్మ యిట్లు పలుకగా రుద్రుడు సంతుష్టుడై, దేవతలు జయ జయ నాదములు చేయు చుండగా, కైలాస నిలయమున కరిగెను.

 

బ్రహ్మయు దేవతలతో పాటు తన ఉత్తమ లోకమున కరిగెను. అట నుండి దేవత లందరును వచ్చిన మార్గమున తమ నెలవుల కరిగిరి.

 

భూదేవీ! ఇది రుద్రుని మహాత్మ్యము. నేను చక్కగా వివరించి చెప్పితిని. దేవుని చరితము, వ్రతము భూమి యందు ఎట్లేర్పడెనో వివరించితిని. ఆ రుద్రుని కంటె మిన్న యగువాడు, నారాయణ ప్రభువు ఒక్కడు తక్క, ఎవ్వడు కలడు?