వరాహ మహా పురాణము
అధ్యాయము - 41
ఓ మునీ! పరమ ధార్మికుడా! భూమిని తాల్చిన వరాహ దేవుని మొదటి ద్వాదశిని గూర్చి వినుము. అది మాఘ మాసమున శుక్ల పక్షమున వచ్చును.
మునుపు చెప్పిన పద్ధతి ప్రకారమే వివేకము కలవాడు ఏకాదశి యందు సంకల్పము, స్నానము ఆచరించి దేవుని అర్చింప వలయును.
ధూపము, నైవేద్యము, గంధములతో అచ్యుతుని అర్చించి ఆతని ముందు నీరు నింపిన కుంభమును ఉంచ వలయును.
‘ఓం వరాహాయ నమః’ అని పాదములను, ‘మాధవాయ నమః’ అని నడుమును, ‘క్షేత్రజ్ఞాయ నమః’ అని కడుపును, ‘విశ్వ రూపాయ నమః’ అని హరి వక్షమును, ‘సర్వజ్ఞాయ నమః’ అని కంఠమును, ‘ప్రజాపతయే నమః’ అని శిరస్సును, ‘ప్రద్యుమ్నాయ నమః’ అని భుజములను, ‘దివ్యాస్త్రాయ నమః’ అని సుదర్శనమును, ‘అమృతోద్భవాయ నమః’ అని శంఖమును పూజింప వలయును. ఇది దేవార్చన యందు పద్ధతి.
తెలివి గలవాడు ఇట్లు అర్చించి ఆ కుంభమున తన విభవ శక్తి మేరకు బంగారము తోడనో, వెండి తోడనో, రాగి తోడనో పాత్రము నుంచ వలయును.
ఆ కుంభమును అన్ని విత్తనములతో నిండిన దానినిగా జేసి శక్తి ననుసరించి అందు బంగారు వరాహ ప్రతిమను ఉంచ వలయును.
కొండలతో, ఆడవులతో, చెట్లతో కూడిన భూమి నంతటిని కోర చివరతో ఎత్తిన వాడును, మధువను రక్కసుని చంపిన వాడును, మాధవుడును, వరాహ రూపమును తాల్చిన వాడును అగు హరిని బంగారు రూపముతో చేసి ఆ బీజము లన్నియు నింపిన పాత్రలపై నిలుప వలయును.
తెల్లని వస్త్రముల జంట కప్పిన రాగి పాత్ర యందు నిలిపి గంధములతో, పూవులతో, పెక్కు విధములగు నైవేద్యములతో అర్చింప వలయును.
పూవుల రంగ వల్లిని తీర్చి ఆ రాత్రి అచట జాగరము చేయ వలయును. హరి అవతారములను చదివింప వలయును. భావించు చుండ వలయును.
ఈ విధముగా నియమమును పూర్తి చేసి తెల్లవారిన పిదప సూర్యు డుదయించు సమయమున స్నానము చేసి శుచియై హరిని పూజించి ఆ పాత్రను ఉత్తమ బ్రామ్మణునకు సమర్పింప వలయును.
వేదములను, వేదాంగములను ఎరిగిన వాడు, మంచి నడవడి కలవాడు, బుద్ధి మంతుడు, విష్ణు భక్తుడునగు విప్రర్షికి విశేషముగా అర్పింప వలయును.
వరాహ ప్రతిమ రూపమున నున్న హరిదేవుని కుంభముతో పాటు బ్రహ్మణునకు దాన మిచ్చిన కలుగు ఫలమేమో చెప్పెదను వినుము.
ఈ జన్మము నందతనికి సౌభాగ్యము, సంపద, కాంతి, తుష్టి కలుగును. దరిద్రుడు ధనవంతు డగును. కొడుకులు లేనివాడు కుమారుని పొందును. దరిద్ర దేవత వెను వెంటనే నశించును. లక్ష్మి అప్పటి కప్పుడు వచ్చి చేరును.
ఈ జన్మము నందు పర లోకము నందును కలుగు సౌభాగ్యమును గూర్చి ప్రాత కాలపు కథ యొకటి కలదు. వినుము.
ఈ లోకమున పూర్వము వీర ధన్వుడను రాజుండెడి వాడు. ఆ మహావీరు డొకనాడు వేట కొరకు అడవి కరిగెను.
ఆ అడవి యందు మృగముల గుంపులను చంపుచు, అడవి నడుమ తిరుగుచు, మృగ రూపమున నున్న బ్రాహ్మణులను తెలియక ఆ రాజు చంపెను.
అట్లు మృగ రూపమున నున్నవారు సంవర్తుడను వాని పుత్రులు, అన్న దమ్ములు, ఏబది మంది వేద అధ్యయనము నందు నిష్ఠ కలవారు.
మహర్షీ! వారే కారణమున మృగ రూపమును ధరించిరి? ఇది వినుటకు వేడుక కలదు. మ్రొక్కెదను. నాకు దానిని వినిపింపుము.
వారొ కప్పుడు అడవి కరిగిరి. పుట్టి నంతనే తల్లిని కోల్పోయిన లేడి పిల్లలను చూచి ఒక్కొక్క రొక్కొక్క దానిని గ్రహించిరి. బుజముపై నిలుపు కొనగా అవి చని పోయెను.
అంత వారందరు దుఃఖితులై తండ్రి కడ కరిగి మృగహింస చేయని వారు కనుక ఇట్లు పలికిరి.
మహర్షీ! అప్పుడే పుట్టిన అయిదు లేడి పిల్లలు మా వలన మా నిమిత్తము లేకయే చని పోయినవి. అందు వలన మాకు ప్రాయశ్చితమును విధింపుము.
సంవర్తుడు:
నా తండ్రి హింస చేసిన వాడు. నేనంత కంటెను పాపాత్ముడను. కనుక పాప కర్ములైన మీరు నాకు పుత్రకులై పుట్టిరి.
ఇప్పుడు మృగ చర్మములు ధరించి నియమ జీవితము గడపుచు అయిదేండ్లు తిరుగుడు. మీరు శుద్ధు లగుదురు.
తండ్రి యిట్లు పలుకగా ఆ కొడుకులు మృగ చర్మము ధరించి ఏకాగ్ర చిత్తముతో శాశ్వతమగు బ్రహ్మమును జపించుచు అడవి లోనికి ప్రవేశించిరి.
అట్లు ఒక యేడు గడువగా వీరధన్వ మహారాజు వారు లేడి రూపములతో తిరుగు వనమునకు వచ్చెను.
ఒక చెట్టు మొదట మృగ చర్మములను ధరించి జపము చేసి కొనుచున్న వారిని గాంచి ఆతడు మృగములే యనుకొని కొట్టగా ఆ వేద పారాయణము చేయువారు ఒక్క మారుగా మృతి చెందిరి.
చక్కని వ్రతములు గల ఆ బ్రాహ్మణులను మరణించిన వారిని చూచి ఆ రాజు భయముతో వణకి పోవుచు దేవరాతుని ఆశ్రమమున కరిగెను. ఓ మహామునీ! నాకు బ్రహ్మ హత్యా పాతకము కలిగిన దని పలికెను.
ఆ వధ వృత్తాంతము మొదటి నుండియు చెప్పి ఆరాజు పరమ శోకము పైకొనగా పెద్ద పెట్టున ఏడ్చెను.
ఆ దేవరాత మహర్షి అట్లు విలపించు చున్న రాజవరుని గాంచి రాజా! భయ పడకుము. నీ పాతకమును నేను తొలగింతును.
సుతలమను పాతాళమున భూధేవి మునిగి పోయి నపుడు దేవుడగు విష్ణువు వరాహ రూపము తాల్చి పైకెత్తి నట్లు నిన్ను ఉద్ధరించెదను.
బ్రహ్మ హత్య పాపము చుట్టు కొన్న నిన్ను ఆ జనార్దన దేవుడే స్వయముగా ఉద్ధరించును.
ముని యిట్లు పలుకగా ఆ రాజు సంతోషించి, ఏ విధముగా ఆ దేవడు నా యెడ ప్రసన్ను డగును? ప్రసన్నుడై నా పాపము నెట్లు రూపు మాపును? అని అడిగెను.
అతడట్లు పలుకగా ఆ దేవరాతు డతనికీ వ్రతము నుపదేశించెను. ఆతడును దానిని చక్కగా నొనరించి పుష్కలము లైన భోగముల నను భవించి అంత్య కాలమున బంగారు విమానముతో ఇంద్ర లోకమగు స్వర్గమున కరిగెను.
ఆర్ఘ్యమును గొని దేవరాజు ఆతనికి ఎదురుగా వెడలెను. అట్లు వచ్చు చున్న ఇంద్రుని చూచి విష్ణు కింకరులు, దేవరాజు నిన్ను చూడరాదు. నీకంటె అతడు తక్కువ తపస్సు కలవాడు, అనిరి.
ఇట్లే లోకపాలు రందరు ఆతని కెదురుగా అరిగిరి. వారి నందరిని విష్ణు కింకరులు మీరందరు హీన కర్ములని కాదనిరి, ఇట్లతడు సత్య లోకము తుది వరకు వెడలెను.
మరల మరణము లేనిది దాహము ప్రళయము దాపు రింపనిది అగు లోకమున ఆ మహారాజు దేవతలు కొనియాడు చుండగా ఈనాటికిని నిలిచి యున్నాడు. యజ్ఞ పురుషుడు ప్రసన్నుడు కాగా ఆతడు అట్టి స్థితి పొందుటలో వింతయేమి?
విధి ననుసరించి చేసిన ఒక్కొక్క వ్రతము కూడ ఈ జన్మమున సౌభాగ్యము, ఆయువు, ఆరోగ్యము, సంపద అను వానిని, పరమున ఉత్తమ మగు అమృత స్థితిని ఒసగును.
నిండు సంవత్సరము పూర్తి యైనచో నాలుగు రూపములు కల నారాయణుడు తన పదము నొసగు ననుటలో సందేహమేమి కలదు?
ఆ కేశవుడు పాల సముద్రము చిలుకు నపుడు చేప రూపుతాల్చి వేదములను పైకి తెచ్చెను. అట్లే ఈ తాబేటి రూపము రెండవ విష్ణు స్వరూపము.
ఆ పురుషోత్తముడు వరాహ రూపము తాల్చి భూమిని పైకెత్తెను. అది మూడవ వైష్ణవ రూపము.
