వరాహ మహా పురాణము
అధ్యాయము - 135
ఎర్రని వస్త్రముతాల్చి నా కడకు అరుదెంచు వాని సంసార ముక్తి విధాన మెట్లుండునో, ఓ భూదేవీ! వినుము.
తెలిసి చేసిన కర్మ దోషము చేత మానవుడు ముట్టుతలైన స్త్రీల రజస్సును తాకిన వాడగును.
ఎఱ్ఱని వలువలు తాల్చిన వ్యక్తి పదునైదు వత్సరములు అట్టి రజస్సై యుండి పోవును.
అట్లు శాస్త్ర విధిని వదలి ప్రవర్తించు పురుషులు శుద్ధి పొందెడు ప్రాయశ్చిత్త విధానమును వక్కాణించెను.
పదునేడు దినములు ఒంటి పూట భోజనము చేయ వలయును. మూడు దినములు గాలిని, ఒక రోజు నీటిని పుచ్చుకొన వలయును.
ఈ విధముగా నాకు అప్రియము చేసిన వాడు అట్టి ప్రాయశ్చిత్తమును చేసికొని దోషము నుండి విడివడును. నాకు ప్రియుడును అగును.
భూమీ! ఎఱ్ఱని వస్త్రములు (నా పూజా సమయమున) తాల్చుట, దాని ప్రాయశ్చిత్తము అను వానిని నీకు తెలిపితిని. ఇది సంసార మోక్షణమును కలిగించు నట్టిది.
సుందరీ! శాస్త్రమును పాటింపక చీకటిలో దీపము లేకుండ నన్ను త్వర పడుచు, విజ్ఞత లేక తాకువాని పతన మెట్లుండునో చెప్పెదను. వినుము. ఆ పాపము చేత ఆ నరాధముడు కష్టములలో నలిగి పోవును.
వాడు ఒక్క జన్మ కాలము గ్రుడ్డివాడై చీకటి గుయ్యారమున అడ్డమైన గడ్డిని తినువాడై ప్రవర్తించును.
ఎప్పుడు తన తప్పు తెలిసికొని నన్ను చెదరని మనస్సుతో స్మరించునో అప్పుడు నా భక్తుడై పుట్టును. ఇది ఆతనిని చక్క దిద్దు విధానము.
చీకటిలో నన్ను తాకు వానికి ప్రాయశ్చిత్త మెట్టిదో, దేనితో అతడు తరించునో, నా లోకమున కరుగునో దానిని చెప్పెదను.
పదునైదు దినములు కన్నులకు గంతలు కట్టుకొన వలయును. ఇరువది దినములు శ్రద్ధతో ఒంటిపూట భోజనము చేయ వలయును. ఏదో ఒక నెలలో ద్వాదశి నాడు నీరు మాత్రము త్రావుచు ఉండ వలయును.
పిమ్మట గోవు మూత్రముతో వండిన యవల అన్నమును భుజింప వలయును. ఇట్టి ప్రాయశ్చిత్తము చేత ఆ పాతకము నుండి అతడు విడుదల పొందును.
నల్లని బట్టలు కట్టుకొని నా పూజల యందు ఆసక్తి కలవాడై ఆయా పనులు చేయువాని పాటెట్టిదో, వినుము.
చెట్లపై పురుగై అయిదేండ్లు, దోమయై మూడేండ్లు, ఈగయై మూడేండ్లు, చేపయై పదియేండ్లు, లకుముకి పిట్టయై పదునైదేండ్లు, ముంగిసయై యైదేండ్లు, తాబేలై పదియేండ్లు ఈ ప్రపంచమున త్రిమ్మరు చుండును.
నన్ను ప్రతిష్టించిన తావులలో పదునాల్గేండ్లు పావురమై నా పరిసరములలో నిలిచి యండును.
నల్లని బట్టలు తాల్చిన దోషమునకు ప్రాయశ్చిత్తమును చెప్పెదను. దీనితో అతడు సిద్ధిని పొందును. సంసారము నుండి మోక్షము పొందును.
ఏడు దినములు యవల పిండిని, మూడు రాత్రులు పేలాల పిండిని రాత్రికి మూడు చొప్పున తినుచు పాపము నుండి విడుదల పొందును.
ఈ పద్ధతితో కర్మములు చేయువాడు శుచియగు భాగవతుడై నా దారి ననుసరించు వాడై సంసారమునకు పోకుండును. నా లోకమునకు పయనించును.
ఉతుకని వస్త్రము తాల్చి నా భక్తుడు నా పూజలు చేసినచో ఆ దోషమునకు శిక్ష యేమో తెలిపెదను. అట్లు మాసిన బట్టలు తాల్చి పూజ చేయువాడు సంసారమున పడి పోవును.
ఒక జన్మమున పక్షియు, ఒక జన్మమున లొట్టి పిట్టయు, ఒక జన్మమున గాడిదయు, ఒక జన్మమున నక్కయు, ఒక జన్మమున గుఱ్ఱమును, ఒక జన్మమున లేడియు నగును.
ఇట్లు ఏడు జన్మముల తరువాత మానవుడై పుట్టును. నాకు భక్తుడు, గుణము లెరిగిన వాడు, నా పూజల యందు శ్రద్ద కలవాడు, దోషము లేనివాడు, సమర్థుడు అహంకారము లేనివాడు నగును.
మాసిన వలువలు కట్టి పూజ చేయు మానవులు పొందెడు దుఃఖమును నీవు చక్కగా వివరించి చెప్పితివి.
సర్వ కర్మములకు మేలు కూర్చెడు ప్రాయశ్చిత్తమును కూడ నాకు చెప్పుము. నీ పూజ యందు చెదరని ఆసక్తి కల భక్తులు ఏమి చేసి యీ పాపము నుండి ముక్తి పొందుదురో దానిని నాకు సెలవిమ్ము.
దేవీ! నా అర్చనలకు సుఖమును కూర్చునట్టి ప్రయశ్చిత్తమును చెప్పెదను. వినుము.
యవల పిండితో మూడు దినములు, పిండితో మూడు దినములు, నూకలతో మూడు దినములు, పాయసముతో మూడు దినములు, పాలతో మూడు దినములు, ఏమియు తినకుండ మూడు దినములు, ఇట్లు మాసిన గుడ్డలు కట్టుకొని పూజ చేయువాడు ప్రాయశ్చిత్తము చేసి కొనినచో అతనికి దోష ముండదు. సంసారమునకు అరుగడు.
కుక్క ముట్టిన పదార్థమును నాకు నివేదన మొసగువాడు, ఆ పాపము వలన సంసారమను మహా భయమున చిక్కుకొనును.
ఏడు పుట్టుకలు కుక్కయు, ఏడు పుట్టుకలు నక్కయు, ఏడేండ్లు గ్రుడ్లగూబ యునై పిదప మానవుడుగా పుట్టును.
అంత భాగవతులలో శ్రేష్ఠుడైన వాని యింటి యందు విశుద్ధమగు బుద్ధి కలవాడు, వేదముల నెరిగిన వాడు నా భక్తుడు నై పుట్టును.
పిక్కటిల్లిన శక్తి గల ప్రాయశ్చిత్తమును చెప్పెదను, మానవులు దానితో పాపమును వదలి సంసారమను సముద్రమును దాటుదురు.
దుంపలు, పండ్లు, కూరలు, పాలు, పెరుగు, పాయసము, గాలి, వీనిని మూడేసి దినముల చొప్పున తినుచు ఇరువది యొక్క రోజులు చెదరని దీక్షతో, మంచి లక్షణములతో గడుప వలయును. అప్పుడా దోషము ఉండదు. నా లోకమునకు అరుగును.
పంది మాంసము తిని నా కడకు వచ్చు వాని పాటెట్టిదో, సుందరీ! చెప్పెదను.
పందియై పది యేండ్లు అడవిలో తిరుగును. పదునాల్గేండ్లు బోయ వాడగును. పిదప ఏడేండ్లు మట్టియై నీట మునుగు చుండును.
పిదప పదు నాలుగేండ్లు ఎలుక అయి, అటుపై పందొమ్మి దేండ్లు రక్కసుడగును.
ముళ్ళ పందియై ఎనిమిదేండ్లు అడవిలో తిరుగు చుండును. ముప్పదియేండ్లు మాంసము తిండిగా గల పులియై పుట్టును.
ఇట్లు యాతనల నన్నింటి ననుభవించి పంది మాంసము తిన్నవాడు పుణ్యము కల కులమున భాగవతుడై పుట్టును.
నిండైన క్షణములు గల హృషీకేశుని మాట యంతయు విని భూదేవి తలపై దోసిలి యొగ్గి ఇట్లు పలికెను.
పంది మాంసము తిన్నవానికి ప్రాయశ్చిత్త మెట్టిదియో భక్తులకు సుఖమును కూర్చెడు ఆ పరమ రహస్యమును నాకు తెలుపుము.
పశువుల పుట్టుక యనెడు సముద్రము నుండి మానవు లెట్లు దాటుదురో చెప్పెదను. అయిదు దినములు ఆవు పేడతో, ఏడు దినములు నూకలతో, ఏడు దినములు నీటితో, ఏడు దినములు ఉప్పు కారములు లేని చప్పిడి కూటితో, మూడు దినములు పేలాల పిండితో, ఏడు దినములు నూవులతో, ఏడు దినములు ఉప్పుతో, ఏడు దినములు పాలతో గడపి తనకు శుద్ధిని కలిగించుకొన వలయును.
క్షమ, ఇంద్రియ నిగ్రహము కల వాడగును. అహంకారమును విడనాడును. ఇట్లు చెదరని దీక్ష కలవాడై నలుబది తొమ్మిది రోజులు ప్రవర్తించు వాడు పాపములన్నింటి నుండియు ముక్తి పొంది జ్ఞానము కలవాడై, ప్రమాదము లేనివాడై నా కర్మము లాచరించి నీ లోకమున కరుగును.
బాతు మాంసము తిని నా కడ కరుదెంచు వాడు పదునైదేండ్లు బాతు అగును. పదియేండ్లు మొసలి యగును. అయిదేండ్లు పంది యగును.
నా యెడల చేసిన ఈ తప్పునకు సంసారమున పడి పొరలు చుండును. కడకు చేయరాని పుణ్య కర్మముచేసి శ్రేష్ఠమగు కులమున పుట్టును.
పరిశుద్ధుడు, శ్రేష్ఠుడు, దోషము లేనివాడు నగు భాగవతుడై సర్వ ధర్మములను వదలి వైచి నా లోకమున కరుగును.
మనుజుల ఘోరమైన దుఃఖమనెడు సముద్రము నుండి దేని వలన దాటుదురో అట్టి ప్రాయశ్చిత్తమును, బాతు మాంసము తిన్న పాపమునకు చేయ వలసిన దానిని చెప్పెదను.
మూడు దినములు యవల అన్నము, మూడు దినములు గాలిని, మూడు దినములు, పులుపు, ఉప్పులేని అన్నమును, ఇట్లు పదునైదు దినములు భోజన నియమమును పెట్టుకొని ప్రాయశ్చిత్తమును చేసికొన వలయును.
మనోజ్ఞమైన గతిని కోరువాడగు నేని చక్కదిద్దు కొన్న బుద్ధి కలవాడై బాతు మాంసము తిన్న తప్పునకు ప్రాయశ్చిత్తము నిట్లు చేసికొన వలయును.
