వరాహ మహా పురాణము
అధ్యాయము - 71
ఆ పినాకి ఇట్లు చెప్పగా దేవతలు, ఋషులు, నేనును ఆ దేవునకు ప్రణమిల్లితిమి.
శిరస్సుతో ప్రణమిల్లి ఆ దేవుని చూచు నంతలో ఆతని దేహమున నున్న బ్రహ్మను హృదయమున సన్నని దుమ్ము కణమంత సూక్ష్మ రూపుడగు నారాయణుని కను గొంటిమి. ఆ నారాయణుడు జ్వలించు చున్న సూర్యుని వన్నెతో ప్రకాశించు చుండెను.
అతనిని దర్శించు కొని అందరు విస్మితులై యాజకులగు ఋషు లందరు సామము, ఋక్కు, యజస్సులతో జయ జయ ధ్వనులను గావించిరి.
కావించి వారు ఆ దేవునితో నిట్లనిరి. పరమేశ్వరా! ఇదియేమి? నీ ఒక్క మూర్తి యందే త్రి మూర్తులును గాన వచ్చు చున్నారు.
ఓ మేధావులారా! ఈ యజ్ఞము నందు మహర్షులు నన్నుద్దేశించి దేనిని హుతము చేయుదురో దానిని మేము మువ్వురమును గ్రహింతుము.
ముని వరులారా! మాకు వేర్వేరు భావములు లేవు. పెక్కు విధములైన వాని యందును, చక్కని చూపు గలవారు దీనిని చక్కగా దర్శింతురు.
రుద్రు డిట్లు పలుకగా ఆ మును లందరు శంకరుని మోహ శాస్త్ర ప్రయోజనమును గూర్చి యిట్లడిగిరి.
దేవా! లోకములను మోహ పెట్టుటకై నీవు విడిగా ఒక శాస్త్రమును చేసితివి. అది చేయుటకు కారణమేమి? మాకు చెప్పుము.
భారత వర్షమున దండకమను పేరు గల వనము కలదు. అందు గౌతముడను బ్రాహ్మణుడు ఘోరమగు తప మొనరించెను.
బ్రహ్మ దానికి నిండు సంతోషము పొంది ఆ మునితో, తపోధనా! వరము కోరు కొనుమని పలికెను.
లోకములకు కర్తయగు బ్రహ్మ అట్లు పలుకగా ఆతడు ‘పద్మ సంభవా! నాకు వెను వెంటనే కొన్ని ధాన్యపు గింజల నొసగుము’ అని పలికెను.
ఇట్లనగా బ్రహ్మ ఆతడు కోరిన వరము నిచ్చెను. అతడును ఆ వరమును కైకొని శత శృంగమున ఒక పెద్ద ఆశ్రమమును నిర్మించు కొనెను. అందు ఆ ధాన్యపు గింజలు ఉషః కాలమున మొలకెత్తి మధ్యాహ్న మునకు పండు చుండగా వానితో ఆ విప్రుడు బ్రాహ్మణులకు తగినంత ఆతిథ్యము చేయు చుండెను.
అంత కొంత కాలమునకు పండ్రెండేండ్ల పెనుకరవు (అనావృష్టి) ఒడలికి గగుర్పాటు కలిగించుచు ఏర్పడినది.
ఆ దండకమున నున్న మహర్షు లందరు ఆ అనావృష్టిని చూచి దప్పికతో బాధ పడుచున్న వారై గౌతముని కడ కరిగిరి.
అట్లు వచ్చిన వారిని గాంచి గౌతముడు తలతో మ్రొక్కి ఓ మునివర పుత్రులారా! మీరందరు మా యింట నిలువుడని పలికెను.
అట్లు పలుకగా వారందరు ఆ కరవంతయు పూర్తిగా పోవు వరకు అతని ఆశ్రమము నందే భుజించుచు నిలిచిరి.
ఆ కరవు మరలి పోగా ఆ బ్రాహ్మణు లందరు తీర్థయాత్రపై మనసు పెట్టిరి.
అచట మారీచుడను పరమ ముని శాండిల్యుడను ముని సత్తముని చూచి చక్కగా ఆలోచించి యిట్లు పలికెను.
శాండిల్య! నీకొక మంచి మాట చెప్పెదను. నీ తండ్రి గౌతమ మహర్షి. అతనికి చెప్పక మనము తపో వనమునకు తప మాచరించుటకు పోజాలము.
అట్లు పలుకగా ఆ మును లందరు నవ్విరి. ఏమయ్యా! ఈయన అన్నము తిన్నంత మాత్రమున మనము మన దేహములను అమ్మితిమా! ఏమి?
ఇట్లు పలికి మరల అట నుండి వెడలి పోవుటకొక నిమిత్తము నాలోచించిరి. ఒక మాయ గోవును సృజించి ఆ శాలయందు వదిలిరి.
అంత నా శాలయందు తిరుగుచున్న ఆ గోవును చూచి గౌతమ ముని చేతి యందు నీటిని గ్రహించి రుద్రా! పొమ్ము అని పలికెను.
అపుడు మాయామయి అగు ఆ ఆవు నీటి బిందువులతో అట క్రింద పడెను. చని పోయిన ఆ ఆవును, వెడల గోరుచున్న ఆ మునులను గాంచి నమస్కరించి ఆ గౌతము డిట్లు పలికెను.
విప్రులారా! మీ యందు భక్తుడను. విశేషించి మీకు మ్రొక్కిన వాడనునగు నన్ను వదలి మీరేల పోవలయును. చెప్పుడు ఆలసింపకుడు.
బ్రాహ్మణా! నీ దేహమందు ఈ గోహత్యా పాప మున్నంత వరకు నీ అన్నమును మేము తినము.
వారట్లనగా ధర్మమెరిగి గౌతముడు ఆ మునులతో ఓ తపోధనులారా! ఈ గోవధకు ప్రాయశ్చిత్తమును సెలవిండు అని పలికెను.
ఆ గోవు అమృత స్వరూప. మూర్ఛిల్లినది వలె నున్నది. గంగా జలమున మునిగినచో ఇది లేచును. సంశయము లేదు.
మరణించిన దానికి ప్రాయశ్చిత్తము. చావని దానికై ఈ మాత్రము వ్రతము చాలును. కోపము చేయకుము. అని పలికి వారు వెడలి పోయిరి.
వారు వెడలిపోగా బుద్ధి శాలియగు గౌతముడు హిమవంతమను మహాగిరికి నన్నా రాధించుటకును, గొప్ప తపము చేయుటకును అరిగెను.
ఒక నూరేండ్లు నన్నారాధించెను. నేను తుష్టిచెంది సువ్రతుడా! వరమును కోరుకొమ్మంటిని.
అతడు నాతో ఇట్లనెను. నీ జటలలో ఉన్న తపస్విని ఈ గంగను నాకిమ్ము. ఈ పుణ్య భాగీరథి నాతో పాటు వచ్చుగాక!
అతడిట్లు పలుకగా శివుడు ఒక జడముక్క నొసగెను. దానిని కైకొని ఆతడును చచ్చి పడి యున్న గోవున్న చోటి కరిగెను.
ఆ నీటితో తడిసిన ఆ గోవు లేచి స్త్రీయై అరిగెను. అచట పుణ్య జలములు, పవిత్రములగు పడియలు గల ఒక్క పెద్ద నది యేర్పడెను.
ఆ గొప్ప అద్భుతమును గాంచి పవిత్రులైన సప్త మహర్షులు ఆకాశమున విమానము నందున్న వారై మేలు మేలని పలుకుచు వచ్చిరి.
గౌతమ! మేలు. మంచి వారిలో నీకు సాటియగు వాడెవ్వడు?ఈ జాహ్నవీ దేవిని దండకమున అవతరింప జేసితివి.
వారట్లు పలుకగా గౌతముడు ఇదియేమి? నాకీ గోహత్యా పాపమెట్లు కలిగించెనని పరికించెను.
ఇది యంతయు ఋషుల మాయ చేత కలిగెనని తెలిసికొని మీరందరు జడలు, బూడిద, తప్పుడు వ్రతములు తాల్చిన వారు, వేదములకు వెలియైన వారు, వేద కర్మముల నుండి భ్రష్టులైన వారు అగుడని శపించెను.
మహాముని యగు ఆ గౌతముని క్రూర వచనము విని సప్తర్షులు ఇట్లనిరి: ఉత్తమ బ్రాహ్మణులు సర్వ కాలము ఇట్లు కాకుందురు గాక! నీ పలుకు పొల్లును కారాదు. సంశయము లేదు.
ఈ బ్రాహ్మణ శ్రేష్ఠు లందరు ఉపకారము చేసిన నీ యందు అపకారము చేయు వారైనను, నీ యందు భక్తి కలవారు. నీ మాటల నిప్పులో బూదియై కలి యుగమున బ్రాహ్మణులు క్రియా హీనులు, వేద కర్మముల నుండి వెలిపడిన వారు అగుదురు.
ఈ నదికిని గోదావరియను పేరు గౌణముగా కలుగును. ‘గోవుదత్త’ ‘వరదానము వలన’ అను అర్థముతో ఇది గోదావరి యగును.
ఈ నది కడకు వచ్చి గోవును దాన మిచ్చిన వారు, ఇతర దానముల నొసగిన వారు దేవతలతో పాటు మోదమును పొందుదురు.
గురువు సింహరాశి యందున్నపుడు శ్రద్ధ గల వాడై ఈ నది కరిగి విధి పూర్వకముగా స్నానము చేసి పితృ దేవతలకు తర్పణము చేయువాని పితరులు నరకమున పడిన వారైనను స్వర్గమున కరుగుదురు. స్వర్గము నందున్న పితృ దేవతలు ముక్తి పొందుదురు. సందియము లేదు.
నీవును గొప్ప కీర్తిని పొంది శాశ్వత ముక్తిని పొందెదవు. అని ఆ మునులు, నేను ఉమాదేవితో పాటు శాశ్వతముగా నుండు కైలాస పర్వతమున కేగిరి.
ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులైన మునులు నాతో నిట్లనిరి. కలి యందు వీరందరు నీవంటి రూపము కలవారు. జడలే కిరీటముగా ధరించు వారు, ఇచ్చ ననుసరించి ప్రేత వేషమును తాల్చువారు. మాయ లింగములు ధరించు వారు నగుదురు. ఆ విధముగా కలి చేత పీడింప బడు మా వంశము వారందరి ననుగ్రహించుట కొరకు ఏదేని శాస్త్రమును దయతో తామొసగ వలయును.
ఇట్లు వారు ప్రశ్నింపగా ఓ బ్రాహ్మణో త్తములారా! వేద క్రియలతో కూడిన ‘నిఃశ్వాస’ అను ఒక సంహితను చేసితిని. దాని యందు బాభ్రవ్యులు, శాండిలులు ఆరితేరిన వారైరి. చిన్న తప్పు వలన నిది జరిగినదని విన్న వెంటనే వారు పిల్లి శీలములు కల వారైరి.
భవిష్యత్తు ఎరిగిన నేను బ్రాహ్మణులను మోహ పెట్టితిని. కలి యందు లోభము కలవారు శాస్త్రములను నిర్మింతురు.
నిశ్వాస సంహిత లక్ష శ్లోకముల ప్రమాణము కలది. అదియే పాశుపత దీక్ష. దానినే పాశుపత యోగ మందురు.
ఈ వేద మార్గము కంటె వేరైనది క్షుద్ర కర్మముగా తెలియ దగినది. అది రౌద్రము. శుద్ధి లేనిది.
ఇట్టి పిల్లి శీలము గల నరులు రుద్రు నాశ్రయించి బ్రతుకు వారు చంచల స్వభావులు తమ శాస్త్రములను వేరుగా వ్రాసికొను చుందురు. అట్టి వారిని ఉచ్ఛుష్మ రుద్రు లందురు. నేను వారి యందు నిలువను.
పూర్వము దేవతల పని కలిగినపుడు భైరవ స్వరూపముతో నేను నర్తనము చేసితిని. ఇది క్రూరకర్ములకు నాతో సంబంధము.
మునుపు దైత్యులను నాశ మొందించు కోరికతో నేను అట్టహాసము చేసితిని. అప్పుడు లెక్క పెట్టరాని కన్నీటి బిందువులు పడినవి. అవియే భూతలమున రౌద్ర స్వరూపము లగును.
ఉచ్ఛుష్మ పద్ధతి యందు ఆసక్తికల రుద్ర సంబంధులు మద్య మాంసముల యందు ప్రీతి కలవారు, స్త్రీలోలురు, పాప కర్ములు అయి భూలోకమున జన్మించిరి.
గౌతముని శాపము వలన వారి కులమున బ్రాహ్మణులు జన్మింతురు. వారిలో సదాచారులు నా శాసనమున ప్రీతికల వారగుదురు.
బైడాలికులు స్వర్గమా, మోక్షమా అను సంశయము వలన నా సంతానమును చెరుచు వారగుదురు.
ముందు నామాట మీద గౌతముని శాపాగ్నిచే దగ్ధులైన బ్రాహ్మణులు నరకమున కరుగుదురు. ఇందు విచారణ చేయనక్కర లేదు.
నేనిట్లు చెప్పగా ఆ బ్రహ్మ పుత్రులు తమ తావున కరిగిరి. పరంతపుడగు గౌతముడును తన గృహమున కరిగెను.
విప్రులారా! మీకు ధర్మము లక్షణమును చెప్పితిని. దీని కంటె విపరీతముగా ప్రవర్తించు వాడు పాషండుల యందు ఆసక్తి కల వాడగును.
