వరాహ మహా పురాణము
అధ్యాయము - 30
రాజా! పాపములను పోకార్చు మరియొ కథ వినుము. అది వసుపతికి సంబంధించినది (వసుపతి - ధనములకు అధిపతి - కుబేరుడు) బ్రహ్మ శరీరమున నున్న వాయువు, కుబేరుడుగా ఎట్లు పుట్టెనో చెప్పెదను.
వాయువు మొదట మొదటి దగు దేహమున నుండెను. ఆ క్షేత్రమున కధిష్ఠాన దేవత ఒక పని కొరకు వాయువునకు ఆకారము కలుగునట్లు ఆదేశించెను.
అట్లు ఆకారము పొందిన వాయువు ఉత్పత్తి ఎట్లు జరిగెనో నేను వివరించు చున్నాను. పుణ్యాత్మా! నేను చెప్పుచున్న ఆ ఉత్పత్తి నాలకింపుము.
సృష్టి చేయగోరు బ్రహ్మ ముఖము నుండి మిక్కిలి తీవ్రమగు గులక రాలను వర్షించుచు వాయువు వెలువడెను. బ్రహ్మ వానిని నిలువరించెను. ఆకారము పొందుము. శాంతింపుము. అని బ్రహ్మ పలుకగా వాయువు ఆకారము ధరించెను.
దేవత లందరకు గల ధనమును, వారార్జించిన ఫలమును అంతటిని నీవు రక్షింపుము. అని బ్రహ్మ పలుకగా వాయువు ధనపతి అయ్యెను.
బ్రహ్మ సంతృప్తి పడి ఆ కుబేరునకు ఏకాదశి తిథిని కల్పించెను. ఆ తిథి యందు అగ్నితో వండని పరార్థములను భుజించుచు నిష్ఠతో కూడిన పరిశుద్ధునకు కుబేరుడు తృప్తుడై కోరినదెల్ల ఒసగును. ఈ ధనపతి రూపము పాపము లన్నింటిని పటాపంచలు చేయును.
ఈ కథను భక్తితో విను వాడును, చదువు వాడను, కోరిన కోర్కెలనెల్ల పొందును. స్వర్గ లోకమున కరుగును.
