వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 72

 

సర్వజ్ఞుడు, సర్వకర్త, భవుడు, పురాతనుడు, రుద్రుడు అగు పరమేశ్వరునికి ప్రణమిల్లి అగస్త్యుడు శ్రద్ధతో ఇట్లడిగెను.

 

 

మూడు కన్నుల దేవరా! నీవు బ్రహ్మయును, విష్ణువును, ఈ మువ్వురును సర్వ శాస్త్రముల యందును అన్ని యెడలను త్రిమూర్తులుగా ప్రఖ్యాతులు. ఒక దీపము నందలి అగ్ని పెక్కు దీపములను వెలిగించు నట్లుండు వారు. అందు తమ ప్రధానత ఎప్పుడు? విష్ణు వెప్పుడు ప్రధానుడు? బ్రహ్మ ఎప్పుడు? దీనిని నాకు తెలియ జెప్పుము.

 

విష్ణువే పర బ్రహ్మము. వేద సిద్ధాంత మార్గములు దీనినే చెప్పు చున్నవి. అదియే మూడు భేదములను పొందు చున్నది. అజ్ఞానులు దీని నెరుగ కున్నారు.

 

‘విశ’ అను ధాతువునకు ప్రవేశించుట అర్థము. దానికి ‘ష్ణు’ అను ప్రత్యయము చేరగా ‘‘విష్ణు’’ అనురూప మేర్పడినది. సర్వ దేవుల యందు ప్రవేశించు సనాతనుడగు పరమాత్మయే విష్ణువు.

 

ఈ విష్ణువే పదునొకండు రూపములుగా చెప్పబడు నప్పుడు యోగము ఐశ్వర్యము, అను లక్షణములతో కూడిన వాడై ఆదిత్యు డగు చున్నాడు.

 

ఆ పరమేశ్వరుడే ఎల్లవేళ దేవ కార్యములను చేయు చుండును. ప్రతి యుగము నందును లోక మార్గములను చక్కగా సాగించుటకు, దేవ కార్యములను నెరవేర్చుటకు, మనుష్య భావమును పొంది నన్ను స్తుతించు చుండును.

 

ప్రతి ద్వాపర యుగము నందును నేనాతనికి వరము లిచ్చు వాడను, కృత యుగమున శ్వేత ద్వీపమున నేనాతనిని స్తుతించు చుందును.

 

సృష్టి కాలమున నేను నలు మోముల దేవరను స్తుతింతును. నేను కాలుడ నగుదును. కృత యుగమున బ్రహ్మయు, దేవతలు, రాక్షసులు నన్నెప్పుడు స్తుతింతురు. భోగములను కోరెడు దేవతలు లింగమే మూర్తిగా గల నన్ను పూజింతురు.

 

ముక్తి కోరువారు మనస్సులో వేయి శిరస్సులు కల దేవుని అర్చింతురు. అతడే విశ్వాత్ముడు. దేవుడు నగు నారాయణుడు.

 

బ్రాహ్మణోత్తములు నిత్యము బ్రహ్మ యజ్ఞముతో పూజించుచు బ్రహ్మను ప్రీతుని గావింతురు. బ్రహ్మ అనగా వేదమే.

 

నారాయణుడు, శివుడు, విష్ణువు, శంకరుడు, పురుషోత్తముడు, అను ఈ పేరు లన్నియు సనాతనుడగు పర బ్రహ్మమునే చెప్పును. మేధావులు ఇట్టి దానిని ధ్యానమయ యోగమని వక్కాణింతురు.

 

యజ్ఞము నందు పశువులను వ్రేల్చు హోమ కర్మమున ‘ఓమ్‌’ అని ప్రసిద్ధమైన దాని యందు నేను చక్కగా నెలకొని యుందును.

                                                                                                                      

కర్మములకై వేదముల నుపయోగించు వారికి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అను మేము మువ్వురము మంత్రముల తొలి వర్ణములము. ఇందు భావింప వలసినది లేదు.

 

నేనును విష్ణువును, బ్రహ్మయును మేమే వేదములము కర్మములము. ఇవన్నియు నొక్కటియే. బుద్ధి మంతుడు వేరుగా భావింప రాదు.

 

పక్ష పాతము చేత ఎవ్వడును గాని వీనిని వేర్వేరుగా భావించునేని ఆ పాప పురుషుడు ఘోరమైన రౌరవమను నరకమున కరుగును.

 

ఉత్తమా! నేనును, బ్రహ్మయును, విష్ణువును, వరుసగా ఋక్కు, యజుస్సు, సామములము. ఎవ్వరికిని దీని యందు భేదము ఉండ రాదు.