వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 65

సార్వభౌమ వ్రతమును గూర్చి సంగ్రహముగా చెప్పెదను. దీని నాచరించి రాజు వెంటనే సార్వభౌముడగును.

 

కార్తిక మాసమున శుక్ల పక్షము దశమి నాడు రాత్రి భోజనము చేయువాడై ప్రతి దినము అన్ని దిక్కుల యందును శుద్ధమైన బలిని ఉంచ వలయును.

 

రంగు రంగుల పూవులతో భక్తితో ఉత్తమ విప్రులను పూజించి ఆయా దిక్కును గూర్చి ‘దిక్కులారా! మీరందరు నాకు ప్రతి జన్మము నందును సిద్ధిని కూర్చు వారగుదురు గాక’ అను నర్థము గల మంత్రముతో దిక్ర్పార్థనము కావింప వలయును.

 

ఇట్లు పలికి ఆ దిక్కుల యందు నిర్మలమగు మనస్సుతో బలిని ఉంచ వలయును. ఆ రాత్రి చక్కగా మంత్రములతో సంస్కరించిన పెరుగన్నమును భుజింప వలయును.

 

మొదట ఇట్లు దధ్యోదనమును తిని తరువాత ఇష్టము ననుసరించి భుజింప నగును. ఇట్లీ వ్రతమును ఏడాది కాలము చేయు వానికి దిగ్విజయము తప్పక కలుగును.

 

మార్గశీర్ష మాసము శుక్ల పక్షము ఏకాదశి నాటి నుండి ప్రారంభించి యీ వ్రతమును వివేకవంతుడు పట్టుదలతో చేయ వలయును.

 

 

కుబేరున కిష్టమైన ఈ వ్రతమును చేసినచో ఇది పుష్కలముగా ధనము నిచ్చును.

 

ఏకాదశి నాడు, శుక్ల పక్షమున గాని, కృష్ణ పక్షమున గాని ఆహారము కైకొనక ద్వాదశి దినమున పారణ చేయుట అను ఈ వైష్ణవ వ్రతమును ఆచరించు వాడు మిక్కిలి ఘోరములైన పాపములను పరిమార్చును. త్రమోదశి నాడు నక్తమును పాటించుట ధర్మ వ్రతముగా చెప్పబడును.

 

ఫాల్గున మాసము శుక్లపక్షము మొదలుకొని ఈ వ్రతము చేయ వలయును. కృష్ణ పక్షము నందు విశేషముగా రౌద్ర వ్రతము మాఘ మాసము మొదలుకొని ఒక సంవత్సరము వరకు చేయ వలయును.

 

శుక్ల పక్షమున పూర్ణిమ తిథి యందు నక్త భోజనము (రాత్రి పూట మాత్రము భోజనము చేయుట) ఇందు వ్రతము. అమావాస్య నాడు చేయుట పితృ వ్రతము.

 

పదునైదేండ్లు ఈ విధముగా తిథి వ్రతములను చేయు వానికి వ్రతము ప్రమాణము ననుసరించి మహా ఫలములు లభించును.

 

వేల కొలది అశ్వమేధములు, వందల కొలది రాజసూయములు కల్పము ప్రకారము ఆతడు చేసినట్లగును.

 

రాజోత్తమా! దీని నంతటిని చక్కగా చేయు నరుడు శుద్ధుడు, రజస్సు లేని వాడునై సర్వ లోకములను పొందును.