వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 12

 

 

అంతట సుప్రతీక మహారాజు విష్ణువు చేతి చక్రమునగ్నికి తన కొడుకు బూదియైన వార్త విని చింతించెను. అట్లు చింతించు చుండగా ఆతని కిట్లు బుద్ధి పొడమెను.

 

 

చిత్రకూటమను పేరుగల పర్వతమున విష్ణువును రాముడను నామముతో జనులు కొని యాడుదురు. కావున నేను రామ నామముతో జగత్పతిని స్తుతించెదను.

 

 

నరనాథుడు, అచ్యుతుడు, కవి, పురాతనుడు, రాక్షసులను రూపు మాపిన వాడు, మంగళ స్వరూపడు, సమర్థుడు, మహేశ్వరుడు, ఎల్ల వేళల శరణు పొందిన వారి ఆర్తిని పోకార్చు వాడు, లక్ష్మీ దేవికి ఆశ్రయమైన వాడు అగు శ్రీరామ చంద్రునకు మ్రొక్కెదను.

 

 

ప్రభూ! నీవు వెలుగు లన్నింటికిని వెలుగుల నొసగు వాడవు. అన్ని రూపములను తాల్చు వాడవు, భూమి యందు అయిదు గుణములతో, నీట నాలుగు గుణములతో, నిప్పు నందు మూడు గుణములతో, గాలి యందు రెండు గుణములతో, గగనమున ఒక్క గుణముతో నెలకొని యుందువు. ఓ హరీ నీవు నాద మయమగు దేహము గల పురుషోత్తముడవు. (భూమి యందు~ శబ్ద స్పర్శ రూప రస గంధములు. నీటి యందు ~ శబ్ద స్పర్శ రూప రసములు, అగ్ని యందు ~ శబ్ద స్పర్శ రూపములు, గాలి యందు ~ శబ్ద స్పర్శములు, ఆకాశము నందు శబ్దము ~ అనునవి గుణములు).

 

 

నీవు చంద్రుడవు, సూర్యుడవు, అగ్నివి, ఎందును, ఎప్పుడును నాశనము లేని నీయందు ఈ జగత్తంతయు లీనమై యున్నది. నీ యందు చెదరక నిలిచి యుండి ‘రమించు’ చున్నది కావుననే నిన్ను రాముడని కొని యాడుదురు. నీ వలననే జగత్తునకు ప్రతిష్ఠ యేర్పడు చున్నది.

 

 

ఈ సంసార మొక మహా సముద్రము. అందు పెను దుఃఖములను అలలు ఎల్లవేళల చీకాకుగా ఎగిరిపడు చుండును. ఇంద్రియము లనెడు పెను మొసళ్లతో భరింపరాని భయము గొల్పు చుండును. అట్టి ఈ సముద్రమున నరుడు నిన్ను తల పోయుట అను తెప్పను గ్రహించి మునిగి పోవ కున్నాడు. అట్టి నిన్ను తపో వనము లందు తప స్సంపన్నులు ‘రామ’ అని నోరార కొని యాడుదురు.

 

 

ప్రభూ! హరీ! నీవు వేదములను రక్కసులు కొనిపోయి నపుడు మత్స్య స్వరూపము ధరించితివి. యుగము ముగియు నపుడు దిక్కు లన్నింటిని ఎరు పెక్కించితిని. అట్టి అగ్ని స్వరూపుడగు నీవు బహు రూపములను ధరింతువు.

 

 

మాధవా! ప్రతి యుగము నందును నీవు సముద్రమును చిలుకు నపుడు తాబేటి రూపుతాల్చి నిలుతువు. జనార్దనుడవగు నీకు సాటి వచ్చున దెందును లేదు. నీవే స్వయముగా ఉత్తమ భూతమవు.

 

 

మహాత్మా! ఈ విశ్వ మంతయు నీ తోడనే నిండి యున్నది. ఈ దిక్కు లన్నియు నీవే యని నీవే యెరుగుదువు. ఆద్యుడవు. పరంధాము డవునగు నిన్ను వదలి నేనెట్లు ఇతరుని శరణు కోరుదును?

 

 

ముందు నీ వొక్కడవే యుంటివి. ఆ పిమ్మట నీ నుండి పెద్ద పెట్టున భూమి, నీరు, నిప్పు, గాలి, నింగి అను అయిదు మహా భూతములు ఏర్పడినవి. అట్లే మనస్సు, బుద్ది, చిత్తము మొదలగు గుణము లన్నియు నీ నుండియే వెలువడినవి.

 

 

ఈ విశ్వ మంతయు నీ చేతనే అల్లు కొనబడి యున్నది. నీవు సనాతనుడగు పురుషుడనని నా భావము. సమస్త విశ్వమునకు ప్రభువవగు ఓ విశ్వమూర్తీ! వేల హస్తములు గల దేవాది దేవా! నీకు జయము. రామా! మహానుభావా! నీకు నమస్కారము.

 

 

ఇట్లా సుప్రతీకుడు స్తుతింపగా దేవదేవుడు ప్రసన్నుడై సుప్రతీకునకు తన రూపమును చూపించెను. వరము కోరుకొమ్మని ప్రీతితో పలికెను.

 

అట్లు పలికిన విష్ణువు పలుకు విని సుప్రతీక మహారాజు తత్తర పాటుతో ప్రణమిల్లి దేవ దేవా! నాకు నీ దివ్య దేహమున లయ మగునట్లు వర మిమ్మని వేడు కొనెను.

 

 

విష్ణువట్లు పలుకగా రాజు సుప్రతీకుడు వెను వెంటనే రాక్షస సంహారకుడగు విష్ణువు మూర్తిలో లీన మయ్యెను. ఆ రాజు పెక్కు కర్మ కాండముల నుండి విడివడి ఆత్మ భూతుడై యతనిలో నెలకొని యుండెను.

 

 

ఇట్లు నేను స్వాయంభువ మన్వంతరము నందలి మొదటి కృత యుగము నాటి పురాణ కథను కొంత భాగము చెప్పితిని. వేయి నోళ్లు గలవాడైన వాడు కూడ దీనిని పూర్తిగా చెప్పలేడు.

 

 

భూదేవీ! నాకు గుర్తునకు వచ్చినంత మాత్రము సూచనగా నీకు పురాణ కథను చెప్పితిని. సముద్ర జలము నుండి పాత్రల ప్రమాణమును బట్టి మాత్రమే కదా నీరు తీసి కొనుటకు వీలగును. అట్లే ఎంతో విలువ గల ఆ చరిత్రలో అక్కడక్కడ తడవితిని.

 

 

తనంత తానుదయించిన బ్రహ్మయు, శ్రీమన్నారాయణుడు దీనిని వివరించి చెప్పిరి. భూమిపై మరియెవ్వడు చెప్ప గలడు? నాకును ఇది అశక్యమే. కాని ఆ నారాయణుని ఒక అంశము నగుట వలన ఏదో స్మరణకు తెచ్చుకొని నీకు చెప్ప గలిగితిని.

 

 

సముద్రమున ఇసుక రేణువుల లెక్కయు, భూమి యందలి దుమ్ము కణముల లెక్కయు తెలియ రావచ్చును. అటుగా చేయుచున్న బ్రహ్మ సృష్టి యొక్క లెక్క తెలియ శక్యము కాదు.

 

 

మనోజ్ఞమగు నగవు గల భూదేవీ! ఇది నారాయణుని ఒక అంశము. దీనిని నేను నీకు చెప్పితిని. ఇది కృత యుగమున జరిగిన వృత్తాంతము. ఇటుపై నీవేమి విన గోరుదువు?