వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 17

 

 

ప్రభూ! త్రేతా యుగమున ఆ మణి వలన పుట్టిన నరవరు లున్నారే, వారికి భగవంతుడు, మీరు రాజులగు దురని వర మొసగెను గదా! వారి జన్మ మెట్టిది? వారేమి కావించిరి? వారి పేరు లేమి? నాకు తెలియ జెప్పుము.

 

 

మణి వలన పుట్టిన సుప్రభుడు మహామనుడను రాజాయెను. భూతధాత్రీ! ఆతని పుట్టుకను గూర్చి చెప్పెదను, వినుము.

 

 

తొల్లి మొదటి కృత యుగమున శ్రుతకీర్తి యని కీర్తి గన్న మహాబాహు వగు రాజుండెను. ఆతడు ముల్లోకములలో గొప్ప బలము కలవాడు.

 

 

మణి వలన పుట్టిన సుప్రభుడు ఆ రాజునకు పుత్రుడాయెను. గొప్ప కీర్తియు, మిక్కుటమగు బలమును గల ఆతని పేరు ప్రజాపాలుడు.

 

 

అతడొక నాడు క్రూర మృగములతో నిండిన ఘోరాటవి కరిగెను. అందు పవిత్రమగు ఋష్యాశ్రమమును గాంచెను.

 

 

ఆ ఆశ్రమమున పరమ ధార్మికుడగు మహా తపుడను ఋషి అన్నపానములు వదలి సనాతనమగు బ్రహ్మమును జపించుచు తప మొనర్చు చుండెను.

 

 

శుభ సంపదలు గల ఈ రాజు ఆ ఆశ్రమమును ప్రవేశింప గోరెను. మహా తపస్సు గల ఆ ప్రజాపాలు డందు ప్రవేశించెను.

 

 

ఉత్తమ మగు ఆ ఆశ్రమము నందు శ్రేష్ఠమగు వృక్ష జాతులు భూమి యందలి ప్రశస్తములగు మార్గములను క్రమ్మి యుండినవి. లతా గృహములు చంద్రుని వలె ప్రకాశించు చున్నవి. అందు ప్రవేశించిన తుమ్మెదలు ఆయాసము నెరుగ కున్నవి.

 

 

ఆ ఆశ్రమ స్థానమున దేవ కాంతల పాద పంక్తులు కానవచ్చు చున్నవి. ఆ దేవ కాంతల కాలి గోళ్లు మంచి ఎరుపు వన్నె తిరిగిన పద్మముల లోపలి కాంతుల వంటి కాంతులతో విరాజిల్లు చున్నవి. వారు ఈ ఆశ్రమము నందలి ప్రీతితో దేవ భూమిని కూడ వదలి వచ్చిరి.

 

 

మరియు ఆ ఆశ్రమ పరిసరములలో వేరువేరు ప్రమాణములు గలవియు, మంచి పూవులు గలవియు ఎత్తైనవియు నగు వృక్షములు గలవు. వానిపై పెక్కు విధములగు పక్షులు, మత్తెక్కిన తుమ్మెదలు ఆనందము నిండిన హృదయములతో అలరారు చున్నవి.

 

 

కడిమి, మంకెన, అర్జునము, శీలము, సాలము మొదలగు చెట్ల యందు, పూపొదరిండ్ల యందను ఉన్న పక్షుల కమ్మని రావములతో నిండినదై సుజనులు ప్రయోగించి నదియు, ఎట్టి చిక్కులు లేనిదియు నగు కార్య భారము కలదియో యన్నట్లు విరాజిల్లెను.

 

 

అందు గృహస్థులగు బ్రాహ్మణులు చేయుచున్న యజ్ఞముల నుండి వెలువడు చున్న ధూమములు, అగ్ని హోత్రములు, వాడి కోరలు, మేలైన జూలు గల సింహముల వలె అధర్మమను ఏనుగును చీల్చి చెండాడు చున్నవి.

 

 

ఇట్లా రాజు ఆ శ్రేష్ఠమగు ఆశ్రమమున పెక్కు వింతలను చూచుచు ప్రవేశించెను. అట్లు ప్రవేశించు చునే అందు తీవ్రమగు తేజస్సుతో అలరారు చున్న వాడును, అంతు లేని కిరణములు గల సూర్యుని వలె వెలుగొందు చున్న వాడును, పుణ్యాత్ములలో ముఖ్యుడును, బ్రహ్మవేత్తలలో అగ్రగణ్యుడును దర్భాసనమున కూర్చున్న వాడును అగు మహా తపో మహర్షిని గాంచెను.

 

 

ఆ మహర్షిని చూచి నంతనే ఆ రాజు మృగములను వశ పరచు కొనుట యను పనిని మరచి పోయెను. ముని ప్రసంగము వలన ఆతని మానసము ధర్మముపై నిలిచి పోయెను. సర్వ శ్రేష్ఠుడు, సాటిలేని వాడునగు ఆ మునిని గాంచిన ఆరాజు అట్టి మనస్థితిని పొందెను.

 

 

ఆ మునియు ఎట్టి దోషము నెరుగని ప్రజాపాల మహారాజును గాంచి, ఆసన మొసగుట, స్వాగతము పలుకుట మొదలగు సత్కారములతో ఆతనికి అతిథి మర్యాదలు సలిపెను.

 

 

అంత నా రాజు ఆ ఋషి వరునకు ప్రణమిల్లి ఆసనమున కూర్చుండి పరమ దుర్లభగు ప్రశ్న నిట్లడిగెను.

 

 

స్వామీ! దుఃఖములతో నిండిన సంసారమున మునిగిన వారు, దానిని గెలువ గోరు వారునగు పురుషులు చేయ దగినదేమో నాకు తెలియ జేయుము. నీకు మ్రొక్కుదును.

 

 

సంసారమను సముద్రమున మునుగు చున్న నరులు చెదరనిదియు, మిక్కిలి గట్టిది యునగు ఒక తెప్పను చేసికొన వలయును. పూజలు, హోమములు, దానములు, యజ్ఞములు, ధ్యానములు దానికి కీలలు. చక్కగా నాటుకొన్న మోక్షము గల దేవ భటులు ప్రాణములు మొదలగు త్రాళ్లతో అట్టి నరులను పైకి లాగుదురు. రాజా! నీవు త్రిలోక ప్రభువునే ఇపుడు తెప్పగా చేసి కొనుము.

 

 

నరకమును రూపుమాపు వాడు, దేవ దేవుడు అగు నారాయణునకు నమస్కరించు వాడు సంసార దుఃఖమును బోనాడి పరమము, దుఃఖ వాసన యైన లేనిదియు నగు శ్రీమహా విష్ణువు యొక్క అవ్యయ పదము నందు కొనును. (అవ్యయము = ఎట్టి కాలము నందును, ఏ దశ యందును చెడనిది)

 

 

సర్వ ధర్మములు చక్కగా నెఱిగిన మహానుభావా! సనాతనుడైన విష్ణువును మోక్షము పొందగోరు పురుషులు ఎట్లు పూజింతురు? దీని కలరూపు ఎరిగింపుము.

 

 

బుద్ధిశాలీ! సర్వ యోగీశ్వరుడగు హరి శ్రీమహా విష్ణువు పురుషులకును, మరియు స్త్రీలకును ఎట్లు ప్రసన్ను డగునో చెప్పెదను. వినుము.

 

 

పితృ దేవతలతో పాటు దేవత లందరును, బ్రహ్మ మొదలగు వారును, బ్రహ్మాండము నడుమ నున్న ఎల్ల వారును విష్ణువు వలననే పుట్టిరి. ఇది వేదమున వినవచ్చు సత్యము.

 

 

అగ్ని, అశ్వినీ దేవతలు, గౌరి, వినాయకుడు, ఆదిశేషుడు, కుమారుడు, ఆదిత్యులు, దుర్గాదేవితో పాటు సప్త మాతృకలు, దిక్కులు, కుబేరుడు, లోక పాలకుడగు విష్ణువు, యముడు, రుద్రుడు, చంద్రుడు, పితృ దేవతలు ~ ఈ అందరు జగన్నాయకుడగు శ్రీమహా విష్ణువు నుండి పుట్టిన వారే.

 

 

ఇట్లు హిరణ్య గర్భుని దేహమున పుట్టిన ఈ అందరును అటుపై పెచ్చు పెరిగిన గర్వము గల వారైరి.

 

 

‘నేను యోగ్యుడను, నన్ను పూజింప వలయును’ అను పెనురొద దేవతల గుంపులో అల్లకల్లోలమగు సముద్రపు ఘోషవలె విన వచ్చినది.

 

 

అట్లు వివాదము చేయుచున్న వారిలో నుండి అగ్ని పైకి లేచి ‘నన్ను పూజింపుడు, నన్ను ధ్యానింపుడు. ఇదిగో ప్రజాపతి నిర్మించిన దైన దేహము నానుండి వేరై నేను లేని కారణమున నశించును. కావున నేనే గొప్ప వాడను’ అని పలికెను.

 

 

ఇట్లు పలికి అగ్ని దేవుడు శరీరమును వదలి వెలికి వచ్చెను. అట్లతడు వెలువడినను ఆ శరీరము చెడి పోకుండెను.

 

 

అంత ప్రాణము, అపానము అను స్వరూపములతో దేహమున నుండు అశ్వినీ దేవతలు దేహమున మేమే ప్రధానులము. కావున పూజ్యులలో మేమే గొప్ప వారమని పలికిరి.

 

 

ఇట్లు పలికి వారిరువురు శరీరమును విడచి మరియొక చోట నిలిచిరి. వారిరువురు లేక పోయినను దేహము ఏ లోపము లేనిదై చక్కగా నుండెను.

 

 

పిదప వాగ్రూపిణియగు గౌరి ‘ప్రాధాన్యము నాయందు కలదు!’ అని పలికి క్షేత్రము నుండి (దేహము నుండి) వెలుపలి కరుదెంచెను. అయినను దేహము పలుకొక్కటి మాత్రము లేనిదై భద్రముగనే యుండెను.

 

 

అంత ఆకాశమను పేరుగల గణపతి యిట్లు పలికెను. ‘నేను లేని దేహమే కొంచెము కొలది కాలమైనను నిలువ జాలదు’. ఇట్లని యాతడును దేహము నుండి వేరయ్యెను. అయినను, ఆకాశమను తత్త్వము లేకున్నను శరీరము చెడ కుండెను.

 

 

రంధ్రము లేవియు లేక చక్కగా నెలకొని యున్న దేహమును చూచి శరీరము నందలి ధాతువు లన్నియు నిట్లు పలికినవి.

 

 

మా కంటె వేరుగా శరీరమునకు నిలుకడ లేదు. అని పలికి అవియన్నియు దేహమును వదలెను.

 

 

అవి వదలినను క్షేత్రమును పురుషుడు భద్రముగనే యుంచెను. అది కాంచి ‘అహంకార’ మని పేరుగన్న కుమారస్వామి యిట్లు పలికెను.

 

 

నేను లేనిచో శరీరమునకు నిలుకడయే లేదు - అని పలికి శరీరము నుండి వెలువడి వేరుగా నిలిచెను.

 

 

చెడని రూపు గల ఆ అహంకారము వదలి పోయినను దేహము, ముక్తుని వలె చెడక నిలిచెను.

 

 

ఆదిత్యుడని ప్రసిద్ధి గల సూర్యున కది చూచినంత కోపము పెల్లుబికి వచ్చెను. ‘నేను లేనిదే యీ దేహము క్షణమైనను నిలువదు’ అని పలికి శరీరమును వదలి పోయెను. అయినను దానికి ఇనుమంతయు చెరుపు కలుగ లేదు.

 

 

పిదప మాతృ గణమను పేరుగల కామము మొదలగునది లేచి నేను లేనిచో శరీరమునకు ఉనికియే లేదని పలికెను.

 

 

ఇట్లని అది దేహమును వదలి వెలికి వచ్చెను. కాని దేహము చెడిపో కుండెను.

 

 

అంత దుర్గయని పేరొందిన మాయ, నేను లేనిదే దీనికి అస్తిత్వము లేదని పలికి అదృశ్య మయ్యెను.

 

 

పిదప నాలుగు దిక్కులును పైకి లేచినవి. మేము లేనిదే ఏపనియు జరుగదు. సందియము లేదు. ఇట్లు పలుకుచు ఆ నాలుగు దిక్కులును ఒక్క క్షణమున లేచి పోయినవి.

 

 

అపుడు ధనపతియగు వాయువు నేను దేహము నడుమ లేకున్నచో దీనికి స్థితియే లేదనుచు తలనుండి వెలుపలికి వచ్చెను.

 

 

ఆ వెనుక విష్ణు స్వరూపమగు మనస్సు నేను లేనిదే యీ దేహము క్షణమైనను నిలువ జాలదని పలికి అదృశ్య మాయెను.

 

 

అంత ధర్ముడు నేనే అంతటిని పాలించితిని. ఇప్పుడు నేను వెలువడినచో ఇది యెట్లు బ్రతుకును? అని పలికి వెలువడి పోయెను. అయినను శరీరము చెడలేదు.

 

 

అటుపై అవ్యక్తము, మహత్తు అనుపేర్లు గల భూతములకు నిర్దేశకుడు అయిన మహా దేవుడు ‘నేను లేనిచో శరీరము ఉండదు’ అని పలికి వెడలి పోయెను. అయినను శరీరము చెరుపునంద కుండెను.

 

 

అదిచూచి తన్మాత్రలని పేరొందిన పితృ దేవతలు మేము వదలి పోయినచో దేహము తప్పక రూపు మాయునని పలికి ఆ దేహము వదలి వెడలి పోయిరి. (తన్మాత్రలనగా అయిదు ఇంద్రియముల గుణములు ~ శబ్ద స్పర్శ రూప రస గంధములు)

 

 

అగ్ని, ప్రాణము, అపానము, ఆకాశము, ధాతువులు, అహంకారము, సూర్యుడు, కామాదులు, మాయ, దిక్కులు, వాయువు, విష్ణువు, ధర్మము, శంభువు, తన్మాత్రలు అనునవి యన్నియు వదలి పోయినను దేహము ముక్తి యందున్నదో యన్నట్లు నిలిచి యుండెను.

 

 

పురుషుడుగా ప్రసిద్ధి కెక్కిన చంద్ర స్వరూపుడు రక్షించు చుండగా దేహము చెడ కుండెను.

 

 

పదునారింటి లక్షణములు గల అక్షరమగు సోముడు నెలకొని యుండగా దేహము మునుపటి వలె అన్ని గుణములతో కూడినదై లేచి తిరుగ సాగెను. (పదునారు = అగ్ని మొదలగునవి పదునైదు + సోమ స్వరూపుడగు పురుషుడు).

 

 

సర్వజ్ఞుడు పాలించు చుండగా మునుపటి స్థితిలో నున్న శరీరమును గాంచి ఆయా క్షేత్ర దేవతలు వెలవెల బోయిరి.

 

 

ఆ క్షేత్ర దేవత లందరు తమతమ నెలవులు పొందగోరి అందరును పరమేశ్వరుడగు ఆ దేవుని స్తుతించిరి.

 

 

ప్రభూ! నీవే అగ్నివి, ప్రాణము, అపానము, సరస్వతి, ఆకాశము, వాయువు, శరీరము నందలి ధాతువులు, అహంకారము, ఆదిత్యుడు, మాతృ గణము, మాయ, దుర్గ, దిక్కులు, దేవతల ప్రభువు, విష్ణువు, ధర్మము, జిష్ణువు, ఓటమి యెఱుగని వాడు ఇవి యన్నియు నీవే. అక్షర శబ్దమునకు అర్థమైన స్వరూపముతో నుండు పరమేశ్వరుడవు నీవే.

 

 

మేము వదలి పోగా ఇది యెట్లు నిలిచిన దనగా ఇట్లు మేము వదలిన యీ దేహమును నీవే సంరక్షించు చున్నావు కనుక నిలిచినది. మాకు స్థానమును చెరుప వలదు. ఓ ప్రజాపతీ! నీవే స్వయముగా మమ్ములను సృజించితివి కదా!

 

 

ఇట్లు వారు స్తుతింపగా ఆ ప్రభువు పరమానంద మందెను. మరియు ఇట్లు పలికెను. మిమ్ముల నందరిని కేవలము లీలకై నేను సృజించితిని.

 

 

కార్యము నెర వేరిన నాకు మీతో పని యేమి! అయినను మీకు ఒక్కొక్కిరికి రెండేసి రూపము లొసగుదును.

 

 

భూత కార్యముల యందు ఆకారము లేని స్థితితో, దేవ లోకమున ఆకారముతో నిలుపుడు. పిదప కాలము ముగిసిన వెనుక లయము పొందుడు. (భూత కార్యము లనగా భూలోకమున ప్రాణుల విషయము నందు అని భావము)

 

 

మీకెన్నటికిని నేను దేహములను ఏర్పరుప రాదు. మీ మూర్తులకు ఇప్పుడు పేరు పెట్టెదను.

 

 

అగ్నికి వైశ్వానరుడని పేరు. అశ్వులకు ప్రాణాపానములని పేరు. గౌరి హైమవతి యగును.

 

 

పృథివి మొదలగు అయిదు భూతముల సముదాయము వినాయకుడగును. శరీర ధాతువులు, అనేక భూతములు. అహంకారము అను వానికి స్కందుడను పేరు ఏర్పడును. ఆతడే కార్తికేయుడు.

 

 

భానుడు ఆదిత్య రూపుడు. మూర్తము, అమూర్తము కన్నులు కామాదుల సముదాయమే మాతృ గణము.

 

 

శరీరమున మాయయను పేరు గల యీమెకు దుర్గ అనిపేరు. ఒక కారణము వలన ఈమె మరల ఏర్పడును. పది దిక్కులు వరుణుని కన్యలుగా జనింతురు.

 

 

ఈ వాయువు ఒక కారణమున కుబేరు డగును. మనస్సునకు విష్ణువను నామము కలుగును. సంశయము లేదు.

 

 

ధర్ముడు యముడను పేరొందును. మహత్తత్త్వము భగవానుడగు మహాదేవు డగును.

 

 

ఇంద్రియ విషయములగు శబ్దాదులు పితృ దేవతలగును. ఈ సోముడు స్వయముగా సప్తమ స్థానము కలవాడగును. (యామిత్ర - ఇది జ్యోతిషసంజ్ఞ - ఏడవ స్థానము మిక్కిలి పవిత్ర మైనది)

 

 

ఇట్లు నారాయణ స్వరూపుడగు వేదాంత పురుషుని చెప్పితిమి. పిదప దేవత లందరు వారివారి స్థానముల కరిగిరి. దేవుడు అదృశ్యు డాయెను.

 

 

వేదములచే తెలియ దగిన జనార్దనుని ప్రభావ మిట్టిది. రాజా! నీ వింకేమి వినవలతువు?