32 - భార్గవ చరితము

వసిష్టుఁడిట్లు చెప్పెను.

రాముఁడు బ్రహ్మ వచనములను వినెను. జగద్గురువును నమస్కరించెను. అత్యధికముగా ప్రసన్నమనస్కుఁడయ్యెను. శివలోకమున కరిగెను. అయ్యది ఊర్థ్వమున లక్షయోజనముల దూరము. బ్రహ్మలోకము కంటే విలక్షణమయినది. అది వర్ణింపఁబడుటకు వీలులేనిది. అదీ అనిర్వచనీయము. అది యోగులచే పొందశక్యమైనది, అది పరాత్ పరమయినది. అత్యుత్కృష్టమైన దాని కంటేను నుత్కృష్టమయినది. దానికి వైకుంఠము దక్షిణమున నున్నది; మఱి గౌరీలోకము వామభాగమున గలదు. ధ్రువలోకము దానికి దిగువ నున్నది. ఆ శివ లోకము అన్ని లోకముల కంటెను పరముగా నున్నతముగా నున్నది. తపస్సు యొక్క వీర్యగతి గలిగినరాముఁడు శివలోకమును దర్శించెను. అయ్యది ఇంకొక వస్తువుతో సమభావమున నుపమించుటకు వీలులేనీదీ. అదీ యద్వితీయమైనది. నానా విధ కుతూహల జనకములయిన వస్తు సముదాయముతో నిండి యున్నట్టిది అందు యోగీంద్రులు సిద్ధులు శుభంకరులైన పాశుపతదీక్షాపరులు కోటికల్పములు తపస్సుచేసి పుణ్యులైనవారు అతిశాంతులు, నిర్మత్సరులు అయిన జనములు నీవసింతురు. (5) అయ్యదీ పారిజాతములు మందారములు మున్నగు వృక్షముల చేతను కామధేనువుల తోడను శోభించునది. యోగీశ్వరులకు యోగియైన శంకరునిచే నయ్యదీ తదిచ్చయా సృజింపఁబడినది. శిల్పులకు గురువైన విశ్వకర్మచే నాశివలోకము కలలో నయినను చూడబడలేదు. దీవ్యములయిన సరోవర సహస్రములతోడను, పద్మరాగమణుల చేతను వీరాజిల్లునదీ. అతిరమ్యములయిన మణిమయ వేదికలతో కూడియున్నది. సువర్ణముచేతను, రత్నములచేతను నిర్మితమయిన ప్రాకారముచే నదీ సమావృతమై శోభిల్లును. అదీ అంబరమునంటునట్టిది. అయ్యది క్షీరమువలె అతీధవళమైనది. దానికి నాలుగు ద్వారములు కలవు. అది మణిమయవేదికలతో కూడినది. రత్నమయమై రక్తవర్ణశోభితములయిన సోపానములు కలది. స్తంభములు రత్నస్తంభమయము. తలుపులు (కవాటములు) నానావిచిత్రములయిన చిత్రములచే నలంకృతమే మనోజ్ఞ సౌందర్య విభాసితములు. వాని మధ్య నొక భవనము. రమ్యమైనది. సింహద్వారముచే నుపశోభితము ధర్మాత్ముఁడైన రాముఁడు దానిని వీక్షించేను. విచిత్రములతో గూడిన దానిని దర్శించినట్లుగా రాముఁడు తలపోసెను. అందున్న ద్వారపాలుర నిరువురను రాముఁడు చూచెను. ఆ ద్వార పాలకులతిభయంకరులు. భయంకరములయిన దంతములతోడి వదనములు కలవారు. వికారాకారులు. ఎఱ్ఱని నేత్రములు కలవారు. తగులబడ్డ శైల సదృశులు. మహాబల పరాక్రములు. వారు విభూతి భూషిత శరీరులు. వ్యాఘ్రచర్మముల వస్త్రములుగా దాల్చినవారు.

వారు త్రిశూలములను పట్టిస మను ఆయుధములను ధరించినవారు. అయినను బ్రహ్మతేజస్సుచే ప్రజ్వలించు మొగములు కలవారు. వారిని రాముఁడు చూచెను. మనస్సులో భయపడెను. అయినను, అత్యంత వినయభావ శోభిత వినీతునివలె స్వల్పముగా నిట్లు పలికెను. ‘ఓ భగవత్స్వరూపులారా ! ఈశులారా ! మీకు నమస్కరించుచున్నాను. శంకరుని దర్శింప వచ్చితిని. మీరు నా రాక ఈశ్వరునకు దెలిపి , తదాజ్ఞను గ్రహించి ఆ శంకరుఁడెట్లు ఆనతిచ్చునో అట్లాచరింపనరులరు” అనేను. వారాతని వచనములు వినిరీ. శివుని కడ నుండి తదాజ్ఞను గ్రహించి వచ్చిరి. ఆ ఈశ్వరానుచరద్వంద్వము రామునికి ప్రవేశింప ఆజ్ఞ నొసంగిరి. రాముఁడు వారి ఆజ్ఞను గ్రహించి, అంతఃపురము లోనికి సంతోషముతో ప్రవేశించేను. అందు, రమ్యమయినది, సిద్ధసంఘములచే సమాకీర్ణమయినదియు, సుగంధబాహుళ్యముచే పరిమళించునదియునగు ప్రపంచవిభుని సభను దిలకించి రాముఁడు విస్మయావిష్ణుఁడయ్యెను. ఆ సభలో శాంతుని, త్రినేత్రుని, చంద్రశేఖరము కలవానిని, త్రిశూలముచే శోభిల్లు హస్తము గలవానిని, వ్యాఘ్ర చర్మ శ్రేషాంబరము దాల్చిన వానిని, విభూతిచే విభూషింపఁబడిన శరీరావయవములు కలవానిని, నాగ యజ్ఞోపవీతములు దాల్చిన వానిని, ఆత్మారాముని, పూర్ణకామునీ, కోటిసూర్య సమప్రభా భాసితుని, పంచ ముఖములు గలవానిని, దశభుజ శోభితుని, భక్తుననుగ్రహించు విగ్రహము కలవానిని, సిద్దులకు యోగమును జ్ఞానమును ‘తర్కముద్ర”తో నుపన్యసించువానిని, యోగీంద్రులు ప్రమథప్రకరులు సంతోషముతో స్తోత్రము చేయునట్టి వానిని, భైరవులచే, యోగినులచే, రుద్రగణములచే పరివృతుఁడై యున్నవానిని శివుని చూచి అత్యంత ముదాన్వితుఁడై శిరసా రాముఁడు నమస్కరించెను. రాముఁడు, ఈశ్వరుని వామభాగమున కార్తికేయుని, దక్షిణమున గణేశ్వరుని, నందీశ్వరుని, మహాకాలునీ, ముందుగా వీరభద్రుని, తొడపై శతభుజాలంకృతయైన దుర్గాదేవిని చూచి, వారందరకు నమస్కరించెను. తరువాత విద్వత్సంపూర్ణమైన గాద్గదికవాక్కుతో వారిని స్తోత్రముచేయ ఆరంభీంచెను. విభునికి, శివునికి, ఈశానునికి, సర్వవ్యాపకునికి అవ్యయునికి, భుజంగభూషణునికి, ఉగ్రునికీ, నర కపాల మాల ధరించీ జ్వలించువానికి నమస్కరించుచున్నాను. ఎవ్వఁడు సర్వలోకములకు విభుఁడో, సృష్టి స్థితి వినాశకారకుఁడో బ్రహ్మాది దేవతల రూపము ధరించిన వారిలో జ్యేష్ఠుఁడో, అట్టి కృపాసముద్రునిగా నిన్నెఱుంగుదును.

వాజ్మనస్సుల కగోచరమయిన వానికి, ఎవనిని వర్ణింప వేదము లశక్తిమంతములో అతనికి నమస్కారము. జ్ఞాన బుద్దుల కసాధ్యమైన వానికి నిరాకారునకు నమస్కారము. ఇంద్రాదులు, సురగణములు, ఋషీశ్వరులు, మనువులు, రాక్షసులు - ఏ పరాత్పరుని యొక్క యాథార్థమును తెలియజాలరో ఆతనికి నమస్కరింతును. ఎవని యొక్క యంశచే సర్వలోకములు చరాచర ప్రపంచము సృజింపఁబడుచున్నదో, మరల నేవని యందు ఆ సృష్టింపబడినది సర్వము లీనమగుచున్నచో, జగన్మయుఁడయిన యాతనికి నమస్కరించుచున్నాను, ఏ ప్రభుని యొక్క ఈషతోపకారణముగా హుతాశనుఁడు పుట్టెనో - ఏ యగ్ని ఊర్థ్వలోకమును పాతాళమును దహించునో, ఆహరునకు ఆపరాత్పరునకు నమస్కరించుచున్నాను. (30) పృథ్వీ పవనుఁడు, వహ్ని, అంభస్సు, నభము, యజ, చంద్రుఁడు, సూర్యుడు. అను నీ యెనిమిది జగత్పూజ్య మూర్తులెవ్వనివో ఆ యజ్ఞస్వరూపునకు అష్టమూర్తియైన హరునకు నమస్కరించుచున్నాను. ఎవ్వఁడు కాలరూపుఁడో, జగదాదికర్తయే, పృథ గ్రూపము ధరించి లోకసరంక్షకుఁడో, ఎవడు రుద్ర రూపముదాల్చి సర్వమును నాశనము చేయునో, అట్టి కాలరూపుఁడయిన హరుని శరణు జొచ్చెదను. (32) అని ఈ విధముగా పలికి భార్గవుఁడు ఆత్రముగా హరుని అంఘ్ర సమీపమున పడి సాష్టాంగ ప్రణామ మాచరించేను. ఈశ్వరుఁడు వామకరముతో అతనిని లీలతో లేవదీసి సంతోషముతో ఆ కరుణార్ణవుఁడు తన దక్షిణకరమును ఆతని శిరస్సున నుంచెను. ఆదరముగా ఆతనిని ఆశీస్సులతో నభినందించెను. ఆతనిని గణేశ్వరుని ముందు కూర్చుండబెట్టేను. కృపార్ధ్ర దృష్టితో సర్వకామములను తీర్చు పరమేశ్వరుఁడు ఉమాదేవిని చూచి, ఆతనితోనిట్లనెను.

శివుఁడిట్లనెను.

ఓ బ్రహ్మచారి ! నీవెవఁడవు? ఎవని యొక్క కులమున పుట్టితివి? ఏ కార్యమునుద్దేశించి నీవిచ్చటకు వచ్చితివి? దానిని కూర్చి చెప్పుము. నీ భక్తి భావముచే మిక్కిలి ఆనందించితిని. నీ మనస్సులో నేదియున్నదో దానిననుగ్రహించెదను ! అని ఈ విధముగా విశ్వము యొక్క ఆర్తిని తొలగించు మహాత్ముఁడయిన హరునిచే పలుకబడి భార్గవుడు మరల నమస్కరించి, విబుధులకధిపతియు, కృపా సముద్రుఁడయిన శివునితో సత్వర మిట్లనెను. (పరశురాముఁడిట్ల)నెను. భృగువంశీయుఁడను జమదగ్ని కుమారుఁడను. పేరు రాముఁడు జగద్వంద్యుఁడవయిన నిన్ను శరణుజొచ్చితిని. ఏ కార్యము కోరకు నీ సాన్నిధ్యమున కరుగుదెంచితినో, ఓ విశ్వేశ నావాంఛితమయిన కామమును నెరవేర్పుము. (38)

నా తండ్రి జమదగ్ని వేటకై యరణ్యమునకు వచ్చిన కార్తవీర్య భూపతికి ఆతిథ్యమొసంగెను. మందబుద్ధియయిన యారాజు లోభగుణమువలన తనబలములతో నాతండ్రిని పడగొట్టెను. మాతండ్రిని మృతి పొందినవానిగా జూచి, ఆ ధేనువు గోలోకమునకు పోయేను. దోషరహితుఁడయిన నా తండ్రిని చూచి కార్తవీర్యుడు విచారింపలేదు. స్వనగరమున కరిగెను. తరువాత మా మాత అత్యంత దీనముగా రోదించెను. లోక వృత్తము నెంగినవాఁడు, నా ప్రపితామహుఁడగు భృగువు వచ్చెను. వనము నుండి నేనునప్పుడే వచ్చితిని. నాతో సహితముగా దుఃఖార్తులయిన సోదరులను, మా అమ్మను ఓదార్చి, ఆ మంత్రజ్ఞుండు నొ తండ్రిని బ్రతికించెను. (43) భృగువు యొక్క రాకకు పూర్వము నా మాతృ దుఃఖముచే మిక్కిలి క్రుద్ధుఁడనయితిని. మా అమ్మను ఓదార్చుచు నేనొక ప్రతిజ్ఞను చేసియుంటిని. మా తల్లి దుఃఖముచే ఇరువది యొక్కమారు ఉరమును గొట్టుకొనెను. ఆ యిరువదియొక్కమారు భూమినంతటిని క్షత్ర రహితముగ చేసెదను అని ప్రతిజ్ఞ జేసితిని. జగత్పతియైన మహాదేవుఁడు నా ప్రతిజ్ఞను పరిపూర్తి గావించును. ఓ ప్రభూ ! అందు నిమిత్తము నేను నీ సకాశమునకు వచ్చితిని అనెను.

వసిష్ఠుఁడిట్లనెను.

రాముని పలుకులను విని దుర్గాదేవి ముఖమును చూచి, నమ్రవదనుఁడై శివుఁడు ఒక క్షణ కాలము ఆలోచించెను. (47) అంతలో, ఆశ్చర్యపడిన దుర్గాదేవి చాలసేపు నవ్వుకోనేను. తరువాత భార్గవుఁడయిన రామునితో వైరసాధనమును గూర్చి మాటాడెను. ఓ ద్విజ పుత్ర ! ఓ తపస్వీ ! కోపముతో ఇరువది యొక్క మారు భూమిని క్షత్రియ రహితముగ చేయగోరి మహా సాహస కార్యమాచరించితివి. ఈశ్వర సదృశం డయిన కార్తవీర్యార్జునుని శస్త్ర రహితముగా చంపఁగోరితివీ, ఆ కార్తవీర్యుఁడో తన కనుబొమ్మయొక్క చలనము మాత్రమున సులభముగా రావణుని నిరాకృతునిగ జేసెను.

              పూర్వమాతనికి దత్తాత్రేయుడు శ్రీహరి కవచమును, వీర్యవంతమయిన శక్తిని ఒసంగియుండెను. ఆతనిన ఎట్లు నీవు చంపఁగా కాంక్షింతువు! శంకరుఁడు కరుణాసిద్ధుఁడు. ఆతడే చేయుటకు, చేయకుండుటకు (ఇంకొక విధముగా చేయుటకు) ప్రభువు. ఓ బిడ్డా ! శంకరుని కంటే వేఱొకఁడెవఁడు తత్కార్యము నాచరించుటకు శక్తుఁడు కాఁడు. (52) అనెను. అంత దేవి యొక్క అనుమతిని పొంది, దయార్ణవుఁడయిన శంభువు జమదగ్ని సుతునితో మంగళకర వాక్యము లిట్లు పలికెను.

శివుఁడిట్లనెను.

ఈ రోజు నుండి ఓ విప్ర ! నీవు నాకు స్కందసముఁడవు కమ్ము. ఓ మహామతీ ! దివ్యమయిన మంత్రమును కవచమును నీకిచ్చెదను. అలవోకగా నీవు వాని ప్రభావ ప్రసాదమున కార్తవీర్యుని చంపఁగలవు. నీవీ భూమీనీ కూడ ఇరువది యొక్క మారు భూపతి రహితముగ చేయగలవు. త్రైలోక్య విజయమను కవచమును, పరమాద్భుతమయిన నాగపాశమును, సుదుర్లభమయిన పాశుపతమును, బ్రహ్మాస్త్రమును నారాయణాస్త్రమును, ఆగ్నేయాస్త్రమును, వారుణాస్త్రమును, గాంధర్వాస్త్రమును,గరుడాస్త్రమును, మహాద్భుతమయిన జృంభణాస్త్రమును, గదను, శక్తిని, శూలమును, దండమును, ఉత్తమమయిన శస్త్రాస్త్ర గ్రామము నొసంగెదను. వీని నన్నింటిని గ్రహించి రాముఁడు మిక్కిలి సంతుష్టుల డయ్యెను. శాంతుఁడయిన శివునకు, దుర్గకు, స్కందునకు, గణేశ్వరునకు నమస్కరించి, రాముఁడు ఉత్తమ తీర్థమయిన పుష్కరమునకు బయలు దేరి వెళ్లాను, శివోక్తమయిన ఉత్తమ మంత్ర కవచములను సిద్దము చేసికొని భృగునందనుఁడు స్వకార్యము నంతటిని సాధించేను. కార్తవీర్యుని ససైన్యముగా, స్వకుల బాంధవ యుతముగా సంతోషముగా చంపి, ముందుగా భృగువు తన తండ్రి గృహమునకు తిరిగి వచ్చెను.

ఇది వాయుప్రోక్తము మహాపురాణమునయిన బ్రహ్మాండపురాణమునందు మధ్యభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున భార్గవచరితమున ముప్పది రెండవ అధ్యాయము.