లింగ మహా పురాణము

Table of Contents

49 - అఘోర శివుని ప్రతిష్ఠను -తరంగజపహోమములను నిరూపించుట

సూత ఉవాచ:-

హృదయాద్యంగ న్యాసముతో అంగుష్ఠాదికరన్యాసముతోడను ధ్యాన పూర్వకముగ
నఘోరమంత్రమును పఠించుచు శివలింగమును వలె నఘోరేశ్వరుని ప్రతిష్ఠించవలెను.

కుండమునందు గాని స్థండిలమునఁగాని అగ్నిముఖాది విధితో నగ్నిని రగులుకొలిపి దధిమధ్వాజ్యములతో కూడిన తిలలతో 1000, 500, 108 వానిలో ఏదేనొకసంఖ్యగా హవనము నొనర్చవలెను. తత్పూర్వము అఘోరేశ్వరు నభిషేకాదులతో యథావిధిగ పూజింపవలెను.

నెయ్యి తేనె పేలపిండి వ్రేల్చుటచే దుఃఖములన్నియు తొలగును.

తిలహోమము - సర్వవ్యాధివినాశకరము ఐశ్వర్య ప్రదంబు; ప్రతి దినము 108 పర్యాయములు ఆరునెలలు అఘోరమంత్రమును జపించినచో మానసిక వాచిక శారీరక దురవస్థలన్నియు దూరమగును.

ఇంక రాజులు గూడ పై విధము అఘోరమంత్ర జపహవనముల నాచరింపఁజేసినయెడల శత్రువిజయులగుదురు.

దీనిని సహస్రము ప్రతిదినము జపించుచు ఒక నెల సహస్రము హవనము నొనర్చినచో సన్నిపాతాది జ్వరములు శమించును.

 ఒక సంవత్సరము వరకు తేనె నెయ్యి పెరుగులతో ప్రతి దినము 108 పర్యాయములు హవనము నొనర్చినచో మహాసౌభాగ్యము చేకూరును.

అఘోరేశ్వరుఁడు సంప్రీతుఁడగుటకు ముఖ్యముగా యవక్ష్మీరాజ్యతండుల హోమమును సహస్రపర్యాయములు చేయవలెను.

 రాజులు తదితరులు దధ్యన్నహవనముతో బలవంతులగుదురు. క్షీరాన్న హోమముతో సర్వోపద్రవములను శాంతింపఁజేయుదురు. ఆరునెలలు ఘృతమును వ్రేల్చినచో వ్యాధులన్నిటిని పోగొట్టుకొనఁగలుఁగుదురు.

ఇంక నొక సంవత్సరము తిలహవనముతో క్షయరోగము నశించును. యవహోమముతో దీర్ఘాయుష్యము చేకూరును. ఘృత హవనమువలన విజయము సంప్రాప్తించును. తేనెతో కూడిన చరువును పదివేల పర్యాయములు హవనమును ఆరునెలలాచరించినచో కుష్ఠాది మహావ్యాధులు శమించును.

 ఘృతము క్షీరము తేనె యనునవి - మధురత్రయమనఁబడును. మధుర త్రయహవనము - భగం దరరోగమును పోగొట్టును. కేవల ఘృత హవనమువలన రోగములన్నియు శమించునవి చెప్పవచ్చును.

 అఘోరధ్యానము అఘోరమూర్తిస్థాపనము అఘోరేశ్వరుని యథావిధిగా పూజించుటయు ఆధివ్యాధుల నన్నిటిఁబోగొట్టును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (49) వ యధ్యాయము.