లింగ మహా పురాణము

Table of Contents

106 - శివుని నృత్యారంభ సందర్భమున కాళీదేవి యొక్కయు క్షేత్రపాలుని యొక్కయు ఉత్పత్తిని నిరూపించుట

“వినాయకోద్భవమును వినినాము ఇక శంకరుఁడు నాట్యమును ప్రారంభించుటకు గల కారణమును వివరింపుము!“ అని శౌనకాదులు ప్రశ్నింపగా సూతుఁడు చెప్పఁదొడగెను.

“దారుకుడు” అను అసురుఁడు-తపస్సుచే స్త్రీ వధ్యత్వ పరమునొంది- చెలరేగినవాడై దేవతలను పలుతెఱఁగులు బాధింపగా బ్రహ్మాదులు స్త్రీ రూపధారులై పోరాడినను వారినిఁగూడ పరాజితుల నొనర్చెను.

అందువలన బ్రహ్మాదులు దారుకాసురుని సంహరింపజేయుము!“ అని తనను ప్రార్థింపగా పరమేశ్వరుఁడు “లోకకళ్యాణమునకై దారుకాసురుని వధింపు“ మని కోరెను. అంత పార్వతీదేవి తన పదునారవ అంశతో బ్రహ్మదేవుని శరీరములో ప్రవేశింపగా చతుర్ముఖుడు “ తనలో దేవి ప్రవేశించిన” దని దేవి యొక్క మాయవలన తెలియకుండెను. అట్టితఱి మదానాంతకుఁడు తన కంఠమునందలి విషమువలన కాలకంఠియనఁబడు కాళికాదేవిని పుట్టించెను.

కాళికాదేవి కంఠమునందు నలుపువన్నెతో భయంకరురాలుగ నుండ నమరులు వెఱుగంది నలుదిశలఁ బరుగిడిరి. కాళికాదేవికి నొసట మూడవ కన్ను, శిరస్సున చంద్రరేఖ, కంఠమునందు విషము, హస్తమున త్రిశూలంబు, ఓడలుపై భూషణములు నమరియుండెను.

కాళికోడ్భవానంతరము దివ్యాంబర ధారిణులగు దేవేరులు. సిద్ధేంద్రులు, పిశాచములు నుదయించెను. శివాజ్ఞచే కాళికాదేవి దారుకాసురుని వధించి క్రోధాగ్నిజ్వాలలఁ గ్రక్కుచుండగా జగత్తంతయు వ్యాకులపడుచుండెను. అందువలన మహేశ్వరుఁడు చిన్నపిల్లవాడై యావిర్భవింపగా శివమాయా ప్రభావము నమ్మవారు గుర్తింపజాలనిదై బాలుని లేపి శిరస్సున వాసన చూచి ఎత్తుకొని తన స్తనము నొసఁగెను. బాలుఁడు స్తనజన్య క్షీర పానముద్వారా కాళికాదేవియొక్క కోపమును శమింపజేసి పెద్ద వాడై క్షేత్ర పాలకుఁడుగా పరిణమించి ఎనిమిది (భైరవ) మూర్తులు గలవాడయ్యెను.

కాళికాదేవి యొక్క ఆవేశము పూర్తిగా తగ్గుటకై మహేశ్వరుఁడు కాశీ క్షేత్రమున తాండవము నొనర్పగా దేవేరులైన యోగినులును నాట్యమాడిరి. ఇట్లు కాళికాదేవి శంభుని తాండవమును వీక్షించినదై తన కడుపునిండ సంతోషించెను.

అట్టి తఱి బ్రహ్మోపేంద్రాద్యమరులు అమ్మవారికి వినమ్రులై స్తోత్రములఁజేసి తమ నెలవులకు జనిరి.

“ఇవ్విదము లోకకల్యాణ ప్రదమగు శివతాండవము దగు సందర్భమును మీకు వినుపించితిని. ఇంక నేమి కావలయునో అడుగుడు!” అని సూతుఁడు విశ్రాంతికై విరమించెను.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (106)వ అధ్యాయము.