లింగ మహా పురాణము

Table of Contents

38 - మహాదానదశమమగు సహస్ర గోదానమును నిరూపించుట

మగదూడలు గల వేయి ఆవులను సమకూర్చి - వానిలో ఎనిమిది ఆవులను యథాశాస్త్రము పూజింపవలెను. వాని కొమ్ముల తొడుగులను బంగారముతోడను, డెక్కలను వెండి తోడను చేయించి కంఠములయందు కట్టియు చెవులపై వజ్రములను నెలకొలిపి - శివునకు నివేదించి ఒక్కొక ఆవును వస్త్రయుగ్మముతో కప్పి - ఒక్కొక బ్రాహ్మణనకు సువర్ణదక్షిణలతో సహ దానముఁజేయవలెను.

 సహస్రసంఖ్యాక బ్రాహ్మణులు వేయిమంది ఒకేసారి దొరుకనిచో బ్రాహ్మణులు తటస్థించిన తఱి కొన్ని ఆవులను దానముఁ జేయుచు సంవత్సరము వరకు గోసహస్రదానమును పూర్తి చేయవలెను.

 గోవును పూజించి శివలింగము నర్చించియు గోదానముఁజేయుట శ్రేయస్కర మగును. గోదానము జేయుతఱి - దిగువ మంత్రమును పఠింపవలెను,

“గావో మమాగ్రతో నిత్యం - గావో నః పృష్ఠత స్తథా,

హుడయే మే సదా గావో - గవాం మధ్యే వసామ్యహమ్”

ఈ దానము రాజులు కోటీశ్వరులు చేయదగినది. కాని ఒక్కొక ఆవును సంపాదిస్తూ సబ్రాహ్మణునకు దానము జేయుట సామాన్యులకు గూడా సాధ్యమగునని తెలియవలెను.

ఇట్లు చేసినవాడు - ఒక్కొక ఆవునకు గల నొక్కొకవెంట్రుకకు ఏకైక శతసంవత్సరములు స్వర్గము నండు గొప్పవాడై సుఖపడును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (38)ప యధ్యాయము.