లింగ మహా పురాణము
23 - కల్పభేదము ననుసరించి - సధ్యోజాతాద్యావిర్భావమును గాయత్రిమహిమను నిర్వచించుట
సూత ఉవాచ - సూతుఁడు పక్కాణించెను.
శ్లో॥ తస్య తద్వదనం శృత్వా - బ్రహ్మణోగనాన్ భవః । బ్రహ్మరూపీ ప్రబోధార్ధం బ్రహ్మాణం ప్రాహ సస్మితమ్ ॥
భగవానుఁడు పరబ్రహ్మ స్వరూపుఁడు నగు శివుఁడు - బ్రహ్మదేవుని ప్రార్థనము నాలకించి సృష్టి జ్ఞానమును కలుగజేయుటకై - చిరునగవుతో నిట్లు వచించెను. శ్వేత కల్పము ప్రారంభమైనపుడు నేనే దిగువవిధము ఆవిర్భవించితిని. తెల్లని తలపొగ, శ్వేత పుష్పమాలిక, ధవళ వస్త్రము, తెల్లని యెముకలు, తెలుపు వన్నెకురులు, తెల్లని నెత్తురు గలవాడునై నందున సయ్యది శ్వేత కల్ప మనబడియెను. నా వలన గాయత్రీ దేవి బ్రహ్మ సంజ్ఞ కందై ధ్వవళాంగము తెల్లని రక్తంబు గలదై జన్మించెను.
అట్టితఱి నీవు రహస్యముగా నన్ను ధ్యానించినండున - సద్యోజాతు డనైతిని. పంచ బ్రహ్మలలో సద్యోజాతము ఒక బ్రహ్మముగా చెప్పఁబడును. ఇట్టే రహస్యమును గుర్తించి నన్ను సద్యో జాతునిగ నుపాసించువారు - జన్మరా హత్యము నొందుచురు.
ఎప్పుడు లోహిత కల్పము ప్రారంభ మగునో - అప్పుడు నా వన్నెతో నయ్యది లోహితకల్ప మనఁబఱగెను. ఆ సమయమున గాయత్రీ దేవి గోరూపములో ఎర్రని మాంసము ఎముకలు క్షీరము గలదై క్షీర పూర్ణస్తనములతో శోభించుచుండెను.
అట్టితఱి - నా ఎరుపువన్నె మారుటచే సుందరుడనైనందున - వామ దేవుఁడనైతిని. అప్పుడు గూడ నీవు నన్ను ప్రార్ధించులుఁ జేసి వామదేవరూపముతో నీ ముందు నిలచితిని.
ఇట్టి వామడేవు సుపాసించువారు - కైలాసమున ఎల్లకాలము నివసింతురు.
ఇక - యుగధర్మము ననుసరించి పసుపు వన్నెతో సుండుటచే నా వర్ణముఁదగు సంబంధమువలన నయ్యది పీతకల్పముగా ప్రఖ్యాత మయ్యెను. గాయత్రీ దేవియు పీతవర్ణము గలదాయెను. యోగులు నన్ను ధ్యానించుటచే తత్పురుషునిగా నీ ముందు ఆవిర్భవించితిని. పార్వతీదేవితో సహ వేదమాతయగు గాయత్రితో కూడను తత్పురుషు నుపాసించువారు - రుద్రలోకముఁ జెందుదురు.
భయంకరుడనై నలుపు వన్నె గలవాడనైన సమయమున నయ్యది కృష్ణకల్ప మనబడెను. కృష్ణ కల్పమున నేను లోకమును ప్రవర్తింప జేయు కాలము నైనందున - నల్లని ఒడలు గలదై - నల్లని నెత్తురు గలదిగా పరిణమించెను. అందువలన నన్ను ఘోరునిగా నుపాసించువారికి నేను అఘోరమైన శాంతరూపముతో ప్రన్నుఁడ నగుదును.
ఆ పిదప విశ్వము అను కల్పము సంభవించెను. అప్పుడు నీవు యోగసమాధిలో నన్ను కనుగొంటివి! లోకమునకు ఆధారమగు గాయత్రీ దేవి - గోరూపిణియై విశ్వరూప యనఁబడెను. నన్ను విశ్వరూపునిగా భావించువారికి నేను సౌమ్యుఁడ నగుదును. మరియు ధర్మార్ధ కామమోక్షములు సిద్ధించును. ఆ కల్పమునందు ప్రజలు తెలుగు ఎరుపు నలుపు వన్నె గలవారై జన్మింతురు. మరియు వారు పవిత్ర జీవనులై సర్వవిధ ఆహారములను భక్షంతురు. వేదములు - పురుషార్థ చతుష్టయమును తెలుపు నవిగా నుండును.
భూతదయ, దానము, తపస్సు, సత్యము అను నాలుగు - ధర్మము అను వృషభము యొక్క పాదములుగ నుండును. జగత్తు కృత త్రేతా ద్వాపర కలియుగములలో ప్రవర్తించు చుండును.
ఇంక లోకములఁ గూర్చి చెప్పుచున్నాను.
ఎట్టనఁగా? మొదటిది భూలోకము, రెండవది భువర్లోకము, మూడవది స్వర్గలోకము, నాలుగవది మహర్లోకము; ఐదవది జనలోకము, ఆరవది తపోలోకము, ఏడవది సత్యలోకము కాగా సత్యలోకముఁ జెందినవారు మరియు సత్యలోకోపరి విరాజమానంబగు విష్ణులోకము జేరువారును కొంత కాలము ఆలోకములలో నివసించి మోక్షము నొందుదురు.
ఆప్టాక్షరములు గల “ఓం నమో నారాయణాయ” అను మంత్రముపై వైకుంఠము ఆధార పడియుండును.
విష్ణులోకముపై కుమారలోకము, తదుపరి ఉమాలోకము, అద్దానిపై మహేశ్వరలోకము నెలకొని యుండును. ప్రాణులందరు సంసార పాశబద్దులగుటచే పశువులనఁబడుదురు. అట్టి పశువులను సంసారపాశము నుండి విడిపించు పశుపతియగు శివుని లోకము సర్వోపరి విరాజిల్లు చుండును.
శ్లో॥ శివలోకః స్మృత స్తస్మాత్ - పదం తద్యోగి నాం శుభం । నిర్మమా నిరహంకారా - కామక్రోధ వివర్జితాః ద్రక్ష్యంతి తద్ద్విజా యుక్తా - ధ్యానతత్పర మానసాః ॥
భస్మ రుద్రాక్ష మంత్ర లింగధారణాత్మకమగు శివయోగముగలవారికి శివలోకము
లభ్యమగును. శివయోగులు అహంకార మమకారములు, కామక్రోధాది వికారములును లేనివారై బాహ్యా భ్యంతరముల యందు శివు నారాధించుచుందురు. ప్రారబ్ధాంతమున శివసాయజ్యముఁ జెందుదురు.
నా ముఖమునుండి వెడలిన చంద్రుఁడు ప్రాణికోటి సుజ్జీవింపజేయుచుండును. చంద్రుని వలన అమృతముఁగ్రోలి ఆవులు బలసిన పాలిండ్లు గలవై ధవళ క్షీరము నొసగుచుండును. అట్టి ఆవుల పాలు త్రాగు జీవాత్మలు రెండు కాళ్లు గల మానవులు, నాలుగు కాళ్లు గల జంతువులునై మనుచుందురు. నీకు విశ్వరూపుఁడు అను పేరు ప్రఖ్యాతమగును. అప్పుడు అగ్నిదేవత ఆమోఘ రేతస్కుఁడై ప్రజ్వలించుచుండును.
ఇట్టి సమస్తమును స్మరించువారు పునర్జన్మ లేనివారై శివానందాస్వాదలోలురగుదురు.
ఇయ్యది “శివవిజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద
ప్రవచనమున (23) ఇరువది మూడవ అధ్యాయము.
