లింగ మహా పురాణము

Table of Contents

19 - శివుఁడు ప్రసన్నుఁడై బ్రహ్మ విష్ణువులకు వరముల నొసఁగుట

సూత ఉవాచ - సూతుఁడు - చెప్పఁదొడఁగెను.

సురసత్తము లారా! మీరు నా యందలి భక్తితో చేసిన స్తోత్రమున సంతోషించితిని - నన్నుచూడుడు! భయమును వీడుడు! మహాబలవంతులైన మీరిరువురు నా అవయవముల నుండిజన్మించితిరి. లోకపితామహుఁడగు నీ బ్రహ్మదేవుఁడు నా కుడివైపు నుండియు, విష్ణువు నా ఎడమవైపు నుండి యావిర్భవింపగా విశ్వనాథుఁడైన రుద్రుఁడు నా హృదయము నుండి యుద్భవించెను.అని మహాదేవుఁడు “ మీకు వరముల నొసగెదనని” ప్రవచించి సుందరములు పావనంబులు నగు తన హస్తములతో విష్ణువుఁ దాకుచు అనుగ్రహించెను. అటుపిమ్మట నారాయణుఁడు జ్యోతిర్లింగ మధ్యమున సాక్షాత్కరించిన మహేశ్వరునకు ప్రణమిల్లినవాడై – “మహాదేవా! నీయందు మా ఇరువురికి అనన్యమైన ఏకాగ్రభక్తి ఎల్లకాలము ఉండునట్లు వరము నొసఁగుము!” అని వేడుకొనగా పరమేశ్వరుడు “నా యందు భక్తి శ్రద్ధలు మీకు మెండుగా నుండుగాక!” యని కరుణించెను. అంత శ్రీహరి మోకాళ్లపై కూర్చుండి నమస్కరించి వినమ్రుడై యుండగా “వత్సా విష్ణో! అవాంతర సృష్టిస్థితిలయముల నొనర్చు సామర్థ్యమును నీకు ప్రసాదించుచున్నాను. పాద్మకల్పము నందు నీకు కుమారుఁడై జన్మించు నీ బ్రహ్మదేవు నెల్లకాలము కాపాడుచుండుము! నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరరూపమున సృష్టి స్థితి లయముల నొనర్చుటను పరమార్థముగా భావింపుడు! ప్రతి కల్పము నందు సృష్ట్యాదిని మీకు సాక్షాత్కరించి యనుగ్రహించుచుందును.” అని వక్కాణించి సదాశివుడు అంతర్ధానముఁ జెందె (కనుమఱుగయ్యే)ను.

అప్పటి నుడి పదునాలుగు లోకములలో లింగార్చనము సుప్రతిష్ఠమైనది.

శ్లో॥ లింగ వేదీ మహాదేవీ - లింగం సాక్షాస్మహేశ్వరః । లయనా ల్లింగ మిత్యుక్తం - తత్రైవ నిఖిలం సురాః ।

లింగము యొక్క వేదిక (పాన వట్టము) శక్తి కాగా వేదిక పైని పిండము సాక్షాత్తు
శివుడగుచున్నవాడు. భూసురులారా! సమస్త ప్రపంచము మహాప్రళయమున దాగియుండుటకు అనువైనది లింగమనబడును.

 ఈ ఆఖ్యాన మును శివ లింగ సన్నిధిని పఠించువాడు ప్రారబ్బాంతమున ముక్తుడై శివసముఁడగును.

ఇయ్యది

“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద
ప్రవచనమున - (19) పందొమ్మిదవ అధ్యాయము.