లింగ మహా పురాణము

Table of Contents

46 - శివలింగ స్థాపన ప్రాముఖ్యము

“నీ వలన జీవఛ్ఛాద్ధ విధానమును తెలిసికొనినాము. ఇఁక సమస్త దేవతా ప్రతిష్ఠఁగూర్చి వినవలెనను కుతూహలము కలిగినది. నీవు సర్వార్థ పరిజ్ఞానము గలవాడవు; శివభక్తుడవు; వేదవ్యాసుని ప్రతిరూపము అగువాడవు; వ్యాసశిష్యులలో ప్రముఖుడగు వైశంపాయనునితో సమానుడవు;” అని శౌనకాదులు ప్రశ్నించి మిన్నకుండగా - ఆకాశవాణి-

శ్లో॥ సర్వం లింగమయం లోకం సర్వం లింగే ప్రతిష్ఠితం । తస్మా త్సర్వం పరిత్యజ్య - స్థాపయేత్ పూజయేచ్చ తత్ ॥

 “ప్రపంచ మంతయు శివలింగ మయమగుటచే శివలింగమునందు చరాచర జగత్తంతయు ఆధార పడియున్నది. అందువలన ఇతర దేవతాప్రతిష్ట ను పేక్షించి శివలింగమును ప్రతిష్ఠించి పూజించుచుండవలెను.”

“శివలింగ స్థాపనము అను ఖడ్గముతో బ్రహ్మాండమును భేదించి - పరమ పదమును చేరఁగలుగుదురు” బ్రహ్మవిష్ణు ఇంద్ర వరుణ కుబేరులు తదితర దేవతలందరును శివలింగములను ప్రతిష్ఠించియే తమ తమ పదవులయందు ముఖ్యులుగా విలసిల్లుచున్నవారు.

“గాన హరిబ్రహ్మాది ప్రతిష్ఠయందు ఆసక్తి లేనివారై శివలింగమును మాత్రము -సలక్షణమైన మందిరములో ప్రతిష్ఠించినచో - సర్వదేవతా ప్రతిష్ఠా ఫలమును పొందుదురు.” అని పలికినందున - మునులందరు శివనిష్ఠచే శివ ప్రతిష్ఠా మనస్కులైరి.

ఇట్లు సూతుఁడు ప్రవచించి విరమించెను.

ఇయ్యది
 “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (46)వ యధ్యాయము.