4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
104 - అధ్యాయము
శ్రీనారాయణ ఉవాచ :
శ్రీ నారాయణుడిట్లా :
ఇంతలో బ్రహ్మ, పార్వతితో కూడా శివుడు, అనంతుడు ధర్ముడు, భాస్కరుడు, అగ్ని (1) కుబేరుడు, వరుణుడు, పవనుడు, యముడు, మహేంద్రుడు, చంద్రుడు, ఏకాదశరుద్రులు, (2) ఇతర దేవతలు, మునులు, ఏడుగురు వస్తువులు, ఆదిత్యులు, దైత్యులు, గంధర్వులు, కిన్నరులు, (3) వీరంతా శ్రీకృష్ణుని, బలరాముని, ద్వారకను చూడటానికి వచ్చారు. మనోహరమైన వటమూలానికి వేగంగా వస్తున్న (4) పురుషోత్తముని చూచి దేవతలంతా స్తుతించారు. ఆకాశము నుండి, విమానముల నుండి, వటమూలానికి చేరి , (5) రమ్యమైన మిక్కిలి మనోహరమైన ద్వారకను చూచారు. ముత్యములు, మాణిక్యములు, వజ్రములు, రత్నముల కాంతులతో ప్రకాశించే దానిని చూచారు. (6) చుట్టూ చతురస్రంగా ఉండి, శతయోజనములు గల దానిని చూచారు. గంభీరములైన ఏడు పరిఖలతో (కందకము) చుట్టబడ్డదది. (7) తొమ్మిది ప్రాకారములు గలది, లక్షల కొలది క్రీడాసరోవరములు కలది, ఆసరోవరాలు మనోహరంగా, పద్మములతో కూడి ఉన్నాయి. ఆ పద్మాలపై తుమ్మెదలు వాలి ఉన్నాయి. (8) మూడు లక్షల పుష్పోద్యానములు నాల్గు దిక్కుల ద్వారాలు కలిగి (సర్వతో భద్ర) శోభిస్తున్నాయి. వాటిలో పూలు వికసించి ఉన్నాయి. గాలివల్ల ఆ ప్రదేశమంతా సువాసనతో నిండిపోయింది. (9) చల్లని, మెల్లని చందనపు గాలి వాసనతో ఆ ప్రదేశం నిండిపోయింది. శతకోటి కొబ్బరి చెట్లతో శోభిస్తున్నదది. (10) వాటికి నాల్గింతలెక్కువైన పోక (గువాక) చెట్లతో అలంకరింపబడింది. పోక చెట్లకన్న నాల్గింతలెక్కువైనమామిడి చెట్లు అక్కడ ఉన్నాయి. (11) ఓముని! మామిడి చెట్లతో సమానమైన పనస చెట్లు వ్యాపించి ఉన్నాయక్కడ. ఓముని! మామిడి చెట్లతో సమానమైన తాటిచెట్లతో శోభిస్తున్నదది. (12) రాగి చెట్లు, రేగుచెట్లు, మారేడు, ఆమ్రతకములు, వటవృక్షములు బూరుగు, అల్లనేరేడు కదంబ వృక్షములు ఇక్కడ శోభిస్తున్నాయి. (13) వెదురు చెట్లు, చింతచెట్లు చంపకము, పొగడచెట్లు, నాగేశ్వరములు, నారింజ చెట్లు, నిమ్మచెట్లు, దానిమ్మచెట్లు ఉన్నాయక్కడ. (14) ఖర్జూరములు, ఏరుమద్దులు, కోవిదారములు (కాంచనం), పిష్టములు, చెరుకు తోటలు, కరక్కాయ చెట్లు, వుసిరిచెట్లు, చిల్ల గింజ చెట్లు ఇవన్నీ చుట్టూ వ్యాపించి ఉన్నాయి. (15)
మద్ది చెట్లు, ద్రాక్షతీగలు, హింతాలము (గిరకతాడుచెట్లు) చల్లని ఏడాకుల అరటి చెట్లు, ఇతరమైన రకరకాలైన చెట్లు కోరతగినవి, వానితో ప్రియమైన వానితో కూడినది, నిండిపోయినది. (16) లెక్కింపరాని, రమ్యమైన చాలా ఎత్తైన మందిరములతో అలంకరింపబడినది. రత్నశ్రేష్ఠముల సారముతో నిర్మింపబడినవి. ముత్యములు మాణిక్యములు వీనితో అలంకరింపబడినవి. (17) మాణిక్యములు, వజ్రములు, రకరకాలైన మంచి రత్నములు వీనితో చేసిన కలశములు గలవి. మణులతో నిర్మింపబడిన ఇష్టమైన శ్రేష్ఠమైన సోపాన సమూహములు గలవి. (18) కఠినమైన, దివ్యమైన బేడెము, గొళ్ళాలు గల ద్వారములు గలవి. పచ్చని మణుల స్తంభముల సమూహములు గలవి. (19) రకరకాలైన చిత్రవిచిత్రములైన మంచి చిత్రములతో అలంకరింపబడినవి. అద్దములు, సూక్ష్మ (సన్నని) వస్త్రములు వీనితో తెల్లని చామరలతో అలంకరింపబడినవి. (20) ప్రాంగణములు, పద్మరాగాదులు, ఇంద్రనీలములు మొదలగు మణులతో తీర్చిదిద్దబడినవి. రత్నములు పొదగబడిన వీధులు, రాజమార్గములు కలవి. (21) రత్నముల కాంతితో, గ్రీష్మ కాలమందలి మధ్యాహ్న సూర్యునివలె వెలిగిపోతున్నాయి. అట్టి లక్షలాది గవాక్షములు కలది. గుఱ్ఱపు శాలలు తీర్చిదిద్దబడ్డాయి. (22) రమ్యమైన ద్వారకను చూచి ఆ దేవతలు ఆశ్చర్యపడ్డారు. బలరాముడు పుట్టుక అనేది లేని భగవంతుడైన దేవుడు (కృష్ణుడు) ప్రసన్న వదనులైనారు. (23) యదు వంశము వారి సమూహమును, ఉగ్రసేనునిస్మరించాడు. వసుదేవుని, దేవకిని, పాండవులను, వారి తల్లిని స్మరించాడు. (24) నందుని, యశోదను గోపాలురను, రాజేంద్రులను మునిపుంగవులను, గంధర్వులను, కిన్నరులను, యదుపుంగవులను కూడా స్మరించాడు. (25) నందుడు, యశోద, గోపకులు కుంతితో కూడా పాండవులు, గంధర్వులు, కిన్నరులు, విద్యాధరులు, ఓ నారద! (26) కిన్నెర స్త్రీలు, నర్తకీమణులు, గాయకులు, వాద్య వస్తువులు భిక్షుకులు, వ్యాపారులు, భట్టులు, గణకులు (27) అనేక దేశములందలి రాజులు వైద్యులు, ఇతరులైన మనుజులు, సన్యాసులు, యతులు, అవధూతలు, బ్రహ్మచారులు, (28) తమతమ శిష్యులతో కూడి అందరు మునులు, సిద్ధపుంగవులు వచ్చారు. సనకుడు, సనందుడు, సనాతనుడు (29) జ్ఞానులకు గురువులకు గురువైన భగవత్స్వరూపుడైన సనత్కుమారుడు, మూడు కోట్ల శిష్యులతో కూడి ఐదు సంవత్సరాల వయస్సుగలిగి దిగంబరుడై వచ్చాడు. (30)
శ్రీభగవానువాచ :
అను!! భగవంతుడైన అజుడు, దుర్వాసుడు, మూడు లక్షల శిష్యులతో కూడివచ్చాడు. కశ్యపుడు లక్ష శిష్యులతో, మూడు లక్షల శిష్యులతో వాల్మీకి (31) గౌతముడు లక్ష శిష్యులతో, బృహస్పతి కోటి శిష్యులతో, శుక్రుడు మూడు కోట్ల శిష్యులతో, భరద్వాజుడు లక్ష శిష్యులతో (32) భగవానజుడైన అంగిరుడు, మూడుకోట్ల శిష్యులతో, కోటి శిష్యులతో వసిష్టుడు, ప్రచేతుడు కోటి శిష్యులతో (33) పులస్త్యుడు మూడు లక్షల శిష్యులతో, అగస్త్యుడు కోటి శిష్యులతో, పులహుడు లక్ష శిష్యులతో, క్రతువులక్ష శిష్యులతో వచ్చారు. (34) అత్రి మూడు కోట్ల శిష్యులతో, భృగువు ఐదు కోట్ల శిష్యులతో, మరీచి మూడు కోట్ల శిష్యులతో, శతానందుడు వేయి శిష్యులతో (35) విభాండకుని కొడుకు ఋష్యశృంగుడు మూడు కోట్ల శిష్యులతో, పాణిని కోటి శిష్యులతో, కాత్యాయనుడు లక్ష శిష్యులతో (36) యాజ్ఞవల్క్యుడు వేయి శిష్యులతో, వ్యాసుడు మూడు కోట్ల శిష్యులతో, కులపురోహితుడు గర్గుడు లక్ష శిష్యులతో (37) గాలవుడు వేయి మంది శిష్యులతో, సౌభరి కూడా వేయిమంది శిష్యులతో, లోమశుడు మూడుకోట్ల శిష్యులతో, మార్కండేయుడు మూడు కోట్ల శిష్యులతో, (38) సాందీపిని, దేవతలు మంచి శిష్యులు మూడు కోట్ల మందితో వచ్చారు. కోటిమంది శిష్యులతో వోడుడు, లక్ష మంది శిష్యులతో పంచశిఖుడు, (39) నేను నారాయణున్ని, నరుడు నా సహోదరుడు శిష్యుడు, మూడు కోట్ల శిష్యులతో, విశ్వామిత్రుడు కోటి మంది శిష్యులతో (40) జరత్కారువు మూడు కోట్ల శిష్యులతో ఆస్తీకుడు మూడు కోట్ల శిష్యులతో, పరశురాముడు మూడుకోట్ల శిష్యులతో వత్సుడు లక్ష మంది శిష్యులతో (41) దక్షుడు మూడు లక్షల శిష్యులతో కపిలుడు ఐదు కోట్ల శిష్యులతో, సంవర్తుడు మూడు లక్షల శిష్యులతో, అట్లానే ఉతథ్యుడు (42) వేయిమంది శిష్యులతో జైమిని, పైలుడు లక్షమంది శిష్యులతో, సువర్ణుడు వైశంపాయనుడు వేయేసి మంది శిష్యులతో (సహస్రుడు), (43) వ్యాసశిష్యుడు పురోగముడు లక్షమంది శిష్యులతో, శృంగి, ఉపమన్యువు లక్షమంది శిష్యులతో (44) వేయి మంది శిష్యులతో గౌరముఖుడు, గురుసుతుడు కచుడు లక్షమంది శిష్యులతో వచ్చారు. అశ్వత్థామ, ద్రోణుడు, శిష్యులతో కృపాచార్యుడు (45) భీష్ముడు, కర్ణుడు, శకుని, రాజుదుర్యోధనుడు, రాజు తమ్ములు అందరు, ఇతర రాజులందరు జగద్గురువును చూడవచ్చారు. (46) భగవంతుడిట్లన్నాడు - శివుడు, బ్రహ్మమొదలైనవారు దేవతలు, మునులు, ఇతరులు వచ్చిన వారు,శుభకర్మ ఏర్పడినప్పుడు వెళ్తున్నారు.(47)
ఉగ్ర సేన ఉవాచ :
వాసుదేవ ఉవాచ :
అను!! నీవు ద్వారకాపురికి యాదవులతో కూడి పొమ్ము, నా తండ్రి, తల్లులతో పాటు మ హేంద్రమందు క్షణంలో వెళ్ళు (48) ఇతరులు, ఇతరులైన యాదవులు మదురాపురికి వెళ్తారు అని ఇది విని రాజు విరసుడై భయాకులుడై భగవంతునితో అన్నాడు. (49) ఉగ్రసేనుడిట్లా - వాసుదేవ! నేనాభూమికి వెళ్ళను పైతృకమైన దానిని వదలను దైవకర్మలందు, పైతృకమందును అన్ని తీర్థముల వంటిది శుద్ధమైనది. (50) అగ్నియందు, భూమియందు, తర్పణాంజలిని పితరులకు వదిలితే నా భూమిని, స్వామిపితరులు శ్రాద్ధాకర్మలో నాశనం చేస్తారు. (51) అప్పుడు పితరుల శ్రాద్ధము నిష్ఫలమౌతుంది, దేవపూజ కూడా నిష్ఫలమే. ఫలితము కొంచమే వస్తుంది. పైతృకస్థలమందైతే సంపూర్ణ ఫలప్రదము. (52) పుత్రులు, పౌత్రులు, కళత్రము, ప్రాణము వీటన్నిటి కన్న ఎప్పుడూ ప్రియమైనది పితరునకు మాతకు శ్రేష్ఠమైన పైతృకభూమి దుర్లభమైనది. (53) అది సత్యము, పవిత్రమైనది దైవ పైతృకములలో అది. ఆనందాన్ని రక్షణను ఇస్తుంది అది. (పైతృకం) ఇతరులిచ్చేది అశుద్ధమైనది. (54) పైతృకభూమిలో మరణిస్తే అది తీర్థ క్షేత్రముతో సమానమైన ఫలాన్ని ఇస్తుంది. పితరులు తవ్విన భూమిలోని నీరు, ఓహరి! గంగాజలము వలె పవిత్రమైనవి.(55) ఆ పవిత్రమైన జలంలో స్నానం చేస్తే గంగలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది. అక్కడ పితరులకు తర్పణము దేవపూజ పవిత్రమైనవి.పైతృకజన్మ భూమిలో ఆఫలము రెట్టింపుగా లభిస్తుంది. సజ్జనులకు కూడా దానభూమి, పైతృక భూమి తుల్యమైనది. (57) వాసుదేవుడిట్లా - నీకు భోగముల గూర్చి ఏంచెప్పాలి. ని షేకాన్ని ఎవరు కాదంటారు (తండ్రి వీర్యంతో వీడి జన్మ. కనుక వీడికి జన్మభూమే). పైతృకతీర్ధమువంటిదే ద్వారక. ద్వారకను మించిన తీర్థమేముంది. (58) అన్ని తీర్థములకన్న పరమైనది, శ్రేష్ఠమైనది, అనేక పుణ్యములనిచ్చేది ద్వారక. అందులోకి ప్రవేశించినంత మాత్రాన నరుల జన్మ నశిస్తుంది. (59) ద్వారక యందు, దానము, శ్రాద్ధము, దేవపూజనము, గంగాది తీర్థముల పూజకన్న నాల్గింత లెక్కువ ఫలాన్నిస్తుంది, ఓ రాజ! (60) బ్రహ్మాదులతో కూడా వెళ్ళు. మునులతో యాదవులతో కూడా వెళ్ళు. అక్కడ గృహముల కన్న ఆదరపూర్వకమైనది రాజేంద్ర భవనముంది. (61) మహేంద్రుని అమరావతిని ఎప్పుడూ తిరస్కరించేది, అది. ఆ సుధర్మయందు, మ హేంద్రమందు క్షణం లోనీ వుండు మహారాజ! (62) జంబూద్వీపమందున్న రాజులు,రాజేంద్రులు, మండలేశ్వరులు, మహేంద్రునకు దేవతల వలె నీకు పన్ను ఇస్తారు. (63) ధనముతో, ధన సంపదతో కుబేరుని జయించు. సంపదతో మహేంద్రుని వలె, తేజస్సుతో సూర్యుని జయించు. (64) యుద్ధంతో దేవతలను జయించు, పుణ్యంతో మునుల జయించు. తపస్వులను తపస్సుతో, వ్రతముతో వ్రతంగల వారిని జయించు (65) ఉగ్రసేనునితో సమానమైన రాజు గతంలో కాని భవిష్యత్తులో కాని ఉండడు. ఆతని సభలో మహాబలుడైన బలదేవుడు, భగవంతుడున్నాడు. (66)
ఓ నరేశ్వర! అనంతుని సహస్ర శిరస్సుల పై విశ్వముంది. ఒక శిరస్సు పై ఉంచబడింది, చాటలో ఆవగింజ వలె ఉంది.(67) అనంతుని సమానమైన దేవుడు, బలరామునికన్న బలవత్తరమైన వాడు లేడు. ఆతని గుణములకు అంతం లేదు, అందుకే బుధులు ఆతనిని అనంతుడన్నారు. (68) ఎనిమిది మంది వస్తువులు, మహాభాగ్యులైన రుద్రులు, (శంకరుడు తప్ప) బలవంతులైన పన్నెండు మంది ఆదిత్యులు, మహేంద్రుడు, ఈ దేవతలతో సముడు బలరాముడు (69) నృపేశ్వరుడైన ఉగ్రసేనుని, నిజంగా జయించుటకు ఎవరూ సమర్ధులుకారు. రాజు కృష్ణుని మాటలను విని ప్రసన్నముఖుడైనాడు. (70) మహేంద్ర భవనముకన్న ఉత్తమమైన చోటికి యాదవులతో సహా ఆతడు వెళ్ళాడు. ద్వారకమధ్యలో మణుల తేజస్సుతో వెలుగుతున్న తన ఆలయాన్నిచూచాడు. (71) వేయిమంది ద్వారపాలురు కొందరి చేతులలో శూలములు, కొందరి చేతిలో దండములు ఉన్నాయి. మానవేశ్వరుడు, నియమింపబడ్డవారితో రక్షింప బడుతున్న ద్వారాన్ని చూచాడు. (72) ఆరు ద్వారముల కావల లోపల అభ్యంతరములో శిబిరముంది. నూరు మందిరాలు, రత్నములతో అలంకరింపబడ్డాయి. (73) గజమందిరంలో మత్తగజేంద్రముల సమూహంను చూచాడు. గజముల గుంపు చతుర్యుగకాలమంత గజములకు ఆరింతలెక్కువ. (74) మహాబలముగల తురగములున్నాయి. అవి సూర్యుని గుజాలను వెక్కిరిస్తున్నాయి. అన్ని వాహనములకును గజేంద్ర సమూహము ప్రధానమైనవి. (75) ఓ నారద! ఇవి మ హేంద్రుని ఐరావత గజాన్ని ఇవీ ఎప్పుడూ పరిహసిస్తున్నాయి. చాలా ఉన్నతమైన ఇష్టమైన , ఉచ్చె:శ్రవములను మించిన గుజ్జాల సమూహమును (కోటిని) చూచాడు. (76) పదికోట్ల గాడిదలు, వీటికి ఆరింతల పదాతిదళాలు చూచాడు. రత్నములలో శ్రేష్ఠమైన వానితో నిర్మితమైన ఐదు లక్షల రథాలను చూచాడు. (77) ఐదు లక్షల సారథులు వాటికి గుఱ్ఱములు ఆరింతలున్నాయి. వాటికి సమానమైన అశ్వశాలలున్నాయి. సుధర్మ అనుసభను చూచాడు. (78) అభ్యంతరమందు రమ్యమైన, దేవతల సమూహము, మునులు గల, అందమైన వహ్నితో శుద్దమైన వస్త్రములతో, ఎర్రని కంబళములతో అలంకరింపబడ్డదానిని (79) అందమైన ఎర్రని పింగళ వర్ణముగల రత్నసింహాసనములతో అలంకరింపబడ్డ దానిని, అమూల్య రత్నములతో నిర్మింపబడ్డ వీథుల తేజస్సుతో వెలిగిపోతున్న దానిని (80) చాలా భయపడుతున్న శతకోటి కింకరులతో చుట్టబడిన దానిని, అట్టి సభను, రమ్యమైనదానిని, శుభమైన శంఖధ్వని విని ప్రవేశించాడు. (81) దుందుభుల వాద్యమును, మునుల వేదమంత్రాలను వింటూ ప్రవేశించాడు. రాజును చూచి బలరామునితో పాటు కృష్ణుడు వేగంగా లేచాడు. (82)
బ్రహ్మ మహేశ్వరుడు, శేషుడు, దేవతా శ్రేష్ఠులు, దేవతలు, అందరు మునులు, మహావ్రతులు అంతా లేచి నిలబడ్డారు. (83) రాజేంద్రులు, సిద్ధేంద్రులు, వసుదేవుడు మొదలగు వారంతా లేచారు. రమ్యమైన రత్నసింహాసనమందు మహాబలుడైన ఉగ్రసేనుడు (84) మ హేంద్రుని యొక్క, మునుల యొక్క, హరియొక్క ఆజ్ఞతో కూర్చున్నాడు. దేవతలు, గురువులు, గరుడు అందరి అనుమతితో నూ (85) ఓ నారద! పూర్ణకుంభంతో సప్త సముద్రముల నీరుతో, దేవ మంత్రములతో రాజునకు అభిషేకము చేశారు. (86) అగ్నితో శుద్ధమైన, మనోహరమైన రెండు వస్త్రములను రాజుకిచ్చారు. అవి ఇది వరలో పరమాత్మయైన కృష్ణునకు వరుణుడిచ్చాడు. (87) పారిజాత పూలమాలను, చందనము, రత్నాభరణములు, రత్నముల గొడుగు వీనిని ఆరాజునకు మహాబలుడైన బలదేవుడిచ్చాడు. (88) బ్రహ్మ కమండలువును, మహేశుడు శూలమును, పార్వతి రత్నమాలను, మాలతిసతి హారమును ఇచ్చారు. (89) ఇతరులు దేవతలు, మునులు, రాజేంద్రులు సిద్ధపుంగవులు క్రమంగా విడివిడిగా ఆతనికి మౌతకమును (ధనము) ఇచ్చారు. (90) వసుదేవుడు ఆతనికి శుభకరమైన తెల్లని చామరమునిచ్చాడు. దీనిని ఇది వరలో పరమాత్మయైన కృష్ణునకు పవనుడు ఇచ్చాడు. (91) ఇంద్రుడు సురభిని, పూజింపబడిన కామధేనువును ఇచ్చాడు. యశోద, దేవకి వీరిద్దరు ఆతనికి ఆనందంతో శ్రేష్ఠ రత్నములనిచ్చారు. (92) ఏడుగురు కింకరులతో పాటు శ్వేతచామరములతో వీవబడుతూ, అక్రూరుడూ భక్తితో హరి ఆజ్ఞతో ఛత్రమును ధరించాడు, (93) రమ్యమైన రత్న సింహాసనమందు రత్న దర్పణమును చూచాడు. మిక్కిలిపుణ్యముతో పొందదగిన దానిని, హరి ఇచ్చాడు. (94) భట్టులు, భిక్షుకులు, బ్రాహ్మణులు స్తుతిచేశారు. దేవతలు, మునులు ఆరాజుకు శుభాశీస్సులనిచ్చారు. (95) రాజు బ్రాహ్మణులకు భక్తితో కోట్ల రత్నములిచ్చాడు. భట్టులకు నూర్ల కొలది రత్నములను, అట్లాగే భిక్షకులకు ఇచ్చాడు. (96) రాజును అభి షేకించి, దేవతలను, ముని పుంగవులను, బ్రాహ్మణులను, భట్టులను, భిక్షువులను, ద్విజుని గురువును పూజించి (97) ఆనందంతో యాదవులంతా తమ ఇళ్ళకు వెళ్ళారు. హరిప్రక్కన ఉండేవారు అంతా తమ ఇళ్ళకు వెళ్ళారు. (98) ప్రొద్దున, అందరు, హరియొక్క సుధర్మ అను సభకు వచ్చారు. మహేంద్రునకు నమస్కరించి అందరు సభలో కూర్చున్నారు. (99)
అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు ద్వారకా ప్రవేశ ఉగ్రసేనాభి షేక మనునది నూటనాలుగవ అధ్యాయము.
