4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

92 - అధ్యాయము

మూ॥ శ్రీనారాయణ ఉవాచ :

నారాయణుని వచన మిట్లా - శ్రీకృష్ణునితో ప్రేరేపింపబడి ఆనందంతో గణేశ్వరునకు నమస్కరించి, నారాయణుని, శంభుని, దుర్గను, లక్ష్మిని, సరస్వతిని స్మరించి (1) గంగను మనస్సులో ధ్యానించి, దిగీశుడైన ఆ మహేశ్వరుని ధ్యానించి మంగళసూచలను (శకునాలు) చూసి, ఉద్ధవుడు బయలు దేరాడు. (2) దుందుభిధ్వనిని, ఘంటాధ్వనిని, శంఖధ్వనిని విన్నాడు. హరిశబ్దమును, సంగీతమును మంగళధ్వనినీ విన్నాడు. (3) పతిపుత్రులు గల సాధ్విని, దీపమును మాలలు అద్దము, నిండిన కుండను, పెరుగు, పేలాలు,పండ్లు (4) గరిక మొలక తెల్లధాన్యము, వెండి, బంగారము, తేనె, బ్రాహ్మల సమూహము, కృష్ణసారమును (జింక) వృషభమును, నేయిని, (5) కొత్త (ఫ్రెష్) మాంసమును, గజేంద్రమును, నృపేంద్రుని, తెల్లని గుఱ్ఱన్ని, ధ్వజమును, ముంగిసను, పాలపిట్టను, తెల్లని పుష్పాన్ని, చందనమును (6) ఈ విధంగా దారిలో శుభసూచలను చూస్తూ వృందావన వనమునకు చేరాడు. ఎదురుగా అత్తి చెట్టును, అక్షయమైన వటవృక్షాన్ని చూచాడు. (7) నిగనిగలాడుతున్న, ఎరుపు రంగుగల, పుణ్యమునిచ్చే, ఈప్సితమైన తీర్థమును మంచివేషముగల, ఎర్రని భూషణములతో అలంకరింపబడ్డ బాలకులను చూచాడు. (8) శుచిగా ఉండి బాలకృష్ణ! అని అంటూ రోదిస్తున్న వారినోదార్చి దూరంగా వెళ్ళాడు. ఆనందంతో నగరంలో ప్రవేశించి (9) విశ్వకర్మ నిర్మించిన నందుని శిబిరాన్ని చూచాడు. ఆభవనము మణులతో రత్నములతో నిర్మింపబడింది.ముత్యములు మాణిక్యములు వజ్రాలు వానితో ఆ భవనం నిర్మించారు. (10) రత్నాలతో కప్పబడి, మనోహ్లాదమైన, ఉత్తమ రత్నకలశములతో కూడిన, చిత్రమైన విచిత్రములతో కూడిన ద్వారాన్ని చూచి ఆతడు ప్రవేశించాడు. (11) రథము పైనుండి త్వరగా దిగి ఆ ప్రాంగణమందు ఆనందంతో నిలబడినాడు. యశోద, రోహిణి వీరలు త్వరగా వచ్చి యోగక్షేమాలన్ని అడిగారు. (12) సంతోషంతో ఆసనం వేసి, నీటిని తాగటానికి) ఇచ్చి, ఆవును మధుపర్కమును ఇచ్చారు నందుడెట్లున్నాడు, బలరాముడు, కృష్ణుడు ఎట్లున్నారో, ఎక్కడున్నారో అదంతా ఉన్నదున్నట్లు చెప్పు, ఓ ఉద్ధవ! అని అడిగారు. (13) వారిక్షేమ సమాచారమంతా క్రమంగా ఉద్దవుడు చెప్పసాగాడు. బలరామకృష్ణులతో కూడినందుడు, ఆనందంగా ఉన్నాడని చెప్పాడు. (14) కృష్ణుని ఉపనయనం వరకు ఆలస్యంగా వస్తాడు. శాస్త్రానుగుణంగా ఉండవలసిన రీతిలో మీకు కుశలాన్ని చేకూర్చి (15) నేను మథురకు వెళ్తాను. యశోద! ఇప్పుడు విను అని అన్నాడు. యశోద, రోహిణులు నందుని, కృష్ణ బలరాముల, క్షేమ వార్తను విని ఆనందించారు. (16) ఆతనికి రత్నములు, సువర్ణము, వస్త్రములు కావలసినవి ఇచ్చారు. అమృతం లాంటి మధుర పదార్థాలను ఉద్దవునకు భుజింపచేశారు. (17) ఆతనికి ఉత్తమమైన మణులు, రత్నములు వజ్రములు ఇచ్చారు. అట్లాగే అనేక రకాలైన మంగళకరమైన వాద్యములను వాయింపచేశారు. (18) బ్రాహ్మణులను భుజింపచేశారు. మంగళక్రియలు చేశారు. మిక్కిలి ఆనందంతో వేదములను పఠింపచేశారు. (19) పరుడైన విభుని, విప్రుని ద్వారాశంకరుని పూజింపచేశారు. అనేక రకాలుగా తేబడిన పదార్థాలను నైవేద్యంగా ఇచ్చారు. పుష్పధూప దీపములతో (20) చందన, వస్త్ర, తాంబూలములతో, మధువు గవ్యము, ఘృతము వీనితో పూజించారు. శ్రీవృందారణ్య దేవతయైన భవానిని పూజింపచేశారు. (21) ఓముని! షోడశోపచార ద్రవ్యములతో ఉపచరించారు. రకరకాలైన బలులు నివేదించారు. నూరు మహిషములను, శుద్దమైన వేయిమేకపోతులను , (22) శుద్దమైన యోగ్యమైన పదివేలమేకలను తీసుకొని వచ్చి (ఐదేసి చొప్పున) బలిగా ఇచ్చారు. బ్రాహ్మణులకు నూరేసి బంగారు నాణములను, నూరేసి ఆవులను ఇచ్చారు. (23) కృష్ణునకు క్షేమము జరగాలని త్వరగా దక్షిణలు కూడా ఇచ్చారు. ఆదర పూర్వకంగా మాటిమాటికి ఉద్దవుని పూజించారు.

యశోదనురోహిణిని, గోపబాలకులను ఓదార్చి వృద్దులను గోపాల బాలికలను అందరిని ఓదార్చి రాసమండలానికి వెళ్ళాడు. (25) చంద్రమండలంలా వర్తులంగా ఉన్న అందమైన రాసమండలాన్ని చూచాడు. మారేడు, వాస్తూకము, అరటి స్తంభములు ఇవి నూర్లకొలది వెలిగిపోతున్నాయి. (26) తగినట్టి మృదువైన వస్త్రములు, చందనపు చిగుళ్ళు, పట్టు దారంతో కట్టబడిన మారేడు దళములు గల మాలలు గల కిటికీలున్నాయి. (27) పెరుగు, పేలాలు, పండ్లు, పట్టు వస్తువులు, పూలు, గరికపోచలు, చందనము అగురు, కస్తూరి, కుంకుమ వీటన్నిటితో అంతటా సంస్కరింపబడింది. (28) మూడు కోట్ల గోపికలు దానినిచుట్టి ఉన్నారు, ప్రయత్నంగా దాన్ని రక్షిస్తున్నారు. సుందరమైన రమ్యమైన మూడు లక్షల రతి మందిరములతో తడుపబడింది. (అలంకరింప) (29) కృష్ణుడు వస్తాడని అనుమానిస్తున్న లక్షమంది గోపాలురు దాన్ని చుట్టి ఉన్నారు. యమున నది ఎడమైపునుండి మాలతీ వనానికి వెళ్ళాడు. (30) చందనపు చెట్లకు, చంపకపు చెట్లకు, అడవి మొల్లలకు, అట్లాగే మొగిలి, మాధవి వనములకు ప్రదక్షిణం చేసి (31) పొగడ, ప్రబ్బలి, అశోకముల అడవిని చుట్టి, మల్లిక, మోదుగ, దిరిశెన వనములను అట్లాగే (32) ఉసిరి, కాంచనపు చెట్లు, కర్ణికార చెట్ల వనమును, అట్లాగే లవంగము, నాగేశ్వరముల విపినమును, అట్లాగే (33) సాలవృక్షముల, తాలవృక్షముల, హింతాలవృక్షముల వనమును, అట్లాగే, పనస, మామిడి, మనోహరమైన లాంగలి వనములను, (34) రమ్యమైన మందారకాననమును (చుట్టి) ఇవన్నీ ఎడమవైపున ఉండగా త్వరగా వెళ్ళాడు. అందమైన కుంద వనమును చూచి, మధుకాననమును చేరి(35)నాడు. పుంస్కోకిలల మధురమైన శబ్దంతో నిండిందా వనము. అనేకమైన తుమ్మెదలు గుంపులుగా తమ మధుర ధ్వనిని విన్పిస్తున్నాయి. ఆవనం నిండిందా ధ్వనితో (36) అడవి చెట్లతో చుట్టబడిందా ప్రదేశం. ఈప్సితమైన ఇప్పచెట్లకు ఆధారమైనది. గాలి, అడవి పూలవాసనతో ఆప్రదేశాన్నంతా సువాసనగా చేసింది. (37) అది చూచి యశోద చెప్పిన రాజమార్గం గుండా అప్పుడు ఉద్వేకరంకాని, రహస్యమైన బదరీవనానికి త్వరగా వెళ్ళాడు. (38) మారేడు పండ్లు, వేప, నారింజ వనము, అట్లాగే పద్మముల, కరవీరముల (గన్నేరు), తులసి వృక్షముల అడవిని (39) చూచి, ఎర్రనైన పండిన, ఇష్టమైన పండ్లను చూచి, దాని కుడి ప్రక్కనుండి కదళీ వనమును ప్రవేశించాడు. (40) మిక్కిలి నిర్జనమైన అడవిలో అందమైన, రాధిక ఆశ్రమమును చూచాడు. శ్రేష్ఠమైన మణులతో చేసిన ప్రాకారము, కందకము, దుర్గము ఇవి ఆ ఆశ్రమం చుట్టూ ఉన్నాయి. (41) శత్రువులు ప్రవేశించటానికి ఏమాత్రం వీలులేనిది, మిత్రులకు ప్రవేశించుటకు సులభ సాధ్యమైంది, సుఖకరమైనది అది రహస్యమైనది. సంకేత మార్గంలో రక్షకులు పరిరక్షిస్తున్నారు. (42) విశ్వకర్మదీనిని నిర్మించాడు. అది రకరకాల చిత్రవిచిత్రములతో కూడి ఉన్నది. శ్రేష్ఠమైన మణులు, ముత్యములు, మాణిక్యములు, వజ్రములు వీటి హారములతో ప్రకాశిస్తున్నది, పరమమైనది. (43) శ్రేష్ఠమైన రత్నములలో ఉత్తమమైన వానితో చేయబడింది. రత్న స్తంభములతో చక్కగా ప్రకాశిస్తున్నది. రత్నసోపానములతో కూడిన మందిరముతో మనోహరముగా నున్నది. (44) అమూల్యమైన రత్నములతో చేయబడింది. కలశములతో అంతటా ప్రకాశిస్తున్నది. అగ్నితో శుద్ధిచేయబడిన వస్త్ర ముల పతాకములతో అలంకరింపబడినది. (45) మంచి రత్నములతో చేసిన దర్పణముల (అద్దముల)తో ఉత్కృష్టమైనది, తెల్లని చామరలతో నింపబడింది. రత్నకవాటములు గల సింహద్వారమును చూచాడు, ఉద్ధవుడు.

ఉద్ధవ ఉవాచ :

ద్వారం పైన విచిత్రమైన రమ్యమైన వృందావనమను వనమును, రమ్యమైన కదంబవనమును, వారివస్త్రాపహరణాదికమును (47) విశ్వకర్మ నిర్మించిన మిక్కిలి అందమైన రాసమండలమును చూచాడు. గోపాలురు గోపికలతో కూడిన రకరకాల రత్న కుటీరములను చూచాడు. (48) అందమైన వేత్రములను చేత ధరించిన లక్ష గోపికలతో రక్షింపబడిన ఎప్పుడూ స్వేచ్ఛగా విహరించే, అధిక బలవంతులున్న వానిని ఆనందంగా చూచాడు. (49) ఆ ద్వారాన్ని ఎదురుగా చూచి, దానిని దాటి ఆతడు వెళ్ళాడు. రెండవ ద్వారాన్ని దాటాడు. దానికన్న ఉత్తమమైన, ఇష్టమైన దానిని దాటాడు. (50) అన్నిటి కన్నా విలక్షణమైన నాలుగవ ద్వారానికి చేరాడు. విచిత్రమైన, ఉత్తమమైన ఐదవ ద్వారాన్ని ఆ పైన చూచాడు. (51) అంతట రుచిరంగా ఉన్న, పరమమైన ఆరవ ద్వారానికి చేరాడు. అక్కడ గోడల పై రామరావణుల యుద్ధము అందంగా చిత్రితమైనది. (52) విష్ణువు యొక్క పది అవతారములు, కృత్రిమమైన రాసమండలమును, యమునా నదిని, జలకేళిని, చూచాడు. ఇవన్నీ విశ్వకర్మ ఏర్పరచాడు. (53) ఆరవ ద్వారాన్ని వేయిమంది గోపికలు రక్షిస్తున్నారు. వారు శ్రేష్ఠమైన, రత్నములలో ఉత్తమమైన వానితో చేయబడిన అలంకారములను అలంకరించుకున్నారు. (54) వజ్రములు పొదిగిన మంచి రత్నములతో చేసిన దండమును చేత ధరించారు. ఉత్తమమైన మణులు, ముత్యములు, మాణిక్యములు, వజ్రములు వీటితో నిర్మించిన హారముల ధరించారు. (55) వారికి నాయకురాలైన మాధవి ఇప్పుడు ఉద్ధవుని క్షేమ సమాచారం అడిగింది. ఆ ఉద్ధవుడు క్రమంగా సమాధానం పూర్తిగా చెప్పాడు. (56) రాధాప్రియ సఖీగణము వెళ్ళి చెప్పారు. ఆ మాధవి చాలా ఆనందించి, ఆనందంతో ఆతనిని అక్కడ ఉంచింది. (57) రాధ తన ప్రియసఖీ గణముతో మంగళ వార్తను విని ఆనందంతో శంఖధ్వనిని, గంట, పటహము, మృందగము వీని ధ్వనిని చేసింది. (58) ప్రియమైనవాడు, వచ్చినవాడు ఐన ఉద్ధవుణ్ణి త్వరగా యోగక్షేమాన్ని ప్రశ్నించింది. ఆనందంతో, ఉత్తమైన తన అభ్యంతర మందిరంలోకి రాధ ఆతనిని ప్రవేశ పెట్టమంది. (59) అమూల్యమైన రత్నములతో నిర్మింపబడిన శ్రేష్ఠమైన మందిరానికి వెళ్ళి, అమావాస్యనాటి (చంద్రుడులేని) చంద్రకళలా ఉన్న రాధను ఎదురుగా చూచాడు. (60) బాగా వికసించిన పద్మమువంటి నేత్రములు కలది, నిద్రిస్తోంది, శోకం వల్ల మూర్చిల్లింది, ఏడుస్తున్నది, ముఖం ఎర్రబారింది, బాధపడుతోంది సొమ్ములన్నీ తీసివేసింది. (61) చేష్టలుడిగి ఉంది. ఆ హారం తినటం లేదు. బంగారం రంగుగల కుండలాలను ధరించింది. ఆమె గొంతు, పెదవి ఎండిపోయాయి. కొద్ది ఊపిరితో ఉంది. (62) ఆమెను చూచి భక్తితో తన మెడను వంచి ఆమెకు నమస్కరించాడు. భక్తితో భక్తుడైన ఆ ఉద్ధవుని శరీరమంతా పులకాంకురాలు పొందింది. (63) ఉద్దవుని వచనమిట్లా - రాధ పాదపద్మములకు నమస్కారము. ఆమె బ్రహ్మాది దేవతలతో నమస్కరింపబడేది. ఆమె కీర్తిని, కీర్తి స్తేనే ముల్లోకాలు పవిత్రమౌతాయి. (64) గోలోకంలో ఉండే రాధికకు నమస్కారము. శతశృంగవాసురాలికి చంద్రవతికి నమస్కారము. (65) తులసీవన వాసురాలికి వృందారణ్య వాసురాలికి నమస్కారము. రాసమండల వాసురాలికి, రాసేశ్వరికి నమస్కారము. (66) విరజాతీర నివాసురాలికి వృందకు నమస్కారము బృందావన విలాసినికి, కృష్ణకు నమస్కారము. (67) కృష్ణుని ప్రియకు శాంతురాలికి నమస్కారము. కృష్ణుని వక్షః స్థలనివాసురాలికి, కృష్ణునికి ప్రియమైన ఆమెకు ) ప్రియురాలికి నమస్సులు.

అను! వైకుంఠవాసినికి మహాలక్ష్మికి నమస్కారము. విద్యాధిష్ఠాతృ దేవతకు సరస్వతికి నమస్కారము. (69) ఐశ్వర్యాని కంతకు అధిదేవతయైన కమలకు నమస్కారము. పద్మనాభుని ప్రియకు పద్మకు నమస్కారము. (70) మహావిష్ణువు తల్లికి పరాద్యకు నమస్కారము. సింధు సుతకు మర్త్యలక్ష్మికి నమస్కారము. (71) నారాయణ ప్రియకు నారాయణికి నమస్కారము. విష్ణుమాయకు వైష్ణవికి నమస్కారము. (72) మహామాయా స్వరూపురాలికి సంపదకు నమస్కారము. కళ్యాణ రూపిణికి, శుభురాలకు నమస్కారము. (73) నాలుగు వేదముల తల్లియైన ఆమెకు సావిత్రికి నమస్కారము. దుర్గ వినాశినికి దుర్గా దేవికి నమస్కారము. (74) ఇది వరలో కృతయుగంలో తేజస్వంతులలో సర్వదేవతల తేజస్సుకు, అధిష్టానమైన ప్రకృతికి ఆనందంతో నమస్కరిస్తున్నాను. (75) త్రిపుర సంహారికి త్రిపురకు నమస్కారము. సుందర స్త్రీలలో రమ్యమైన ఆమెకు నిర్గుణురాలుకు నమస్కారము. (76)నిద్రా స్వరూపురాలికి, నిర్గుణరాలికి నమస్కారము. దక్షసుతకు, సతికి నమస్కారము. (77) శైలసుతకు పార్వతికి నమస్కారము. తపస్వినికి, ఉమకు నమస్కారము. (78) నిరాహార స్వరూపురాలికి, అపర్ణకు నమస్కారము. గౌరీలోక విలాసినికి గౌరికి నమస్కారము. (79) కైలాసవాసినికి, మా హేశ్వరికి నమస్కారము. నిద్రా స్వరూపురాలికి దయాస్వరూపురాలికి, శ్రద్ధాస్వరూపురాలికి నమస్కారము. (80) ధృతి, క్షమ, లజ్జస్వరూపురాలికి నమస్కారము. తృష్ణ, క్షుత్తు స్వరూపురాలికి స్థితి కర్రికి నమస్కారము. (81) సంహార రూపిణికి మహామారికి నమస్కారము. భయకు, అభయ రూపురాలికి నమస్కారము. ముక్తిదాయినికి నమస్కారము. (82) స్వధకు, స్వాహారూపురాలికి, శాంతికి, కాంతికి నమస్కారము. తుష్టికి, పుష్టికి, దయా స్వరూపురాలికి, నమస్కారము. (83) నిద్రాస్వరూపురాలికి శ్రద్ధకు నమస్కారము. క్షుత్పిపాసా స్వరూపురాలుకు, లజ్జకు నమస్కారము. (84) ధృతికి క్షమకు, చేతన స్వరూపురాలికి నమస్కారము. సర్వశక్తి స్వరూపిణికి సర్వమాత్రకు నమస్కారము. (85) అగ్నిలోదాహ స్వరూపురాలైన ఆమెకు భద్రకు నమస్కారము. పూర్ణ చంద్రునిలో శోభకు శరత్పద్మంలో శోభకు నమస్కారము. (86) పాలకుదాని తెలుపుదనానికి భేదం లేనట్లే, వాసనకు భూమికి భేదం లేనట్లుగానే నీటికి చల్లదనానికి భేదం లేనట్లుగానే (87) 'ఆకాశానికి శబ్దానికి భేదం లేనట్లుగానే వెలుగుకు సూర్యునికి భేదం లేనట్లుగానే, లోకంలో వేదంలో పురాణంలో రాధామాధవులకు భేదంలేదు. (88) ఓ కళ్యాణి! మేలుకో. ఓ సతి! నాకు సమాధానమివ్వు. అని పలికి ఉద్ధవుడు అక్కడ మాటిమాటికి నమస్కరించాడు. (89) ఇట్లా ఉద్దవుడు చేసిన స్తోత్రాన్ని భక్తితో చదివిన వారు ఈలోకంలో సుఖాన్ని అనుభవించి, చివర హరి మందిరానికి వెళ్తారు.

ఈ స్తోత్రం చదివిన వారికి బంధువిచ్చేదం కలుగదు. మిక్కిలి దారుణమైన రోగ, శోకములు కలుగవు. భర్త దేశాంతరమందున్న స్త్రీ తిరిగి భర్తను పొందుతుంది. భార్యకు దూరంగా ఉన్నవాడు తన ప్రియురాలిని పొందుతాడు. (91) సంతానహీనుడు పుత్రులను పొందుతాడు. ధనహీనుడు ధనాన్ని పొందుతాడు. భూమిలేనివాడు భూమిని, ప్రజా (సంతాన)హీనుడు ప్రజను పొందుతాడు. (92) రోగి రోగం నుండి ముక్తుడౌతాడు జైలులోని వాడు జైలునుండి ముక్తుడౌతాడు. భయంగలిగిన వాడు భయంనుండి ముక్తుడౌతాడు. ఆపదలో నున్నవాడు ఆపదనుండి ముక్తుడౌతాడు. అంతంతమాత్రం కీర్తిగలవాడు మంచికీర్తిమంతుడౌతాడు. మూరుడు పండితుడౌతాడు.(93) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు రాధాస్తోత్రమనునది తొండది రెండవ అధ్యాయము ముగిసినది.