4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

101 - అధ్యాయము

మూ॥ శ్రీనారాయణ ఉవాచ :

అను II నారాయణుడిట్లన్నాడు –

దేవతలు, మునులు స్తుతించి మనస్సులో విరమించారు. పచ్చని బట్టతో ప్రాంగణంలో శోభిస్తున్న కృష్ణుని చూచారు. (1) ఓ ముని! మెరుపుతీగతో కూడిన కొత్తగా వర్షించే మేఘం వలె ఉన్నాడు. కొంగలపంక్తితో కూడిన దానివలె లేదా మాలతీ మాలతో కూడినట్లే ఉన్నాడు. (2) నొసట గుండ్రంగా కస్తూరితో కూడిన చందనపు బొట్టుంది. వర్షించే మేఘం వెనుక మచ్చగల చంద్రుడు వలె శోభిస్తున్నాడు. (3) రెండు చేతులు, నల్లని వర్ణము, మనోహరంగా రాధాకాంతుడున్నాడు. కొద్దిగా నవ్వుతున్న ప్రసన్నమైన ముఖం కలవాడు, భక్తులను అనుగ్రహించే కొరకు రూపమెత్తినవాడు. (4) రత్నపు భుజాభరణములు కంకణములు రత్నపు కాలి అందెలు వీనితో ప్రకాశిస్తున్నాడు. ఏడుస్తూ తండ్రితోడ పై బలరామునితో కూడి కూర్చున్నపరుడు కృష్ణుడు. (5) మనోరమమైన శుభలగ్నమందు, మంగళకాలమందు, సౌమ్యగ్రహాలు చూస్తుండగా (లగ్నాన్ని), లగ్నాధిపుడు జాగ్రదావస్థలో నుండగా (6) చెడు గ్రహాల దృష్టిపడనప్పుడు, మంచి గ్రహాలు చూస్తుండగా, స్వస్వివాచన పూర్వకముగా శుభకర్మను ఆరంభించారు. (7) సురల విప్రుల ఆజ్ఞతో వసుదేవుడు శుభకర్మ ఆరంభించాడు. బ్రాహ్మణునకు, సాదరముగా నూరు బంగారు నాణములిచ్చి ఆరంభించాడు. (8) దేవేంద్రులను, మునీంద్రులను, పురోహితుని నమస్కరించి గణేశుని, దినేశుని, అగ్నిని, శంకరుడై (మంగళం చేసే)న శివుని (9) పూజించి దేవసభయందు అక్షతలతో షట్ (ఆరుగురు) దేవతలను పూజించి, భక్తిపూర్వకముగా, ప్రయత్నంగా షోడశోపచారములతో పూజించి, (10) సభలో వేదమంత్రములతో పుత్రుని కూర్చోబెట్టాడు. అనేక రకాల దేవతలను, దికాల్పలకులను, నవగ్రహాలను పూజించి పంచోపచారములిచ్చి, భక్తితో షోడశమాతృకల పూజించి, వసుధారను ఇచ్చి (నీరు) ఏడు మార్లు ఘృతధారను ఇచ్చి అగ్నికి (12) చేదిరాజైన వస్తువును నమస్కరించి, పూజించి, తిరిగి వెళ్ళిపోయాడు. వృద్ధి శ్రాద్ధమును నిర్వర్తించి, అట్లాగే ఏదో కొంత దేవకార్యమును చేసి (13) వేదోక్తముగా యజ్ఞము చేసి, ఆనందంతో యజ్ఞసూత్రమును , పెద్దవాడైన బలదేవునకు , పరమాత్మయైన కృష్ణునకు ఇచ్చాడు. (14)

శ్రీకృష్ణ ఉవాచ :

అను ॥ ముని సాందీపిని వారికి, గాయత్రి మంత్రం ఉపదేశించాడు. మొదట పార్వతి మిక్కిలి ఆదరంతో భిక్షనిచ్చింది. (15) అమూల్యమైన రత్నములతో చేసిన పాత్రయందున్న ముత్యములు, మాణిక్యము, వజ్రము వీనిని, ఉత్తమ వజ్రములతో చేసిన హారాన్ని తండ్రి ఇచ్చాడు. (16) తెల్లని పూవుతో, దూర్వతో (గరిక) శుభాశీస్సులనిచ్చాడు. ఆ పిదప అదితి, దితి, మునిపత్నులు, దేవకి (17) యశోద, రోహిణి, ఆనందంతో సావిత్రి, సరస్వతి వీరంతా విడివిడిగా మణులు, బంగారముతో అలంకరింపబడ్డ, బిక్షనిచ్చారు. (18) దేవకన్యలు నాగకన్యలు, రాజకన్యలు, పతివ్రతలు, బాంధవుల స్త్రీలు, నవ్వుతూ, స్నేహపూర్వకపు చూపులతో భిక్ష ఇచ్చారు. (19) ఇంద్రుని భార్య వరుణుని భార్య, వాయువు భార్య, రోహిణి, కుబేరుని భార్య, స్వాహాదేవి, కాముని భార్య రతి (20) వీరంతా ప్రత్యేకంగా రత్న భూషణములతో అలంకరింపబడ్డ భిక్షనిచ్చారు. భిక్షను గ్రహించి బలరామునితో కూడిన కృష్ణుడు, భక్తిపూర్వకముగా (21) అందులో కొంచెం గర్గుని కిచ్చాడు. కొంత తన గురువుకిచ్చాడు. వైదిక కర్మపూర్తిచేశాక గరునకు దక్షిణనిచ్చాడు. (22) దేవతలను, బ్రాహ్మణులను సాదరంగా భుజింపచేశాడు. యజ్ఞమునకు వచ్చిన వారంతా శుభాశీస్సులను (23) కృష్ణునకు బలరామునకు ఇచ్చి ఆనందంతో తమ ఇళ్ళకు వెళ్ళారు. నందుడు తన భార్యతో కలిసి కొడుకునకు శుభకర్మ నిర్వర్తించి (24) బలరామకృష్ణులను రొమ్ముపై ఉంచుకొని వారి ముఖములను ముద్దాడాడు. నందుడు పతివ్రత యశోద గట్టిగా దుఃఖించారు. శ్రీకృష్ణుడు ఆతనిని ఓదార్చి ప్రయత్నంగా బోధించసాగాడు. (25) శ్రీకృష్ణుడిట్లా - ఓతల్లి! యశోద! ఓ తండ్రి! ఆనందంగా త్వరగా వెళ్ళండి. ఓ తల్లి! అన్నం తినిపించి పెంచిన దానివి నువ్వే. నీవే నిజమైన తండ్రివి (26) ఇప్పుడు బలరామునితో కలిసి అవంతి నగరానికి పోతాను, ఓ తండ్రి! మునియైన సాందీపిని దగ్గర వేదపాఠము, దాని అర్థము చదవాలని కోరికుంది. (27) అక్కడి నుండి వచ్చాక చాలా కాలానికి మిమ్ముల దర్శిస్తాను. కాలమే కలుపుతుంది, అదే విడదీస్తుంది కూడా.

అమ్మ! అంతాకాలమే చేస్తుంది, నరులను విడదీయటం కలపటము కూడా. సుఖము దుఃఖము, హరము, శోకము అన్నీ మంగళమునకు నిలయమే. (29) నేను చెప్పిన తత్వము యోగులకు కూడా లభించనిది. ఆనందంగా అంతా నందుడు నీకే బోధిస్తాడు. (30) అని పలికి జగన్నాథుడు వసుదేవుని సభకు వెళ్ళాడు. ఆతని ఆజ్ఞ తీసుకుని క్షణంలో వచ్చి సాందీపిని గృహానికి వెళ్ళాడు. (31) వసుదేవునితో, దేవకితో వినయంగా మాట్లాడి నందుడు తన భార్యతో కూడి, మనసులో బాధపడుతూ వెళ్ళాడు. (32) ముత్యములు, మణులు, బంగారము, మాణిక్యములు, వజ్రములు వహ్నిశుద్ధమైన వస్త్రములు, రత్నములు ఇవన్నీ నందునకు దేవకి ఇచ్చింది. (33) తెల్లని గుఱ్ఱము, గజేంద్రము, ఉత్తమమైన బంగారు రథమును కృష్ణుడు నందునకిచ్చాడు. వసుదేవుడు సాదరంగా పంపాడు. (34) వారిని అనుసరిస్తూ బ్రాహ్మణులు దేవికి మొదలైన స్త్రీలు వెళ్ళారు. వసుదేవుడు, అక్రూరుడు, ఉద్ధవుడు కూడా ఆనందంగా వెళ్ళారు. (35) కాళిందినది సమీపానికి వెళ్ళి వారంతా దుఃఖంతో ఏడ్చారు. ఒకరినొకరు పలకరించుకొని వారంతా తమతమ ఇళ్ళకు వెళ్ళారు. (36) విధవయైన కుంతి, కొడుకులతో పాటు, ఓ ముని! వసుదేవుని అనుజ్ఞతో, రకరకాల రత్నమణులను పొంది ఆనందంగా తన ఇంటికి వెళ్ళింది. (37) వసుదేవుడు, దేవకి, తమ పుత్రునకు శుభం జరగాలనే అభిప్రాయముతో, రకరకాల రత్నములు, మణులు, వస్త్ర ములు, బంగారము, వెండి (38) ముత్యముల,మాణిక్యముల హారములను, అమృతము వంటి తీపి పదార్థములను భట్టులకు, బ్రాహ్మణులకు, ఆదరంగా, ఆనందంగా దానం చేశారు. (39) మహా ఉత్సవము, వేదపాఠము, భగవన్నామమొక్కటే, చాలు, మంగళములు కూర్చటానికి. ప్రయత్నంగా బ్రాహ్మణులను భుజింపచేశాడు. (40) జ్ఞాతులను, బాంధవులను వారి వారికి తగినట్లు బహుమానాలిచ్చాడు. మణులు, మాణిక్యములు, ముత్యములు, మంచి వస్త్రములు వీనితో సన్మానించాడు. (41)

అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీ కృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు భగవంతుని ఉపనయనమనునది నూట ఒకటవ అధ్యాయము.