4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
5 - శ్రీకృష్ణస్తోత్ర రాజపఠనము
శ్రీనారాయణ ఉవాచ :
ఆ దేవతలందరు మొత్తము గోలోకము చూచి హర్షించిన మనస్సులతో మరల రాధాదేవి గృహముయొక్క ప్రధాన ద్వారము వద్దకు వచ్చిరి. ఆ ద్వారము అమూల్య రత్నములతో నిర్మించిన కవాటములతో, ఇరువైపుల రత్న నిర్మితములైన అరుగులతో, తెల్లని వజ్రములతో కలిసియున్న పసుపు వన్నె మణులతో కూడి యుండెను. ఆ ద్వారము వద్ద రత్న సింహాసనము మీద పీతాంబరధారియై రత్నకిరీట కాంతులతో రత్నాభరణములతో విరాజిల్లుచున్న వీరభానుడను ఉత్తమ ద్వార రక్షకుని చూచి సంతసముతో ఆ ద్వారపాలకునకు దేవతలు తాము వచ్చిన వృత్తాంతమునంతను నివేదించిరి.
దేవతల మాటలు విన్న ద్వారపాలకుడు (వీరభానుడు) వెనుక ముందడక వారితో “స్వామి ఆజ్ఞ లేకుండ మీరు లోనికేగరాదు. ఇప్పుడు మీ కనుమతి ఇచ్చుటకును నేను సమర్థుడను కాను" అని పలికి శ్రీకృష్ణ స్థానమునకు కింకరులను పం పెను. ఓ నారదా! స్వామి అంగీకారమును (ఆజ్ఞను) పొందియే లోనికేగుటకు దేవతల కనుమతినిచ్చెను. వారతనిని ప్రశంసించి మొదటి ద్వారము కన్న విచిత్రము సుందరము మనోహరముగాను శ్రేష్ఠము గాను ఉన్న ద్వితీయ ద్వారము వద్ద కెగిరి. ఆ ద్వారము వద్ద స్వామిచే నియోగింపబడి యున్న చంద్రభానుడుండెను. అతడు ఐదులక్షల గోపాలకులతో కూడి రత్నాభరణ భూషితుడై శ్యామలకిశోరమూర్తియై (శ్రీకృష్ణుని వలె నల్లని రూపమున) బంగారు బెత్తము ధరించి సీంహానస్థుడై ఉండెను. దేవతలతనితో తమ వార్త తెలిపి అతని ఆజ్ఞ పొంది అతనిని ప్రశంసించి రెండవ ద్వారము . కన్న కడుసుందరమై మణుల కాంతితో వెలుగుచున్న తృతీయ ద్వారము వద్దకేగి అచ్చట నియమించబడియన్న
ను వానిని దర్శించిరి. ఆతడును శ్యామసుందర బాలుడే. ఒక చేత మురళిని మరియొక చేత రత్న దండమును ధరించి ద్విభుజుడై రెండు చేతులు గలవాడు) చెవులయందలి రత్నకుండలము కాంతి చెంపల పై ప్రసరించుచుండగా రాధా మాధవులకు ప్రియమైన సేవకుడుగా తొమ్మిది లక్షల గోపాలకులతో గూడి రాజఠీవితోనుండెను. దేవతలతనితో సంభాషించి నాల్గవ ద్వారము వద్దకేగిరి. అది మొదటి మూడింటి కన్న విశేషముగా మణుల తేజస్సుతో వెలుగుచు అత్యద్భుత చిత్ర వీచైతములతో అలంకృతమై సుందరమును సుమనోహరముగానుండెను. అక్కడ నియోగింపబడియున్న వసుభానుడనెడి ప్రజానాయకునీ దేవతలు దర్శించిరి. అతడు సుందరబాలరూపుడు. రత్నభూషణాలంకృతుడై మణీదండము ధరించి సింహాసనమున కూర్చుండి పండిన దొండపండువంటి క్రింది పెదవిపై.. చిరునవ్వులు చిందించుచు మిక్కిలి మనోహరముగా వెల్లుచుండెను. దేవతలతనితో సంభాషించి ముందుకేగి పంచమద్వారమును దర్శించిరి. ఆ ద్వారము వజ్రములతో నిర్మించిన గోడల పై చిత్రించిన ఆశ్చర్యకర చిత్రములతో ధగధగలాడుచుండెను. అక్కడ దేవభానుడను ద్వారపాలుడు సుందర మైన సింహాసనము మీద కూర్చుండి రత్న భూషణములతో రత్నాలహారములతో అలంకృతుడై నెమలి పింఛము నడినెత్తి మీద కొప్పున ధరించీ కడిమిపూలదండలు రత్నకుండలములతో వెలుగుచు చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుల ద్రవమును పులుముకొని దశలక్ష ప్రజలతో కూడి చేత బెత్తము బట్టుకొని రాజశ్రేష్ఠుని వలె నుండెను. దేవతలతని దర్శించి ఆ వైభవమునకానందించి అతనితో సంభాషించి ముందుకేగిరి. అచ్చట రెండువైపుల వజ్రాల అరుగులు గలిగి పుష్పమాలాలంకృతమై చిత్తరువులతో శోభిల్లు ఆరవ ద్వారము వద్ద నున్న శుక్రభానుడను ప్రజేశ్వరుని దర్శించిరి, అతడును పదిలక్షల ప్రజలతో గూడి నానావిధములైన అలంకారముల శోభతో ఆడ్యుడై కుండలముల తేజస్సు ప్రసరించు చెక్కిళ్లపై చేవిసందులలో చిక్కుకొన్న శ్రీగంధపు చివురులు వంగియుండగా వెలసియుండెను. దేవతలు ఆ ద్వారపాలకునితో సంభాషించి త్వరగా సప్తమ ద్వారము చేరబోయిరి. ఆ ద్వారము నానావిధ చిత్రములు గలిగి గడచి వచ్చిన ఆరు ద్వారముల కన్న విలక్షణముగా నుండెను. ఆ ద్వారమున నీయోగింపబడియున్న రత్నభానుడు శ్రీహరికి మిక్కిలి ప్రియమైనవాడు. అతడు నిలువెల్ల చందనము పులుముకొని పూమాలలు ధరించి మనోహరములైన మణులు రత్నములతో నిర్మితములైన భూషణములలంకరించుకొని రత్న సింహాసనస్థుడై చిరునవ్వు గల ముఖకమలముతో, రాజేంద్రుని వలె పన్నెండు లక్షల గోపాలురతో గూడి వెలుగుచుండెను.
ఆ వేత్రహస్తుని (చేతియందు కళి గల ద్వార పాలకుడు} పల్కరించి దేవతలు సంతోషముతో ఏడింటికన్న ప్రత్యేక లక్షణములు గల విచిత్రమైన అష్టమద్వారము చేరబోయిరి. అక్కడ కిశోరదశలో నున్న పన్నెండు వేలమంది గోపాలకులతో గూడియున్న సుపార్శ్వుడను సుందర ద్వారపాలకుని దర్శించిరి. బంధుజీవ పుష్పము వలె ఎర్రనైన క్రింది పెదవిపై చిరునవ్వుతో శ్రీగంధపు తిలకముతో రత్న కుండలములతో సర్వాలంకార శోభ గల ఆదౌవారికుడు {ద్వారపాలకుడు) రత్న దండము ధరించి యుండెను. అచ్చటి నుండి త్వరగా తమ వాంఛననుసరించి దేవతలు నవమద్వారము వద్దకేగిరి. ఆ ద్వారము వజ్రములు రత్నములతో నిర్మితమై నాల్గు వేదములు అపూర్వములైన చిత్రముల వరుసలతో వెలుగుచుండెను. అచ్చట సుందరాకారుడైన సుబలుడను ద్వారపాలుడు వారికి కన్పించెను. నానా భూషణములలంకరించుకొని పన్నెండు లక్షల గోపాలకుతో గూడి చేత దండము ధరించి మనోహరముగానున్న అతనినీ సురలు సంభాషించి వేరొక ద్వారము వద్దకేగిరి.
ఆ దశమ ద్వారము ఎవరును ఇది ఇట్టిదని వివరింపరానిదిగా, ఇంతకు పూర్వమెవరును కనీవినీ ఎరుగనిదిగా ఉండుట చూచీ దేవతలు ఆశ్చర్యపడిరి. వారి కక్కడ సుదాముడన్న సుందర ద్వారపాలకుడు కన్పించేను. అతడు శ్రీకృష్ణునితో సాటియైన అనిర్వచనీయ సుందరరూపము గలిగీ ఇరువది లక్షల మంది గోపాలకులతో కూడియుండెను. దండహస్తుడైన (దండము ధరించి - ఆజ్ఞాపించు అధికారి చిహ్నము) అతని దర్శించి దేవతలు ఏకాదశ ద్వారము వద్దకేగిరి. అది మిక్కిలి అద్భుతమైనది. అక్కడ శ్రీరాముడన్న గోపనాయకుడు ద్వారపాలకుడుగానుండెను. అతడు రాధాదేవికి పుత్రునియంత ప్రియమైనవాడు. అమూల్య రత్న సింహాసనము మీద పీతాంబరధారియై వెలగట్టరానీ రత్నభూషములు ధరించి చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుల సుగంధ లేపనములతో చెక్కిళ్లను పెంచుచున్న రత్న కుండలముల కాంతితో మేలిజాతి రత్నములచేత నిర్మింపబడిన కిరీట కాంతితో నిలువెల్ల ధరించిన వికసిత మాలతీ పుష్పమాలలతో కోటిసంఖ్య గల గోపాలకులు చుట్టుముట్టి యుండగా ఒక రాజశ్రేష్ఠుని కన్న మిక్కిలి వైభవముతో అతడుండెను.
ఓ నారదమునీ! ఆ శ్రీదామునితో సంభాషించి దేవతలు సంతోషముతో పన్నెండవ ద్వారము చేరబోయిరి. ఆ ద్వారము అమూల్య రత్నములతో నిర్మించిన వేదికలతో, కనీ వినీ ఎరుగని దుర్లభ చిత్రములతో, వజ్రములతో నిర్మించిన గోడలతో, అందముగా ఆకర్షకముగానుండెను. ఆ ద్వారప్రదేశమున నియమింపబడిన గోపాంగనలను సురలు దర్శించిరి. ఆ గోపికలందరు నవయావనవతులు రత్నాభరణభూషితలు పీతాంబరములు ధరించినవారు పెద్ద వెండ్రుకల గోప్పులు గలవారు. సువాసన గల మాలతీ పుష్పమాలలను సర్వాంగములందు ధరించినవారు రత్న కంకణములు దండకడియములు రత్నాల మొలనూలులు ధరించిన వారు రత్నకుండలములు చెక్కిళ్లయందు ప్రకాశించువారు. చందనము మొదలగు సుగంధ ద్రవ్యముల ద్రవమును పులుముకొన్నవారు. బలిసినకటి భాగముతో పీరుదుల బరువుతో వంగిపోయినట్లున్నవారు. శతకోటి గోపికలలో మేల్జాతీవారు శ్రీహరికి మిక్కిలి ప్రియమైనవారు. ఆ గోపికలను అనేకులను గుంపులుగా చూచి దేవతలాశ్చర్యపడిరి. ఓ మునీ! సంతోషముతో వారిని పలకరించి సురలు వేరొక ద్వారమునకేగిరీ. అటనుండి క్రమముగా మూడు ద్వారములందు (ఒకే తీరు దృశ్యములను చూచిరి).
గోపాంగనలలో శ్రేష్ఠమైనవారు ఉత్తములలో ఉత్తమురాండ్రు రూపమును బట్టి సుందరులు, స్థానమును బట్టి గౌరవింపదగీసేవారు, మంగళకరమైన అవయవములు (సాముద్రిక శాస్త్రమును బట్టి) గలవారు అక్కడ ఉండిరి. అందరు రాధాదేవికి ప్రియమైనవారే, వారందరు సౌభాగ్యవతులు. వికసించుచున్న నవ యౌవనము గలవారు సుందరాలంకారములను అలంకరించుకొన్నవారు. దేవతలు మూడు ద్వారములందున్న ఆ గోపాంగనలను చూచి ఏస్మితులై వారితో మాటలాడి ఆదరించి ముందుకేగిరి. మూడు ద్వారములందలి దృశ్యము కలలో గాని మేల్కొన్నప్పుడుగాని విన్నదిగాదు కన్నులతో చూచినది కాదు. అది అద్భుతముగా అతి సుందరముగా విజ్ఞులును నీరూపించరానిదిగా ఉండెను. తరువాత దేవతలు రాధికాదేవి అభ్యంతర గృహ (లోపలి అంతఃపురము) ము యొక్క ప్రధాన ద్వారమును పదునారవ దానిని చేరిరి.
గోపికా గణములన్నింటికి అది ప్రధాన స్థానము. ముప్పది మూడు వర్గములుగా నున్న గోపాంగనో గణముల చేత చుట్టుముట్టి రక్షింపబడునదీ ఆ ద్వారము. అచ్చటి రాధాదేవి సఖులు నాగోగుణములు గలవారై నిర్వచింపరానివారుగా నుండిరి. వారందరు రూపము యావనము అను సంపద గలవారు. రత్నాలంకార భూషితలు, రత్నకంకణములు, రత్నాలదండకడియములు, రత్ననూపురములు (కాళ్ల అందెలు) ధరించి, నడుములకు మువ్వలు గల రత్నాల మొలనూలు అలంకరించుకొని, రత్నకుండలముల (చెవికమ్మలు) జంట చెక్కిళ్ల మీద మెరయుచుండగా, వక్షస్థలముల మీద వికసించిన మాలతీ మాలలు ప్రకాశించగా, శరదృతువులోని పద్మముల కాంతిని దొంగిలించునంతటి చంద్రుని వంటి ముఖములతో ఒప్పుచు, పారిజాత పుష్పమాలలు చుట్టుకొని, పండిన దొండ పండు వంటి క్రింది పెదవుల మీద చిరునవ్వు చిందించుచు, పండిన దానిమ్మ పండులోని గింజల వలె (ఎఱ్ఱగా - సందులేకుండ) నున్న పలువరుసతో, సంపెంగ పూవు వంటి సుందరమైన పచ్చని శరీరకాంతితో, బక్క చిక్కినట్లున్న మధ్యభాగములతో, నడుములు) గరుత్మంతుని సుందరమైన చంచువు (పక్షిముక్కు) యొక్క శోభను దొంగిలించునట్టి ముక్కులయందు ఏనుగుముత్తెముల ఆభరణములతో, ఏనుగుయొక్క కఠిన కుంభ స్థలము వంటి స్తనముల భారముతో వంగిన శరీరములతో, బలిసిన శ్రోణి భారముతో ఆయాసపడుచున్నట్లున్న వారును శ్రీ ముకుందుని పదములందే లగ్నమై యున్న మనస్సులు గలవారు నగు ఆ గోపాంగనలను, ఆ ద్వారమును దేవతలు కనురెప్పపాటు లేకుండ దర్శించిరి.
రెండువైపుల వేదికల మీద (అరుగులు) రత్నసాలభంజికలు (రత్నాల స్త్రీలబోమ్మలు) శోభింపగా, ఇంద్రనీల మణుల స్తంభములు వాటి నడుమ ఎర్రని సింధూరపు వన్నెమణులు ప్రకాశించుచుండగా పారిజాత వృక్షముల ప్రసూన మాలికల {పూలదండలు) చేత అలంకరింపబడి ఆ పూమాలల మీది నుండి వీచుచున్న గాలుల వలన ఆ ప్రదేశమంతయు సువాసనలు వ్యాపించియుండగా పరమాశ్చర్యము కళించుచున్న ఆ రాధాదేవి అభ్యంతర గృహమును (లోపలి ప్రధానగృహము) దేవతలు దర్శించి అక్కడి గోపాంగనలతో సంభాషించి శ్రీకృష్ణ పాద పద్మములను దర్శించుటయే ముఖ్యమైన కోరికగా గలవారై పులకరించిన శరీరములతో, ఉప్పొంగిన భక్తి వలన ఏర్పడిన నిండు కన్నీటితో, వినయముతో కొంచెము వంగిన మెడలు గలవారై శ్రేష్టమైన రాధాదేవి గృహమును ముందుగా సమీపము నుండి చూచిరి.
ఆ రాధాదేవీ మందిరము అనేక మందిరముల నడుమ మనోహరముగా చతుశ్శాలలుగలదిగా అమూల్యములైన శ్రేష్ఠ రత్నములతో నిర్మించబడినది. వజ్రములతో గూడిన నానావిధ రత్న స్తంభములతో పారిజాత పుష్పముల మాలలతో ముత్యములతో, మణులతో, శ్వేత చామరములతో, నిలువుటద్దములతో, అమూల్య, శ్రేష్ఠ రత్న కలశముతో అలంకరింపబడియుండెను. సుందరమైన ప్రాంగణము (వాకిలి) మణుల స్తంభములతో పట్టుదారములకు గ్రుచ్చి అలంకరించిన శ్రీఖండ (శ్రీగంధపు)పు చివుళ్ల తోరణములతో అలంకృతమై, చందనము అగురు కస్తూరి కుంకుమ ద్రవములలేపనము (అలుకుట-పూయుట గలదై తెల్లని ధాన్యము (జవ్వలు, తెల్లనిపూలు, చివురులు, పండ్లు, బియ్యము, తమలపాకులు, గరికపోచలు, అక్షింతలు, వరి పేలాలు కడపయందు అలంకరింపబడి, సిందూరము, కుంకుమ పువ్వు ద్రవము ధములు పాటిమీద ఫలములలో పారిజాత ప్రసూనముల మాలలతో వెలయుచు పూలను తాకీ వీచుచున్న గాలులతో అంతట పరిమళము వెదజల్లబడుచుండెను. ఎవరికీని నిర్వచింపధాని - నిరూపించరాని వస్తువులతో ఆ గృహము విరాజిల్లుచుండెను. పారిజాత పుష్పమాలలతో శోభిలుచున్న రత్న శయ్యల మీద సుందర సూక్ష్మ వస్త్రములు పరచబడియుండెను. అనేకములైన రత్న కుంభములు రత్నపాత్రలు అమూల్యములు సుందరములునై యుండెను.
నానావిధములైన వాద్యములయొక్క మధుర నాదములతో ధ్వనించు (స్వరయంత్రములు వీణలు) గోపికల యొక్క శ్రావ్య సంగీతము మృదంగము మొదలగు వాద్య శబ్దములలో మోహింపజేయుచుండెను. కృష్ణునితో సాటివచ్చు గోపాలురు గుంపులు గుంపులుగా చుట్టు చేరి యుండిరి. రాధాకృష్ణుల గుణములను ప్రశంసించు ఉత్సాహవంతమైన పదముల (పాటలు) సంగీతము శ్రావ్యముగా వినవచ్చుచుండెను. అటువంటి రాధాదేవి అభ్యంతర గృహమును చూచి దేవతలు విస్మితులైరి. మధురగీతమును విని ఉత్తమ నృత్యమును దర్శించి మొత్తము దేవతలు భగవద్ధ్యానమునందు స్థిరపడిన మనస్సులు గలవారై అక్కడ నిలిచిరి.
అంతట గుండ్రని ఆకారము కలదై నూరు ధనువుల ఎత్తుతో నున్న సుందర రత్నసింహాసనమును దర్శించిరి. ఆ సీంహాసనము చిన్న చిన్న రత్నకలశములతో ఆశ్చర్యకరమైన స్త్రీల విగ్రహములతో చిత్తరువులుగా తీర్చిన పుష్పోద్యొసములతో అలంకరింపబడియుండెను. ఓ నారదా! ఆ సింహాసనము మీద కోటి సూర్యుల ప్రభకు సాటివచ్చునట్టి, ఏడు తాడిచెట్ల ఎత్తుగా పైకి వ్యాపించినట్టి, మహాద్భుతముగా వెలిగిపోవుచున్నట్టి, ఇతరజ్యోతిస్సుల తేజస్సునపహరించునట్టి, చూచువారి మహాశ్రమలను పోగొట్టునట్టి, అంతటా వ్యాపించునట్టి, సమస్త ప్రపంచమునకు బీజమైనట్టి, మహాతేజోరాశిని దేవతలు దర్శించిరి. అది వారి కంటి చూపును నిరోధించెను. ఆ తేజస్స్వరూపమును చూచి ధ్యానతత్పరులై, భక్తితో మెడలు వంచి పరమభక్తితో నమస్కరించిరి. ఆ దర్శనము వలన పరమానందము పొంది బాష్పములు నిండిన కన్నులు గలవారై, సర్వాంగములు పులకరించి కోరిక లీడేరిన మనస్సులు గలవారైరి. దేవతలిట్లు ధ్యానయుక్తులై తేజస్స్వరూపుడైన పరమాత్మకు నమస్కరించి అక్కడినుండి లేచి ఆ తేజస్సును దాటి ముందుకేగిరి.
ఇట్లు ధ్యానించి జగత్ సృష్టికర్తయగు బ్రహ్మ చేతులు జోడించి తన కుడివైపు శంకరుడు ఎడమవైపు ధర్మరాజు (ధర్మదేవత) నిలచియుండగా ధ్యానమునకు నిలయమైన మనస్సుగలవాడై పొంగివచ్చెడి భక్తితో త్రిగుణముల కతీతుడును చరాచర ప్రపంచకోటికి ప్రభువును, యోగిజనులకును శ్రేష్ఠుడును అగు పరమాత్మను ఇట్లు స్తుతించెను (91-92).
బ్రహ్మోవాచ :
బ్రహ్మ ఇట్లు పలికెను :
శ్రేష్ఠము శ్రేష్ఠతమము వరములనిచ్చునది వరములనిచ్చు శక్తి గలవారికిని మూలకారణము సర్వజీవకోటికి మూలకారణము అగు తేజోరూపమునకు నమస్కరించుచున్నాను. మంగళమై మంగళకారణులకు మంగళకరమై మంగళములనిచ్చునదై సమస్త మంగళములకు ఆధారమైయున్న తేజోరూపమునకు నమస్కరించుచున్నాను.
అంతట నిలిచియుండియు ఏది దోషమంటనిదియో, అది నిలిచిన అన్నింటికీ ఆత్మరూపమైనదియో, పరులకంటే శ్రేష్ఠమైనదో, కోరికలు లేనిదియో, ఇది గట్టిదని హేతువులచే ఊహింపరానిదియో, అట్టి తేజోరూపమునకు నమస్కరించుచున్నాను. గుణములు (జ్ఞానానందాదులు) గలదై కూడ ఏది గుణములు (శోక మోహాదులు) లేనిదియో, సనాతనమైన జ్యోతిరూపముగా అంతట వ్యాపించినది ఏదియో, ఆకారములు ధరించి కూడ ఆకారధర్మములైన వికారములు లేనిది ఏదియో ఆ తేజోరూపమునకు నమస్కరించుచున్నాను. ఇది ఇట్లని నిర్వచింపసాధ్యముకానిదియు వ్యక్తమై కూడ అంతమాత్రమేకానందున అవ్యక్తమనబడునదియు సమస్తమున కొకటీ ఐనదియు తన సంకల్పమాత్రమున సర్వరూపములు ధరించునదియు ఐన తేజోరూపమునకు నమస్కరించుచున్నాను. సత్త్వరజస్తమోగుణములు వాటి కార్యముల యొక్క విభోగము కొరకు హరివిధి రుద్రులను మూడు రూపములు ధరించిన వాడును, త్రిగుణముల కతీతుడును అగు నిన్ను వేదమున కందనీ వానిని అందరు ఏమి తెలుసుకొందురు? వారందరు నీ మహిమలోని కలామాత్రముతో నిర్మించబడిరి. సర్వమునకు నిలచుట కాధారమును సర్వమునకు (ఆకాశము వలె) బయటిరూపమును సర్వమునకు బీజమును తనకు బీజము వేరొకటి లేనివాడును, సర్వమునకు అంతము కల్గించువాడును తాను అసంతుడును అగు తేజోరూపమునకు నమస్కరించుచున్నాను. వీర్యము తేజస్సు, తపస్సు, శక్తి, బలము, ఐశ్యర్యమనెడి షడ్గుణ సంపత్తితో పొందిన రూపములు గలవాడై చూడదగినవాడును, విద్వాంసుల చేత వర్ణింపబడువాడును, ఆ వర్ణనలచేతనే దృశ్యమానమగువాడును అగు నీన్ను ఏమని వర్ణింతును. ఈ తేజోరూపుడవగు నీకు నేను నమస్కరించుచున్నాను. శరీరము (నశించు రూపము) లేనిదై కూడ విగ్రహము (దివ్యాకారము) గలదియు, ఇంద్రియములకు గోచరించనిదై కూడ ఇంద్రియములు గలదియు, సర్వజీవుల కర్మలకు సాక్షియై కూడ తనకు సాక్షిలేనిదియు, అగు తేజోరూప తత్త్వమునకు నమస్కరించుచున్నాను. పాదములు లేకున్నను నడచునదియు, కన్నులు లేకున్నను సర్వమును దర్శించునదియు, చేతులు నోరు లేనిదీయు సర్వభోక్త, విశ్వమంతటినీ భుజించునది) ఏదియో ఆ తేజోరూపమునకు నమస్కరించుచున్నౌను. వేదమున నిరూపించబడిన పరబ్రహ్మతత్త్యమును సాధువులు వర్ణింపజాలుదురు. ఐనను వేదమున పూర్తిగా నిరూపింపబడనిది ఏ వస్తువో (తత్వము) ఆ తేజోరూపమునకు నమస్కరించుచున్నాను. సర్వమునకు ప్రభువై తనకు ప్రభువు లేనిదేదియో, సర్వమునకు తాను ఆదిమూలమై తనకు ఆది లేని దేదియో, సర్వమునకు అంతరాత్మయై తనకు ఆత్మ వేరొకటి లేనిదేదియో, ఆ తేజోరూపమునకు నమస్కరించుచున్నాను.
సకల జగత్తు యొక్క సృష్టిని చేయు నేను గాని, స్వయముగా వేదజనకుడు ధర్మరూపుడు రక్షకుడు అగు విష్ణువు గాని, సంహారకుడైన శంకరుడు గాని (నీ) వస్తు స్వరూపమును స్తోత్రము చేయుటకు ఎవరును శక్తులు కారు. నీ సేవచేత ఈ ధర్మదేవత పాలన (రక్షణ) ధర్మమందు నియోగింపబడినవాడు, నీవు తగిన కాలమని నిరూపించినపుడు నీయాజ్ఞచేత సంహారము చేయు హరుడు, నిన్ను స్తుతింపజాలరు). నీపాద పద్మముల సేఫొశక్తిచేత మొత్తము దేహధారుల ఉత్పత్తికర్తనగు {సృష్టికర్త) నేను నిమిత్తమాత్రుడను. జీవులకు వారు వారు చేసిన కర్మలను బట్టి ఫలమిచ్చుపొడవును, భక్తులమగు మాకు ప్రభువును నీవే. నీ మాయ యొక్క ప్రతిబింబము వంటీ ఈ బ్రహ్మాండమున మేము ఇట్టి లక్షణము కలవారమైతిమి. ఇటువంటి అంతులేని (సంఖ్యలో) బ్రహ్మాండముల యందు మావంటి సేవకులు ఎన్ని విధములుగా సున్నారు? భూమి మీది ఇసుక రేణువులకు లెక్కలేనట్లే నీ శక్తి ముందు మిక్కిలి చిన్నవైన ఆ బ్రహ్మాండములకును లెక్కలేదు. అట్టి అన్నీ బ్రహ్మాండములకు అందలి అందరు జీవులకు జనకుడు ప్రభువు ఎవరో అట్టి నిన్ను స్తుతించుటకు ఎవరు సమర్థులు. ఎవని యొక్క శరీరమందలి ఒక్కొక్క రోమకూపమునందు (వెండ్రుకపుట్టిన రంధ్రము} ఒక్కొక్క బ్రహ్మాండము వెలసి యుండునో అట్టి మహావిష్ణువు నీలో పదహారవ భాగము (నీ శక్తిలో పదునారవ అంశ), యోగిజనులందరు కోరదగిన నీ యీ రూపమును ధ్యానింతురు. నీ భక్తుల యొక్క దోస్యమునందు అపేక్ష కలవారై నీ పాద పద్మమును సేవింతురు.
ఓ పరమేశ్వరా! ఏ నీరూపము మిక్కిలి సుందర కిశోరాకారము గలదై చూడగోరదగినదై మంత్రపునశ్చరణ సందర్భమున ధ్యానించదగినదై యుండునో అట్టి దివ్యరూపమును మాకు చూపించుము. వర్షఋతువులో వచ్చిన క్రొత్త మేఘము వలె సల్లనీదియు, పీతాంబరము {పసుపువన్నె వస్త్రము) ధరించినదియు, రెండు హస్తములు కల్గి ఒక చేత పిల్లన గ్రోవి పట్టుకొన్నదియు, చిరునవ్వుతో మిక్కిలి మనోహరముగానున్నదియు, కొప్పున నెమిలిపింఛమును మాలతీ పుష్పమాలను అలంకరించుకొన్నదియు, వెలగట్టరాని శ్రేష్ఠరత్న ములతో గూడిన ఆభరణములు ధరించినదియు, అమూల్య రత్నములచే నిర్మించబడిన కీరీటము శిరమున వెలుగుచున్నదియు, శరదృతువులో వికసించిన పద్మముల కాంతినీ దొంగిలించినట్లున్న ముఖచంద్రుడు కలదియు, పండిన దొండపండు వంటి క్రింది పెదవితో పండిన దానిమ్మలోని బీజముల కాంతీ గల పలువరుసతో మనోహరముగా నున్నదియు, విలాసముగా కడిమీ చెట్టు మూలమందు నిలిచి రాసకేళీ రసమునకు నిరీక్షించుచున్నదియు, . గోపికల ముఖకాంతితో వికసించిన శరీరము గలదియు, రాధాదేవి వక్షస్థలమున నీలచి ఉన్నదియు ఇట్లు వాంఛింపబడు నీ రూపమును చూచుటకు ఎవడు ఉత్సుకుడు (తీవ్రమైన ఆసక్తి గలవాడు) కాకుండును? ఇట్లు పలికి బ్రహ్మ మరల మరల నమస్కరించెను. ధర్ముడును (ధర్మదేవత) ఇట్లే స్తోత్రము చేసెను. శంకరుడు అశ్రువులు నిండిన కన్నీరు గలవాడై మరల మరల నమస్కరించెను. ఇట్లు నిలచి దేవతలు మరల స్తుతించిరి.
ఓ నారదా! ఆ ఆశ్రమమున నున్న అందరు శ్రీకృష్ణుని తేజస్సుతో ఆవరింపబడిరి. బ్రహ్మరుద్ర ధర్మదేవతలొనర్చిన ఈ స్తోత్రరాజమును శ్రీహరిని పూజించు సమయమున భక్తియుకుడై ఎవడు పఠించునో అతడు శ్రీహరియందు దృఢమైన దుర్లభమైన నిశ్చలమైన భక్తిని పొందగలుగును. దేవదానవులకు మునీశ్వరులకు లభించనట్టి శ్రీహరి దాస్యమును పొందగల్గును. అణిమాద్యష్టశ్వర్యము లతనికి సిద్ధించును. సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యములనెడి ముక్తి దశలు నాల్గింటిని పొందును. ఇహలోకములో విష్ణుతుల్యుడై ప్రసిద్ధిపొంది లోకుల చేత నిశ్చయముగా పూజలందును. సర్వసౌభాగ్యములు గలవాడై ప్రపంచమును తన కీర్తితో నింపును, సత్పుత్రుడు, విద్య, కవిత్వము, వాక్సిద్ధి, మంత్రసిద్ధి, నిశ్చలమైన సంపద, సుశీలయు సాధ్వియు, పతివ్రతయునైన భార్య, దీరాయువు గల సంతానము, చిరకాలము నిలిచియుండు సత్కీర్తి మానవునకు (ఈ స్తోత్రపఠనము వలన) లభించును. అంత్యమున శ్రీకృష్ణుని సమీపము కేగును (ముక్తి).
ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండమున గోలోకవర్ణనమందు శ్రీకృష్ణ స్తోత్రరాజము యొక్క పఠనము అనెడి ఐదవ అధ్యాయము సమాప్తము.
