4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
37 - హరనిర్మాల్య శాప ప్రసంగము
శ్రీరాధికోవాచ - రాధాదేవి పలికెను :
ఇటువంటి మహాత్ముడు విభుడు నైన ఈశ్వరుని యొక్క ఉచ్ఛిష్టము (తినగా మిగిలిన పదార్థము - ఎంగిలి - నైవేద్యము) ఎట్లు ప్రశంసింపబడలేదు? (ఇతరులు స్వీకరించుటకు చెప్పబడలేదు) ఓ సందేహములను తీర్పు స్వామీ! చెప్పుము.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :
ఓ దేవీ! పాపములనెడి కర్రలను కాల్చుటలో మండుచున్న అగ్విజ్వాలవంటిదైన ఒక పురాతన ఇతిహాసమును చెప్పుదును వినుము. ఒకసారి సనత్కుమారుడు వైకుంఠమునకు పోయి భక్తులతో కూడియున్న శ్రీమన్నారాయణుని దర్శించేను. భక్తి సంతోషములతో నమస్కరించి రహస్యములైన తత్త్వములు గల స్తోత్రములతో స్తుతించెను. అందుకు సంతోషించిన భక్తవత్సలుడు (శ్రీమన్నారాయణుడు) ఆ సనత్కుమారునికి తాను భుజించిన పదార్థము యొక్క శేషభాగమును ఇచ్చెను.
అది తనకు లభించగనే సనత్కుమారుడక్కడనే కొద్దిగా భుజించి దుర్లభమైన ఆ భగవంతుని భుక్త శేషమును తన ఆత్మ బంధువులకొరకని కొద్దిగా మిగిలించుకొనెను. సిద్ధాశ్రమమునకు పోయి తనకు గురువైన శంకరునికి దానినిచ్చాను. అది లభించగనే భక్తి ఉప్పొంగగా భుజించిన పరమేశ్వరుడు మిక్కిలి దుర్లభమైన ఆ వస్తువు లభించినందుకు ప్రేమ పరవశుడై నృత్యము చేసెను. సర్వాంగముల యందు పులకలేర్పడగా సంతోషము వలన కన్నులతో నీరు నిండగా ఆ ఐదు ముఖముల శివుడు మంచీకంఠ స్వరముతో రాగ తాళములతో మనోహరముగా ఆలోపన చేయుచు అనేక రాగములలో నొ గుణములను గానము చేసెను. ఆనంద పారవశ్యములో చేతిలోని డమరువు ఊదేడి కొమ్ము ధరించిన పులితోలు క్రిందపడి పోయినవి. తరువాత స్వయముగా నేలమీద పడి రోదించుచు మూర్ఛిల్లెను, తన హృదయ పద్మములో సహస్ర దళముల మధ్యనున్న - మిక్కిలి కోరదగిన నా రూపమును ధ్యానించి నన్ను దర్శించి స్థిర చీతుడై ఉండెను.
ఇంతలో సరక బాధలను నశింపజేయునట్టి దుర్గాదేవి ప్రసన్నమైన ముఖము చూపులు గలదై సంతోషముతో అక్కడికి వచ్చెను, భక్తితో నేలమీద బడి యేడ్చుచు మూర్ఛిల్లి యున్న శివుని జూచీ నవ్వి ఆ శూలపాణి వార్తను గురించి సనత్కుమారుని అడిగెను. అతడు ఆమెకంజలి పట్టి సర్వ వృత్తాంతము చెప్పెను. అది విని పెదవులు వణకుచుండగా ఆ దేవి శివుని యందు కోపము పూనెను. త్రినేత్రుడు లేచి తనను శపించుటకు పూనుకున్న దేవికి అనేక విధములుగా విషయము బోధించెను. అంజలి పట్టి ఆమెను స్తుతించెను. మనోహరముగా నున్న ఆ స్తోత్రము విని పార్వతీ శివుని శపించలేదు కానీ శంకరుని ఉచ్ఛిష్టము (ఎంగిలియైన పదార్థము. తినగా మిగిలిన పదార్థము, నైవేద్యము) బుధులెవ్వరును తినగూడని దుష్ట పదార్థముగా శపించెను.
తపసౌభాగ్యము వలన తేజస్సు గలవారైన జీవుల యొక్క మహిమనే కాదు ఈ బ్రహ్మాండమందు సర్వము సంహరింపగల (లయము చేయగల) శివుడు పార్వతీ భయముతో వణికి పోయెను. అప్పుడా జగన్మాత సదుణ నిలయ, కోపముతో కన్నులు ఎర్రదామరలవలె కాగా ఇట్లు పలికెను. ఇతర ప్రాణుల యొక్క తేజస్సు కంటే మాత్రమే కాదు. బ్రహ్మాండములను లయము చేయు వాని తేజస్సు కంటెను ఆమె తపః ప్రభావమాశ్చర్యకరము. శైలకన్యక శివుని చలింపచేసెను.
పార్వత్యువాచ - పార్వతీ పలికెను :
సర్వ జగముల యొక్క పోషకుడవు విశేషించి నా రక్షకుడవు నీవే. చతుర్వేదములను ఉత్పత్తి చేసినవాడవు. బ్రహ్మకు చెప్పినవాడవు. స్వయముగా ప్రభువువు నీవు. భక్తులకు ముక్తిప్రదాతవు. సర్వ సంపదలిచ్చుపోడవు. అట్టి నీవే స్వయముగా నీతి విరుద్ధమైన కర్మ చేసినప్పుడు ఇక ఎవడు ధర్మమును రక్షించును? ఎల్లప్పుడు నీకు పరిపాలింపదగిన - పోషింపదగిన దానను. భక్తితో సేవించు దాసురాలిని. నా కర్మదోషము వలన హరి భుక్త శేషమును భక్షింపకుండ నీ చేత మోసగింపబడితిని.
ఒక్కొక్క పదార్థము బంగారము వలన, ఒక్కొక్క వస్తువు వాయువు సోకుట వలన, ఒక పదార్థము నీటితో కలుగుట వలన అన్ని వస్తువులును విష్ణువుకు సమర్పించుట వలన పరిశుద్ధమగుచున్నవి, విష్ణువుకు నైవేద్యము పెట్టిన అన్నముతోనే సర్వదేవతలకు పితృదేవతలకు అతిధులకు ఆహుతులిచ్చే శ్రాద్ధము చేసి సంతర్పణ చేసి అర్చించవలెనని సర్వవేదములందు నిశ్చయించబడినది. శ్రీహరి గర్భములో ఉంచని (నివేదన చేయని) పదార్ధము భుజింపగూడదని దానిని వదిలివేసి ఎవడు భక్తితో భగవంతునికి నివేదించియే భుజించునో వాడు పరములో విష్ణు పారదులలో శ్రేష్ఠుడగును. సర్వ వస్తువులలో మిక్కిలి ఇష్టమైన రుచి గల దుర్లభమైన అమృతము, విష్ణువుకు నివేదించిన అన్నము యొక్క మహిమకు పదహారవ భాగముగా గూడ సరితూగదు. మూడులనానందపరచునట్టి అమృతము అకాల మృత్యువును నశింపజేయును. ఇక హరికి నివేదించిన పదార్థమైతే భుజించిన వ్యక్తిని విష్ణువుతో సమానునిగా (ముక్తునిగా) చేయును.
ఎవడు సాధుజనులతో కూడియున్నందు వలన ప్రయత్నము లేకుండ (దైవికముగా) లభించిన హరి నైవేద్యమును భుజించ గల్గునో వాడరవది వేల సంవత్సరములు తపస్సు చేసిన ఫలము పొందును. ఎవడు శ్రీహరికి నిత్యము భక్తితో పదార్థము నివేదించి భుజించునో ఆభక్తుడు తేజస్సులో హరితో సముడగును. ఆ స్థితి ఏ తపస్సు చేసిన వాడు పొందగల్గును? పూర్వము పుష్కర క్షేత్రములో మునుల సభలో నీవు చెప్పగా ఈ విషయము వినియుంటిని. నేను వేదకర్తను గాను. నీకు చెప్పుటకు నేనేమి సమర్ధురాలను? సుదీర్ఘ కాలము తపస్సు తపించి ఈశ్వరుడవైన నిన్ను భర్తగా పొందితిని. ఈనాడు నీవు విష్ణు నివేదిత ప్రసాదమునీయక నన్నెట్లు మోసగించితివి స్వామీ!
ఓ మహేశ్వరా! ఈనాడు నాకు నీవు విషు నైవేద్యమీయనందువలన నా నుండీ ఈ ఫలము స్వీకరించుము. ఈనాటి నుండి ఈ భారతవరములో ఏ జనులు నీకు నైవేద్యము పెట్టిన పదార్థమును భుజింతురో వారు ఒకసారి శునక జన్మనెతుదురు అని పలికి పార్వతీ మాత భర్త ముందు రోదించెను. అప్పుడామె దృష్టి పరమేశ్వరుని కంఠమందు పడి అతడు సల్లని కంఠము గలవాడయ్యెను.
తదా శివః శివాం భక్త్యా కృత్వా వక్షసి సాదరం।
తన్మానభంగం స్తోత్రేణ వినయేన చకార హ॥
కరేణ చక్షుషోర్నిరం సంమృజ్య చ పునః పునః ।
బోధయామాన వివిధైర్నీతి వాక్యైర్మనోహరైః ॥
పరితుష్టా చ సా దేవీ భర్తారం నమువాచ హ ।
కలేవరం చ త్యక్త్యామీ నైవేద్యేన వీనా హరేః॥
బిభర్తి దేహం సతతం తవ సౌభాగ్య వర్ధనం।
కథం వహామీ సౌభాగ్య రహితం చ కలేవరం ॥
అపూర్వం తవ నైవేద్యం జన్మమృత్యు జరామరం।
కృతం దుష్టం చ యత్తస్మాత్పశ్య దేహం త్యజామీ చ ॥
అప్పుడు శివుడు పార్వతిని ప్రేమాదరములతో వక్షస్థలమున చేర్చుకొని (కౌగిలించుకొని) వినయ పూర్వక నుతీలో ఆమె అహంకారమును (కోపమును) పోగొట్టెను, చేతితో ఆమె కన్నీటిని మాటి మాటికి తుడిచివేయుచు మనోహరములైన అనేక నీతివాక్యములతో బోధచే సెను. ఆ దేవి శాంతురాలై భర్తతో ఇట్లనెను. నీవు శ్రీహరి నైవేద్యము వలన ఎల్లప్పుడు సౌభాగ్యము పెంచుకొను దేహమును భరించుచున్నావు. ఆ సౌభాగ్యము (హరి నైవేద్య భోజనము) లేని ఈ శరీరమును నేనెట్లు భరింతును ? హరి నైవేద్యము లభించని నా శరీరమును త్యజింతును. అంతేకాక జన్మ మృత్యువులను ముసలితనమును హరించివేయునట్టి అపూర్వమైన నీ యొక్క నైవేద్యమును శాపముతో దుష్టముగా చేసితిని కనుక నేనీ దేహమును త్యజించుచున్నాను. చూడుము.
ప్రభూ! లింగము పైన ఏ పదార్థము నీకని నివేదింపబడునో అది గ్రహింపగూడనీదగును. విష్ణువు యొక్క నైవేద్యముతో కలిసినప్పుడు దానికి పవిత్రత ఏర్పడును. ఇట్లు పలికి ఆ దేవి దేహత్యాగము చేయబూనుకొనెను. హరుడు భయపడి ఆమెను నుతింపనారంభించెను.
శంకర ఉవాచ - శంకరుడు పలికెను :
ఓ మహాదేవి! కోపము ప్రకటించిన చండికా! జగదంబా! సుందరీ! నా అపరాధముంతను క్షమింపుము. ఓ సనాతనీ! బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు బీజభూతురాలా! నీ తపస్పుతో కొనబడి నీచేత పోషింపబడుచున్న నాయందు దయచూపుము. త్రిగుణములకు అతీతుడైన గోలోక నాధుని యొక్క సర్వశక్తుల స్వరూపమైనదానా! నిర్గుణ స్వభావా! ఎల్లప్పుడు నన్ను విడువని సహచారిణీ! స్వేచ్ఛననుసరించి సాకార నీరాకారములు కలదానా! ప్రియా! ఆ ప్రభువు యొక్క కృపచేతనే ఇప్పుడు నా వక్షస్థలముందుంటివి. ఓ మహామాయా! సర్వ బీజస్వరూపిణీ. సర్వసిద్ధులిచ్చుదానా! ముక్తిని కృష్ణ భక్తిని ఇచ్చుదేవీ మనోహరీ! నీకు శ్రీహరి నివేదన నీయకుండుట సూటిగా ఆ స్వామీ ఇచ్చేయే. దానిని కాదని నీకిచ్చుటకు నేను సమర్థుడను కాను. అట్లే శ్రీహరి ఇచ్ఛననుసరించి నీవు నీ దేహము త్యజించి నిర్గుణ స్థితిని పొందుము. అని పలికి ఆ చంద్రశేఖరుడు ఆమె ముందు నిలిచేను. ఆ నుతికామె ప్రసన్నురాలై హరునికి నమస్కరించెను.
ఇట్లు పూర్వము పరమేశ్వరుడు రచించిన (చేసిన) పార్వతీ స్తోత్రమును ఆపదలలో చిక్కు కొన్న వాడెవడు పఠించినను అతడా భయము నుండి విమోచనము పొందును. మిత్రభేదము (మిత్రుల నడుము కలిగిన భేదాభిప్రాయము) దూరమై (తొలగిపోయి), వారికి సంతోషము కల్గును. పార్వతీదేవి సంతుష్టురాలై అతని మందిరము విడువకుండును.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను :
భర్త ప్రతిజ్ఞను విన్న పార్వతీ దేవి సంతుష్టురాలయ్యెను. శంకరుని ఆజ్ఞననుసరించి ఆమె ఆకాశగంగకు పోయి స్నానము చేసి భక్తితో నిర్గుణుడైన తన ఇష్టదైవమును (విష్ణువును) పూజించి అప్పటికి తగినట్లు శీఘ్రముగా కూరగాయలతో బాటు మధుర భోజనము వండెను. శివుడును స్నానము చేసి సనాతనుడు తన హృదయమందు స్థిరముగా ఉన్నవాడును జ్యోతిరూపమున సున్న పరబ్రహ్మము అగు నన్నే చక్కగా పూజించి గొప్ప భక్తితో స్తుతించెను. నేనక్కడికి పోయి ఆ పదార్థములన్నిటిని భుజించి అతనికి అభివాంఛితము (కోరుకున్న దానిని) ఇచ్చితిని. అప్పుడు పార్వతి నా నైవేద్యమును పొంది దాని ప్రభావము వలన నీ సన్నిధికి చేరెను. ఆ పార్వతీ దేవి సంతోషము పొంది భర్తతో బాటు నా నైవేద్య శేషమును భుజించి భక్తితో శంకరుని స్తుతించి మాటి మాటికి నమస్కరించెను. ఓ సురేశ్వరీ! రాధా! శంకరుని నైవేద్యము ఏ కారణము వలన శపింపబడెనో నీవడిగిన ప్రశ్నకు సర్వము సమాధానము చెప్పితినీ అని శ్రీకృష్ణుడు పలికెను.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన హర నిర్మాల్య శాప ప్రసంగమనెడి ముప్పది ఏడవ అధ్యాయము సమాప్తము.
