4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
25 - మునిమోక్షణ ప్రస్తావనము
నారద ఉవాచ - నారదుడనెను :
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లు పలికెను :
ఓ బ్రహ్మభూతుడా! శ్రీహరి యొక్క మంగళకరమైన చరిత్రము ఎంత అద్భుతమైనది ! విశేషించి నీ వాక్కుల ద్వారా మిక్కిలి మనోహరమైన దానిని వింటిని. దూర్వాసముని శాపము వలన ఔర్వముని పుత్రిక (కందలి) అట్లు మరణించగా ఆ తండ్రి ఏమి చేసెనో? ఓ తపోధనుడా! నాకా విషయము తెలుపుము. అనగా నారాయణ మహర్షి ఇట్లనెను. ఔర్వముని సరస్వతీనదీ తీరమున తపస్సు, చేయుచుండగా కేవలము వాయువుచేతనే పట్టుకొనబడిన అతని తలమీదుగా (కప్పువలె) నిలిచియున్న ధౌతవస్త్రము (ఉదికిన పంచె) పై నుండి క్రిందపడెను. ఆ వస్త్రమట్లు నేలమీద పడగా మునీశ్వరుడు వెంటనే తపస్సు విడిచి యోగ శక్తి వలన తన బిడ్డకు వచ్చిన ఆపదను తెలిసికొనెను. శోకమాతనిని కప్పివేయగా వెంటనే ఆలుని ఆశ్రమమునకు పోయెను. ఆశ్రమ సమీపమున కేగి ఆ బ్రాహ్మణుడు భయాందోళనతో “బిడ్డా! కందలీ!” అని మరల మరల పిలిచెను.
మామగారి కంఠస్వరము గుర్తించి దూర్వాసముని భయముతో మనస్సు చెదరి వెంటనే బయటకు వచ్చి ఔర్వుని పాదములపై పడెను. మామకు నమస్కరించి దుఃఖముతో మిక్కిలి ఏడ్చెను. మొదటినుండి జరిగిన వృత్తాంతమంతయు ఆ మునికి చెప్పెను. ఆ వార్తను విని ఔర్వుడు దుఃఖము క్రమ్ముకొనగా గొప్పజ్ఞానియయ్యును నేలమీద పడిపోయి మూర్ఛిల్లెను. మరణించినవానివలె చేష్టలుడిగెను. ఓ నారదా! చచ్చినట్లున్న మామను చూచి దూర్వాసమునికి మనస్సులో కష్టమనిపించి అతడు ప్రయత్నముతో ఔర్వమహామునికి చైతన్యము వచ్చునట్లు చేసెను. స్మృతికి వచ్చిన ఔర్వుడు ఎదురుగా నిలిచియున్న అల్లునిచూచి కోపము పట్టజాలక పెదవులు మాటి మాటికి అదరుచుండగా పలికెను. దూర్వాసుడు భయముతో తలవంచుకొని మహాదుఃఖముతో కన్నులెర్రబడి కన్నీరు నిండగా నిలబడెను.
ఔర్వ ఉవాచ - ఔర్వముని ఇట్లనెను :
ఓయీ బ్రాహ్మణుడా! అత్రి వంశీయుడా! నీవు సృష్టికర్త పౌత్రుడవు. స్వల్పదోషమునకు అత్యధికమైన శిక్ష నెట్లు విధించితివి ? శంకరుని అంశతో నీవు జన్మించితివి. ఆ జగద్గురువునకు శిష్యుడవు. వేదవేదాంగ వేత్తవు. సర్వజ్ఞుడవు. స్వయముగా గుణవంతుడవు. నిన్ను గన్న తల్లి మహాసాధ్వియైన అనసూయాదేవి. లక్ష్మ్యంశ సంభూతురాలు. ఏ దోషము వలన నీకిటువంటి బుద్ధి యేర్పడినదో నేనెరుగను. ఎవనీ తండ్రి సద్గుణవంతుడో! ఎవని తల్లి గుణవతి మరియు పతివ్రతయో! అట్టి తల్లిదండ్రుల పుత్రుడు దయాహీనుడు! ధర్మము యొక్క గతి సూక్ష్మమై తెలియరానిదయ్యెను. ఆశ్చర్యము !
నాకు ప్రాణముల కంటె అధిక ప్రియమైన కన్యను సంతోషముతో నీకర్పించితిని. ఆమె మహాగుణవతి. స్వల్పమైన దోసమోమెలోనుండెను. వాగ్దుష్టురాలైన స్త్రీని పరిత్యజించుటయే శిక్షవిధించుట యని వేదమందు వినబడినది. నీవు కోపముతో విడిచిపెట్టినచో ఆమెను తండ్రి ప్రయత్నించి పోషించువాడు. నా బిడ్డలో స్వల్పదోషమును చూచి నీవు భస్మము చేసితివి. అందువలన నీకు గొప్ప పరాభవము (అవమానము) ముందు జరుగగలదు. ఇందులో సందేహము లేదు. గొప్పవారిని అల్పులను సర్వప్రాణులను ఎల్లప్పుడు సృష్టించువాడు రక్షించువాడు శిక్షించువాడు (శాసించువాడు) దయానిధియగు భగవంతుడే సుమా. ఇట్లు పలికి ఔర్వముని మరల మరల దుఃఖించి అమ్మా! బిడ్డా! అని పలుకుచు కోపముతో తన నివాసమునకేగెను.
ఔర్వముని వెళ్లిపోగా దూర్వాసుడు మరల మిక్కిలి దుఃఖించెను. జ్ఞానము వలన మరపున బడిన శోకము మరల ద్విగుణమయ్యెను. కాలము గడచిన తరవాత జ్ఞానాగ్ని చేత శమింపజేయబడిన దుఃఖమను అగ్ని బంధు దర్శనము వలన కల్గిన శోకమును ఇంధనములు (కర్రపుల్లలు) వేయుట వలన మరల వృద్ధి చెందును. అతడు ప్రియురాలిని తలచుకొని తలచుకొని అక్కడ మరల మరల విలపించి తన మనస్సునకు బోధ సలిపి తపస్సులో స్థిరపడెను. ఇట్లు దూర్వాసుని శాపమునకు కారణము చెప్పితిని. కొంతకాలమునకతనికి భరింపరాని అవమానము జరిగెను.
నారద ఉవాచ - నారదుడనెను :
దూర్వాసముని శంకరుని అంశకదా! తేజస్సులో శివునితో సమానుడు కదా! ఏ మహాతేజస్వి అతనికి పరాభవము కలిగించెను ?
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :
ఓ నారదమునీ! సూర్యవంశమున జన్మించిన అంబరీషుడను రాజేంద్రుడు ఎల్లప్పుడు శ్రీకృష్ణ పాదపద్మములందే మనస్సు గలవాడై - రాజ్యమునందుగాని భార్యల యందు గాని పుత్రుల మీద గాని ప్రజల మీద గాని పూర్వజన్మలోని పుణ్యకర్మల వలన సమకూరిన సంపదల మీద గాని ఒక క్షణము గూడ మనసు పెట్టకుండెను. అతడు గొప్ప జితేంద్రియుడు శాంతమనస్కుడు ధర్మకార్యములాచరించు ధర్మాత్ముడు. కలలోగాని మేల్కొని యున్నప్పుడుగాని రాత్రింబగళ్లు ముదముతో శ్రీహరినే ధ్యానించును. విష్ణువ్రతములందే ఆసక్తి గలవాడు కనుక ఏకాదశీవ్రతము నందు శ్రీకృష్ణ పూజనమందు మనస్సు లగ్నము చేసి తాను చేయు కర్మలన్నిటిని కృష్ణార్పణము చేయుచు నేను కర్తనని అహంకార మమకారములు లేకపోవుటచే వాటి వలన సంభవించు దోషములు (పుణ్యపాపములు) అంటకుండనుండెను.
బ్రహ్మాది దేవతల చేత స్తుతింపబడునది దేవదానవులచేత పూజింపబడినది కోటిసూర్యుల ప్రభ గలది వాడియైన పదహారు అంచులు గలది ఐన శ్రీహరి యొక్క సుదర్శనమనెడి చక్రము సర్వకాలరక్షగా స్వామిచేత ఆ రాజువద్ద ఉంచబడినది.
అట్టి అంబరీషుడు ఏకాదశీ వ్రతము నాచరించి ద్వాదశినాడు ఉదయకాలముననే స్నానము చేసి వీధి (శాస్త్రము) ప్రకారము భగవంతుని పూజించి బ్రాహ్మణులకు వెండి బంగారములను దానము చేసి బ్రాహ్మణులను భుజింపజేసి తాను భుజించుటకు కూర్చుండెను.
ఓ నారదా! ఇంతలో నొక బ్రాహ్మణుడు తపస్సు చేసినవాడు చేతిలో బ్రహ్మదండము గొడుగు ధరించినవాడు తెల్లని వస్త్రములను నుదుట తిలకమును ధరించినవాడు జటాధారి మిక్కిలి బక్కచిక్కి ఆకలిగొని ప్రాణములు పోవునేమో అన్న భయముతో నున్నవాడు గొంతు దవడలు పెదవులు ఎండిపోయిన వాడగు దుర్వాసుడు ఆ రాజు ముందుకు వచ్చెను.
అప్పుడు రాజు మునీంద్రుని చూచి లేచి నమస్కరించి పాద్యజలమిచ్చి బంగారు పీఠము వేసెను. ఆ ముని, రాజు నాశీర్వదించి కూర్చుండెను. అప్పుడు రాజు ప్రీతితో “ఏమి యాజ్ఞ ? మీ కోరిక ఏమి" అని యడుగగా ఆ మహాముని “రాజా! ఆకలి గొన్న నాకు శాస్త్రానుసారము భోజనము పెట్టుము. అఘమర్షణ మంత్రజపముతో స్నానమాడి త్వరగా వత్తును. ఒక్క క్షణము నిరీక్షించుము” అని పలికి మరల వెడలిపోయెను.
బ్రాహ్మణుడట్లు పలికి వెళ్లిపోగా దాటిపోనున్న ద్వాదశీ తిథిని గమనించి రాజు భయముతో దురంతమైన విషాదము పొందెను. ఇంతలో తన వద్దకు వచ్చుచున్న గురువును చూచి సంతోషముతో నమస్కరించి రాజు పరిస్థితినంతయు విన్నవించెను. "ఓ మునిరాజా! మునివరుడైన దూర్వాసుడు వచ్చుట లేదు. ద్వాదశీ తిథియేమో వెళ్లిపోవుచున్నది. ఈ సంకట పరిస్థితిలో శాస్త్రీయముగా ఏది చేయదగినదో దానినాచరించుట వలన కలిగిడి భద్రము అభద్రము లేవియో విచారించి శీఘ్రముగా చెప్పుము” అని ప్రశ్నించిన రాజు వాక్కులు విని వెంటనే ముని పుంగవుడు హితము సత్యము వేదోక్తమును చివరికి (ఫలించుదశలో) సుఖము కల్గించునట్టి మాటను వచించెను.
వశిష్ఠ ఉవాచ - వశిష్ఠ మహర్షి పలికెను :
రాజా! ద్వాదశి దాటిపోయిన పిదప త్రయోదశి తిథిలో పారణము (ఉపవాసము తరువాత చేయు భోజనము) చేయుట ఉపవాస ప్రతమును ఉపవసించినవానిని నశింపజేయును. అది బ్రహ్మహత్యతో సమమైన పాపమని వేదములో వినిపించును. అప్పుడు భుజించిన పదార్థము కల్లుతో సమానమని బ్రహ్మ చెప్పెను. ఇక ఆ సమయములో చేరవచ్చిన అతిథిని తినబెట్టకుండి మూఢుదు ఆఖలికి భయపడి తాను తిన్న యెడల వాడు కుంభీపాక నరకము పొందుట నిశ్చయము. నూరేండ్లందులో నుండి చండాలుడై జన్మించును. జన్మజన్మకు దరిద్రుడు వ్యాధియుక్తుడగును. అందువలన ఈ సంకటమైన సమయములో అతిసూక్ష్మమైన ధర్మమును చెప్పెదను వినుము. రెండు ధర్మముల నిప్పుడు కాపాడుము (పౌరణము అతిథి సత్కారము). ఓ రాజా! త్వరగా నీవు శ్రీకృష్ణ పాదోదకమును త్రాగి ఉపవాస ఫలమును రక్షించుకొనుము. స్వామి శ్రీ పాదజలము త్రాగుట భక్షించుట కాదు. ఇట్లు బ్రహ్మపుత్రుడైన వసిష్ఠ మహర్షి పలుకగా అంబరీషుడు శ్రీకృష్ణుని పాదపద్మములను స్మరించుచు కొద్దిగా స్వామి పాదజలమును త్రాగెను.
ఓ నారదా! ఇంతలో దూర్వాసముని అక్కడికి చేరవచ్చి సర్వజ్ఞుడు కనుక రాజు భగవంతుని తీర్థము గ్రహించినందుకు కోపించి తన జడనొక దానిని పీకి రాజు ముందు వేసెను. వెంటనే దాని నుండి అగ్ని జ్వాలవంటి పురుషుడు భయంకరముగా ఖడ్గహస్తుడై ఉద్భవించి రాజును చంపబూనుకొనెను.
కోటిసూర్యులతో సమానమైన తేజస్సు గల శ్రీహరి చక్రము ముని జడనుండి పుట్టిన ఆకృత్యా పురుషుని చూచి వెంటనే నరికి వేసెను అట్లే దూర్వాసమునిని నరకుటకు వచ్చుచున్న ఆ సుదర్శన చక్రమును చూచి ఆ బ్రాహ్మణుడు భయముతో మనస్సు చెదిరి పరుగెత్తెను. మండుచున్న అగ్నిజ్వాలవలె తన వెనుకబడి వచ్చుచున్న చక్రమును చూచి భయదుఃఖములతో బ్రహ్మాండమంత తిరిగి సృష్టికర్తను తలచుకొని అతడన్నిటికి నాధుడని బ్రహ్మను శరణుజొచ్చెను.
ముని బ్రహ్మ సభలో ప్రవేశించి రక్షించుము రక్షించుమనగా బ్రహ్మలేచి నిలబడి కుశలప్రశ్ననడిగెను. అతడు బ్రహ్మకు మొదటి నుండి జరిగిన వృత్తాంతము చెప్పెను. బ్రహ్మ విని భయముతో నిట్టూర్పు విడిచి ఇట్లనెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మ పలికెను :
నాయనా! ఎవని తేజస్సుతో హరిదాసుని శపింపబోతివి ? సాక్షాత్తుగా భగవంతుడెవనికి రక్షకుడో అట్టివానిని ముల్లోకములలో చంపగలవాడెవ్వడు ? నీచుల నుండి గొప్ప వారిని భక్తులను రక్షించుటకొరకే భక్తవత్సలుడైన శ్రీహరి చక్రమెల్లప్పుడు ధరించెను. ఏ మూఢుడు విష్ణువునకు ప్రాణసముడైన వైష్ణవుని (విష్ణుభక్తుని) ద్వేషించునో, నంహరింపబూనుకొనునో అట్టి వ్యక్తిని సర్వేశ్వరుడైన శ్రీహరి సంహరించును. కాబట్టి నాయనా నీకిప్పుడిక్కడ రక్షణలేదు. వేరే ఎక్కడికైనను త్వరగా పొమ్ము. లేనిచో సుదర్శన చక్రము నిన్ను నన్ను చంపగలదు. తేజస్సులో విష్ణు తుల్యమైన ఆ చక్రము ఈ బ్రహ్మలోకమునేమి ? క్షణములో బ్రహ్మాండమంతటిని (పదునాల్గు లోకములను) కాల్చుటకు శక్తి గలది. వేరే ఏ తేజస్సుతో దానినాపతరము!
బ్రహ్మ వాక్కు విని భయపడి ఆ విప్రుడు అక్కడి నుండి పరిగెత్తి కైలాసమునకు పోయి భయముతో శంకరుని శరణుజొచ్చెను. కృపానిధీ! నన్ను కాపాడుమని శంకరునితో పలుకగా - సర్వము తెలిసిన వాడు కనుక శివుడు ఆద్విజుని కుశలప్రశ్న అడుగక “ఓ బ్రాహ్మణుడా! స్థిరముగా నుండుము నా మాట వినుము” అని దీనులకు ప్రభువు జగములను క్షణములో లయము చేయువాడగు శంకరుడిట్లు పలికెను.
శంకర ఉవాచ - శంకరుడిట్లు పలికెను:
ఓమునీ! జగములను సృష్టించు బ్రహ్మ మనుమడవు. అత్రి మహర్షి పుత్రుడవు. వేదపండితుడవు. సర్వమెరిగినవాడవు. కాని నీవు చేసిన పని మూర్ఖుల కర్మతో సమానముగా నున్నది. వేదములలో పురాణేతి హాసములలో అన్నిటియందు సర్వేశ్వరుడని నిరూపింపబడిన విష్ణువును మూఢుని వలె తెలియకున్నావు. నేను బ్రహ్మ ఇంద్రుడు ఆదిత్యులు వసువులు ధర్మదేవత సర్వదేవతలు మునీంద్రులు మనువులు అందరు ఏ ప్రభువు యొక్క కనుబొమల కదలిక చేతనే ఆవిర్భవించుచు లయము చెందుచున్నారో - అట్టి స్వామికి ప్రాణాధికుడైన భక్తుని చంపబూనితివే. ఎవని తేజస్సుతో ఆపని తల పెట్టితివి?
నేను బ్రహ్మ లక్ష్మీదేవి పార్వతి సరస్వతి రాధాదేవి ఆ స్వామికి భక్తుని కంటె ప్రేమచేత ఎక్కువకారు. అతనికి అందరి కంటె భక్తులు ప్రియమైనవారు. సర్వజీవులకు అంతరాత్మయైన ఆ భగవంతుడు జాతకర్మలను బట్టి నీచులు శ్రేష్ఠులని చూడక భక్తుల నందరిని ఎదురులేని చక్రాయుధముతో ప్రయత్నించి మాటిమాటికి రక్షించుచుండును. తేజస్సులో తనతో సమానమైన గొప్ప వీర్యము గల చక్రమును భక్తుల రక్షణకేర్పరచి కూడ అంతటితో నమ్మి ఊరకుండక మిక్కిలి త్వరగలవాడై ఎల్లప్పుడు శ్రీహరి వారినడుమ నీడవలె తీరుగును. అతనికి లక్ష్మీదేవి ప్రాణాధికురాలు. అంతకు మించి వేరొకడెవడు లేడు. అట్టి తన కాంత భక్తులను ద్వేషించినచో వెంటనే ఆ స్వామి ఆమెను వదిలివేయును.
ఓ బ్రాహ్మణా! శ్రీహరికి అందరిలో బ్రాహ్మణులు తన శరీరము కంటే కూడ ప్రియులు. బ్రాహ్మణుల కంటె తన ప్రాణముల కంటె ప్రియమైన వారు భక్తులు. ఆ సర్వేశ్వరునికి ఈ ముల్లోకములలో ప్రియుడు అప్రియుడెవ్వడు? ఎవడందరికంటె ఉత్తమ లక్షణములు గలవాడో శ్రీహరి వానిని తాను భజించునుఎల్లప్పుడు స్మరించును. ఓ బ్రాహ్మణా! మహాప్రళయమై ఈ బ్రహ్మాండమంతయు నీటిలో మునిగినప్పుడు కూడ భగవద్భక్తులకు నాశము కలుగదు: గోవిందుని భజించుము. అతని పాదపద్మములను స్మరింపుము శ్రీహరిని స్మరించినంతలో సర్వాపదలు నశించును. నీవు త్వరగా వైకుంఠమునకు పొమ్ము. ఆ వైకుంఠుడే నీకు రక్షకుడు. అతడు కరుణాసముద్రుడు. నీకు తప్పక అభయమిచ్చును.
ఇంతలో సూర్యకిరణములతో భూమండలము వెలిగినట్లు కైలాసమంతయు చక్రతేజస్సుతో నిండిపోయెను. కైలాస వాసులందరు భయంకరమైన చక్రజ్వాలలతో కాలిపోయిరి. రక్షించుము రక్షించుమని శంకరుని శరణుజొచ్చిరి. దయానిధియైన శంకరుడు ఓర్చుకొన శక్యముగాని చక్ర తేజస్సును చూచి పార్వతితో కలిసి ఆ బ్రాహ్మణునికి ఆశీస్సులిచ్చెను. నేను చిరకాలమునుండి సమకూర్చుకొన్న తేజస్సు తపస్సు తథ్యమైన యెడల అపరాధము చేసి భీతుడై ఉన్న ఈ విప్రుడు బాధారహితుడగు గాక.
పార్వత్యువాచ - పార్వతి ఇట్లనెను :
నా పతిదేవుని యొక్క ఏ పుణ్యముల మీద ఆధారపడి ద్విజుడు శరణుజొచ్చెనో. నా ఆశీస్సు వలన మహా భయము నుండి త్వరగా ఇతడు విముక్తుడై బాధలేనివాడగు గాక. ఇట్లు కృపతో పార్వతీపరమేశ్వరులు పలికిరి. ముని వారికి నమస్కరించి వైకుంఠుని శరణు గోరబోయెను.
దూర్వాసముని మనోవేగముతో వైకుంఠమునకు పోవుచు వెనుక బడి వచ్చుచున్న సుదర్శనము చూచి శ్రీహరి అంతఃపురమును ప్రవేశించెను. అక్కడ రత్నసింహాసనముపై కూర్చుండియున్న శంఖ చక్రగదాపద్మములను హస్తములందు ధరించియున్న- పీతాంబరముతో శోభిల్లు శ్రీహరిని ద్విజుడు దర్శించెను. శ్యామవర్ణముతో చతుర్భుజములతో శాంతస్వరూపముతో మనోహరముగా లక్ష్మీనాథుడు రత్నాభరణములను రత్నాలహారములను ధరించి ప్రకాశీంచుచుండెను. చిరునవ్వుతో సుందరముగా నున్న ముఖమండలము, భక్తుల ననుగ్రహించుటలో త్వర, శ్రేష్ఠమైన రత్నముల కిరీటముతో వెలుగుచున్న శిరస్సు తెల్లని చామరములతో సేవ చేయుచున్న పార్షదులు, చుట్టు సేవించుచున్న సునంద నంద కుముద ప్రచండాదిపరివారము, ముందర స్తోత్రమొనర్చుచున్న సరస్వతి, పాద సేవచేయుచున్న లక్ష్మీదేవి, ఇట్లు వైభవముగా కొలువుదీరియున్న ఆ వైకుంఠనాధుని దర్శించి సాష్టాంగముగా నమస్కరించినవాడై ముని సామవేదమందు చెప్పబడిన స్తోత్రముతో ఆ పరమేశ్వరునిట్లు స్తుతించెను.
దూర్వాసా ఉవాచ - దుర్వాసముని పలికెను :
కమలాకాంతా! నన్ను కాపాడుము. కరుణానిధీ నన్ను రక్షించుము. దీనుల బంధువా? దీననాథా! కరుణాసముద్రుడా! ప్రభూ! వేదములను వేదాంగములను ప్రకటించిన బ్రహ్మను విధాతను నియమించువాడా! మృత్యువుకు మృత్యువా! కాలపురుషునికి కాలరూపుడా! కష్టసముద్రమున పడిన నన్ను రక్షింపుము. ప్రళయకర్తను హరించువాడవు సర్వమునకు ప్రభువును సర్వమునకు మూలకారణమైనవాడవు. విరాట్స్వరూపమునకు సూక్ష్మబీజమైన వాడవు నీవే. సంసారసాగరమందున్న నన్ను కాపాడుము. శరణాగతులను, దుఃఖము ఆపద భయముల నుండి రక్షించుట యందాసక్తి గలవాడా! భగవంతుడా! నారాయణా! నీకు నమస్కారము. భీతుడైన నన్ను కాపాడుము.
వేదములలో చెప్పబడిన ఆది తత్త్వమేదో; ఆ వేదములే దానిని స్తుతించుటకును శక్తిచాలనివి. విద్యామాత సరస్వతి మూగబోయిన చోట ఇక ఇతర విద్వాంసులేమి స్తుతింతురు. ఏ పరమాత్మను స్తుతించుటకు వేయి ముఖములు గల ఆది శేషుడు ఐదు ముఖములు గల పరమశివుడు నాల్గు ముఖములు గల బ్రహ్మ శక్తి చాలని వారైరో- శ్రుతులు స్మృతికర్తలు వాణీదేవియు స్తుతింపజాలరో అట్టి నిన్ను ఓ జ్ఞానదాతా! సామాన్య బ్రాహ్మణుడను వేదములు పఠించిన శిష్యుడిను. ఏమని సుతింతును. మనువులు మహేంద్రులు ఇరువై ఎనిమిది మంది గతించినచో ఏ బ్రహ్మకు ఒక రాత్రిపగలగునో అట్టి బ్రహ్మ యొక్క నూట ఎనిమిదేండ్ల జీవితకాలము నీవు కన్ను మూసి తెరిచినంతలో పూర్తియై అతడి పడిపోవును. అట్టి అనిర్వచనీయ మహిమ గల నిన్ను ఏమని స్తుతింతును. ప్రభూ! నన్ను కాపాడుము. ఇట్లు స్తుతించి స్వామి పాదపద్మముల పై పడి భయముతో మనస్సు చెదరి కన్నీటితో స్వామి పాదములను తడిపెను.
దూర్వాసముని ఒనర్చిన పరమాత్మయైన శ్రీహరియొక్క ఈ సోత్రము సామవేదమందు చెప్పబడినది. పుణ్యప్రదమైనది మరియు జగములకు మంగళకరమైనది. ఆపదలలో చిక్కుకొన్న వ్యక్తి మనో నిగ్రహము భక్తితో కూడినవాడై దీనిని పఠించినచో శ్రీమన్నారాయణుడు దయతో త్వరగా చేరవచ్చి వానిని రక్షించును. రాజద్వారమందుగాని శ్మశానమునగాని భయమూలమైన కారాగృహమందు గాని శత్రువుల చేత పట్టుబడినప్పుడు గాని దొంగల వలన భయమేర్పడినపుడు గాని క్రూర మృగముతో రాజు సైన్యముతో చుట్టుముట్టబడినప్పుడుగాని మహాసముద్రములో ఎక్కిన పడవ మునుగు చున్నప్పుడు గాని ఈ స్తోత్రముతో భగవంతుని స్మరించిన యెడల భయాపదల నుండి ముక్తుడగును. సందేహము లేదు.
ఇది దుర్వాసమునిచేత చేయబడిన శ్రీకృష్ణస్తోత్రము సమాప్తమైనది.
నారాయణ ఉవాచ - నారాయణమున పలికెను :
భక్తులయందు వాత్పల్యము గలవాడగు భగవంతుడు దూర్వాసముని స్తోత్రమును విని సంతసించి మధురముగా నవ్వుచు అమృతము వర్షించినట్లు ఇట్లు పలికెను.
శ్రీభగవానువాచ - భగవంతుడిట్లు పలికెను :
ఓయీ! లే లెమ్ము. నా వరము వలన నీకు మంగళమగును. ఐనను సత్యమును సుఖముకూర్చునదియు ఐన నా మాట వినుము. సత్పురుషుల ద్వారా విన్న శాస్త్రము వలన ఇతరులకు(సామాన్యులకు) జ్ఞానమేర్పడును. శాస్త్రములే సత్పురుషుల రూపములను దాల్చి చరించుచున్నవని (సత్పురుషుల విషయములో) తలంచవలెను. వేదవిరుద్ధమైన కర్మలాచరించుట అందరికిని మిక్కిలి గర్షించదగినదే. ఇది తెలిసికూడ అట్లా చరించినవాడు విద్వాంసుడైనను జీవస్మృతుని కంటె (బ్రతికియుండియు చచ్చిన వ్యర్థుడు) ఎక్కువ నీచుడు. ఓ బ్రాహ్మణా! పురాణములలో వేదములలో ఇతిహాసములలో వైష్ణవుని (విష్ణుభక్తుడు) మహిమ చెప్పబడినది. అంతట అందరిచేత అది వినబడినది వైష్ణవులకు నేను ప్రాణమును, నాకు వైష్ణవులు ప్రాణములు. వారిని ద్వేషించిన మూఢుడు నా ప్రాణములను హింసించువాడే. వైష్ణవులు పుత్రపౌత్రులను భార్యలను రాజ్యమును సంపదలను త్యజించి కూడ ఎల్లప్పుడు నన్ను ధ్యానింతురు. ఇక వారికంటె మిక్కిలి ప్రియమైనవాడివడుండును? వారిని ద్వేషించిన మూఢుడు నా ప్రాణములను హింసించువాడే, వైష్ణవులు పుత్రపౌత్రులను భార్యలను రాజ్యమును సంపదలను త్యజించి కూడ ఎల్లప్పుడు నన్ను ధ్యానింతురు. ఇక వారీకంటె మిక్కిలి ప్రియమైన వాడెవడుండును? నా ప్రాణములును నా భక్తుని కంటె శ్రేష్ఠము కావు. లక్ష్మీదేవి శంకరుడు సరస్వతి బ్రహ్మ దుర్గ గణేశ్వరుడు బ్రాహ్మణులు వేదములు శ్రేష్ఠురాలైన వేదమాత (గాయత్రి) నా ప్రాణముల కంటె ప్రియమైన గోపికలు గోపాలకును రాధాదేవియును నాకు భక్తుని కంటె శ్రేష్ణులు కారు. ఇట్లు మొత్తముగా వాస్తవము సత్యసారమును చెప్పితిని. ఇది వారిని ప్రశంసించి (అతిశయముగా) చెప్పినది కాదు. వారు నాకు ప్రాణముల కంటె అధికముగా ప్రియులు.
నన్నెవరు ద్వేషింతురో వారు మూఢులు జ్ఞానహీనులు మోసగింపబడినవారు. తమ ఆత్మనగు నన్నెవరెరుగరో వారు దీర్ఘకాలము సరకమును పొందుదురు. నాకు ప్రాణముల కంటె ప్రియమైన భక్తులనెవరు ద్వేషించుచున్నారో వారిని నేను త్వరగా శిక్షింతును. ఈ దేహము వదలగనే దీర్ఘకాలము నరకప్రాప్తీయే వారికి విధింతును. నేను సమస్త జీవులకు సృష్టి స్థానమును. ప్రభువును. పరిపాలకుడను. సర్వత్ర వ్యాపించి ఉండువాడను స్వతంత్రుడను. అట్టి నేను రాత్రింబగళ్లు భక్తులకధీనుడనై (వారివశమై) ఉందును. గోలోకమున ద్విభుజములతో వైకుంఠమున చతుర్భుజములతో రూపమునకు మాత్రముందును. ఎల్లప్పుడు నా ప్రాణములు భక్తులవద్దనే ఉండును. భక్తుడేది నాకని చెప్పునో ఏది సమర్పించునో దానిని నేను భక్షింతును. భక్తుడు గాని వాడు అమృతము వంటి పదార్థమిచ్చినను నాకది ఆభక్ష్యము (తినగూడనిది) అగును.
రాజశ్రేష్ఠుడును దయాశీలుడును కోరికలు లేనివాడును ఇతర ప్రాణులను హింసించనివాడగు అంబరీషుని - అన్ని ప్రాణుల హితమునకై ఆసక్తి పడు వానిని నీవేట్లు చంపజూచితివి? సర్వప్రాణులయందెవరు దయగలవారో వారే సజ్జనులు. వారిని ద్వేషించువారు మూఢులు. అట్టి మూఢులను నేను నశింపజేయుదును. భక్తులను హింసించువానిని, భక్తుల శత్రువును రక్షించుటకు నేను సమర్థుడను కాను. నీవంబరీషుని గృహమునకే పొమ్ము. నిన్ను రక్షించుటకతడే ప్రభువు.
నారాయణ ఉవాచ - నారాయణ ముని పలికెను :
భగవంతుడు పలికిన ఈ మాటలు విని బ్రాహ్మణుడు (దూర్వాసుడు) భయముతో మనస్సు చెదరినవాడై విషాదముతో కూడిన మనస్సుతో శ్రీకృష్ణ పాదపద్మములను స్మరించుచు నిలుచుండెను. ఇంతలో బ్రహ్మయు భవానీ శంకరులును ధర్మదేవతయు ఇంద్రాది దేవతలును మునిశ్రేష్ఠులును అక్కడికి చేరవచ్చిరి. అందరు నమస్కరించి సర్వాంగములు పులకరించగా భక్తితో శిరస్సులు వంచి ఆ పరమాత్మను స్తుతించిరి.
బ్రహ్మోవాచ - బ్రహ్మ అనెను :
జీవుల అంతరాత్మ స్వరూపుడా! ఏ విధమగు కల్మషములంటనివాడా! భక్తులననుగ్రహించుట యందు త్వరగల స్వామీ! భక్తునికపరాధమొనర్చిన ఈ బ్రాహ్మణ పుంగవుని రక్షించుము.
మహాదేవ ఉవాచ - మహాదేవుడనెను :
దీనులకు బంధువైనవాడా! జగత్తంతటికి నాధుడా! ఈ విప్రుడు నీ అధీనములోని జగత్తుకంటె బయటివాడు కాడు. అపరాధము చేసినను దీనుడై శరణు చొచ్చినాడు. కావున ఇతనిని కాపాడుము.
పార్వత్యువాచ - పార్వతి ఇట్లనెను :
అంబరీషుడు నీ భక్తుడు. బ్రాహ్మణులు గాని దేవతలు గాని మేము గాని అంతటి వారము కాము. ఐనను నీవు మాకందరికి ప్రభువువు. అపరాధియైన ఈ విప్రుని రక్షించుము.
ధర్మ ఉవాచ - ధర్మదేవత ఇట్లనెను :
ఓ స్వామీ! అందరికి నీవు కన్నతండ్రివి. రక్షకుడవు. శిక్షించుప్రభువువు. ఐనను ఒక్క శిశువును రక్షించుట కొరకు ఇంకొక శిశువును తండ్రి చంపుచున్నాడనుట ఎట్లుండును? ఎక్కడ సంభవమగును ?
ఇంద్ర ఉవాచ - ఇంద్రుడనెను :
స్వామీ! ఎల్లప్పుడు సర్వజీవుల యందు కృపతో సమబుద్ధిగలవాడవు నీవు. ఇప్పుడు ఇతని అపరాధమునకు ఫలమును కూడ సమబుద్ధితో ఈయదలచితివి. ఇక అతనిని రక్షింపవలసినది.
రుద్ర ఉవాచ - రుద్రుడనెను :
లోకమునకు శాంతినొనర్చుట యోగ్యము. ఇప్పుడాశాంతిని కల్గించుము. దెబ్బతిన్న మూలమును (కొంత శిక్షితుడైన బ్రాహ్మణుని) పాలించుట నీకు తగును.
దిక్పాల ఉవాచ - దిక్పాలకుడనెను:
అపరాధము చేసినను బ్రాహ్మణుని నరకుట వేదమందు లేదు కనుక తగదు. సత్ర్పభువు (అగు నీవు) అపరాధమును క్షమించి ఎల్లప్పుడు రక్షించును.
గ్రహా ఊచుః - గ్రహములు పలికినవి :
ఎవడు వైష్ణవుని ద్వేషించునో వాడు మూఢుడు. సర్వదేవతలు వానిపై కోపము పొందుదురు. మేము వానిని మాటి మాటికి పీడింతుము. తరువాత నీవు వానిని కాపాడదగుదువు.
మునయ ఊచుః - మునులు పలికిరి :
నాధుడా! ఈ బ్రాహ్మణుడవమానింపబడిన యెడల మేమందరము బ్రతికియుండి కూడ మరణించిన వారమే అగుదుము. ఒక మునికి శిక్ష విధించుట వలన మా జాతికే సిగ్గుపడవలసిన స్థితి ఏర్పడును.
అత్రి రువాచ - అత్రిముని పలికెను :
క్రోధస్వభావము గల పుత్రుని నీవే నాకిచ్చితివి. ఐనను వీడెల్లప్పుడు నీ సేవకుడు. ముల్లోకములలో ఏ తేజస్వి నీ తేజస్సునకు భయపడడు?
లక్ష్మీరువాచ - లక్ష్మిదేవి పలికెను:
ఓ భగవంతుడా! శరణాగతుడైన బ్రాహ్మణుని అపరాధమును క్షమించుము. దేవతలు బ్రాహ్మణులును ఇతనికొరకే నిన్ను స్తుతించుచున్నారు. ఈ విప్రుని చంపుట నీకు తగదు.
సరస్వత్యువాచ - సరస్వతి పలికెను :
ఓ భగవంతుడా! సర్వదేవతలకు జనకుడవు. కోరిన వరములిచ్చు వాడవును స్వామియు నైన నీకు శ్రుతిని (వేదవాక్కును) స్మరింపజేయుచున్నాను. నీవు అందరిని రక్షించుటకే తగినవాడవు, (రక్షణమన్నది నీ అర్హత సుమా).
పార్షదా ఊచుః - పార్షదులు పలికిరి :
మిమ్ము స్మరించినంత మాత్రమున అందరికి అన్ని విధముల మంగళములు సమకూరును. అన్ని ఆపదలు తొలగిపోవును. ఈ శరణాగతుని కాపాడుము.
నర్తకా ఊచుః - నర్తకులు పలికిరి :
దారిద్ర్యమును నశింపజేయు స్వామీ! మేమెల్లప్పుడు నిన్ను భిక్షమడుగువారము. ఇప్పుడు మాకు భిక్ష పెట్టుము. బ్రాహ్మణుని రక్ష మాకు భిక్షగా ఇమ్ము.
శరణు పొందిన వారియందు దయగలవాడగు స్వామి వీరియొక్క స్తోత్రమును విని నవ్వి అందరికి సంతోషకారణమగు మాటను పలికెను.
శ్రీభగవానువాచ - భగవంతుడు పలికెను:
దేవాదులారా! మీరందరు నీతియుక్తము సుఖకరమైన నామాట వినుడు. మీ ఆజ్ఞను బట్టి నిశ్చయముగా విప్రరక్షణ చేతును. కాని ఇతడీ వైకుంఠము నుండి అంబరీషుని గృహమునకు పోవుగాక. ముని అక్కడ రాజు యొక్క సంతృప్తి కొరకు పారణము (ఉపవాసానంతర భోజనము) చేయుగాక. ఈ విప్రుడతనికతిథిగా పోయి నిర్దోషియైన రాజును శపించబూనుకొనెను. సుదర్శనచక్రము తనచేత రక్షింపబడు రాజును చంపబూనిన ఈ బ్రాహ్మణుని దహింపదలచెను. ఈ ముని భయపడి నిండుగా ఒక సంవత్సర కాలము భూమియందంతట తిరుగుచున్నాడు. అక్కడ అంబరీషుడు ద్వాదశి పారణ కాలేదన్న విచారముతో భార్యతో బాటు ఉపవసించియున్నాడు. భక్తుడు ఉపవసించి యున్నందున నేను కూడ ఉపవాసముతో ఉన్నాను. చనుబాలు త్రాగని శిశువును చూచి తల్లి ఆహారము భుజింపజాలదు కదా!
నా ఆశీస్సు వలన ఈ ముని ఈ క్షణములో నిర్భయుడగు గాక. రాజు వద్దకు పోవు మార్గములో నాచక్రమతని నిక హింసించదు. ఈనాడు నేను నిశ్చింతగా ప్రీతితో భక్తుడర్చించిన అమృతము వంటి పదార్ధమును సుఖముగా భుజింతును. లక్ష్మీదేవి అర్పించిన ద్రవ్యమైనను భక్తుని ద్వారా వచ్చిన పదార్థము వలె నేను భుజించజాలను. తృప్తిపొందలేను. ఇతరులను తృప్తిపరచజాలను. ఓ మునీంద్రా! బుద్ధిశాలీ! నాయనా! రాజగృహమునకు నీవు పొమ్ము. ఓ దేవతలారా! మునులారా! మీ మీ గృహములకు మీరు భార్యలతో బాటు వెళ్లుడు అని శ్రీహరి పలికి తన అంతఃపురములోని కేగెను. వారందరు జగదీశునకు నమస్కరించి సంతోషముతో వెళ్లిపోయిరి.
బ్రాహ్మణుడును అతని ననుసరించెడి కోటిసూర్యుల తేజస్సు గల సుదర్శన చక్రము మనోవేగముతో అంబరీషుని గృహమునకేగిరి. ఆ రాజు సంవత్సరకాలముపవసించి ఉండి కంఠము పెదవులు దవడలు శుష్కించి సింహాసనము పై అట్లే ఉండి తన యెదుట (తిరిగి వచ్చిన) మునిపుంగవుని దర్శించెను. వెంటనే సంభ్రమముతో లేచి ప్రేమాదరములతో నమస్కరించి రుచిగల భోజనమును మునికి పెట్టి భుజింపజేసి తరువాత తాను భుజించెను. బ్రాహ్మణశ్రేష్ఠుడు భుజించి తృప్తినొంది సంతోషముతో రాజునాశీర్వదించెను. మరిమరి రాజును ప్రశంసించుచు తన నివాసమునకు పోయెను. ఆ దూర్వాసముని అత్యాశ్చర్యముతో తనలో తాను విష్ణుభక్తుల మాహాత్మ్యము ఇతరత్ర దుర్లభము అని అనుకొనుచు వెళ్లెను.
ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన మునిమోక్షణ ప్రస్తావమను ఇరువది ఐదవ అధ్యాయము సమాప్తము
