4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
3 - సప్తసముద్ర జన్మరాధా సుదామ శాపము
శ్రీనారాయణ ఉవాచ :
శ్రీనారాయణముని ఇట్లు పలికెను :
రాధాదేవి రత్నమండపములోని నివాసగృహమునకు పోయి అచట హరిని కానక నదీ రూపము ధరించిన విరజను మాత్రమే చూచి తన ఇంటికి తిరిగి పోయెను.
శ్రీకృష్ణుడు నదీరూపము చెందిన ప్రియురాలగు విరజను చూచి మనోహర జలము గల ఆ నదీ తీరమున కూర్చుండి బిగ్గరగా ఇట్లు ఏడ్చెను. ఓ ప్రేయసీ! నా దగ్గరకు రమ్ము. ఓ కళ్యాణీ! నీవు లేకుండ నేనెట్లు జీవింతును. ఓ నదీ నాయికా! నీవు నా ఆశీస్సుతో పూర్వ రూపము కంటే పూర్వ సౌభాగ్యము కంటే విశేషసుందర మూర్తివై రమ్ము. నీ పూర్వ రూపము నదీ రూపమైనది. ఉత్తమ శరీరము దాల్చి ఆ జలము నుండి లేచి రమ్ము. నీకు అష్టసిద్ధులిచ్చితిని త్వరగా రమ్ము అని అనెను.
కృష్ణాజ్ఞతో విరజాదేవి ఉత్తమ రూపము దాల్చీ సాక్షాత్తు రాధయే అన్నట్లు హరి ముందుకు వచ్చెను. పీతాంబరము ధరించి తనను జూచు ప్రాణనాధుని చిరునవ్వుతో ఓరచూపుతో చూచుచుండెను. నిండైన నితంబ భారముతో పుష్టిగా ఉన్నతముగానున్న స్తనమండలముతో గజేంద్రుని మందగమనముతో సుందరమైన సంపెంగ పూవు వన్నెతో (పసుపు పచ్చవన్నె) పండిన దొండపండు వంటి క్రింది పెదవితో పక్వమైన దానిమ్మ గింజల కాంతి గల పలువరుసతో శరత్పూర్ణిమనాటి చంద్రుని వంటి ముఖముతో విచ్చిన కలువపూలవంటి కన్నులతో కస్తూరీ తిలకము పై సింధూరపు చుక్క బొట్టుతో మకరరేఖలు గల చెక్కిళ్ల కాంతితో అందమైన కొప్పుతో రత్నకుండలములతో రత్నహారముతో జాతి ముత్యపు ముక్కుపోగుతో రత్నకంకణములు దండకడియములు సుందర శంఖములు గల హస్తాభరణములతో ముత్యాల హారములతో మువ్వల మొలనూలుతో రత్నాల అందెలతో సుందరీమణులలో సుందరియై స్త్రీలలో మాన్యయై ధన్యయగు విరజ హరిని సమీపించెను.
ఆ సుందరిని చూచి జగత్పతియగు కృష్ణుడు ప్రేమోద్రేకముతో వెంటనే అ లింగనమొనర్చుకొని మరల మరల ముద్దిడెను. ఏకాంతమున ఆ ప్రేయసిని పొంది నానావిధ శృంగారములొనర్చెను. విరజాదేవి అతని అమోఘ వీర్యము ధరించి సద్యోగర్భవతియై ధన్యురాలయ్యెను. నూరుదేవతా సంవత్సరములు గర్భము ధరించి అందమైన ఏడుగురు కొడుకులను గనెను. ఆ కొడుకులతో ఆ సాధ్వి కృష్ణునకిష్టురాలై సుఖముగా నుండెను.
ఒకసారి నిర్జనమైన బృందారణ్యమున ఆ సాధ్వి శృంగారాసక్తిలో హరితో విహరించుచుండెను. ఇంతలో ఆమె చిన్నకొడుకు అన్నలతో బాధింపబడి భయముతో తల్లి వద్దకు వచ్చెను. వాని స్థితిని చూచి కృపానిధియైన కృష్ణుడామెను వదిలి రాధాగృహమునకేగెను. విరజ తన పుత్రుని ఒడిలో చేర్చుకొని వానిని బుజ్జగించి ధైర్యము చెప్పి కృష్ణునకై చూడగా ఆమెకు కృష్ణుడు కనిపించక అసంతృప్తురాలై మిక్కిలి దుఃఖించెను.
ఆమె కోపముతో ఆ కొడుకును లవణసముద్రమగుదువు గాక ఏ జీవులును ఏకాలమందు గాని నీ నీరు త్రాగకుదురు గాక అని శపించెను. వానిని బాధించిన మిగిలిన బాలురును మూఢులై భూమిని చేరి జంబూ ద్వీపమున అందరొక చోటగాకుండ వేర్వేరుగా ఆయా ద్వీపములందు నీలుతురుగాక. ఆ ద్వీపములందున్న నదులతో ఏకాంతముగ క్రీడించి సుఖింతురు గాక అని శపించెను. చిన్నవాడు తల్లి శాపమును తోబుట్టువులకు తెలుపగా వారందరు ఏడ్చుచు తల్లి వద్దకు వచ్చి శాప వివరణను విని భక్తితో సాష్టాంగముగా తల్లిపాదములకు నమస్కరించి భూతలమునకు పోయిరి. చిన్నవాడు తల్లి శాపమున లవణ సముద్రమయ్యెను. వారు సప్త ద్వీపములను విభజించుకొని చిన్నవాని నుండి అగ్రజునివరకు ఒకరికంటే ఒకరు రెండింతలుగా ఆయా ద్వీపములందు సముద్రములైరి. లవణసముద్రము, ఇక్షు సముద్రము (చెరకు), సురా (కల్లు) సముద్రము, సర్పీస్ (నెయ్యి) సముద్రము, దధి సముద్రము, క్షీర సముద్రము, జల (మంచినీటి). సముద్రము అని అవి ఏడు. ఈ సముద్రములు సప్తద్వీపవతియైన భూమియందు వ్యాపించినవి. ఇవి (పరోక్షముగా) సస్యములకు నీరందించును. తల్లి తోబుట్టువుల వియోగమునకు వీరందరు దుఃఖించిరి. సాధ్వీయగు విరజాదేవియు పుత్రులకు కట్టిన దుర్గశకు మిక్కిలి దుఃఖించి భర్త యొక్కయు కొడుకుల యొక్కయు వియోగమునకు దుఃఖించి మూర్ఛిల్లెను.
రాధికాపతియగు శ్రీహరి విరజాదేవి శోకసాగర మగ్నమైనట్లు తెలిసికొని చిరునవ్వు మొగముతో ఆమె వద్దకు మరలి వచ్చెను. హరిని చూచి ఆమె శోకవిషాదములు త్యజించి ఆనంద సాగరమగ్నమై కాంతుని ఆలింగనమొనర్చెను. పుత్రులను పరిత్యజించి ఉన్న ఆమెను కృష్ణుడు ప్రసన్న నేత్రములతో చూచి ప్రీతితో వరమిచ్చెను. ప్రియా! నిత్యము నీ స్థానమునకు తప్పకుండా వత్తును. రాగవలెనే నీవును ఆమె వంటి ప్రియురాలవగుదువు. నా వరప్రసాదము వలన నీ పుత్రులనెల్లప్పుడు చూడగలవు. ఇట్లు పలుకుచు విరజ యింటనున్న శ్రీకృష్ణుని చూచి రాధ చెలికత్తెలు ఆమెకీవార్త చెప్పిరి.
ఓ నారదా! చెలుల మాట విన్న రాధ కోపించి క్రోధమందిరమున పడుకొనెను. ఇంతలో శ్రీ కృష్ణుడు శ్రీదామునితో పాటు రాధ వద్దకు పోయి ఆమె ఇంటిముందు నిలిచెను. తన ముందున్న వారిని చూచి ఆ రాసమండల నాయిక కోపముతో యిట్లు పలికెను.
ఓ హరీ! గోలోకమున నీకు నాకంటే మిక్కిలి ప్రియమైన స్త్రీలెందరో కలరు. వారివద్దకే పొమ్ము. నాతో ప్రయోజనమేమీ? నీ ప్రియకాంత వీరజ నా భయము వలన దేహము వదలి నదీ రూపము దాల్చినది. ఐనను ఆమె వద్దకే పొమ్ము. ఆ నదీ తీరమున ఇల్లు కట్టుకొని ఉండుము. పొమ్ము. ఆమె నదియయ్యెను, నీవు నదమగుట యోగ్యముగానుండును. నదీనదముల సంగమము ప్రశస్తముగా ఉండును. శయన భోజనములందు స్వజాతి వలన కలుగు సుఖము మిక్కిలి తృప్తినిచ్చును. దేవతాశిరోమణికి నదితోక్రీడ. ఓహో! ఇది విని గొప్పవారు వెంటనే నవ్వుకొందురు. నిన్ను సర్వేశ్వరుడని చెప్పువారు వాస్తవమునకేమెరుగుదురు. సర్వభూతము (జీవులు)లకు అంతరాత్మయగు భగవంతుడు నదీ సంభోగము కోరుచున్నాడు! రాధాదేవి ఇట్లు కోపముతో పలికి లక్షల గోపికలతో కూడియుండియు (దాసీజనము) నేల పై పండుకొని లేవకుండెను.
ఓ నారదమునీ రాధికాదేవి ముందర చామరములు ధరించి కొందరు సన్నని మేలి వస్త్రములు కలవారు కొందరు తాంబూల ద్రవ్యములు పట్టుకొని కొందరు పూలమాలలు పట్టుకొని కొందరు సుగంధ జలము ధరించి కొందరు పద్మములు పట్టుకొని కొందరు సిందూరము పట్టుకొని కొందరు మంచినీరు పట్టుకొని కొందరు రత్నాలంకారములు చేత పట్టుకొని కొందరు కాటుక బరీణలు పట్టుకొని కొందరు వేణువు, వీణలను పట్టుకొని కొందరు ఆవీరమును చేత బట్టి కొందరు జలయంత్రము (చిమ్మెన గొట్టము) లు పట్టుకొని కొందరు సువాసన తైలములతో కొందరు కరతాళములు కందుకము (బంతులు) గలవారు కొందరు మృదంగములను మురజములను మ్రోగించువారు కొందరు, కొందరు సంగీత నిపుణలు మరి కొందరు నర్తనము చేయువారు క్రీడా వస్తువులు ధరించి కొందరు సుధామధువుల పాత్రలు ధరించి కొందరు పాదపీఠములలో కొందరు అలంకార వస్తువులతో కొందరు పాద సేవ చేయువారు కొందరు చేతులు జోడించుకొని కొందరు స్తోత్రములు చేయుచు కొందరు చెలికత్తెలుండిరి. అంతఃపురము చుట్టు గుంపులు గుంపులుగా కొందరు ద్వారపాలికలుగా కొందరు నేత్రములు ధరించియు ఉండిరి. ద్వారమునందున్న వారు శ్రీకృష్ణుని లోనికేగనీయకుండిరి.
ముందున్న ప్రాణేశుని చూచి రాధాదేవి అతిగర్వముతో అయోగ్యము అననురూపము (తగని) అతికర్కశముగా ఇట్లు పలికెను.
రాధికోవాచ :
రాధ ఇట్లు పలికెను :
ఓ కృష్ణా! విరజావల్లభా నాముందు నుండి పొమ్ము. ఓ చపలుడా విషయాసక్తుడా నన్నెందుకు బాధింతువు. పద్మావతి వద్దకు గాని నీమనోరమమైన రత్నమాల వద్దకు గాని అతి సుందరియైన వనమాల వద్దకు గానీ పొమ్ము. ఓ నదీకాంతుడా దేవదేవేశా నీ వ్యవహారములన్నియు తెలిసినవి. నీకు భద్రమగు గాక. ఇచటి నుండి వెడలి పొమ్ము. ఎప్పుడు కూడ మనుష్య వ్యవహారములందు నీకాసక్తి. కావున నీకు మనుష్య జన్మ కలుగుగాక. ఈ గోలోకము నుండీ భరత ఖండమునకు పొమ్ము. ఓ సుశీలా ఓ శశికళా ఓ మాధవీ ఈ ధూర్తునీకిచట ఏమీ ప్రయోజనము. వెడలగొట్టండి.
రాధాదేవి మాటలు విని గోపికలు హితము సత్యము సమయోచితము సారవంతములైన వినయ వాక్యములు హరితో పలికిరి. ఓ శ్రీహరి క్షణము సేపు వేరొకచోటికి పొమ్ము. రాధాదేవి కోపము తొలగిపోగానే మీ వద్దకు వచ్చి తల్చుదుము అని కొందరనిరి. కొందరు క్షణము సేపు వేరొక యింటికి పొమ్ము. ప్రేమతో నీవు పెంచిన రాధ నిన్ను తప్ప ఎవరిని ఇట్లు పలుకును! అనిరి. మరికొందరు రాధికయందలి ప్రేమలో ఆమె కోపము తొలగిపోవునంతవరకు ఒక క్షణము బృందావనమునకు పొమ్మనిరి. ఇంక కొందరు పరిహాస వాక్యముగా ఈశునితో ఇట్లు “ఓ కాముకుడా! భక్తితో మానిని (అభిమానవతి) కోపమును తీర్చుము” అనిరి. ఇంకను కొందరు లోలుడవగు నీకు యోగ్యమైన మర్యాదలెట్లు చేయుదుము. వేరొక భార్య వద్దకు పొమ్ము అనిరి. మరికొందరు హరికి ఎదురుగా నిలిచి చిరునవ్వుతో “ఆమె వద్దకు పోయి లేపి కూర్చుండబెట్టి కోపము తీర్చుము” అనిరి. ఇంక కొందరు గోపికలు రాధ ముఖమును చూచుటకెవడు సమర్థుడు అని కఠినముగా పలికిరి. మాటలు నేర్చిన మరికొందరు స్త్రీలు కృష్ణా నీవు ఇంకొక గడప తొక్కని యెడల ఆమెతో నిన్ను కూర్చుదుము అనిరి. అందరి మాటలు విని చిరునవ్వుతో కోపము లేక నిలిచియున్న ఆ ప్రభువును కొందరు లోనికి పోనీయక అడ్డగించిరి.
జగత్సృష్టికి బ్రహ్మాదులకు మూలమైన శ్రీహరి గోపికలడ్డగించగా వేరొక గృహమున కేగుటను చూచి శ్రీదాముడు వెంటనే కోపించి కనులేర్రన చేసి భర్త మీది అలుకతో కనులేర్రబడియున్న పరమేశ్వరి అగు రాధాదేవితో ఇట్లనెను.
శ్రీదామోవాచ :
శ్రీరాముడిట్లు పలికెను :
ఓ తల్లీ! నో ప్రభువును కటువాక్యములేట్లు పలుకుచున్నావు. ఆలోచన లేకుండ బెదిరించుచున్నావు. ఇదీ వ్యర్ధము. బ్రహ్మ అనంతుడు (ఆదిశేషుడు) ఈశ్వరుడు (శంకరుడు) మొదలగు దేవతలకు ప్రభువు. జగన్మూలమునకు మూలమైనవాడును సరస్వతి లక్ష్మీ మాయ ప్రకృతులకు ఈశుడును, నిర్గుణుడు, స్వాత్మారాముడు, పూర్ణకాముడు (కోర్కెలు నిండినవాడు) ఐన స్వామిని నీవు నిందించుచున్నావు. నీవు అతని సేవ మరియు పాదార్చనల వలననే అందరు దేవేరులలో శ్రేష్ఠురాలవు నాయకివి ఐతివికదా. ఓకల్యాణీ! అది ఎరుగకుంటివి. నేనేమీ చెప్ప సమర్థుడను. శ్రీ కృష్ణుడు తన భ్రూ విలాసము చేతనే (బొమ్మముడీ) నీవంటి దేవేరులను కోటానుకోట్లు సృష్టించు శక్తి కలవాడు. నిర్గుణుడగు నతనిని గుర్తించవైతివి. శ్రీవైకుంఠమున శ్రీదేవి భక్తిపూర్వకముగా తన శిరోజముల (తలవెండ్రుకల)తో ఈ శ్రీహరి పాదపద్మములను తుడుచుచు మాటి మాటికి సేవలు చేయుచుండును. సరస్వతీ దేవి కర్ణామృతమైన స్తోత్రములతో ఎల్లప్పుడు భక్తిగీతములు పాడును. అట్టి ప్రభువును నీవెరుగకుంటివి. జీవకోటికి బీజరూపమైన మాయా ప్రకృతి స్వామికి భయపడుచు ఎల్లప్పుడు భక్తితో స్తుతించును. అట్టివానీ నేరుగవైతివి. ఆ మహాత్ముని ఎల్లప్పుడు స్తుతించుచున్న వేదములును ఆతని మహిమలోని పదహారవ భాగమును కూడ సరిగా నెరుగవో అట్టి మహాభాగునీ నీవెరుగకుంటివి. వేదములకు జనకుడైన బ్రహ్మ తన నాలుగు ముఖములతో సుతించుచు స్వామి పాద సేవ చేయునమ్మా. యోగిజనులకు గురువగు శంకరుడును శరీరము పులకరింపగా ఆనందబాష్పములు రాలగా తన పంచముఖములతో స్తుతించుచు వారి చరణాంబుజములు సేవించును. ఆదిశేషుడు తన వేయినోళ్ళతో ఎల్లప్పుడు స్తుతించుచు ఆ పరమాత్మ పాదపద్మములను భక్తితో సేవించును. ధర్మపాలకుడు జీవుల కర్మలకు సాక్షి జగత్నాలకుడు అగు ధర్మదేవత కూడ భక్తి సంతనములతో అతని పాదపద్మములను సేవించును. శ్వేతద్వీపమున నివసించుచు జగములను పాలించు విష్ణువితడే. అతడును అతని అంశలే వ్యక్తావ్యక్తములను ధరించును, దేవదానవులు, మునిగణములు, మానవులు వారి సంతతియు పండితులును అతని సేవలు చేసినప్పటికీ స్వప్నములో కూడ అతని చరణాంబుజములను దర్శించలేరు. ఒక్క బొమ్మముడి పాటుతోనే సృష్ట సంహారములు చేయగల శ్రీహరి పాదపద్మములను భజింపుము. కోపమును త్యజించుము.
సృష్టికర్తయగు బ్రహ్మ జీవితకాలము నూట ఎనిమిది పరమాయు వర్షములు. ఆ బ్రహ్మయొక్క ఒకదినములో ఇరువది ఎనిమిది మంది ఇంద్రులు కూలిపోదురు. అట్టి సృష్టికర్త శ్రీహరి యొక్క కనురెప్ప పాటు కాలములో ఆయువు ముగిసి రాలిపోవును. రాధాదేవి నీవును ఇతర స్త్రీలందరును సర్వము నా ప్రభువు ఆధీనములోని వారే.
రాధికోవాచ :
ఓ నారదా! శ్రీదాముని తీవ్రమైన నీష్ణురవాక్యములు విని శ్రీహరి ప్రాణేశ్వరియు రాసమండలసాయికయు అగు రాధ బయటకు పచ్చి తలముడి విడిపోగా పెదవులు వణకగా కనులెర్రచేసి నిష్ఠురముగా అతనితో ఇట్లు పలికెను. ఓరీ! నీచుడా! తెలివిమాలినవాడా! లాలసునిబానిసా అన్ని విషయములు నీవెరుగుదువు. నేను నీ ప్రభువు తత్వమెరుగనా? అధముడా! శ్రీకృష్ణుడు నీకు ప్రభువు. మాకు కాదు. వెళ్లుము. తండ్రినీ పొగడుచు సదా తల్లిని నిందించుచుంటివి. ఎప్పుడును దేవతలను రాక్షసులు నిందించునట్లు నన్ను నిందించుచుంటివి. అందుకు నీవు రాక్షసుడవు కమ్ము. గోలోకము నుండి బయటకు వెళ్లి రాక్షస జన్మను పొందుము. నాచేత శపించబడిన నిన్ను ఎవడు రక్షించును? రాధాదేవి ఇట్లు పలికి మూర్ఛిల్లెను. ఆమె చెలికత్తెలు రత్నాల పిడులు గల వింజామరలు విసిరి ఆమెకు సేవలు చేసిరి.
శ్రీ దామోవాచ :
రాధాదేవి వచనములు విని శ్రీరాముడు పెదవులు వణకగా కోపముతో మనుష్య జన్మమెత్తుముని శపించెను.
శ్రీదాముడిట్లనెను :
సామాన్య మనుష్య స్త్రీకి వలె నీకు కోపమున్నది. కనుక నీవు భూమి మీద మనుష్య స్త్రీవగుదువు. పరశక్తి యొక్క కలంకపు నీడయో లేక అంశయో నీకు క్రోధావేశము కల్గించినది. భూమండలమున బృందావనములో శ్రీహరి అంశతో రాపాణుడను వైశ్యుడు ఉండును. అవివేకులు నిన్ను ఆ రాపాణుని భార్య వని చెప్పుకొందురు. మహాయోగియగు శ్రీహరి నీ శాపము వలన గోకులమున జన్మించును. నీవతనిని పొంది బృందావనమున విహరింతువు. నీవు వంద సంవత్సరములు శ్రీహరి వియోగముననుభవించి మరలనతనిని పొంది గోలోకమునకు వత్తువు. ఇట్లు పలికి ఆమెకు నమస్కరించి శ్రీహరి వద్దకు పోయి క్రమముగా శాపవృత్తాంతమంతయు చెప్పి నమస్కరించి మిక్కిలి ఏడ్చెను.
ఏడ్చుచున్న శ్రీరామునితో శ్రీహరి ఇట్లనెను. భూలోకమునకు పొమ్ము. ముల్లోకములందు ఓటమి లేని రాక్షసేంద్రుడవగుదువు. అంత్యకాలమున ఏబది యుగముల తర్వాత శంకరుని శూల ప్రహారముతో శరీరమును విడిచీ నా ఆశీస్సుల బలమున తిరిగి నా సన్నిధికి చేరుదువు.
శ్రీకృష్ణుని మాటలు విని శ్రీరాముడు దుఃఖముతో నన్ను నీభక్తిరహితునిగా ఎన్నడు చేయవు గదా అని స్వామికి నమస్కరించి ఆశ్రమము వదలి వెళ్లెను.
రాధాదేవియు కొడుకా ఎక్కడపోవుచుంటివని మిక్కిలి ఏడ్చుచు వెనుక వెళ్లెను. ప్రేమ విహ్వలుడు అగు శ్రీదాముడును ఆమెకు మొక్కి దుఃఖించెను. అతడే తులసీ భర్తయగు శంఖచూడుడుగా జన్మించెను.
శ్రీదాముడు వెళ్లిపోగా రాధాదేవి హారిసన్నిధిని చేరి సంఘటనను పూర్తిగా నివేదించెను. శోకముతో బాధపడు ప్రియురాలిని శ్రీహరి ఓదార్చి జ్ఞాన బోధగావించెను. శంఖచూడుడు శాపాంతమున మరల స్వామి సన్నిధిని పొందెను. వరాహకల్పమున శ్రీహరితో పాటు రాధాదేవి ధరణికి వచ్చి గోకులమున వృషభాసుని ఇంట జన్మనెత్తెను.
ఓ నారదా! అందరు కోరునట్టి మంగళకరమైన శ్రీకృష్ణ కథాసారము మొత్తము నీకిట్లు చెప్పితిని. ఇంకను ఏమి వినగోరుచున్నావో తెలుపుమనెను.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములో శ్రీకృష్ణజన్మఖండమున నరనారాయణ సంవాదమున సప్తసముద్ర జన్మము రాధాశ్రీదాముల శాపప్రకారము అను మూడవ అధ్యాయము.
