4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
62 - అధ్యాయము
మూ॥నారద ఉవాచ:
శ్రీనారాయణ ఉవాచ:
నారదుని వచనమిట్లా -బ్రహ్మన్ ! దశరథ రాముడు స్వయంగా ఏ విధంగా ఏ యుగంలో గౌతమ పత్నికి విముక్తి కల్గించాడు. (1) సుఖమునిచ్చే, మనోహరమైన రామావతారాన్ని గూర్చి క్లుప్లంగా ఓ మహాభాగ! నాకు చెప్పండి. నాకు వినటానికి కుతూహలంగా ఉంది. (2) శ్రీనారాయణుడిట్లా అన్నాడు - బ్రహ్మతో ప్రార్థింపబడి విష్ణువు దశరథుని వల్ల స్వయంగా జన్మించాడు. ఆనందంతో త్రేతాయుగమందు కౌసల్య యందు జన్మించాడు. (3) కైకేయి యందు భరతుడు జన్మించాడు. గుణంలో రామునితో సమానుడు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు సుమిత్రయందు జన్మించారు. గుణములకు సముద్రము వంటివారు. (4) విశ్వామిత్ర ప్రేషితుడై (పంపటం) లక్ష్మణునితో పాటు రాముడు సీతను గ్రహించటం కొరకు రమ్యమైన మిథిలకు వెళ్ళాడు. (5) దారిలో పాషాణ రూపంలో ఉన్న కామినిని, రాముడు చూచి, జగదీశ్వరుడు విశ్వామిత్రుని కారణమడిగాడు (పాషాణం కావడానికి) (6) రాముని మాటను విని మహాతపస్వియైన విశ్వామిత్రుడు ధర్మిష్ణుడు అప్పుడు రహస్యం అంతా చెప్పాడు. (7) కారణమును ఆతని ద్వారా విని భువనముల పవిత్రీకరించే రాముడు పాదాంగుళితో ఆమెను స్పృశించాడు. ఆమె పద్మంలా వికసించింది (స్త్రీ అయింది). (8) ఆమె రాముని ఆశీర్వదించి భర్భమందిరానికి వెళ్ళింది. గౌతముడు భార్యను పొంది రామునకు శుభాశీస్సులను ఇచ్చాడు. (9) ఆ రాముడు మిథిలకు వెళ్ళి శివధనుర్భంగం చేసి, సీతను వివాహమాడాడు, ఓ నారద! (10) ఆరాజేంద్రుడు వివాహమాడి పరశురాముని దర్పభంగంచేసి, వివాహోత్సవం వల్ల కల్గిన ఆనందం కలవాడై రమ్యమైన అయోధ్యకు వెళ్ళాడు. (11) సాదరంగా ఆహ్వానించి పుత్రుని రాజు (దశరథుడు) రాజునుగా (రాముని) చేయాలని తలచాడు. ఏడు తీర్థప్రదేశముల ఉదకం త్వరగా తెప్పించి, ముని పుంగవుల రప్పించి, (12) అధివాసము చేయించి శ్రీరాముని అన్ని మంగళములతో కూడిన వానిని చేశాడు.
(అధివాసం = రాజును చేయటానికి ముందు చేసే మంగళస్నాన ఉపవాసాదులు) భరతుని మాతయైన కైకేయి ఇది చూచి, శోకంతో తల్లడిల్లిపోయి (13) ఇదివరలో అంగీకరించిన వరములను ఇమ్మని రాజును కోరింది. రాముని వనవాసము,భరతునకు రాజత్వము అడిగింది. (14) ప్రేమ మోహితుడై రాజు వరములివ్వటానికి ఇష్టపడలేదు. బుద్దిమంతుడైన రాముడు ధర్మ సత్యముల భయముతో, రాజుతో ఇట్లన్నాడు.
మూ! శ్రీరామ ఉవాచ :
శూర్పణ ఖోవాచ:
శ్రీరామవచనమిట్లా :
నూరు తటాకముల దానంతో నరుడు ఏపుణ్యాన్ని పొందుతాడో, అంతకన్నా ఎక్కువ పుణ్యాన్ని వాపీదానం పొందుతాడు, నిశ్చయము. (16) పదిబావుల దానంతో వచ్చేపుణ్యం కన్న, ఎక్కువ పుణ్యమును కన్యాదానం వల్ల పొందుతాడు. (17) పందిమంది కన్యల దానంవల్ల వచ్చే పుణ్యముకన్న, ఎక్కువ పుణ్యాన్ని ఒక యజ్ఞం చేస్తే పొందుతాడు, ఓ రాజ! (18) పుణ్యంచేసిన జనుడు, నూరు యజ్ఞములవల్ల పొందే పుణ్యముకన్న, ఎక్కువ పుణ్యమును పుత్రుని ముఖదర్శనం వల్ల పొందుతాడు. (19) నూరుగురు పుత్రుల దర్శనం వల్ల కలిగే పుణ్యము ఎంతో, అంతటి పుణ్యమును, పుణ్యవంతుడు సత్యవాక్య పాలనవల్ల తప్పక పొందుతాడు. (20) సత్యముకన్న ఉత్తమ ధర్మంలేదు. అసత్యముకన్న పరమైన (అధికమైన) పాతకములేదు. గంగతో సమానమైన తీర్థములేదు.
కేశవుని కన్న పరుడైన దైవం లేడు. (21) ధర్మమును మించిన బంధువు లేడు. ధర్మమును మించిన ధనములేదు. ధర్మమునకన్న ప్రియమైనది ఇతరమేమున్నది. అందువల్ల నీధర్మాన్ని రక్షించుకో, ప్రయత్నించియైనా. (22) తనధర్మం రక్షింపబడితే, ఎప్పుడు అంతటా మంగళమే ఔతుంది, ఓ తండ్రిగారు! కీర్తికరము. మంచిప్రతిష్ఠ ప్రతాపము, పరముగా పూజించతగినది ధర్మము. (23) పదునాల్గు సంవత్సరాలు గృహసుఖాన్ని వదలి ధర్మంగా తిరుగుతూ, నీ సత్యమును పాలించే కొరకు వనవాసం చేస్తాను. (24) ఇష్టపూర్తిగా లేదా ఇష్టం లేకుండా గాని, సత్యం శపథం చేసి, పాలించనివానికి చచ్చేవరకు సూతకము. (25) సూర్యచంద్రులున్నంత వరకు ఆతడు కుంభీపాక నరకమందు వండబడుతాడు. ఆ రువాత మూగవాడు, ఆ పై నరుడు ఏడు జన్మలలో కుష్టురోగి ఔతాడు (26) అని పలికి శ్రీరాముడు నారచీరలు జడలు ధరించి, సీతలక్ష్మణులతో కలిసి, మహారణ్యమునకు వెళ్ళాడు. (27) ఓముని! పుత్రశోకంతో మహారాజు తన శరీరాన్ని వదిలాడు. తండ్రిగారి సత్యప్రతిజ్ఞను పాలించటానికి రాముడు అడవిలో తిరిగాడు. (28) ఒక సమయంలో రావణుని చెల్లెలు ఆమహారణ్యమందు, ఘోరమైన అడవియందు, చాలా ఉత్సాహంగా భర్తతో పాటు తిరుగుతూ (29) కామార్హురాలు, కులట ఐన ఆ రాక్షసి అప్పుడు రాముణ్ణి చూసింది. శరీరమంతా పులకాంకురములు గలదై కామంతో మూర్ఛపొందింది. (30) ఆకాముకి శ్రీరాముని దగ్గరకు వెళ్ళినవ్వుతూ ఇట్లా అంది. రాక్షసి 'ఎప్పుడూ మౌవనం గలది, మిక్కిలి పౌడ, కామంతో బాగా మదించి ఉంది. (31) శూర్పణఖ ఇట్లా అంది - ఓరామ, ఘనశ్యామ, రూపంగలవాడ, గుణవంతుడ, ఎవ్వరూలేని ఈచోట, భావంతో అనురక్తురాలనైన నన్ను స్వీకరించు (32) శూర్పణఖ వాక్యమును విని, ఆధార్మికుడు ధర్మాన్ని తలచి, శాపానికి భయపడి, తీయనిమాటన్నాడు. ఓ నారద!
మూII శ్రీరామ ఉవాచ:
లక్ష్మణ ఉవాచ:
శూర్పణఖోవాచ:
బ్రహ్మోవాచ:
అను! శ్రీరాముడిట్లన్నాడు: అంబ! మాత! నేను భార్యకలవాణ్ణి, భార్యలేని నా తమ్ముని దగ్గరకు వెళ్ళు. ప్రియుడు పరస్త్రీని పొందితే దుఃఖము కల్గుతుంది. ఇతరమైనది సుఖమునకు నిలయము (34) రాముని మాటను విని లక్ష్మణుని దగ్గరకు ఆనందంగా వెళ్ళింది. శాంతుడు, మనోహరమైనవాడు (కోరతగిన) మంచి లక్షణములుగల లక్ష్మణుని చూచింది. (35) ఓ మహాభాగ నన్ను పొందు అని మాటిమాటికి అన్నది. లక్ష్మణుడు ఆ మాటలు విని, కుతూహలముగా ఆమెతో అన్నాడు. (36) లక్ష్మణుడిట్లన్నాడు - ఓ మూఢురాల! సర్వేశుడైన రాముని వదిలి దాసుడనైన నన్ను కోరుతున్నావు. నాభార్య సీతకు దాసి, నేను సీతకు దాసుణ్ణి. (37) నాప్రభువైన రాముని చేరు. నీవు సీతకు సవతివికా, సీతకు ఏవిధముగా పుత్రునిగా ఉన్నానో అట్లా నీకు కూడా పుత్రుడినౌతాను ఓ సతి! (38) లక్ష్మణుని మాటలు విని కామంతో నిండిన మనసుగలదై, కంఠ, ఓష్ఠతాలు భాగములు ఎండిపోవుచుండగా ఆ మూఢురాలు లక్ష్మణునితో ఇట్లా అంది. (39) శూర్పణఖ ఇట్లా అంది - కామంవల్ల స్వయంగా వచ్చిన దానిని నన్ను వదిలితే ఓ మూడుడ! మీకు ఆపద సంభవిస్తుంది, అనుమానం లేము (40) బ్రహ్మమోహినిని వదిలి విశ్వమందాతడు అపూజ్యుడైనాడు. రంభాశాపంతో దక్షుడు మేకపోతు తలగలవాడైనాడు. (41) దేవవైద్యుడు ఊర్వశి శాపంతో యజ్ఞభాగం లేకుండా ఐనాడు. ఓ లక్ష్మణ! మేనకశాపంతో కుబేరుడు రూపం లేనివాడైనాడు. (42) కాముడు ఘృతాచీ శాపంతో శివుని వల్ల భస్మమైనాడు. బలి మదాలస శాపం వల్ల రాజ్యం పోగొట్టుకున్నాడు. (43) మిశ్రకేశి శాపంతో బృహస్పతి భార్యను పోగొట్టుకున్నాడు. నా శాపంతో రాముడుకూడా భార్యను పోగొట్టు (హరణం) కుంటాడు. (44) కామాతురాలు, యౌవనంలో ఉన్నది, భార్యగా స్వయంగా వచ్చింది అట్టి దానిని ధర్మభీతుడై విడిచి పెట్టరాదు, అని ఇదివరలో మాధ్యందిన శ్రుతిలో విన్నాము. (45) ఇక్కడ విడిచి పెట్టి ఆపదలకు లోనై పరంలో నరకం పొందుతాడు. శూర్పణఖ మాటను విని లక్ష్మణుడు, అర్ధచంద్రాకారం గల (46) కత్తి అంచుతో అవలీలగా ఆమె ముక్కును కోశాడు. ఆమె అన్న(లేదా తమ్ముడు) బలవంతుడైన ఖరదూషణుడు ఆతనితో యుద్ధం చేశాడు. (47) ససైన్యుడై లక్ష్మణుని అస్త్రంతో యమమందిరానికి వాడు వెళ్ళాడు. ఖరదూషణుని పదునాలుగు వేలమంది రాక్షసులను చంపాడు లక్ష్మణుడు. (48) చచ్చిన వారిని చూచి శూర్పణఖ రావణుని భయ పెట్టింది. అంతా చెప్పిఅప్పుడు పుష్కర తీర్థానికి వెళ్ళింది. (49) దుష్కరమైన తపస్సుచేసి బ్రహ్మవరాన్ని పొందింది. నిరాహారంగా తపస్సు చేస్తున్న ఆమెను ఆ విధంగా చూచి బ్రహ్మ ఆమెతో అన్నాడు. (50)ఓ నారద! సర్వజ్ఞుడు, కృపాసింధువు ఐన బ్రహ్మ ఆమె మనస్సును తెలుసుకొని (51) బ్రహ్మఇట్లన్నాడు : పొందశక్యం కాని రాముని పొందకపోయి, దుష్కరమైన తపస్సు చేస్తున్నావు. ధర్మలక్షణములు గల, జితేంద్రియులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుని పొందలేదు. బ్రహ్మ విష్ణు శివాదులకు ఈశ్వరుడు, ప్రకృతికన్న పరుడు (52) ఓ వరానన! నీవు మరో జన్మలో భర్తగా పొందుతావు ఆతనిని అని ఈ విధముగా పలికి బ్రహ్మ తన గృహమునకు ఆనందంగా వెళ్ళాడు. (53) ఆమె అగ్నిలో ప్రాణాన్ని వదిలింది. ఆమే మరోజన్మలో కుబ్జగా ఐనది. ఇక శూర్పణఖ వాక్యంతో కోపంతో శరీరం వణుకుతుండగా (54) మాయావియైన రాక్షసేశ్వరుడు (రావణుడు) మాయతో సీతను ఎత్తుకొనిపోయాడు. ఓముని! సీతకన్పించనందువల్ల రాముడు చాలా సేపు మూర్చనందాడు. (55) ఆధ్యాత్మికంగా, రాముని, లక్ష్మణుడు చైతన్యవంతుని చేశాడు. ఆ పిదప, గహనమైన పర్వతాలు, గుహలు, నదులు తిరిగారు.
హనుమానువాచ:
రాముడు, రాత్రింబగళ్ళు శోకంతో బాధపడుతూ, మునుల ఆశ్రమాలలో చాలానాళ్ళు వెతుకుతూ, ఓముని! విభువు సీతను చూడలేదు. (57)ప్రభువు రాముడు స్వయంగా సుగ్రీవునితో మైత్రి చేశాడు. బాణములతో అవలీలగా వాలిని చంపి రాజ్యమును సుగ్రీవునికిచ్చాడు (58) స్వీకరించిన దానిని పాలించేవాడు, మిత్రుడు, సుగ్రీవుడు ఆతనికి రాజ్యమిచ్చాడు. వానరేశ్వరుడు, అంతటా దూతలను పంపించాడు. (59) లక్ష్మణునితో పాటు శ్రీరాముడు సుగ్రీవ భవనంలో ఉన్నాడు. హనుమంతునకు, ఇష్టమైన, రమ్యమైన రత్నాంగుళీయకమును ఇచ్చి (60) ప్రాణములు ధరించుటకు ఉపకరించే శుభ సందేశమును, సీతకై (ఇవ్వమని చెప్పి) అందించి, ఉత్తమమైన దక్షిణ దిక్కుకై ఆతనిని బయలుదేరదీశాడు. (61) మిక్కిలి ప్రేమతో రాముడు కౌగిలించుకొన్నాడు. సుదుర్లభమైన పాదరేణువులను పొంది, హనుమంతుడు, సీతను అన్వేషించే కొరకు లంకకు బయలుదేరాడు. (62) రుద్రకళతో ఉద్భవించినవాడు, రామునితో సందేశాన్ని పొంది వెళ్ళాడు. శోకముతో కృశించిన సీతను అశోకవనంలో చూచాడు. (63) ఆహారం లేకుండా, మిక్కిలి కృశించిన ఆమెను అమావాస్య యందు చంద్రకళవలె ఉన్నదానిని చూచాడు. భక్తి పూర్వకంగా ఎప్పుడూ రామ! రామ! అని జపిస్తున్నది ఆమె. (64) వేడిచేసిన బంగారంలా ఉంది. జడల బరువును కలిగి ఉంది. రాత్రింబగళ్ళు శ్రీరాముని పాదాబ్జములను ధ్యానిస్తున్నది. (65) శుద్ధమైన పడకగలది సుశీల, సువ్రత, పతివ్రత ఆమె. మహాలక్ష్మి చిహ్నములు కలది, తన తేజస్సుతో వెలిగిపోతోంది. (66) సర్వతీర్ధములకు పుణ్యమును కల్గించేది, లోకపావని (పవిత్రం చేసేది) అట్టి సీతను చూచి, ఆమెకు నమస్కరించి ఏడుస్తున్న ఆతల్లిని చూచి వాయునందనుడు (67) ఆనందంతో ఆమెకు రాముని రత్నాంగుళీయకాన్నిచ్చాడు. ధర్మస్వరూపుడైన వాయునందనుడు ఆమెను చూచి ఏడ్చాడు. ఆమె చరణాంబుజములను పట్టుకొని, సీత బ్రతుకుటకు కారణమయ్యే రామసందేశమును చెప్పాడు. (68) హనుమంతుడిట్లన్నాడు - సముద్రపు అవతలి ఒడ్డులో లక్ష్మణునితో కూడి శ్రీరాముడు (యుద్ధ) సన్నద్ధుడై ఉన్నాడు. (69) బలవంతుడైన కపి, సుగ్రీవుడు రాముని మిత్రుడైనాడు. రాముడు వాలిని చంపి, శత్రువులు (ముళ్ళు) లేకుండా చేసి రాజ్యమును సుగ్రీవునికిచ్చాడు. (70) వాలిచే హరింపబడిన ఆతని భార్యను, మిత్రుడైన సుగ్రీవునికి తిరిగి ఇచ్చాడు. సుగ్రీవుడు ధర్మముగానే ఉద్గారమును(రక్షణకు) స్వీకరించాడు. (71) నిన్ను వెదికే కొరకు వానరులంతా వెళ్ళారు. రాముడు రాజీవలోచనుడు నా ద్వారా నీ మంగళవార్తను విని (72) గంభీరమైన సాగరమును బంధించి రాముడు త్వరలో వస్తాడు. పుత్రులు, బాంధవులతో కూడిన రావణుని పాపిని చంపి (73) ఓ తల్లి! త్వరలోనే నీకు విముక్తిని కల్గిస్తాడు. నీ అనుగ్రహంతో, ఈవేళ, రత్నమయమైన లంకను, అనుమానం లేకుండా (74) భస్మం చేస్తాను, ఓ తల్లి! నవ్వుతూ చూస్తుండు. ఓ సువ్రత! లంక ఆడకోతి పిల్లతో సమానంగా (చిన్నగా) కన్పిస్తోంది. (75) సముద్రము మూత్రంతో సమానంగా, భూమి మూకుడు అంతగా (చిన్నగా), అట్లాగే సైన్యముతో కూడిన రావణుడు చీమల గుంపువలె కన్పిస్తున్నారు. (76) అవలీలగా అర్ధముహూర్తంలో సంహరించటానికి నేను సమర్ధుణ్ణి. రామప్రతిజ్ఞను రక్షించే కొరకు ఇప్పుడు వారిని చంపటం లేదు. (77) ఓ మహాభాగిని! స్వస్థురాలవై ఉండు. ఓ నాఈశ్వరి! భయాన్ని వదలు. వానరుని మాటను విని, పెద్దగా మాటి మాటికి ఏడ్చింది. రామునియందుపతివ్రతయైన సీత భయపడి ఈమాట అన్నది.
మూII సీతోవాచ:
సీత ఇట్లా అంది - నన్ను గూర్చి దారుణమైన దుఃఖ సముద్రం నుండి (తేరుకొని) నా రాముడు బ్రతికున్నాడా (79) ప్రభువు కౌసల్యానందనుడు నానాథుడు క్షేమంగా ఉన్నాడా. జానకికి బ్రతుకుదెరువైన (బ్రతికించే) రాముడు కృశాంగుడు ఇప్పుడు ఎట్లున్నాడు. (80) నా ప్రాణాధికమైన ప్రియుడు ఏ ఆహారంతో ఉంటున్నాడు, ఏమి తింటున్నాడు. సముద్రమునకు అవతలి ఒడ్డున సీతాపతి స్వయంగా ఉన్నాడా? నిజమా? (81) నిజంగా ఆతడు సనదుడై ఉన్నాడా? ఆ ప్రభువు శోకంతో నాశం కాలేదా. స్వామికి దుః ఖరూపమైన, పాపినైన నన్ను స్మరిస్తున్నాడా (82) నా ఈశ్వరుడైన ఆతడు నా కొరకు ఎంత దుఃఖాన్ని పొందాడో, రతియందు వ్యవధానం (అడ్డంకిగా) కల్గిస్తుందని, ఇదివరలో కంఠంలో హారం వేసుకోలేదు. (83) ఇప్పుడేమో ఇద్దరి మధ్య శతయోజన విస్తీర్ణమైన సముద్రముంది. ప్రభువు, కరుణా సాగరుడు ఐన ఆ రాముని చూడగలనా. (84) కాంతుడు, శాంతుడు, ధర్మకర్మయందు మిక్కిలి ధర్మిష్ణుడు, అట్టి ప్రభువు పాదపద్మములందు తిరిగి నేను సేవను చేయగలనా. (85) పతి సేవ చేయని మూఢురాలి. జీవనము వృధా, ధర్మ(మునకు) పుత్రుడైన నా లక్ష్మణుడు నిజంగా జీవించి ఉన్నాడా? (86) నాకై దుఃఖసాగరమందు మునిగి, నేను లేనందువల్ల దర్పంభగ్నమై ఉన్నాడా. వీరులలో శ్రేష్ఠుడు, ధర్మ స్వరూపుడు, దేవకల్పుడు (సమానుడు) నా మరిది. (87) నా ప్రభువునకు తమ్ముడైన ఆతడు ఎల్లప్పుడు సన్నద్ధుడై ఉన్నాడా? నిజమా? ధర్మలక్షణములు కల ఆ లక్ష్మణుని, నిజంగా చూస్తానా? నాకు ప్రాణముల కన్న అధికుడు, ప్రేమచే ధన్యుడు, పుణ్య స్వరూపుడు ఆతనిని చూస్తానా? (88) అనే ఇట్లాంటి మాటలను విని శుభమైన ప్రత్యుత్తరమును ఇచ్చి, అవలీలగా లంకను భస్మంగా చేశాడు, ఓ ముని! (89) తిరిగి ఆమెను మేల్కొలిపి, కపి, వాయుసుతుడు, రాజీవలోచనుడున్న చోటికి (రాముని దగ్గరకు) అవలీలగా, వేగంగా వచ్చాడు. (90) తల్లియొక్క వృత్తాంతమంతా దానిని చెప్పాడు. సీతయొక్క మంగళ వృత్తాంతమును విని రాముడు దుఃఖించాడు. (91) లక్ష్మణుడు, గట్టిగా రోదించాడు. సుగ్రీవుడు కూడా దుఃఖించాడు. ఓ నారద! మహాబలపరాక్రమ వంతులైన వానరులు అంతా రోదించారు (92) సేతువును బంధించి రఘునందనుడు లంకకు వెళ్ళాడు సైన్యంతో కూడి, తమ్మునితో కూడి సన్నద్ధుడై త్వరగా వెళ్ళాడు, ఓ నారద! (93) యుద్ధంచేసి, బాంధవులతో కూడిన రావణుని చంపి, రాముడు, మంచి ముహూర్త మందు సీతకు విముక్తి కల్గించాడు, ఓ బ్రహ్మ! (94) సత్యపరాయణయైన సీతను పుష్పక విమానమందుంచి త్వరగా అయోధ్యకు వెళ్ళాడు. క్రీడకౌతుక మంగళములతో సంతోషంతో శోభనపు పెళ్ళికొడుకై (95) భగవంతుడు రాముడు, సీతను వక్షమందుంచుకొని క్రీడించాడు. ఆక్షణంలో రాముడు, సీత విరహజ్వాలను వదిలారు (ముక్తులైనారు) (96) పృథివీతలమందు రాముడు సప్తద్వీపములకు ఈశ్వరుడైనాడు. ఈ భూమి అంతా ఆధి వ్యాధులు లేకుండా అయినది. (ఆధి= మనోవ్యథ) (97) రామునకు పుత్రులుగా ధార్మికులు కుశుడు, లవుడు అని కలిగారు. వారి పుత్రులు పౌత్రులతో ఏర్పడిన రాజులుసూర్య వంశమందలి వారు (పుట్టిన) (98) అని ఓవత్స! నీకు శుభమైన శ్రీరామచరిత్రను చెప్పాను. ఈకథ సుఖమునిచ్చేది, మోక్షమునిచ్చేది, సారమైనది. సంసారసాగరమందు ఆవలి ఒడ్డుచేరుటకు నావవంటిది (99) అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు శ్రీరామచరితమనునది అరువది రెండవ అధ్యాయము సమాప్తము.
