4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
45 - శంకరవివాహము
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను :
తరువాత శంకరుడు వేదము విధించిన ప్రకారముగా అగ్నిని స్థాపించి తన వామ పార్వమున పార్వతిని కూర్చుండబెట్టుకొని వివాహాంగ హోమము చేసెను. శాస్త్రీయముగా ఆయజ్ఞకర్మ ముగిసిన పిదప పురోహిత బ్రాహ్మణునికి శివుడు సూరు బంగారు కాసులను దక్షిణగా ఇచ్చెను. ఓ బృందావన విహారము చేత వినోదించు రాధా! పర్వతరాజు యొక్క నగర స్త్రీలు మంగళహారతులు తెచ్చి మంగళ కార్యమును చేయించి (నాకబలీ) దంపతుల నింటిలో ప్రవేశ పెట్టిరి. దృష్టిదోషము పరిహరింపజేయు కర్మతో బాటు ప్రీతిగా జయధ్వనులు చేసి - చిరునవ్వుతో ఓర చూపులతో ఆనంద పారవశ్యమున శరీరములు పులకలెత్తగా స్త్రీగణము పార్వతీపరమేశ్వరులున్న లోపలి గృహమునకేగి రత్నాలంకార భూషితుడు రూపమును బట్టి అలంకారమును బట్టి ఆడ్యుడుగా నున్న శంకరుని దర్శించిరి.
ఆ శివుడు చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుల యొక్క గంధలేపనముతో చక్కని శరీరము గలవాడుగా, చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖముతో, కటాక్ష వీక్షణములతో మనోహరుడుగా, అపూర్వము సూక్ష్మమునగు వేషము గలవాడుగా, సిందూర బిందు తిలకముచేత అలంకృతుడుగా, సుందరమైన చంపక పుష్పము వంటి శరీర వర్ణము గలవాడుగా, సర్వాయవములు సుందరముగా, క్రొత్తగా అడుగుపెట్టిన పడుచుదనము గలవాడై మునీంద్రుల మనస్సులనే మోహింపజేయువాడుగా ఉండెను.
పరమేశ్వరుడు పరిచారకులు చేర్చిన రత్నాసనము మీద (పార్వతీసమేతుడై కూర్చుండి యుండగా - పదహారుగురు పతివ్రతలు సరస్వతి లక్ష్మీ సావిత్రి జాహ్నవీ (గంగ) రతి అదితి శచి లోపాముద్ర అరుంధతి అహల్య తులసి స్వాహాదేవి (అగ్నిభార్య) రోహిణీ భూదేవి శతరూప (స్వాయంభువ మనువు భార్య) సంజ్ఞాదేవి (సూర్యునీ భార్య) దేవకన్యలు నాగకన్యలు మునీకన్యలు లెక్క పెట్టసాధ్యముగానంతమంది స్త్రీలు అక్కడ చేరి ఆ దంపతులను సేవించుచుండిరి.
అప్పుడు వరుసగా ఆ దేవీగణము అమృతము వంటి మధురవాక్కులను పరమేశ్వరుని గురించి పలికిరి.
సరస్వత్యువాచ - సరస్వతి అనెను :
ఓ మహాదేవా! నీకు ప్రాణములకంటే అధికురాలైన సతీదేవిని పొందితివి. చంద్రుని వంటి కాంతిగల ప్రియురాలి ముఖమును సంతోషముతో చూచి ఇంతవరకున్న సంతాపమును త్యజించుము. ఓ కాముకుడా! కాలనాథా!. ఆమే ఆలింగనముతో కూడి సదా కాలము గడుపుము. నా ఆశీస్సు వలన సర్వకాలమీక ఆమె ఎడబాటు నీకుండదు.
లక్ష్మీరువాచ - లక్ష్మి పలికెను :
ఓ దేవేశా! ఏ సతి లేకుండ నీ ప్రాణములు పోవునో అట్టి ఈమెను లబ్ధ విడిచి నీ కౌగిట చేర్చుకొని ఉండుము. ఇప్పుడు సిగ్గెందుకు?
సావిత్ర్యువాచ - సావిత్రీదేవి అనెను :
ఓ శంభూ! ఇక భేదము పొందకుము. సత్పదార్ధమును సతిచేత తినిపించి నీవును త్వరగా భుజింపుము. తరువాత ఆచమనము చేసి ఆదరముగా ఆమెకు కర్పూరముతో కూడిన తాంబూలమునిమ్ము.
జాహ్నవ్యువాచ - జాహ్నవి ఇట్లనెను :
బంగారు దువ్వెన తీసికొని నీ భార్యయొక్క తలవెండ్రుకలను దువ్వుము. భర్తను ప్రేమించు స్త్రీకి ఇంతకు మించి స్వామి సౌభాగ్య సుఖమేమియుండును?
రతిరువాచ - రతి (మన్మథుని భార్య) ఇట్లు పలికెను :
దేవా! మిక్కిలి దుర్లభురాలును సుందరియునైన పార్వతిని నీవు గ్రహించి - స్వార్ధము లేని నా ప్రాణనాథుని నీవెట్లు భస్మము చేసితివి? ప్రభూ! నీ యందు మన్మథుని అతని వ్యాపారమును {కామము కల్గించుట) జీవింప జేసికొంటివి. వియోగ మూలమైన నా సంతాపమును కూడ దూరమొనర్చుము. ఓ దయానిధీ! దంపతుల యొక్క వియోగ బాధ ఎట్టిదో అదంతయు తెలిసికూడ నా ప్రియుని కోపించి భస్మము చేసితివి. ఇట్లు పలికి ఆమె ముడిలో బంధించి యుంచిన మన్మథుని భస్మమును శంకరుని ముందుంచి నాథా నాథా! అని పలుకుచు బిగ్గరగా రోదించెను. దయాసముద్రుడైన శ్రీహరి ఆ రోదన ధ్వనివిని నూతన దంపతుల నివాసగృహములోని శివుని వద్దకేగెను. బ్రహ్మయు ధర్మాది దేవతలును అక్కడికి వచ్చిరి.
శంకరుడు నారాయణుని బ్రహ్మను ధర్మాది దేవతలను చూచి వేగముగా పీఠము మీది నుండి లేచి “మీ ఆజ్ఞ ఏదియో సెలవీయండి” అని పలికెను. అతని మాట విని హరి “ఓ రుద్రా! కాముని బ్రతికించుము” అని పలికి బయటికి పోయెను. అక్కడ కొలువుదీరియున్న దేవీ గణము (సరస్వతి మొదలైనవారు) వినయపూర్వకముగా అనేక విధములుగా అదే ప్రార్థన చేసిరి. అప్పుడు శంకరుని యొక్క కృపా దృష్టితో భస్మము నుండి మన్మథుడు బయటకు వచ్చెను.
అదే పూర్వ సౌందర్యముతో ఆకారముతో చిరునవ్వుతో ధనుర్బాణములతో నున్న కాముని చూచి రతి మహేశ్వరునికి నమస్కరించెను. మన్మథుడు ఆగము ప్రకారము. శంకరునికి నమస్కరించి స్తుతి చేసి బయటికి వెళ్లి హరికి దేవతలకు నమస్కరించి పలుకరించెను. దేవతలు మన్మథునితో మాట్లాడి ఆశీర్వదించిరి. ఒకప్పుడు వినాశము కల్గించుట మరొక కాలములో రక్షించుట, నిషేధించుట అన్నది గొప్ప వారి వలన జరుగుచుండును. దానిని నివారించుట ఎవనికి సాధ్యము?
ఆ తర్వాత హిమవంతుడు నారాయణుడు మొదలగు దేవతాదులనందరిని భుజింపజేసి భక్తి ప్రయత్నములతో విశ్రమింపజేసెను. శంకరుడు తన నివాస గృహములో పార్వతిని వామపార్శ్వమున ఉంచుకొని ఆమెతో కలిసి భుజించెను. భుజించిన తరువాత దేవతల - తల్లియగు అదితి చిరునవ్వుతో సరసమైన మాట ఇట్లు పలికెను.
అదితి రువాచ - ఆదితి పలికెను :
ఓ శచీదేవీ! భోజనము తరువాత నా ప్రీతిననుసరించి శంకరునికి ముఖము హస్తము పాదముల శుద్ధి కొరకు దంపతులిద్దరికి ప్రీతిపూర్వకముగా జలము పోయుము. శచ్యువాచ - శచీదేవి ఇట్లనెను :
ఏ కారణము వలన మోహము పొంది (అజ్ఞానము) మీక్కిలి ఏడ్చి తన వక్షఃస్థలమున శవమును పెట్టుకొని భూమియంతట తిరిగెనో అట్టి శంకరుడు కాలముననుసరించి తిరిగి ఆమెను పొందినాడు.
అరుంధత్యువాచ - అరుంధతి పలికెను :
నీకీకన్యనిచ్చుటకు మేనాదేవి ఇష్టపడలేదు. ఆమెకనేక విషయములు బోధించి నీకీ పార్వతినిచ్చితిని. నీవీమెతో సుఖమనుభవించుట తగును.
అహల్యోవాచ - అహల్య వలికెను :
ఓ పరమేశ్వరా! సనాతనుడవైన నీవు నీ వృద్ధ దశను వదిలి ఇప్పుడు మిక్కిలి తరుణుడవు (పడచువాడవు) గా నుంటివి. ఆకారణము చేత మేన నీకు తన కూతురునిచ్చుటకిష్టపడినది.
తులస్యువాచ - తులసి పలికెను :
పూర్వము నీచే సతి త్యజింపబడెను. మన్మథుడు దహింపబడెను. ప్రభూ! ఇప్పుడు వసిష్ఠునేందుకు పర్వతుని వద్దకు పంపితివీ?
స్వాహోవాచ - స్వాహాదేవి పలికెను :
ఓ మహాదేవా! ఇప్పుడు స్త్రీల మాటయందు స్థిరమైన పొడవు కమ్ము. వివాహమునకు వ్యవహారమునకు ముందు స్త్రీలలో మాటకారి తనముండును. (వ్యవహార ప్రసంగములో స్త్రీలు నేర్పరులు).
రోహిణ్యువాచ - రోహిణి (చంద్రుని భార్య) పలికెను :
కామశాస్త్రమందు నేర్పుగలపోడా! పార్వతి యొక్క కోరికను నిండుగా నెరవేర్చుము. స్వయముగా నీవు కోరిక కలవాడవే. కాముకులను కామ సముద్రము నుండి ఒడ్డునకు చేర్చుము.
వసుంధరోవాచ - భూదేవి పలికెను :
ఓ శంభూ! అకలి గొన్నవాడు, భోగాపేక్ష కలవాడు భోగపదార్ధము లేకుండ తృప్తిపొందజాలడు. ఏ ద్రవ్యముచేత (భోగపదార్థము చేత) సంతుష్టీకలుగునో దానిని స్త్రీ ఆచరించవలెను (పురుషుడు స్త్రీకి కూడ అట్టిది సమకూర్చవలెననియు భావము).
సంజ్ఞోవాచ - సంజ్ఞాదేవి అనెను :
ఓ సర్వజ్ఞుడా! కామార్తలైన స్త్రీల భావము నీకు తెలియును. తన వద్దకు చేరిన తన భర్త యొక్క భావము స్త్రీ ఎరుగజాలదు.
శతరూపోవాచ - శతరూపాదేవి పలికెను :
ఏకాంత ప్రదేశములో రత్నదీపము తాంబూలము శయ్యను ఏర్పాటు చేసి ప్రేమతో త్వరగా పార్వతీ శంకరులనక్కడికి పంపుడు.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు (రాధతో) పలికెను :
స్త్రీల యొక్క అట్టి మాటలు విని ఎట్టి వికారము పొందనివాడును యోగీంద్రులకు పరమగురువును భగవంతుడును ఐన శివుడిట్లనెను.
శంకర ఉవాచ - శంకరుడనెను :
దేవులారా! నా వద్దనిటువంటి వచనములను పలుకవద్దు. మీరు జగములకు తల్లులు. సాధ్వీమణులు. కుమారుని యందు ఇటువంటి చాపల్యమెందుకు ప్రకటింతురు.
శివుని మాటవిని సిగ్గుపడిన దేవతాస్త్రీలు ఆశ్చర్యముతో వర్ణ చిత్రములోని బొమ్మల వలె మాటాడకుండ మౌనము పూరి.
రుచిగల భోజనమును భుజించిన శివుడాచమనము చేసి భార్యతో కలిసి కర్పూర తాంబూలమును స్వీకరించెను. మేనాదేవి సమకూర్చిన అందమైన రత్న సింహాసనము మీద కూర్చుండి తన విడిదిల్లును (వాస గృహము) చూచెను. వందల రత్నదీపముల కాంతితో ప్రకాశించుచు ఆ భవనము శోభావైభవము కలదై ఉండెను. రత్నపాత్రలతో రత్నకుంభములతో నిండి ముత్యాలు పగడాలతో అలంకరింపబడిన నానావిధ వర్ణచిత్రములు కలదై - శ్రేష్ఠమైన వజ్రములతో నిర్మింపబడి వాటి నడుమ రత్నములు పొదుగబడి ఆ భవనము దాని పరిసరములు ఒకచోట బృందావనము ఇంకొకచోట కుంజవనము మరియొక చోట రాసమండలము ఒకవైపున కైలాసము మరొక వైపున స్వర్గము - ఇట్లు బహా విశేషములతో ఆశ్చర్యకరమైన దానిని చూచి మహాదేవుడు మిక్కిలి సంతోషము పొందెను.
ఓ ప్రాణప్రియరాధికా! అంతలో తెల్లవారెను. జనులు నానావిధ వాద్యములను మ్రోగించరీ. దేవతలందరు లేచి సంభ్రమముతో అలంకరించుకొని తమ తమ వాహనము లెక్కి కైలాసమునకేగుటకు సిద్ధపడిరి. సారాయణుని ఆజ్ఞననుసరించి ధర్ముడు శివుని వాసగృహములోనికి పోయి యోగీశ్వరుడైన శివునితో సమయోచితముగా పలికెను.
ధర్మ ఉవాచ - ధర్మడిట్లనెను :
“ఓ ప్రమథగణనాథా! మేల్కొనుము. నీకు మంగళమగుగాక. హరిని స్మరించుచు పార్వతితో కలిసి మహేంద్ర గిరికి యాత్ర చేయుము” అన్న ధర్మదేవుని వాక్యము విని శంకరుడు పార్వతితో ప్రయాణము చేయుచుండగా మేనాదేవి పెద్దగా దుఃఖించి ఆ దయానిధీతో ఇట్లు పలికెను.
మేనోవాచ - మేనాదేవి పలికెను :
ఓ దయానిధీ! దయతో నాబిడ్డను పరిపాలించుము. భగవంతుడవగు నీవు శీఘ్రముగా సంతోషపడువాడవు కనుక సహస్ర దోషములను క్షమించుము, నా బిడ్డ జన్మ జన్మల నుండి నీ పాదపద్మ భక్తురాలు. ఈమెకు కలలో గాని మెలకువలో గానీ ప్రభువైన మహాదేవుని (నిన్ను) తప్ప ఇతరము పై తలంపులేదు. నీ భక్తిని గూర్చి విసగనే ఆనందాశ్రువులు పులకరింత కలుగును. ఓ మృత్యుంజయా! నీ నింద విన్నచో మరణించిన దానివలె మౌనముగా ఉండును. ఇట్లు మేనక పలికెను. వెంటనే హిమవంతుడక్కడికి వచ్చి బిడ్డను కౌగిలించుకొని పెద్దగా రోదించెను. “ఈ హిమాలయమును శూన్యముగా చేసి ఎక్కడికేగుచున్నావు బిడ్డా! నీ సద్గుణములను తలచుకొన్న నా గుండె పగిలిపోవును” ఇట్లు పలుకుచు పర్వతుడు ఆ శివను శివుని కర్చించి కొడుకులతో బాటు మాటిమాటికి రోదించెను. అప్పుడు దయాళువు, భగవంతుడును ఐన నారాయణుడు అందరికి అధ్యాత్మ విద్యను బోధించి (దుఃఖము తగ్గుటకు) దయచూపెను.
పార్వతీదేవి భక్తితో తల్లిదండ్రులకు గురువునకు నమస్కరించి - ఆ మహామాయ మాయాశక్తి వలన మరల మరల పెద్దగా రోదించెను. ఆమె రోదనము వలన అక్కడి స్త్రీలందరు రోదించిరి. మునులు దేవతలు తమ భార్యలతో గణములతో పాటు మానససర స్తీరమున విశ్రమించెడి పరమేశ్వరుని యొక్క కైలాసమునకు ప్రయాణమై ఒక ముహర్తార్తము యొక్క అర్థకాలములోనే శంకరాలయమును సంతసముతో చేరిరి.
పిదప మేనాహిమవంతులు మైనాకుని పిలిచి “కుమారా! పార్వతీ శంకరులను త్వరగా వెంటబెట్టుకొని రమ్ము. నీకు మంగళమగుగాక” అనిరి. ఆ దంపతుల మాట విని అతడు త్వరగా కైలాసమునకు పోయి పార్వతీ పరమేశ్వరులను తోడ్కొని వచ్చెను. పార్వతి భర్త గృహము నుండి వచ్చినదన్న వార్త విని బాలురు బాలికలు యు చేతులు వృద్ధ స్త్రీలు ఆయా పర్వత రూపిణులు వేడుకతో పరుగెత్తి వచ్చిరి. మేనాదేవి కూడ ఇద్దరు కొడుకులతో కోడలితో బాటు నవ్వుచు పరుగెత్తి వచ్చాను. హిమవంతుడు కూడ సంతోషించి బిడ్డ వద్దకు వారిననుసరించి పరిగెత్తాను. రథము నుండి పార్వతీదేవి దిగి తలిదండ్రులకు గురువుకు మిక్కిలి సంతసముతో నమస్కరించి ఆనంద సముద్రములో మునిగెను.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన శంకర వివాహమను పేరు గల నలుబది ఐదవ అధ్యాయము సమాప్తము.
