4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

39 - హరనిర్మాల్య శాప ప్రసంగము

హిమవంతుడిట్లు స్తుతించి కూర్చుండియున్న శంకరుని ఆజ్ఞను పొంది ముందర దూరముగా అందరీ సమ్మతి పొంది నిలిచియుండెను. అట్లే పరమేశ్వరునకు భక్తితో మధుపర్కాది పరిచర్యలు చేసిను. తరువాత శంకరునీ సహచరులను, మునులనందరిని భక్తితో పూజించెను.

అప్పుడక్కడికి హిమవంతుని భార్యయైన మేనకాదేవి స్త్రీ గణములతో వచ్చి శిరస్సున చంద్రుని ధరించి వటవృక్షము యొక్క మూలమందున్న శంకరుని దర్శించెను.

పులిచర్మమందు మునిగణముల నడుమ కూర్చుండి బ్రహ్మతేజస్సుతో వెలుగుచు చిరునవ్వు గల ముఖముతో శివుడు తారల నడుము ఆకాశములో చంద్రుని వలె విరాజిల్లుచుండెను. అతని రూపము కోటి మన్మధులతో సమానముగా మిక్కిలి ఆహ్లాదము కళించుచుండెను. అతి పురాతనమైన శరీరమందలి ముసలితనమును వదిలి పెట్టి నవ వనమును ధరించి మిక్కిలి సౌందర్యముతో స్త్రీల మనస్సులనతడు హరించుచుండెను. కామ పడితలైన స్త్రీలకు మన్మధుడుగా సతీజనమునకు పుత్రుడుగా విష్ణుభక్తులకు మహావిష్ణువుగా శివ భక్తులకు సదాశివునిగా శక్తి భక్తులకు శక్తి స్వరూపముగా సూర్యభక్తులకు సూర్యునిగా దుష్టులకు కాలస్వరూపుడుగా శిష్టులకు పాలకుడుగా ఆ శివుడుండెను. మృత్యువుకు మృత్యువుగా యమునికి యమునిగా భయానకముగా నుండెను. పులితోలే సుందర వస్త్రము, భస్మమే చందనము, సర్పములే సుందరములైన పుష్పమాలలు, కంఠమందలి విషపు కాంతియే కస్తూరి, జడల సమూహమే సుందరమైన కొప్పు (శిఖ) చంద్రుడే నుదుటి యందలీ చందన తిలకము మనోహరమైన గంగాధారయే అందమైన మాలతీ పుష్పమాల అస్థిమాల (ఎముకల దండ)యే రత్నమాల, ఉమ్మెత్త పువ్వే ధరించిన సంపెంగ పువ్వు, ఇట్లతని సామగ్రియే అలంకారముగా నుండెను. పంచముఖము లొకటియే పద్మముల వంటి నేత్ర యుగ్మముతో శోభించుచు శరత్పూర్ణిమనాటి చంద్రుని కాంతి వంటి ఉత్తము కాంతిలో పరిసరములను ఆచ్ఛాదించుచుండెను (వస్త్రము కప్పినట్లు కాంతి వ్యాపించెను). మంకెన పువ్వును (ఎర్రని వన్నె గల ఒక జాతి పుష్పము) తిరస్కరించునట్టి అందమైన క్రింది పెదవి గల శివుడు తెల్లని చంద్రుడే నంది వాహనముగా భూత గణములే నర్తకుల వలె ఇట్లు మహేశ్వరుని యొక్క సర్వము ఒకదానికొకటిగా ఉన్న శివరూపమును మేనాదేవీ చూచి సంతుష్టురాలయ్యెను.

మేనాదేవి వెంట వచ్చిన స్త్రీలలో కొందరు శివుని జూచి కనురెప్పపాటు లేక కామముతో శరీరమున పులకలేర్పడగా మిక్కిలి కామ పీడితలైరి. మరికొందరాదశలో మూర్చపోయిరి. కొందరు తమ భర్తలను నిందించి మహేశ్వరుని ప్రశంసించిరి. మరికొందరు కోరిక బలమై స్వామిని మనస్సులో కౌగిలించుకొనిరి. కొందరు కామసాగరమున నున్న మేము మా కామమును స్థిరము చేసికొందుమని సంతోష కామములతో మానసికముగా శివుని చుంబించుచుండిరి. (ముద్దులు పెట్టుకొనుట) “మాకీటువంటి భర్తయున్నచో పరమందు కీర్తి లభించెడిది. ఈ లోకమున నుండి ఇక ముందేమీ చేయవలెను. మా భర్తలలో సంసారమిక చాలును” అనీ పరమేశ్వరుని చూచి చూచి కొందరు పల్కుచుండిరి. మరికొందరు స్త్రీలు శివుని జూచి వస్త్రమును కొద్దిగా ముఖము పై కప్పుకొన్నట్లు లాగి చిరునవ్వుతో వంకర చూపులతో మరల మరల చూచుచుండిరి. “మేము గృహములకు పోము. శివుని సన్నిధికే పోదుము. రాత్రింబగళ్లు ముదముతో మాటి మాటికి అమృత కిరణములు గల చంద్రుని వంటి ఈ ముఖమునే దర్శింతుము. భర్తలతో కాపురములు చేయము. మాకు శివుడే భర్తయగు గాక అగ్నిలో ప్రవేశింతుము” అని కొందరు పల్కుచుండిరి. “భారతఖండమున జన్మించిన దుర్గాదేవి పుణ్యవతిగా ప్రశంసలందుచున్నది. ఈ స్వామీ ఆమెకు భర్తకదా” అని కొందరు పల్కుచుండిరి.

ముదముగా ఇట్లు శివుని దర్శించి మేసాదేవి ఆ స్త్రీలతో బాటు ఇంటికి పోయెను. శైలేంద్రుడు కూడ శివుని పూజించి నమస్కరించి స్వగృహమున కేగెను. అతడింటిలో రహస్యముగా భార్యతో విచారించి మంగళము కొరకు పార్వతిని శివుని సన్నిధికి పంపెను. పార్వతియు మనోహరమైన వేషము ధరించి తన మనస్సులో మిక్కిలి అనురక్తి గలిగియున్నందున చెలికత్తెలతో పాటు సంతోషముగా శివ సన్నిధికేగెను.

ప్రసన్న వదనముతో శాంత దృష్టితో నున్న శాంత స్వరూపుడైన శివుని పార్వతి దర్శించి ఏడు ప్రదక్షిణలు చేసి చిరునవ్వుతో నమస్కరించెను. “నీ యందు తప్ప ఇతరత్ర భావము చలించనివాడును గుణవంతుడు తనవంటి వాడింకొకడు లేనివాడును జ్ఞానులలో శ్రేష్ఠుడును సుందరుడునైన భర్తను పొందుదువు గాక సుందరీ!” అని శివుడాశీర్వదించెను. “ఓ శుభురాలా! భర్తయందు నీ సౌభాగ్య మెడతెగక ఉండగలదు. సాధ్వీ! గుణములలో నారాయణునితో సమానుడైన పుత్రుడు నీకు కలుగును. ఓ జగదంబా! నీకు ముల్లోకములందు అధికమైన పూజ జరుగ గలదు. అన్నీ బ్రహ్మాండములలో అందరికి నీవు శ్రేష్ఠురాలవగుదువు గాక. నీవు సషప్రదక్షిణలు చేసి నాకు భక్తితో నమస్కరించితివి కనుక సప్త జన్మలందు నేను సంతుష్టుడనైతిని. సుందరీ! ఆ సత్ఫలితమును పొందుము. ఒక పుణ్యతీర్ధమునందు భర్తయందు ఇష్టదైవమునందు గురువు నందు మంత్రము నందు అట్లే ఓషధి యందు ఏ స్త్రీలకెంతటి పూనిక విశ్వాసములుండునో ఆ స్త్రీలకటువంటి సిద్ధియే లభించును” అని శంకరుడు పలికి ఆ యోగీశుడు వ్యాఘ్ర చర్మము మీద యోగాసనముతో కూర్చుండి పరం బ్రహ్మ జ్యోతి స్వరూపుడైన నన్ను ధ్యానించుచుండెను.

పార్వతీదేవి శివుని పాదములు కడిగి ఆ పాదోదకమును పానము చేసెను. అగ్నివలె పరిశుద్ధమైన వస్త్రముతో ఆ ప్రదేశమునూడ్చీ శుభ్రపరచి విశ్వకర్మాదులచేత నిర్మించబడిన రత్నసింహాసనము నుంచి కంచుపాత్రలోని అపూర్వ నైవేద్యమును సమర్పించెను. మందాకినీ జలమును హస్త పాదములు. కడుగుటకల్పించేను. కస్తూరి కుంకుమ పువ్వుతో కూడిన సుగంధము గల చందనమును విషచ్ఛాయతో సుందరముగా కన్పించు శివుని కంఠమున మాలతీ పుష్పమాలను సమర్పించెను. తన సంతోషము కొరకు భక్తితో పుష్పములు చల్లుచు పూజించేను. బంగారు పాత్రయందున్న అమృతమును మధురమైన తేనెను సమర్పించెను. అంతటను మంచిగా తీర్చిన ఆకారము గల రత్నములు పొదిగిన నూరు దీపములు వెలుగు హారతినిచ్చెను. ముల్లోకములందెక్కడ లభించని మంచి వస్త్రమును బంగారు యజ్ఞోపవీత మును చల్లగా సువాసనతో కూడియున్న జలమును త్రాగుటకు సమర్పించేను. రత్నాభరణములను బంగారు కొమ్ములు గల కామధేనువును, అవసరమైనప్పుడు పుణ్యనదీ జలమును స్నానమునకని సమకూర్చెను. ఇం పైన తాంబూలము నర్పించెను. ఇట్లు పార్వతీదేవి ప్రతిదినము షోడశోపచారములతో ఆ శివుని పూజించి భక్తితో మరల మరల నమస్కరించి పితృ గృహమున కేగెను.

సురనాయకుడైన ఇంద్రుడు అప్సరసల మాటల వలన పార్వతీదేవి పరమేశ్వరుని వద్ద ఉన్న వార్త వినగనే హర్షముతో నర్తించెను. త్వరపడి దూత ద్వారా కామదేవుని తన వద్దకు రప్పించెను. ఇంద్రుని ఆజ్ఞననుసరించి కామదేవుడు అమరావతికి పోయెను. ఇంద్రుడతనిని త్వరగా పార్వతీ పరమేశ్వరులున్న చోటికీ పంపెను. మన్మధుడు యువతీ యువకుల మీద ప్రయోగించి వ్యామోహము కల్గించు ఐదు సాయకములు (బాణములు) తీసుకొని ప్రసన్నవదనుడు అణిమాద్య స్టైశ్వరములు గలవాడు ఐన శివుడు పార్వతితో కూడియున్న స్థలమునకు పోయెను. పోయి శాంతుడును త్రైలోక్య జనమునకు మనోహరుడును పార్వతితో గూడి ప్రసన్న ముఖ నేత్రములు గలవాడై యున్న విభుని శివుని దర్శించేను.

మన్మథుడు ధనుర్బాణములను పట్టుకొని ఆకాశమున నిలిచి నివారింప శక్యము గానిది ఎక్కడ ఎప్పుడును వ్యర్థము గానిదైన అస్త్రమును మోదముతో శంకరునీ మీద విసిరెను(ప్రయోగించెను). ఆకాశము నందు వలె నిర్లిపుడైన ఆ పరమాత్మ యందు మన్మథుని అమోఘస్త్రము మోఘ (దెబ్బతిని వ్యర్థమైనది) మయ్యెను. తన శస్త్రమట్లు వ్యర్ధమై పోగా మన్మధుడు భయము పొందెను. ఆ మృత్యుంజయ విభుని జూచి అతని యెదుట నిలిచి గడ గడ వణకెను. భయముతో మనస్సు చెదరి ఇంద్రాది దేవతలను స్మరించెను.

దేవతలందరక్కడకు వచ్చి ఈ శివుని కోపమును చూచి వణికిపోయి సర్వదేవనాధుడగు శంకరుని స్తోత్రముతో స్తుతించిరి. అతని ఫాలలోచనమునుండి కోపాగ్ని బయటీకీ వెడల గ్రక్కబడుచుండెను. దేవతలు స్తుతించుచుండగ శంభుని నుండి ఉత్పత్తియైన ఆ యగ్ని, పైకి జ్వాలలు ఎగియగా మండుచు ప్రళయకాలమందలి అగ్నివలె వెలుగుచుండెను. ఒక్క సారి పైకెగిరి ఆకాశమున సుడులు తిరుగుచు ఆ అగ్నినేల మీద పడెను. భూమి యంతట జ్వాలలు సుడులు తిరుగుచు పోయి మన్మథుని మీద పడెను. హరుని కోపము వలన మన్మథుడు క్షణములో భస్మమై పోయెను. దేవతలందరు విషాదము పొందిరి. పార్వతి దేవి విచారముతో తలవంచుకొనెను. మన్మధుని భార్యయైన రతీదేవీ హరుని ముందర అనేక విధముల దుఃఖించెను. సర్వదేవతలు భయకంపితులై చంద్రశేఖరుని స్తుతించిరి. రతీదేవికి వచ్చిన ఆపదకు దేవతలు మాటి మాటికి రోదించి రతీతో ఇట్లనిరి. “అమ్మా! నీ భర్త భస్మమును కొద్దిగా తీసుకొని దానిని రక్షించుము, భయము త్యజింపుము. నీ భర్తను మేము బ్రదికింపగలము మరల నీ ప్రియుని పొందగలవు. హరుని కోపము తొలగిపోయి ప్రశాంతమైన కాలమేర్పడును. ఆనాడు నీ భర్త జీవించును” అనిరి. రతీదేవి దుఃఖమును చూచి పార్వతీ మూర్చపొందెను. జ్ఞానేంద్రియములకు అందని గుణత్రయ రహితుడైన పరమశివునామె స్తోత్రమొనర్చిను.

రోదించుచున్న పార్వతిని వదిలి వేసి శివుడు తన స్థానమునకేగెను. అక్కడ పార్వతికి వెంటనే చర్చ (గర్వము) భంగమాయెను. రూప వనముల మూలమున తనకు గల్గిన గర్వమును ఆ శైలరాజకన్య త్యజించెను. సఖీ గణమునకు ముఖము చూపుట కామె సిగ్గిల్లెను. రతి దుఃఖము వలన కలత భయములను పొందిన దేవతలు రుద్రునకు దండవత్రణామములు (సాష్టాంగ నమస్కారములు) చేసి రతీదేవి నోదార్చి తమ తమ మందిరములకేగిరి. మన్మథుని భార్య పొంగి వచ్చు శోకముతో రోదించి భయముతో శివుని స్తుతించి కోపము చేత కనులెర్ర చేసిన రుద్రుని చూచి తన గృహమున కేగెను.

పార్వతి సిగ్గుతో తండ్రి గృహమునకు పోలేదు. ఆమె చెలులు ఎంతగా వారించినను తపస్సు కొరకు వనమునకేగెను. అందుకు శోకము వలన మనస్సు కలత పడిన సహచారిణులు ఆమె వెనుకనే పోయిరి. తల్లులు వారించినను ఆగక పార్వతి ఆకాశగంగానదీ తీరవనమున కేగెను. సుదీర్ఘ కాలమామె మహాతపస్సు చేసి ఆ పరమేశ్వరుని భర్తగా పొందెను. శంకరుని అనుగ్రహ వరము వలన రతీదేవియు మన్మథుని తిరిగి పొందాను. రాధా! రహస్య చరిత్రమైన పార్వతీ గర్వ మోక్షణమును మొత్తము చెప్పితిని. తిరిగి ఇంకేమీ వినగోరుచున్నావు అని శ్రీకృష్ణుడు చెప్పెను.

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన ముప్పది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.