4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

52 - రాధామాధవుల రాసవర్ణనము

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు (రాధాదేవితో) పలికెను :

అందరి యొక్క దర్పములు (గర్వములు) భంగమైన కథలు నాచేత చెప్పబడినవి. నీవును వింటివి కదా. ఇట్లు నీచులకు గాని గొప్పవారికి గానీ ఇట్లు గర్వభంగము చేయబడినది. అందులో సందేహము లేదు. ఇప్పుడిక లెమ్ము, బృందావనమునకు పద. ఓ సుందరీ! అక్కడ గోపికలు నా విరహము కారణమున ఆర్తలై ఉన్నారు. శీఘ్రముగా వారిని చూడగలను.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ ఋషి అనెను :

అన్న శ్రీకృష్ణ వచనమును విని అభిమానవతియు రసికురాళ్లకీశ్వరియు ఐన రాధ “నేనటకు నడవ శక్తురాలను గాను. నన్ను తీసికొని పొమ్ము” అన్న రాధ పాక్యపు విని మధుసూదనుడు నవ్వి ఐనచో సన్నెక్కుము (నాపై కూర్చుండుము) అని పలికి అంతర్ధానమయ్యెను.

మనస్సుతో సమానముగా ప్రయాణించ గల రాధ క్షణము సేపు రోదించి ఇక్కడక్కడ శ్రీకృష్ణుని కొరకు వెదకి బృందారణ్యమును చేరబోయెను.

శోకమున తొందరపాటు కలదై ఏడ్చుచు చందనవనమును ప్రవేశించి అక్కడ శోకము చేత ఆర్తలై భయము చేత మనస్సు చెదరి యున్న గోపికలను (రాధ) చూచెను. ముఖములెర్రబారి అడవియంతట భ్రమించుచు కన్నులు తిరుగుచుండగా వెదకుచు ఆహారము లేనివారై కోపముతో కూడియుండి నాథా నాథా అనీ పిలుచుచు దుఃఖించుచున్న గోపికలను చూచి రాధ తానుకూడ భర్తయొక్క ప్రేము విచ్ఛేదమునకు (ప్రేమ సాగక ఆగిపోవుటకు) భయపడుచు తాముభయులు మలయాద్రి మొదలగు స్థానములలో సంచరించిన వృత్తాంతమును వారికి చెప్పెను. అతని ఎడబాటుకు గోపికలతో బాటు తాను కూడ పీడనొందుచు మాటి మాటికి ఏడ్చుచు నా నాథా అనీ ఉచ్చరించుచు రాధకూడ ఏడ్చెను.

క్షణకాలము రాధ కృష్ణుని కోపముతో నిందించుచు బెదరించెను. క్షణకాలము కోపముతో శరీరత్యాగము చేయుటకందరు సిద్ధపడిరి. ఇంతలో ఆచందన కాననములో శ్రీకృష్ణుడు రాధకు గోపికలకు తనను దర్శింపజేసెను (వారిముందు కనిపించెను). రాధాదేవి గోపికలతో బాటు తన ప్రాణేశ్వరుని చూచి సంతోషముతో చిరునవ్వుతో పులకించిన శరీరముతో పరుగెత్తాను. శీఘ్రముగా కృష్ణుని చేరి బిగ్గరగా కౌగిలించుకొని ఎడబాసి పోయినాడన్న కోపముతో అతని చేతిలోని మురళిని లాగుకొని అతని పూదండను త్రెంపి పీతాంబరమును చింపి - వేసెను. తిరిగి పీతాంబరమును ధరింపజేసి మనోహర పుష్పమాలను వేసెను.. అట్లే వినోదార్థము స్వామి పట్టుకొను మురళిని కూడ ఇచ్చెను. ఇట్లు సంతుష్టురాలైన ఆ బృందావన వినోదిని చందనము అగురు కస్తూరి కుంకుమ ద్రవములను అతనికి పులిమెను. మాటిమాటికాస్వామి ముఖమును చూచి మిక్కిలి ఆదరముతో, ముద్దులు పెట్టుకొనెను. క్షణము సేపు బెదిరించెను. క్షణము సేపు స్తుతించెను. క్షణకాలము ముదముతో అతనికి కర్పూర తాంబూలమిచ్చెను.

తరువాత గోపికలు అందరు ప్రేమచేత మనస్సులు చెదరి రోదనము చేసిరి. అతని యెడబాటు వలన తమకు ఏర్పడిన దుఃఖమును మొత్తమును నివేదించిరి. దేహములను త్యజింపబూనుకొనుటను స్నానభోజనములను విసర్జించుటను రాత్రింబగళ్లు  ప్రతివనములో మాటిమాటికి భ్రమించుటను (తిరుగుట) తెలియజెప్పిరి. క్షణము సేపు బెదిరించిరి. దర్శనమిచ్చినందుకు సంతోషముతో క్షణము సేపు స్తోత్రము చేసిరి. క్షణము సేపు భూషణములను సమర్చించిరి. క్షణకాలము చందనము సమర్పించిరి.

కొందరు గోపికలు “ఓ ప్రాణచోరుడా! మమ్ములను చూడుము. ఎల్లప్పుడు రక్షింపుము” అనిరి. కొందరు మనమితనితో (విశ్వాసము) చేయరాదని పలికిరి. కొందరు స్త్రీలు “త్వరగా నీతనిని మీరు మన నడుము బంధించుడు" అనిరి. “ప్రేమ పాశములో హృదయమందు బంధించుడు” అని కొందరు గోపాంగనలు పలికిరి. కొందరేమో “ఇతడు లేడు. ఎప్పుడు కూడా ప్రసిద్ధిలేదు" అనిరి. కొందరు ఇతడు మనచేతన (మనస్సు) చోరుడు. ఈ దొంగను ప్రయత్నించి చూడుడు కని పెట్టుడు” అనిరి. కొందరు గోపికలు కోపముతో "ఇతడు నరఘాతకుడు క్రూరుడు”. “తిరిగి మన గురించి ఇట్లు పలుకడు” అని కొందరనిరి.

జనరహితములు సుందరములు ఐన వన ములేవేవి ఉన్నవో అన్ని వనములలో ఆసక్తి (వేడుక) తో బాటు గోపికలు కృష్ణునితో గూడి విహరింతురు. ఇట్లు గోపికలందరు ఆ సదీశ్వరుని తమ నడుమ ఉంచుకొని - ఎక్కడ శోభనకరము సుందరమునైన రాసమండలము. కలదో - ఆ వనములోనికి చేరబోయిరి. రాస స్థానమునకు పోయి ఆ రసికేశ్వరుడు స్వర్ణపీఠముపై (గోపికల నడుమ) కూర్చుండగా రాత్రి వేళ ఆకాశములో తారాగణములతో చంద్రుని వలె ప్రకాశించెను. అక్కడ జనార్ధనుడు (కృష్ణుడు) అనేక శరీరములను ధరించి కాముకురాండ్రైన. స్త్రీలకు మనోహరముగా గోపికలతో (పూర్వము వలె) మరల క్రీడించెను.

మన్మథ పీడితుడైన శ్రీకృష్ణుడు స్వయముగా రాధను చేత ధరించి విశ్వకర్మ నిర్మితమైన -  ఇంతకు పూర్వము చెప్పబడిన - రతిమందిరమును ఆరోహించెను (ఎక్కెను). ఆ మందిరము చందనము అగురు కస్తూరీ కుంకుమ ద్రవ్యముల చేత లేపనము చేయబడియుండెను. చక్కని సువాసనలు కలదిగా చేయబడి యుండెను. అందులో సంపెంగ పూల శయ్య పైన స్వామి రాధతో కూడి నిద్రించెను. ఆ కామశాస్త్ర విశారదుడు కాముకుడు ఐన హరి ఆసక్తి కలవాడై ఆ కామిని (రాధాదేవి)తో నానావిధములుగా శృంగారక్రీడలాచరించెను. ఆ దంపతులకక్కడ దీర్ఘకాలము రతిక్రీడసాగెను. ఆ సుఖమందు నిష్ఠగల ఆ దంపతులకు ఆ క్షణములో ముగింపు లేకుండెను. ఇట్లు శృంగార రస (ఆనందము) మునందాసక్తులైన రాధాకృష్ణులక్కడ అట్లుండిరి. బయట వనములో శ్రీకృష్ణుని యొక్క బహుమూర్తులు (అనేకులైన కృష్ణులు) గోపికలలో రకర్మయందు స్థిరముగా నుండిరి.

నారద ఉవాచ - నారదుడు పలికెను :

భక్తజనులకు ప్రియమైన స్వామీ! (ఇది నారాయణుని గురించి నారదుని సంబోధనము) బుధజనులు మొదలు రాధా నామమును పలికియే తరువాత కృష్ణుని తెలిసికొనిరి (ఉచ్చరించిరి) దీనికి కారణమేమి? భక్తుడనగు నాకు తెలుపుము.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ ఋషి అనెను :

మునిశ్రేషా! నారదా! నీవడిగిన ప్రశ్నకు మూడు విధముల సమాధానము చెప్పుదును. వినుము. ప్రకృతియే ఈ జగములకు తల్లి. పురుషుడు {ఈశ్వరుడు) ఈ జగములకు తండ్రి. ముల్లోకములలో తల్లి, తండ్రి కంటే సూరురెట్లు గొప్పది (గరీయసీ - బరువైనది - అధికురాలు). “రాధాకృష్ణ”, “గౌరీశా” అన్న శబ్దమే వేదముందు {ఆగమ శాస్త్రమందు) వినిపించుచున్నది. “కృష్ణరాధా'' “ఈశగౌరీ" అని ఎప్పుడును లోకమందును {వ్యవహారములో) వినబడలేదు. రోహిణీ చంద్రా! నా ఆర్ఘ్యమును స్వీకరించుము అనుగ్రహించుము. సంజ్ఞాదేవితో కూడిన భాస్కరా! నాచేత అర్పించబడిన అర్ఘ్యమును స్వీకరింపుము, కమలాకాంతో (లక్ష్మీవల్లభా) నా పూజను స్వీకరింపుము. అనుగ్రహింపుము. అనీయే సామవేదమునకు చెందిన కొథుము శాఖయందు - (సంబోధన వాక్యము) చూడబడినది  (కనిపించుచున్నది).

'రా' అను అక్షరమునుచ్చరించగనే దాని వలన మాధవుడు అధికముగా పొంగిపోవును. వెంటనే 'ధా' అక్షరమునుచ్చరించుట వలన త్వరగలవాడై (పిలుపు వినవచ్చిన వైపు). పరుగెత్తుచునే ఉన్నాడు. మొదట పురుష, శబ్దముచ్చరించి తరువాత ప్రకృతి శబ్దముచ్చరించినచో వేదమొనతిక్రమించుట వలన వాడు మాతృహంతకుడు అగును. ముల్లోకములలో కర్మక్షేత్రమును పుణ్యప్రదమును అందువలననే ధన్యమును ఐనది భారతవర్షము. అందులో బృందావనము రాధాపాదపద్మ ధూళిచేత పుణ్యమైనది సుమా! బ్రహ్మదేవుడు రాధాదేవి చరణ పద్మమందలి రేణువును పొందుటకై (లభించుటకై) అరువై వేల సంవత్సరములు తపస్సు చేసెను.

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన రాధామాధవుల రాసవర్ణనమనెడి ఏబది రెండు అధ్యాయము సమాప్తము.