4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
102 - అధ్యాయము
మూ॥ శ్రీనారాయణ ఉవాచ :
శ్రీకృష్ణ ఉవాచ :
సాందీపిని రువాచ :
శ్రీనారాయణుడిట్లన్నాడు –
కృష్ణుడు, సాందీపిని గృహానికి బలరామునితో కలిసి ఆనందంగా వెళ్ళాడు. తన గురువుకు, పతివ్రతయైన గురుపత్నికి నమస్కరించాడు. (1) శుభాశీస్సులను పొంది, హరి, రత్నమణులను గురువునకు గురుభార్యకు ఇచ్చి, ఆతనితో తగినట్లుగా ఇట్లన్నాడు. (2) శ్రీకృష్ణుడిట్లా- నీ నుండి, నాకు కావలసిన విద్యను పొందుతాను, ఇది నా కోరిక. ఓ విప్ర! శుభమైన కాలాన్ని నిర్ణయించి, తగినట్లుగా నన్ను చదివించు. (3) మునిశ్రేష్ఠుడు, సరే, అట్లాగే అని ఆతడు, ఆనందంతో కృష్ణుని పూజించాడు. మదుపర్కము తాగించాడు. గోవు, వస్త్రము, చందనము (4) ఇచ్చి తీపి పదార్థములను తినిపించి, వాసనగల తాంబూలము ఇచ్చాడు. చాలా ప్రేమగా చెప్పసాగాడు. పరమేశ్వరుని సంతోషపరిచాడు. (5) సాందీపిని ఇట్లా - పరబ్రహ్మవు పరమమైన స్థానమునీది. గొప్ప ఈశుడవు, పరాత్పరుడవు. స్వేచ్ఛామయుడవు, స్వయంజ్యోతివి, నిర్లిప్తుడవు. ఒక్కడివి. నిరంకుశుడవు. (6) భక్తులకు నాథుడవు నీవొక్కడివే, భక్తులకు ఇష్టమైన వాడివి. భక్తులను అనుగ్రహించే కొరకు రూపం ధరించినవాడవు. భక్తుల కోరికలకు కల్పతరువువు. భక్తులకు ప్రాణవల్లభుడవు. (7) మాయతో బాలుడి రూపమైనావు. బ్రహ్మ, ఈశ, శేషులు నీకు నమస్కరిస్తారు. మాయతో భూమి పై భూపాలుడివైనావు. భూభారాన్ని నశింపచేయవచ్చావు. (8) నీవు బ్రహ్మ జ్యోతివని, సనాతనుడవని యోగులు ఇట్లా తెలుసుకుంటారు. భక్తుల సమూహాలు అభ్యంతరమందు (మనస్సులో) ఆనందంతో జ్యోతి స్వరూపునిగా ధ్యానిస్తారు. (9) రెండు చేతులు, చేతిలో మురళి, సుందరమైన శ్యామల వర్ణరూపము. అవయవములన్నింటా చందనం చల్లబడ్డావు. చిరునవ్వుతో ఉన్నావు, భక్తవత్సలుడవు. (10) పీతాంబరమును ధరించిన దేవుడ! వనమాలతో అలంకరింపబడ్డవాడ. విలాసము కొరకైన ఓరచూపుల వరుసతో అనంగుని వెక్కిరిస్తూ, మూర్చింపచేస్తున్నవాడ, (11) భవనమంతా నీ పాదపద్మకాంతితో లత్తుకపూసినటై చాలా అందంగా ఉంచినవాడ కౌస్తుభమణితో ప్రకాశిస్తున్న శరీరం గలిగిన దివ్య రూపము గలిగి మనోహరంగా ఉన్నవాడ.(12)
గరుపత్న్యువాచ :
అను!! కొద్దిగా నవ్వుతున్న ప్రసన్నమైన ముఖము, మంచి వేషము, దేవతలతో పొగడబడ్డట్టి రూపము గల దేవదేవుడ, జగన్నాథుడ! త్రైలోక్య మోహనుడ, పరుడ, (13) కోటి మన్మథుల లీలవంటి లీలగలవాడ (కాంతి), కమనీయమైన వాడ, ఈశ్వరుడ, అమూల్యమైన రత్నములతో నిర్మించిన భూషణ సమూహములతో అలంకరింపబడినవాడ (14) వరుడ, వరేణ్యుడ, వరదుడ, కోరేవారికి ఇష్టమైన వాడ, నాలుగు వేదములకు కారణమైన వానికి కారణమ (15) మాయతో చదువు కొరకై నా ప్రియమైన స్థానానికి వచ్చావా. నీకు చదువు లోకులకు తెలియజేసే కొరకే, నీ రమణము (క్రీడలు) నీ క్రీడలు, నీ యుద్ధము అన్ని లోకులు నేర్చుకోవాలనే. నీవు స్వాత్మారాముడవు. విభుడవు, పరిపూర్ణతముడవు నీకెందుకీశిక్షణ (16) గురుపత్ని ఇట్లా అంటి - ఇవ్వాళ నా జన్మసఫలమైంది. నా బ్రతుకు సఫలమైంది. పాతివ్రత్యము సఫలమైంది. ఈ తపోవనము సఫలమైంది. (17) నా సమర్థమైన చేయి సఫలమైంది. ఇది కోరతగిన అన్నాన్ని పెట్టింది. ఈ ఆశ్రమము తీర్థపరమైనది. తీర్థపాదులపదములతో చిహ్నితమైంది కనుక. (18) నీపాదధూళితో గృహములు పవిత్రమైనాయి. ప్రాంగణము ఉత్తమమైంది. నీ పాదపద్మములు మా జన్మములను నశింపచే సేవి (19) ఈ దుః ఖము, శోకము, భోగము, రోగము, జన్మలు, కర్మలు, ఆకలిదప్పులు ఇవన్నీ నీ పాదపద్మముల సేవనము లేనంత వరకే, నీ దర్శనం కలుగనంత వరకే (20) ఓ కాలమునకే కాలమైనవాడ! భగవంతుడ! సృష్టించడానికి చంపటానికి సమర్థమైనవాడ! మాయా అనే మోహాన్ని నశింపచేసేవాడ! కృపానాథ! మా పై దయచూపు! (21) అని పలికి కన్నీరు నిండిన కళ్ళుగల ఆమె హరిని తిరిగి రొమ్ముయందుంచుకొని ప్రేమతో తన చనుపాలను, దేవకి తాగించినట్లుగా తాగించసాగింది. (22)
శ్రీకృష్ణ ఉవాచ :
అను ॥ శ్రీకృష్ణుడిట్లన్నాడు –
ఓ తల్లి! నీవు నన్నెట్లా స్తుతిస్తునావు, నేను బాలుణ్ణి, పాలుగారుతున్న ముఖం నాది. నీ కొడుకును (లాంటి). ఇప్పుడు నీ స్వామితో కూడి నీ కిష్టమైన గోలోకానికిపో. (23) ప్రాకృతికమైన మిథ్యయైన, నశించే ఈ శరీరాన్ని వదిలి, జన్మ, మృత్యు, ముసలితనములను నశింపచేసే నిర్మలదేహాన్ని ధరించి వెళ్ళు (24) అని పలికి మునిపుంగవునివద్ద మిక్కిలిభక్తితో నెలరోజులలో నాలుగు వేదములను పఠించి, ఇదివరలో చనిపోయిన గురుపుత్రుని తిరిగి బ్రతికించి ఇచ్చాడు. (25) మూడు లక్షల రత్నాలు, ఐదు లక్షల మణులు, నాలుగు లక్షల వజ్రాలు, ఐదు లక్షల ముత్యాలు (26) రెండు లక్షల మాణిక్యాలు, ముల్లోకములందు లభించనట్టి వస్త్రాలు, దుర్గ ఇచ్చిన హారము, చేతికి ఉన్న రత్నపుటుంగరము (27) పదికోట్ల బంగారము ఇవన్నీ గురువునకు దక్షిణగా ఇచ్చాడు. అమూల్య రత్నములతో నిర్మింపబడ్డ, స్త్రీలు అన్ని అవయవములందు ధరించే ఆభరణాలు (28) శ్రేష్ఠమైన, వహ్నిశుద్ధమైన వస్త్రము ఇవన్నీ గురువుగారి పత్నికి ఇచ్చాడు. ముని ఇవన్ని తన పుత్రునకు ఇచ్చి, భార్యతో కూడి (29) మంచి రత్నములతో చేసిన రథమెక్కి, ఉత్తమమైన గోలోకానికి వెళ్ళాడు. ఆ అద్భుతాన్ని హరిచూచి ఆనందంతో తన ఇంటికెళ్లాడు. (30) ఓ నారద! ఇట్లా బ్రాహ్మణ్య దేవుని చరిత్ర విన్నావు. ఈ మహాపుణ్యకరమైన స్తోత్రాన్ని భక్తితో చదివినవారికి (31) శ్రీకృష్ణుడియందు నిశ్చలమైన భక్తి కలుగుతుంది. ఇందులో అనుమానం లేదు. అంతంత మాత్రం పేరు గలవాడు మంచికీర్తిమంతుడౌతాడు. మూర్ఖుడు పండితుడౌతాడు. (32) ఈలోకంలో, సుఖాన్ని పొంది, చివర శ్రీహరి పాదసన్నిధికి చేరుతాడు. అక్కడ ఎప్పుడు హరిదాస్యములభిస్తుంది, అనుమానం లేదు. (33)
అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు మునిపత్నియొక్క (చేసిన) స్తోత్రమనునది నూట రెండవ అధ్యాయము.
