4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

53 - శ్రీ కృష్ణరాస క్రీడా వర్ణనము

నారద ఉవాచ - నారదుడు పలికెను :

అట్లు రాధామాధవుల పూర్ణమైన ఆనంద రసము (శృంగారము) గడచి పోగా ఆ జగత్పతి ఏమి చేసెను? అక్కడ ఏ రహస్యము జరిగెను. దానిని తమరు చెప్పవలసినది.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను :

రాసమండల మందు రాసేశ్వరి (రాధ)తో కూడినవాడైన రాసేశ్వరుడు (శ్రీకృష్ణుడు) రాసకేళి ముగించి అటునుండి యమునా తీరమందలి ఇసుక తిన్నెలు గల స్థానమునకేగెను. ఆ నదియొక్క నిర్మలమైన జలములో గోపాంగనలతో పాటు జలక్రీడలొనర్చి స్నానమాడి ఆ జలమును పానమొనర్చెను. అక్కడి నుండి రాధతో కలిసి శ్రీహరి భాండీరవనమున కేగెను. అతని ఎడబాటుకు బాధపడుచున్న గోపికలు తమ స్వగృహములకేగిరి.

శృంగారముందాసక్తి గల కృష్ణుడు భాండీరవనమందలి మాలతీవనములో ఏకాంత ప్రదేశమున మాలతీ పుష్పములతో నిండిన రమ్యమైన శయ్యయందు ప్రియురాలైన రాధతో క్రీడించెను. అక్కడి నుండి వాసంతీకాననమునకు పోయిన రాసేశ్వరుడు అక్కడ వసంత. ఋతువు చేత మిక్కిలి మనోహరముగా ఉన్న ఆ వనములో రాధతో క్రీడించెను. అక్కడి నుండి చందన కాననమునకు పోయి చందన ద్రవము (నూరిన గంధము) తీసికొని సర్వాంగములందు పూకోని నిగనిగమను చందనపు చీగుళ్లతో సిద్ధపరచిన సుందరమైన శయ్యమీద నిండు చంద్రుడుదయించుచుండగా రాధతో క్రీడించెను. ఇట్లు విహరించీ చంపకవనమున కేగి అందు సంపెంగపూలు పరచిన శయ్యయందు ఈశ్వరియైన రాధననుభవించెను. అక్కడ అటు క్రీడించి ప్రభువు పద్మవనమున కేగెను. ఆ వనములో పద్మముల మీది నుండి వీచుచున్న చల్లని వాయువుల గల ప్రదేశమున పద్మముల రేకులు పరచిన శయ్యమీద పద్మముఖ్యైన రాధతో సుఖమనుభవించి . ఆమెతో పాటు నిద్రించెను.

నిద్రనాజ్ఞాపించునట్టి ఆ ప్రభువు తాను నిద్రను వీడి (మేల్కొని) నిద్రించి యున్న ప్రియురాలైన రాధను. చూచెను. సుఖకరమైన సంభోగము మూలమున పద్మపత్రముల శయ్యపై పండుకొని నిద్రించుచున్న ఆమె ముఖము చెమట బిందువులతో తడిసి శరత్కాల చంద్రుని నిందించునట్లుండెను. నుదుట సిందూర తిలకము కన్నుల కాటుక మీక్కిలి చెదిరిపోయి లోపించియుండెను. క్రింది పెదవి యందలి ఎర్రని పూత లోపించియుండెను. చెక్కిళ (చెంపలు) యందలి మకరికా పత్రరేఖలు చెదిరిపోయెను. కొప్పుముడి చెదరి వీడిపోయెను. కలువల వంటి కన్నులు మిక్కిలి మూతపడి యుండెను. ఆమె ముఖము అమూల్యమైన రెండు మణికుండలముతో ఏనుగు కుంభస్థలమందు పుట్టిన ముత్యపు ముక్కుపుడకతో శోభిల్లుచుండెను. భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడామెయందలి భక్తి ప్రేమలతో అగ్నిచేత పూతమైన సన్నని వస్త్రము. గ్రహించి ఆమె ముఖమును తుడిచెను.

ఆ హరి ఆమె తలవెండ్రులకను. దువ్వి కొప్పుగా చేసి మాధవీపుష్పములు, మాలతీ పుష్పముల మాలలతో శోభించునట్లు అలంకరించెను, ఎడమవైపు కొద్దిగా త్రిప్పిన ముఖము గల ఆ మనోహరిని రత్నములు కుట్టిన పట్టు పట్టీతో నడుమును బంధించెను. మిక్కిలి గుండ్రముగా నున్న కుందపుష్పములతో శోభించుచున్న ముఖమండలమందు సిందూర వర్ణతిలకము (ఎర్రని గుండ్రని బొట్టు) పెట్టి దానిక్రింది. ప్రకాశించెడి చందన తిలకము నుంచి ఆ రెంటినీ చుట్టునట్లు, కస్తూరి చుక్కలు శోభించునట్లు చేసెను. ఆమె చెక్కిళ్లయందు చిత్రవిచిత్రముగా మకరపత్రరేఖలు సమర్పించెను. కలువ కన్నులు ప్రకాశించునట్లు భక్తితో కాటుక దిద్దెను. అత్యంతానురాగముతో రాధయొక్క పెదవులకు ఎర్రని ద్రవమును పూసేను.

తన యొక్క అలంకారమును (వేషమును) చూచుకొనుటకును చంద్రుని వంటి ముఖమును సరిదిద్దుకొనుటకును ప్రేమతో శుభమైన రత్నదర్పణమును (అద్దము) స్వామి రాధకిచ్చెను. నానావిధ పుష్పముల చేత నిర్మింపబడినదియు, వాడనిదియు, గంధముతో తడుపబడినదియు అగు పూలబంతినీ ఆ సౌభాగ్యవతికి హరి సమర్పించెను. బ్రహ్మ తనకు రహస్యముగా నర్పించిన పారిజాత పుష్పమును ఆమె యొక్క సుందరమైన కొప్పున చెక్కెను. నిండైన ప్రేమతో ఆ ప్రియుడాప్రియురాలి యొక్క సర్వాంగములయందు కస్తూరి కుంకుమ పువ్వుల సుపోసన గల (మిశ్రమము గల) శ్రీగంధమును పులిమెను. శివుడు. రహస్యముగా తనకర్పించిన, వేయి రేకులతో ప్రకాశించుచున్న, నిర్మలమైన దివ్యకమలమును హరి అమె దక్షిణహస్తమున (ధరించుటకై) నుంచెను. మణులతో మిక్కిలి సారవంతమైన ధర్మదేవుడు రహస్యముగా తన కిచ్చిన కౌస్తుభమును మణిని - ఆమె యొక్క పూర్ణ తృప్తి కొరకు స్వామి రాధకర్పించెను.

దస్రుడన్న పోడు ఏకాంతమున తనకర్పించినదియు, రత్నపాత్రయందున్నదియు, కామోన్మాదమును కూర్చునదియు ఐన ఆసవమును (పుష్పములతో గానీ - ఫలములతో గాని సిద్ధము చేసిన మద్యము) ఆమెకందించెను. ఒక రత్నపాత్రలో ఉన్న మాలతి, మాధవి, కుంద మందార చంపకాది పుష్పరాని ఆమె ప్రీతికొరకిచ్చెను. తగిన సమయమెరిగిన ఆ రసికుడు కర్పూరము మొదలగు సుగంధద్రవ్యములు చేర్చిన సుదుర్లభమైన తాంబూలము నిచ్చి ప్రియురాలితో తినిపించెను. విశ్వములయందు సుదుర్లభమును వరుణుడు బృహస్పతి చేత ఏకాంత ప్రదేశమున నిర్మింపజేసినదియు, అమూల్యము అతి సూక్ష్మము సాటిలేనిదియు శ్రేష్ఠమునైన వస్త్రమును  భక్తితో వరుణుడు తన . కరించిన దానిని - వేడుకతో నూడదీసి రాధ ధరింపజేసెను. దేవరాజు (ఇంద్రుడు) తన కర్పించిన ఏనుగుముత్యపు నాసికాభూషణమును (ముక్కున వ్రేలాడు బులాకీ) అందమైన దానిని రాధ ప్రీతి కొరకు స్వామి అర్పించెను.

ఇంతలో నక్కడికి రాధాదేవి సహచరిణులుగా ప్రసిద్ధికెక్కిన సుశీల మొదలగు ప్రధాన గోపికలు అరువదిమంది - అరువది కోట్ల గోపికలతో కూడి - ప్రియురాలైన రాధను ఎత్తుకొని వచ్చిన శ్రీకృష్ణుని యొక్క పాదముద్రల గుర్తుబట్టి వారున్న స్థలమును గుర్తించి – చేరవచ్చిరి.

వచ్చిన గోపికలలో కొందరు చందన పాత్రలను, కొందరు చావురములను, కొందరు కస్తూరి పాత్రలను, కొందరు ధరించదగిన వస్త్రములను, కొందరు సిందూర తిలకమును, కొందరు దువ్వెనలను, కొందరు కాళ్లపారాణినీ, కొందరు ధరించదగిన వస్త్రములను, $ందరు ఆసవములను, కొందరు భూషణములను, కొందరు కరతాళములను, కొందరు మృదంగములను, మరికొందరు స్వరయంత్రములను, కొందరు వీణలను, తమ యజమానురాలి ఉపయోగార్థము చేతులలో ధరించి యుండిరి. కొందరు సంగీత శాస్త్రమందలి ప్రధాన రాగముల సంఖ్యయగు ముప్పది యారు రాగములే గోపికా రూపములు ధరించిన వారుండిరి. ఇట్లు ఈ గోపికలందరు గోలోకము నుండి రాధాదేవి వెంట భారత వర్షమునకు వచ్చినవారే - ఇక్కడకు వచ్చిరి.

ఓ మహాముని నారదా! వచ్చిన గోపికలలో కొందరు పాడిరి. కొందరు నృత్యము చేసిరి. కొందరు తెల్లచామరములతో రాధాదేవి యొక్క సేవచేసిరి (చామరములతో వీచిరి).

ఇటు వేడుకలు వినోదములతో కూడినవాడై పుణ్యవంతమైన జృందావనమనెడి వనమందు గోపికలతో పాటు రాధాదేవి వక్షస్థలమునాశ్రయించి శ్రీకృష్ణుడుండెను. కొంత సేపు ప్రియురాలగు. రాధతో కూడి మాధవుడు తేనెలు త్రాగెను. కొంత సేపు తాంబూలము భక్షించెను. రత్ననిర్మితమైన మందిరములో కొంత సేపు రాధతో శృంగార క్రీడ సల్పెను. తరువాత సంతోషతృప్తులతో కొంత సేపోమెను గూడి నిద్రించెను. తరువాత కొంత సేపు యమునానదీ జలములలో జలవిహారమొనర్చెను.

నాయనా! నారదా! ఈ తీరుగా హరియొక్క రాసక్రీడ నీకు చెప్పబడినది. ఇది ఆశ్చర్యకరమైనది. పరమాత్మయు, తన ఇచ్ఛననుసరించి రూపములు దాల్చువాడును, పరబ్రహ్మయొక్క పరిపూర్ణతమమైన అవతారమైనవాడును, గుణరహితుడుసు, స్వతంత్రుడును తన వ్యవహారమునీంకోకడు శాసించు స్థితిలేనివాడు) ప్రకృతి కంటే వరుడును, ప్రభువును, బ్రహ్మవిష్ణు శివాదిదేవగణములకీశ్వరుడును అన్నిటికతీతుడు శ్రేష్ఠుడును ఐన పరమాత్మ యొక్క గోలోక వాసియగు శ్రీకృష్ణుని యొక్క జన్మరహస్యము తనకును భక్తులకును కోరినదైన బాలక్రీడలును గల కిశోర చరితము {బాల్యదశలో జరిగిన చరిత్రము) నాచేత నీకు చెప్పబడినది. ఇంకేమి వినగోరుచున్నావు.

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదనంవాదరూపమైన శ్రీకృష్ణ రాసక్రీడా వర్ణనమనెడి ఏబది మూడవ అధ్యాయము సమాప్తము.