4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

18 - విప్రపత్నీ మోక్షణ ప్రస్తావము

శౌనక ఉవాచ - శౌనకముని ఇట్లనెను :

ఓ సూత పౌరాణికుడా ! ఎంత అద్భుతము. శ్రీకృష్ణ చరిత్ర మిక్కిలి మనోహరమైనది. వినునప్పుడు సుఖదాయకమైనది. దానికి ఫలముగా శ్రేష్ఠమైన మోక్షమిచ్చునది. దానిని వింటిమి. ఎంత ఆశ్చర్యము. ఇది రహస్య విషయము.

నూత ఉవాచ - సూతుడు పలికెను :

మునిశ్రేష్ఠుడైన నారదుడు నగర నిర్మాణ వృత్తాంతము విని మనోహరమైన కృష్ణ చరిత్రలోని తరువాతి భాగమును అడిగెను.

నారద ఉవాచ - నారదుడనెను :

ఓ ఋషివర్యా ! జ్ఞాన సముద్రుడా! శ్రీకృష్ణుని ఆఖ్యాన చరిత్రము (నడచుచుండగా కన్నుల ముందు చూచిన కధ) అమృతము వంటిది. నిన్ను శరణుపొందిన శిష్యుడనగు నాకు దానినింకను చెప్పుము.

నారదుని మాట విని నారాయణ మహర్షి స్వయముగా సంతోషముతో పరమాద్భుతమైన అపరమేశుని చరిత్రనిట్లు చెప్పెను.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :

ఒకసారి మాధవుడు (శ్రీకృష్ణుడు) గోప బాలకులతో బలదేవునితో గూడి యమునా నదీ జలముతో వర్ధిల్లిన - ఆ నది ఒడ్డుననే యున్న శ్రీమధువనమున కేగెను. అక్కడ ఆ బాలకులందరు. గోబృందములతో అంతట సంచరించిరి. ఆటలాడుకొని అలసిపోయిరి. వారిని ఆకలిదప్పులు బాధించేను. శ్రీకృష్ణుని జేరబోయి చిన్న చిన్న గోపాలబాలురు “ఓ కృష్ణా ! ఆకలి మమ్ము బాధించుచున్నది. నీ సేవకులమైన మేము ఏమి చేయవలెనో చెప్పుము” అని పలికిరి.

ఆ చిన్నవారి మాట విని దయానిధియైన శ్రీకృష్ణుడు ప్రసన్నమైన ముఖమండలముతో చూపులతో వారికి హితమైన సత్యవాక్యమిట్లు పలికెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :

ఓ బాలులారా ! ఈ మధువనమునకు సమీపముననే బ్రాహ్మణుల ఆశ్రమమున్నది. వారందరు ఆంగీరసులు (అంగీర మహర్షి వంశస్తులు) తమ ఆశ్రమములో వారు యజ్ఞము చేయుచున్నారు. సుఖకరమైన ఆ యజ్ఞ స్థానమునకు మీరు వెళ్లి యజ్ఞకార్యమగ్నులై ఉన్నవారిని అన్నము పెట్టుమని యాచించండి. వారు శ్రుతులు స్మృతులలో ఆరితేరిన పండితులు విష్ణుభక్తులు. ఏ కోరికలు లేకుండ కేవలం మోక్ష పేక్షతో వారు నన్నుద్దేశించియే యజ్ఞము చేయుచున్నారు. ఐసను నా మాయ వలన నన్ను వారు లీలగా మనుష్య రూపము ధరించిన పరమాత్మనని ఎరుగరు. యజ్ఞకార్య మగ్నులైన వారొకవేళ మీకన్నము పెట్టనిచో వెంటనే వారి భార్యలను యాచించండి. వారు శిశువుల యందు దయగలవారు కనుక మీకొరకన్నము నీతురు.

శ్రీకృష్ణుని వాక్కులు విని బాలురలో కొంచెము పెద్దవారు పోయి బ్రాహ్మణుల ముందు శిరస్సులు వంచి నిలబడి “ఓ బ్రాహ్మణోత్తములారా ! ఆకలిగొన్న మాకు త్వరగా అన్నము పెట్టండి” అనగా ఆ మాటలను కొందరు బ్రాహ్మణులు చెవిని బెట్టలేదు. కొందరు వినికూడ కదలక ఉన్న చోటనే ఉండిరి.

ఆ గోపబోలురు బ్రాహ్మణస్త్రీలు వంటచేయుచున్న వంటశాలలోనికి వెళ్లి తలలు వంచి విప్రుల భార్యలకు నమస్కరించిరి. పతివ్రతలైన విప్రభార్యలతో ఆబాలురీట్లనిరి “ఓ తల్లులారా! ఆకలితో బాధపడుచున్న చిన్న పిల్లలమగు మాకు అన్నము పెట్టండి”.

ఆ బాలుర మాటలు విని సుందరముగా నున్న వారిని చూచి చిరునవ్వు గల ముఖపద్మములతో నున్న ఆ సాధ్వీమణులు ఆదరముగా నడిగిరీ.

విప్రపత్న్య ఊచుః - బ్రాహ్మణుల భార్యలనిరి :

మీరెవరు? మిమ్మెపరు పంపిరి? మీ నామము లేవీ? కూరగాయలతో బాటు అనేక విధములైన మంచి భోజనము మీకు పెట్టుదుము”.

బ్రాహ్మణ స్త్రీల మాటలు విని సంతోషించిన గోపబాలురు ప్రేమ భావముతో నవ్వుచు విచ్చిన ముఖములతో ఇట్లనిరి.

బాలా ఊచుః - బాలురు పలికిరి :

“ఓ తల్లులారా! బలరామకృష్ణులు మమ్మిచటికి పంపిరి. మిక్కిలి ఆకలి బాధతోనున్నోము. మాకొరకన్నము పెట్టుడు. మేము త్వరగా వారి వద్దకు పోయెదము. ఇక్కడికి సమీపమున భాండీర వనము లోపలి మధువనములో మళ్లీచెట్టు క్రింద బలరామకృష్ణులున్నారు. అలసట తీర్చుకొనుచు ఆకలిగొనియున్న వారు అన్నము యాచించినారు. పెట్టగలరా లేదా త్వరగా మాకు చెప్పవలసినది”.

గోపాల బాలుర మాటలు విని పతివ్రతలైన విప్రపత్నులు సంతోషముతో కన్నుల యందు ఆనంద బాష్పములు నిండగా దేహమంతయు పులకాంకురము లేర్పడగా శ్రీ కృష్ణుని పాదపద్మములందే తమ సంకల్పములు (తలపులు) పెట్టి నానా విధములైన శాకములతో కూడిన శాల్యన్నము (మంచి బియ్యపు అన్నము) రుచి గల పిండి వంటకమైన పాయసము పెరుగు పాలు నెయ్యి తేనె వెండి కంచు బంగారు పాత్రలలో పెట్టుకొని నానావిధమైన కోరికలను మనస్సులో తలచుకొనుచు శ్రీకృష్ణ దర్శనము నందు తహతహగలవారై శ్రీకృష్ణుని సన్నిధికేగిరి.

ఆ విప్రపత్నులు వటవృక్ష మూలమందు బాలకులలో బలరామునితో గూడియున్న శ్రీ కృష్ణుని దర్శించిరి. నక్షత్రముల నడుము చంద్రుని వలే అతడు ప్రకాశించుచుండెను. కిశోర (బాల్య) వయస్సు కలిగి శ్యామసుందర శరీరమున పసుపుపచ్చ పట్టు వస్త్రము ధరించిన ఆ రాధారమణుడు చిరునవ్వుతో శాంత మనోహరుడుగా నుండెను. శరత్పూర్ణిమ నాటి చంద్రుని వంటి ముఖమండలము - రత్నకుండలములతో తళతళ లాడుచున్న చెక్కిళ్లు (చెంపలు) రత్నాల దండకడియములు రత్న కంకణములు రత్నాల అందెలు మోకాళ్ల వరకు వ్రేలాడుచున్న శుభ్రమైన రత్నమాల - ఇట్టి ఆభరణములతో అలంకృతుడై మాలతీ పుష్పమాల కంఠమున వక్షస్థలమున విరాజిల్లుచుండగా ఆ స్వామి అద్భుతముగా నుండెను. పండిన దొండపండు వంటి సుందరమైన క్రింది పెదవి, పండిన దానిమ్మ పండులోని విత్తులవంటి చక్కని పలువరుస, చక్కని కపోలములు (చెక్కిళ్ళు) - కొండె కొప్పున చెక్కిన నెమిలి యిక - చెవుల సందులలో చెక్కిన కడిమి పూలు - సుందరముగా వెలుచున్న మూర్తితో అపరాత్పరుడు యోగులకు కూడ ధ్యానమునకు చిక్కనివాడు, భక్తులననుగ్రహించవలెనన్న తొందర గలవాడు, బ్రహ్మరుద్ర ధర్మ శేషేంద్రాది దేవతల చేత మునుల చేత స్తుతింపబడుచున్నవాడు వారికీ కన్పించెను.

ఈ విధముగా నున్న పరమేశ్వరుని బ్రాహ్మణ స్త్రీలు దర్శించి భక్తితో నమస్కరించి తమకున్న జ్ఞానము బట్టి ఆ మధుసూదనుని ఇటు స్తోత్రమొనర్చిరి.

విప్రవత్న్య ఊచుః - బ్రాహ్మణుల భార్యలీట్లనిరిః

స్వామీ ! నీవు అన్నిటియందు వ్యాపించి యుండు వరబ్రహ్మవు. శ్రేష్ఠమైన లక్షణములకు స్థానము నీవు. నత్యకాముడవు కనుక నీకందని కోరికలు లేనందున ఎట్టి కోరికలు లేనివాడపు. తమోగుణమైన అహంకారము నీయందుండదు. నిర్గుణుడివందురు ఐనను నగుణుడవు (అనగా అశుద్ధ గుణములు లేకుండ లోక కల్యాణ గుణములు గలవాడవు). నిరాకారుడవయ్యు భక్తుల కందుబాటులో నుండుటకు సాకారుడవు. జీవుల కర్మలను చూచి నియమించు సాక్షివి నీవు ఐనను నీకెవరియందును ద్వేషము మమకారము లేనందున నిర్లిపుడవు (ఏది అంటని వాడవు) ఒకే విధమైన ఆకారము లేని పరమాత్మవు. ఈ ప్రకృతి నీ రూపమే. ఆత్మలు నీవే. ప్రకృతికి జీవునకు మూలము ఆధారము నీవే. సృష్టి - రక్షణ - లయము అను విషయములో ఏ ముగ్గురు దేవతలు చెప్పబడిరో ఆ బ్రహ్మవిష్ణు మహేశ్వరులు సృష్టికి బీజభూతులు - (కారణమయినవారు) నీ అంశభూతులు కదా.

ఏ గొప్ప విరాట్పురుషుని యొక్క రోజు కూపమున మొత్తము విశ్వమీమీడియున్నదో అట్టి మహావిష్ణువును కన్న తండ్రివి నీవు. తేజస్సు నీవే తేజస్సు గల గలవాడవు నీవే. జ్ఞానము జ్ఞానివగు నీయందిమిడి యున్నది. వేదము నందు నీవింతవాడవిట్టివాడవని నిర్వచనము చేయ వీలు లేనట్టివాడవు. నిన్ను స్తుతించుటకెవడు. ఈశ్వరుడు (తగిన అధికారి). సృష్టి మూలమైన మహత్తు మొదలగునవి పంచతన్మాత్రలు (స్థూలమైన పంచభూతములకు మూలమైన భూత సూక్ష్మములు) అను సర్వశక్తులు నీవే. సర్వశక్తులరూపము నీవే. సర్వము నీవే. తీరని కోరికలు లేని ఆనీహుడవు. స్వయం ప్రకాశరూపుడవు. సర్వానందములు గల సనాతనుడవు నీవే.

అన్ని రూపములు ధరించు వాడవైనను నీవాకార రహితుడవు. అన్నీ ఇంద్రియముల వలన పొందబడు జ్ఞానము నీకున్నది ఐనను అది నీవింద్రియము కలిగి ఉండుట వలన కాదు. ఎవనిని స్తుతించుటలో ఎవడిట్టివాడని నిరూపించుటలో సరస్వతి జడురాలైనదో, (జ్ఞానము లేనిది) మహేశుడు శేషుడు ధర్ముడు స్వయముగా బ్రహ్మ కూడ జడులైరో - పార్వతీయు లక్ష్మీయు రాధాదేవియు సావిత్రియు వేదమాత గాయత్రియు వేదమును జడత్వమును పొందుదురో అట్టి నిన్ను స్తుతించుటకు ఏ విద్వాంసులకు శక్తి కలదు ? ప్రాణేశ్వరులకు ఈశ్వరుడవైన స్వామీ ! స్త్రీలమైన మేము నిన్నేముని స్తుతింతుము. ఓ దీనబంధూ ! మా యందు ప్రసన్నుడవు కమ్ము. దయ చూపుము.

ఇట్లు పలికి ఆ బ్రాహ్మణుల భార్యలు అతని చరణారవిందములపై వడిరి. ప్రసన్నమైన ముఖమండలము చూపులు గలవాడై స్వామీ వారికి అభయమిచ్చెను.

విప్రపత్నులొనర్చిన స్తోత్రమును పూజా సమయములో ఎవడు పఠించునో ఆ వ్యక్తి ఏప్రపత్నులు పొందిన ఉత్తమ గతిని పొందుననుటలో సంశయము లేదు.

నారాయణ ఉవాచ - నారాయణమహర్షి పలికెను :

తన పాదపద్మముల మీద బడిన వారిని చూచి మధుసూదనుడు పరమును కోరుకొనుడు. మీకు శుభము జరుగును అని పలికెను. శ్రీకృష్ణుని వాక్కు విని ఏప్రపత్నులు సంతోషించి భక్తితో శిరస్సులు వంచి స్వామితో ఇట్లనిరీ.

ద్విజపత్య ఊచుః - బ్రాహ్మణుల భార్యలిట్లు పలికిరి :

శ్రీకృష్ణా! నీవిచ్చు వరము మేము గ్రహింపము. నీ పాద పద్మములమీదనే మాక పేక్ష (కోరిక) కలదు. మాకు నీ దాస్యమును మిక్కిలి దుర్లభమైన దృఢభక్తిని ఇమ్ము. ఓ కేశవా ! ప్రతీక్షణము నీ ముఖకమలమును దర్శించుచుందుము. గృహములకు తిరిగిపోము. ప్రభూ ! మాకీవరము నిచ్చి ముమ్ము దయచూడుము.

విప్రపత్నుల మాటలు విని కరుణానిధియైన శ్రీకృష్ణుడు “సరీయే” అని అంగీకార వాక్యము పలికి ఆ త్రిలోకనాథుడు బాలకుల సభలో కూర్చుండిను. విప్రపత్నులు తెచ్చి యిచ్చిన, అమృతము వలె రుచికరమైన అన్నమును బాలకులకు తానుగా తినబెట్టి స్వామి కూడ భుజించెను.

ఇంతలో ఆకాశము నుండి క్రిందికి దిగివచ్చుచున్న దివ్యమైన బంగారు రథమును విప్రపత్నులు చూచిరి. ఆ రథము రత్న దర్పణములతో (అద్దాలు) రత్నాలంకారములతో ఉత్తమ రత్న కలశముల కాంతితో ప్రకాశించుచు రత్నాల స్తంభములతో కూర్చబడియుండెను. తెల్లని చామరేములు అగ్నివలి ఎట్టిగా ప్రకాశించు వస్త్రములు పారిజాత పుష్పముల మాలలతో అది విరాజిల్లుచుండెను. సుందరముగా సున్న ఆ రథము నూరు చక్రములు కలదై మనస్సుతో సమానముగా ప్రయాణించునది - నవయౌవన వంతులు శ్యామల వర్ణులు మిక్కిలి మనోహరముగా (సుందరముగా) నున్న దివ్యపారదులు ఆ రథమును చుట్టి యుండిరి. వారందరు పీతాంబరములు (పసుపువన్నె వస్త్రములు) ధరించి రత్నాలంకారములు పాదముల వరకు వ్రేలాడు పుష్పహారము లలంకరించుకొని ఉండిరి. నెమిలి యీకలు గురివింద గింజల మాలలు వంకరగా (ఒక ప్రక్కకు) ముడివేసిన కొండెకొప్పుల మీద ధరించి సుందర గోపాల వేషములు ధరించిన వారందరు పిల్లనగ్రోవులు పట్టుకొని ద్విభుజులై (రెండు చేతులు గలవారు) ఉండిరి.

ఆ దివ్యపారదులు రథము నుండి దిగి శ్రీహరి పాదములకు నమస్కరించి రథము నెక్కవలసినదిగా బ్రాహ్మణ స్త్రీలకు చెప్పిరి. విప్రపత్నులు శ్రీవారికి నమస్కరించి మనుష్య దేహములు విడిచి అప్పటికప్పుడు గోలోకమందలి గోపికారూపములు పొంది కోరుకున్న గోలోకమునకేగిరి. విభుడైన శ్రీహరి (కృష్ణుడు) విష్ణుమాయతో ఆ ద్విజపత్నుల ఛాయారూపములను సృష్టించి బ్రాహ్మణ గృహములకు స్వయముగా పంపించెను.

బ్రాహ్మణులు తమ భార్యల గురించి మిక్కిలి తొందరపడు మనన్పులతో వెదుకుచు వెదుకుచు వచ్చి త్రోవలో తమ స్త్రీలను చూచిరి. వారందరు తమ భార్యలను చూడగానే శరీరములు పులకించి ప్రసన్నమైన ముఖములు చూపులు గలవారై భార్యలతో వినయముగా నిట్లు పలికిరి.

బ్రాహ్మణా ఊచుః - బ్రాహ్మణులనిరి :

మీరు భగవంతుని దర్శించి ధన్యులైతిరి. ఆశ్చర్యము. మా జీవితము మా వేదపఠనమంతయు వ్యర్థము. వేదములు పురాణములు విద్వాంసులు ఏకకంఠముగా ఈ సమస్త ప్రపంచము శ్రీవారి విభూతి అనియు అందరికి శ్రీహరియే జనకుడనియు కీర్తించిరి. తపస్సులకు జపములకు ప్రతములకు జ్ఞానమునకు వేదాధ్యయనమునకు అర్చనలకు తీర్థస్నానములకు ఉపవాసవ్రతములకు అన్నిటికీ ఫలదాత శ్రీహరి.

శ్రీకృష్ణుని సేవించిన వారికి తపస్సు యొక్క ఫలములతోనేమి పని ? కల్పతరువు లభించిన వానికి ఇతర వృక్షములతోనేమి ప్రయోజనము ? శ్రీకృష్ణుడివని హృదయమున వసించునో ఆ వ్యక్తికి కర్మలతోను కర్మ ఫలములతోను పనియేమి ? సముద్రము దాటిన వానికి చేద బావిని లఘించుట ఒక పౌరుష కార్యమా ? ఇట్లు ఆ బ్రాహ్మణులు భార్యలతో పలికీ వారిని గృహములకు గొని పోయిరి. ఆనందముగా వారితో సంసార నిర్వహణము చేసిరి.

విష్ణుమాయాశక్తి వలన ఆ బ్రాహ్మణులకు తమ భార్యలక్రీడా విలాసముల యందు వారు చేయు పనుల యందు ఊహకందని అధికమైన ప్రేమ దాక్షిణ్యభావము ఏర్పడెను.

సనాతనుడు పూరబ్రహ్మ ఐన నారాయణుడు (శ్రీకృష్ణుడు) ఆ తరువాత బలదేవునితో బాలురతో గూడి త్వరగా తమ నివాసమునకు పోయెను. ఇట్లు ఉత్తమమైన శ్రీహరి మాహాత్మ్యము మొత్తము ధర్మరుషి ముఖము నుండి పూర్వము నేను విన్నది విన్నట్లు చెప్పితిని. ఇంకేమీ వీనగోరుచున్నావు ?

నారద ఉవాచ - నారదుడనేను :

ఋషివరా ! మునీంద్రులకు యోగసిద్ధులకు దుర్లభమైన ఈశ్వరప్రాప్తి (మోక్షము) విప్ర స్త్రీలకు ఏ పుణ్యము వలన లభించెను ? ఈ పుణ్యవతులు ఎవరు ? పూర్వమీ భూమండలము మీద ఎక్కడ నివసించిరి. లేదా ఏ దోషము వలన భూమి మీదికి వచ్చిరి ? ఈ సందేహములు తొలగించు సమాధానము తెల్పుము.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లనెను :

సప్తఋషుల భార్యలు మంచి గుణవతులు సతీశీలము గలవారు ధర్మమునందే మనస్సు నీలిచిన పతివ్రతలు. రూపములో గూడ సాటిలేనివారు. అందరు ఎల్లప్పుడు క్రొంగొత్తగా కన్పించు యావనము గలవారు. బలసిన పిరుదులు స్తనములు గలిగి దివ్య వస్త్రములు ధరించి రత్నాలంకార భూషితలై ఉండువారు. వారి శరీరపు రంగు కాచిన బంగారు కాంతితో ముఖములు చిరునవ్వుతో వెలుగుచుండును. సహజమైన వంకర చూపుతో (కటాక్షములు - కడగంటి చూపులు) మునుల మనస్సులను మోహపరచు శక్తి కలిగియుండిరి.

వారి సుందరమైన మధ్యప్రదేశమును స్తనములను ముఖములను చూచి అగ్నిదేవుడు మన్మధాగ్ని చేత పీడితుడై వారిని కామించెను. అగ్ని కుండ సమీపమున (యజ్ఞసమయములో) కూర్చున్న వారిని బుద్ధి నశించి సురతమునంద పేక్ష కలవాడై తన జ్వాలలతో వారి అంగములను స్పృశించుచు మాటిమాటికి చూచుచు వ్యామోహముతో స్మృతి తప్పుచుండెను. భర్త పాదకమలమునందే మనస్సు గల ఆ పతివ్రతల కదేమీ తెలియకుండెను.

భగవంతుడగు అంగిరసముని అగ్ని మనస్సు తెలిసికొని “(శుద్ద - అశుద్ధములన్న భేదము పాటింపక) అన్ని పదార్థములను భక్షించువాడవగుదువుగాక” అని శపించెను. అగ్ని అప్పుడు తెలివి తెచ్చుకొని సిగ్గుతో తలవంచుకొని ఆ బ్రహ్మ తేజస్సుకు వణికి పోయి ఆ మహర్షిని స్తుతించెను.

క్రోధము చెందిన ముని వరుడు అగ్నిచేత స్పృశింపబడిన ఆకామినులను పాపయుక్తలైన మీరు మనుష్య జన్మనెత్తుటకు పొండు. భారతవర్షమున బ్రాహ్మణ గృహములలో జన్మింతురు గాక అని శపించి మిమ్ము నత్కులమున బుట్టిన బ్రాహ్మణులు వివాహమాడుదురని పలికెను. ఆముని వాక్యమును విని భర్తలయందలి ప్రేమచేత చెదరిన మనస్సులు గలవారై ఆ ఋషిపత్నులేడ్చిరి. చేతులు జోడించి అందరు ఆ విద్వద్వరునితో ఇట్లనిరి.

మునిపత్న్య ఊచుః - మునిపత్నులు పలికిరి :

ఓ మునిరాజా ! ఏ పాపము చేయని పతివ్రతలమైన మమ్ము పరుడు స్పృశించినది కూడ తెలియని వారిని విడిచి పెట్టవలదు. విడిచి పెట్టదగదు. మేము మీయందు భక్తిగల సేవికలము. మమ్మీట్లు దండించవలదు. మీ పాదపద్మములను మేము మరల ఎప్పుడు చూడగలము ? సాధ్వీజనులకు ప్రియమైన భర్త ఎడబాటు కత్తిచేత నరకుట కంటే పిడుగు పాటుకంటే అన్ని విధములైన దెబ్బల కంటెను ఓర్చుకొనరాని భయంకర సంఘటన. బ్రహ్మము నందే మనసు నిలిచియున్నవారు గుణవంతులలో శ్రేష్ఠులైనవారు మహామునులు అగు. మీరందరు మాకు ప్రియమైనవారు. ఇట్టి వారిని వదిలి మేము భూమి మీదికెట్లు పోగలము?  ఓ ద్విజవరా! ఒక వేళ పోయినచో - శాస్త్రమున చెప్పబడిన - తెలియకుండ సంభవించిన పరస్పర్శ దోషము మాకెట్లు తొలగిపోయి మరల ఇక్కడికి ఎప్పుడు తిరిగి వత్తుమో చెప్పుము.

ఇంద్రుని ఒరపిడి వలన అతనితో సంభోగము సలిపిన ఆహల్య మరల శుద్ధి పొంది తిరిగి తన భర్తను పొందెను. ఓ వేదవేదాంగముల జ్ఞానము పూర్ణముగా తెలిసినవాడా ! నీవు సృష్టికర్త పుత్రుడవు. సర్వవేదవేత్తలలో శ్రేష్టుడవు. ఇతరుల వలన ఏర్పడిన భయమునకు స్త్రీలు భర్తను శరణు పొందుదురు. ధర్మముందు నిలిచిన స్వామీ ! భయముతో గూడిన మాకు అభయ మీమ్ము. పుత్రునియందు శిష్యుని యందు భార్యయందు శిక్ష విధించుటకెవడు సమర్థుడు కాడు ? ఎందుకనగా అతడు దుర్బలుడు గాని బలవంతుడు గాని తన వస్తువుల కధికారి గదా ! ఐనను తన ద్రవ్యమును విక్రయించుట యజమానికి తగదు. అట్లే ఆ ద్రవ్యమునకధికారి కానివాడు రక్షించుటయు తగదు.

ఆ స్త్రీల మాటలు విని దయాస్వభావము గల ఆంగిరసముని పుంగవుడు వారి ముఖ పద్మములను చూచి ప్రేమతో ఏడెను. వేద వేదాంగముల సారమెరిగినవాడు జ్ఞానులలో యోగులలో శ్రేష్టుడైనప్పటికిని ఆ ముని భార్య వియోగమును తలచుకొని మూర్ఛపొందెను. ఆ ఋషులందరును భార్యల విరహమునకు ఉద్విగ్నమైన మనస్సులు గలవారై భార్యల ముఖములను చూచి శోకారులైరి. బొమ్మలవలె బీరీపోయిరి. సర్వవేదవేత్తలలో ఉత్తముడైన ఆంగిరసముని చాల సేపు దుఃఖించి సోదరులతో ఆలోచించి దుఃఖముతో త్వరపడుచు ఆ స్త్రీలతో నిట్లనెను.

ఆంగిరా ఉవాచ - ఆంగీరసముని అనేను :

సత్యమైన వాక్యము చెప్పుచున్నాను. వినుడు. తమ కర్మఫల మనుభవించు వారికి ఆ యనుభవము కర్మశక్తి యున్నంతవరకుండును అనీ వేదమునందు చెప్పబడినది. మీకు మాతో భోగానుభవము తీరిపోయినదని నిశ్చయింపబడినది. కర్మభోగానుభవము క్షయమైన పిదప మరల అనుభవమన్నది వేదమున చెప్పబడలేదు. భారత వర్షములో శుభాశుభ కర్మల ఫలము ఎంతవారికిని అనుభవించకుండ కోటి జన్మలెత్తినను నశించదు (అనుభవించకుండకర్మక్షయము కాదు).

పరపురుషుడనుభవించిన స్త్రీని ఏనరాధముడు (నీచ భర్త) అనుభవించునో అతడు చంద్రసూర్యులున్నంత వరకు కాలసూత్రనరకమున పక్వము చేయబడును. అట్టి స్త్రీ (పరపురుషుడనుభవించిన స్త్రీ) దైవకార్యమునందు పితృకార్యము నందు - వంటచేయుటకు పనికి రాదు. అట్టి స్త్రీని ఆలింగనము చేసికొన్న భర్త యొక్క తేజస్సు నశించును. సంపద భ్రష్టమై పోవును. అతడు చేసిన హవ్యదానము (హోమము) వలన దేవతలు సుఖమనుభవించరు, తర్పణము (తిలోదకములు విడుచుట) వలన పితృదేవతలు సుఖమనుభవించరు అని బ్రహ్మ చెప్పెను.

అందువలన పండితుడు తగినంత ప్రయత్నించి భార్యను రక్షించుకొనును. తన విధిని (రక్షణ కార్యము) చక్కగా నిర్వహించని నరుడు (భర్త) పాప భాజనుడై నిశ్చయముగా సరకము పొందును. అందుకే తగిన ఏకాగ్రతతో అడుగడుగున పండితుడు తన భార్యను రక్షించుకొనును గాని ప్రతనియమములు పూనినవాడు గానీ ఒక పదవిలో నున్నవాడు గాని చేయలేడు. స్త్రీ దోషములకు స్థానము. కనుక ఎల్లప్పుడు భార్యను వంట పాత్రను (మట్టికుండ) పరస్పర్శ సంభవించకుండ శుద్ధముగా రక్షించుకొనవలెను. ఏ నీచురాలు తనభర్తను వదిలి పరుని పొందునో ఆ స్త్రీ సూర్యచంద్రులున్నంతవరకు కుంభీపాక నరకము (కుండలలో పెట్టి పాపిని వండుట) ను పొందును. ఆమెను యమదూతలు వేరోక అనుభవము కల్గించు నరకములో నిలిపి దూరము నుండి కజ్జలతో కొట్టుదును. జారిణి స్త్రీని వాడి కోరలు కల క్రూరమైన కీటములు (పురుగులు) సర్పములంత పెద్దవి రాత్రింబవళ నరకములో కొరుకుచుండును. సూక్ష్మము సుకుమారమునైన దేహము ధరించిన ఆ దుష్టురాలు (యాతనాశరీరము) ఆ బాధలకు భయముతో బొబ్బలు పెట్టుచు వికారమైన ఆకారము పొందును. దెబ్బలకు చావదు. ఒక సగము ముహూర్త కాలము తుచ్ఛసుఖమనుభవించిన (జారిణి స్త్రీ ఈ లోకమున అపకీర్తి పొంది పరలోకమున ఇట్టి దుర్గతిని పొందును. పరుని చేత స్పృశించబడిన ప్రియును పరపురుషుని పొందవలెనని కోరుకున్న స్త్రీయును దుష్టురాలే పరిత్యజింపదగినదే అని బ్రహ్మ చెప్పెను. అందుకే నేర్పుగల సజ్జనులు స్త్రీని ప్రయత్నతో పరుని కంటబడకుండ కాపాడుకొందురు. అసూర్యం పశ్య (సూర్యునికి కన్పించని స్త్రీ) యైన భార్య పరిశుద్ధురాలు పతివ్రత. స్వేచ్ఛగా పురుషులను పొందు స్త్రీ స్వతంత్రముగా తిరుగు స్త్రీ వంటిది. పరగామిని దుష్టత్వమును లోపల దాచుకొన్న స్త్రీయని నిశ్చయము. ఏ స్త్రీ భర్తచేత క్రమశిక్షణలో పెట్టబడుచు కులధర్మభీతితో ప్రవర్తించునో ఆమె భర్తతో బాటు వైకుంఠమునకు పోవుట నిశ్చయము.

మీరు భూమి మీదికి పోయి మనుష్య జన్మను పొందుడు. శ్రీకృష్ణుని దర్శించినంతలోనే అతడు నిశ్చయముగా మీ ఛాయారూపములను నిర్మించును. ఆ ఛాయా స్త్రీలు బ్రాహ్మణ గృహములలో నిలువగా తిరిగి మావద్దకు మీమీ అంశలతో వచ్చి మాకు భార్యలగుదురు. కనుక నా శాపము మీకు వరము కంటే శ్రేష్ఠము ఇట్లు పలికి వారి యెడబాటు అను విషాదముతో కూడిన వాడై సంభాషణ ముగించెను. ఆ సప్తఋషి భార్యలే భూమీ మీదకి వచ్చి అతని శాపకారణముగా వీఘ్ర స్త్రీలుగా పుట్టిరి.

భక్తితో వారు శ్రీహరికన్నము సమర్పించి హరిమందిరమున (గోలోకము) కేగిరి. వారికి నిశ్చయించిన శాపము సంపద కంటే అధిక ఫలదాయకమయ్యెను.

నీచుని వలన పొందు సంపద నింద్యము. గొప్పవాని వలన కలిగేడు ఆపద శ్రేష్టమైనది. ఆశ్చర్యము! అప్పటికపుడేర్పడిన సాధువుల కోపము ఉపకారము సమకూర్చును. ఎవనికి గాని ఎక్కడ గాని ఆపదలేకుండ మహిమ (గొప్పస్థితి) ఎట్లు కల్గును. ప్రియులైన భర్తల నెడబాయుట వలన (త్యజించుట వలన) బ్రాహ్మణ స్త్రీలు ముక్తిని పొందిరి. ఈ విధముగా ఉత్తమమైన హరి చరిత్ర మొత్తము పుణ్యవతులైన స్త్రీలు మోక్షము పొందుటయను మనోహర చరిత్రము నీకు చెప్పితిని.

ఓ విప్రేంద్రా! (నారదా) శ్రీకృష్ణ చరిత్ర అడుగడుగున మాటమాటలో క్రొంగ్రత్తగా నుండును. వీనువారికి తృప్తియుండదు. ఇంకను వినవలెననిపించును. ఔను. శ్రేయస్సులభించు దానియందేననికి చాలునని తృప్తి యేర్పడును. దీనిని గురుముఖత వింటినో ఏది రమ్యమైనదో అది చెప్పితిని. ఇంకేమి వినగోరుచున్నావు. నీకోరిక ఏమిటో చెప్పుము.

నారద ఉవాచ - నారదుడనేను :

ఓ దయానిధీ ! జగదురూ ! నీవు గురుముఖమున పూర్వమేదేది వింటివో ఆయా మంగళకరమైన కృష్ణ చరిత్ర మొత్తము నాకు చెప్పుము.

సూత ఉవాచ - సూతుడనెను :

ఆ దేవ ఋషియైన నారదుని మాట విని నారాయణ మహర్షి స్వయముగా కృష్ణమాహాత్మ్యములోని వేరొక ఘట్టమును చెప్పనారంభించెను.

ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో విప్రపత్నులు మోక్షము పొందిన ప్రస్తావ మనెడి పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.