4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

48 - రాధాశ్రీకృష్ణ సంవాదము

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :

ఓ సుందరీ! ఒకప్పుడు సూర్యుడు (ఎప్పటివలె తన విధి నిర్వహణలో) ఉదయించి సాయంత్రము అస్తమించెను. అప్పుడు మహాసంపద చేతను శంకరుని వరము వలనను మిక్కిలి మదించిన మాలి సుమాలి అన్న ఇద్దరు దైత్యేంద్రులు తమ శరీర తేజస్సుచేత రాత్రి (సూర్యుడు అస్తమించినప్పటికిని) కాకుండుగాక అని ప్రకాశము కల్గించుటకు ప్రయత్నించిరి. అది చూచి కోపించిన సూర్యుడు తన శూలముతో లీలగా వారిని కొట్టెను. సూర్య శూలము తాకి వారిద్దరు భూమి పై పడిరి. భక్తుల యందు వాత్సల్యము గల శివుడు తన భక్తులకు ఏర్పడిన ఆపదను తెలిసికొని వేగముగా అక్కడికి వచ్చి తన గొప్ప జ్ఞాన ప్రభావము చేత ఆ యిద్దరిని బ్రతికించెను. వారు భక్తితో శంకరునికి నమస్కరించి తమ ఇంటికీ వెళ్లిపోయిరి.

తరువాత శంకరుడు కోపముతో మండిపోవుచు సూర్యుని చంపుటకు పరుగెత్తాను. సర్వజీవుల యొక్క సంహారకర్తయైన హరుడు తనను చంపరాగా సూర్యుడు భయముతో పారిపోయి బ్రహ్మను శరణుజొచ్చెను. మహాదేవుడు కోపముతో శూలము నెత్తిపట్టి బ్రహ్మను శాసించువాడు యమునకు యముడు కనుక బ్రహ్మలోకమునకును పరుగెత్తెను.

కోపించి యున్న హరుని చూచి జగత్తులకు పతియైన బ్రహ్మ వేదములలో చెప్పబడియున్న స్తోత్రమును నాల్గు ముఖములతో (పఠించుచు) స్తుతించెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మ అనెను :

దక్షయజ్ఞము ధ్వంసమొనర్చిన జగదురూ! నన్ను శరణు పొందినవాడును సృష్టి యొక్క ఆరంభ కాలములో నీచేతనే సృష్టింపబడిన వాడును ఐన ఈ సూర్యుని యందు ప్రసన్నుడవు కమ్ము. అల్ప ప్రార్థనకు అల్పపూజకును త్వరగా సంతుష్టి చెందు మహానుభావా! భక్తులయందు వాత్సల్యము కలవాడా, దయాసముద్రా! రాత్రి పగలు రూపమున నున్న కాలమును రక్షింపుము. అంతట వ్యాపించునట్టి స్వరూపము గలవాడా! (వివర్తన రూపమైన జగద్రూపా) ఓ భగవంతుడా! సృష్టి స్థితి లయములను చేయువాడా! నీవే సూర్యుని నిర్మించి నీవే సంహారింప గోరుచున్నావు! నీవే బ్రహ్మవు. నీవే జగత్తును మోయుశేషడవు. ధర్మదేవత, ఆర్నీ నీవే. ఇంద్రచంద్రాది దేవతలు నీ వలన భయము పొందుదురు. (నీకు భయపడుదురు) తపస్సే ధనమైన ఋషులు మునులు నిన్నే సేవించిరి. తపస్సులకు ఫలదాతవు నీవు తపస్సు నీవే. తపస్సు ఫలము కూడ నీవే.

భక్తితో బ్రహ్మ ఇట్లు పలికి సూర్యుని తెచ్చి దీనవత్సలుడైన శంకరునికి ప్రీతితో సమర్పించెను. శంభుడు ప్రసన్నమైన ముఖము కలవాడై తాను జగత్కర్త కనుక సూర్యునికాశీస్సులిచ్చి బ్రహ్మకు నమస్కరించి (ఒకరినొకరు గౌరవించుకొనుట సూర్యుడు శరణాగతుడగుట వలన) ముదము పొంది కైలాసమున కేగెను. ఇట్లు బ్రహ్మచేసిన స్తోత్రము నెవడు ఆపత్కాలమందు పఠించునో ఆ నరుడు భీతుడైనచో భయము నుండి, బంధింపబడినవాడైనచో ఆ బంధనము నుండి విడుదల పొందును. ఒక కార్యమును సాధించుటకై రోజు ద్వారమున కేగినవాడు శ్మశానమందున్నవాడు మహా సముద్రములో తానెక్కిన ఓడ మునుగుచున్నప్పుడు ఈ స్తోత్రమును స్మరించినంతలో ఆపద నుండి విముక్తి పొందును. సందేహము లేదు.

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన రాధాశ్రీకృష్ణ సంభాషణ రూపముననున్న నలుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.