4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

8 - శ్రీకృష్ణ జన్మాష్టమీ పూజోపవాస వ్రతములు

నారద ఉవాచ :

నారదుడిట్లు పలికెను :

ఓ నారాయణ మహామునీ! వ్రతములలో ఉత్తమ వ్రతమైన జన్మాష్టమీ వ్రతమును గూర్చి నాకు తెలుపుము. ఇప్పుడు జయంతీయోగము యొక్క ఫలమును సాధారణముగానైనను తెలుపుము. శ్రీకృష్ణజయంతి నాడు సజ్జన సమ్మతమైన ఉపవాసమునకు ఫలమేమి? వ్రతమునకు ఏమి నీయమములు ఎట్టి పూజ విధానముండును? దానితో పాటు ఉపవాస పారాయణములయొక్క విధానము కూడ బాగుగా విచారించి తెలుపుము..

నారాయణ ఉవాచ :

నారాయణ మహర్షి ఇట్లు పలికెను :

నియమనిష్ఠలుగలవాడై సప్తమినాడు హవిష్యము వండి (బియ్యము కడుగకుండ గంజివార్చకుండ వండిన అన్నము) దైవమునకు నివేదించి పారణము (ప్రతభోజనము) చేసి మరునాడు తూర్పున ఎఱ్ఱని రేఖలేర్పడు వేళకే మేల్కొని ప్రాతఃకాల దేహానిధులు తీర్చుకొని స్నానము చేసి జయంతీ వ్రత సంకల్పము చేయవలెను. అనగా ప్రేత ఉపవాసములు చేయ బూనుకొనవలెను. ఇది శ్రీకృష్ణ ప్రీతికి మూలము. మన్వాదులు యుగాదులు అన్న దివసములు సంభవించినప్పుడు చేయునట్టి స్నాన దేవపూజలాచరించుట వలన ఏ ఫలము లభించునో అంతకంటే కోటిరెట్లు ఫలము భాద్రపద బహుళమున వచ్చు కృష్ణాష్టమీ వ్రతాచరణము వలన లభించును.

ఆ తిథినాడు పితృదేవతలకెవడు జలదానము (నువ్వులు నీళ్లు వారి గోత్రనామములు చెప్పుచు దర్భల పై వీడుచుట, (పితృతర్పణము} చేయునో వాడు నూరు సంవత్సరములు గయాశ్రాద్ధము చేసిన ఫలము పొందుననుటలో సంశయము లేదు.

శ్రీకృష్ణజయంతీ వ్రతము చేయదలచిన వాడు ఆనాడు ఉదయమున స్నానము చేసి సంధ్యావందనాదులు (నిత్యకర్మలు) ముగించి సూతికాగృహము నిర్మించుకోవలెను (కృష్ణ జననగృహము). అందులో ఇనుప శలాకలను అగ్నిని సూతికాగృహ రక్షకులను అనేక ద్రవ్యములను బోర్డును కత్తిరించు కత్తెరను ధాత్రీ స్వరూపిణి {పురుడు పోసుకొనుటకు సహకరించు స్త్రీ విగ్రహమును ప్రయత్నముతో సమకూర్చుకోవలెను. షోడశోపచార పూజకు తగిన సామగ్రినీ సుందర వస్తుజాలమును, ఎనిమిది రకముల ఫలములను రుచికరమైన పిండివంటలను సంగ్రహించవలేను. దానిమ్మపండు మారేడు పండు నారికేళము గజనిమ్మపండు, గుమ్మడిపండు అర్ఘ్యపాద్య ఆచమనీయ మధుపర్కములు స్నానవస్త్ర గంధపుష్పములు భూషణములు ధూపదీపములు, కస్తూరి మొదలగునవి నైవేద్య తాంబూలములు శయ్యాసనము మొదలగు షోడశోపచార పూజకు తగినవి సమకూర్చుకోవలెను.

(స్నాన సంధ్యాదులు ముగించుకొన్న కర్త ప్రతమునకు కావలసిన సామగ్రిని కూర్చుకొన్న తరువాత) పాదములు కడుగుకొని ఉదికి ఆరవేసిన దోవతి ఉత్తరీయములు ధరించి ఆసనముపై కూర్చుండి ఆచమనము చేసి పుణ్యాహవాచనము చేసి ఒక కలశమును స్థాపించి పంచలోకపాలక దేవతలనర్చించిన పిదప ఆ కలశమున పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని ఆవాహన చేయవలెను. దేవకీ వసుదేవులను, యశోదానందులను, రోహిణీదేవిని బలరాముని షష్ఠిదేవతను భూదేవినీ, నక్షత్ర దేవతయగు రోహిణిని, స్నానదేవతయగు అష్టమీ తీథినీ, - అశ్వత్థామ, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, వేదవ్యాసుడు, మార్కండేయుడు అను వారినందరిని కలశమున ఆవాహన చేయవలెను. ఆ వెనుక శ్రీహరి ధ్యానము చేయవలెను.

ఒక పుష్పమును తన తల ఫై ఉంచుకొని విశుద్ధ జ్ఞానముతో మరల స్వామిని ధ్యానించవలెను. నారదా! సామవేదమున చెప్పబడిన ఆధ్యాన (విధమును-మంత్రమును మును వినుము.

ఈ ధ్యానమంత్రమును మహానుభావుడైన సనత్కుమారునకు బ్రహ్మదేవుడు చెప్పెను.

బాలరూపుడును సల్లకలువ వంటి కాంతీ గలవాడును మిక్కిలి సుందరుడును చిరునవ్వుతో వెలుగు ముఖపద్మము గలవాడును బ్రహ్మరుద్రుడు ఆదిశేషుడు ధర్మదేవత అనువారిచేత దీనముల కొలది ఎన్నో విధముల స్తోత్రములు చేయబడు ఏ పరమాత్మ గలడో - ధ్యానమున కందనివాడును ఋషులు, మునులు, మనుజులు, సిదలకు ఎవడు సాధింపరానివాడో - యోగీంద్రులకును ఊహకందనీ ఆతిశయము గల సాటిలేని అట్టి సాక్షిరూప పరచూత్మను నేను భజించును.

ఇట్లు ధ్యానము చేసి ఆ పుష్పమును (కలశము పై ఉంచి పూజాసామగ్రిని మొత్తమును మంత్రములు చెప్పుచు షోడశోపచార పూజను సమర్పించవలెను. ఇట్లు శ్రీకృష్ణజయంతీవ్రతమొనర్చు వాడావ్రతము చేయవలెను. నారదమునీ! మంత్ర క్రమము వినుము.

ఓ శ్రీహరీ! శ్రేష్ఠములైన రత్నమాణిక్యములతో నిర్మించబడిన సర్వవిధ శోభలతో కూడిన - చిత్తరువులతో ఆశ్చర్యకరమైన - మంగళకరమైన ఆసనమును స్వీకరింతువు గాక (మంత్రరూపములైన ఈ శ్లోకములన్నీటికినీ కూడ పాఠకులకు తెలియుట కొరకు భావము వ్రాయబడుచున్నది. అనువాదకుడు).

ఓ శ్రీహరీ! విశ్వకర్మ నిర్మితమును అగ్నివలే పవిత్రము ప్రకాశవంతమును - స్వచ్ఛమైన బంగారు తీగలు పొదిగినదియు - పలురంగులు కలదిగా చేసినదియు అగు వస్త్రమును స్వీకరింతువు గాక.

శ్రీహరీ! నీ పాదములు కడుగుటకై బంగారు పాత్రలో ఉన్న పవిత్రము స్వచ్ఛము ఐన జలమును పాద్యముగా స్వీకరింతువు గాక.

శ్రీహరీ! తేనె నెయ్యి పెరుగు పాలు శర్కరతో కూర్చీ బంగారు గిన్నెలో ఉన్న మధుపర్కమును స్నానాంగముగా స్వీకరించవయ్యా.

శ్రీహరీ! పచ్చిగరికమొలకలు అక్షతలు తెల్లని పుష్పములు వేసి చందనము అగురుద్రవ్యము కస్తూరి కలిసియున్న స్వచ్చజలమును స్వీకరింపుము.

ఓ పరమేశ్వరా! సుగంధ ద్రవ్యములతో పరిమళము చేకూర్చిన, తీయని మంచినీటిని శుద్ధ ఆచమనముగా స్వీకరింపుము.

ఓ విష్ణుమూర్తీ! గంధద్రవ్యములతో కూడిన, సువాసనగల నూనెను, ఉసిరికగుజ్జును స్నానపదార్థముగా స్నానమునకై స్వీకరించుము.

శ్రేష్ఠమైన మణుల చూర్ణముతో నిర్మించబడి మిక్కిలి మనోహరముగా నుండి సన్నని వస్త్రము పైన పరచిన శయ్యను స్వీకరించుము స్వామీ!

శ్రీహరీ! రకరకముల వృక్షముల యొక్క చూర్ణములతో వేరుల ద్రవములతో కస్తూరి కలిపిన గంధమును స్వీకరింపుము.

ఓ శ్రీహరీ! పుప్పొడితో గూడిన సువాసన గల పుష్పమును సర్వదేవతలకు మిక్కిలి ప్రియమైనదానిని ఇప్పుడు స్వీకరింపుము.

నేల అలికి స్వస్తికాకారపు ముగ్గు వేసి ఆ స్థలమున బాగుగా పండిన పండ్లు రుచిగల పిండిపదార్ధములు లడ్డూలు మోదకములు రుచిగల పాలతో చక్కగా వండిన పదార్థములు నెయ్యిపాలు తేనె బెల్లము పెరుగు మజ్జిగ వెన్న చల్లని శర్కర పానకము ఇట్లు అన్ని పదార్థములతో గూడిన నైవేద్యమును ఓ శ్రీహరీ నీవు స్వీకరింతువు గాక.

ఓ పరమేశ్వరా! భోగపదార్థములలో శ్రేష్ఠమైన భక్తితో అర్చించబడిన పచ్చ కర్పూరము మొదలగు వానితో కూడిన తాంబూలమును. స్వీకరింతువు గాక! స్వామీ! చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుద్రవములతో. కూడిన కన్నులకు ఇంపైన. ఈ ఆబీరమును స్వీకరించుము.

వివిధములైన చెట్లు జిగురు పదార్థములనగ్నిలో వేయగా ఏర్పడిన పరిమళమంతమైన ఈ పొగను (ఊదుకార్చగా పచ్చుపొగ సర్వదేవతలకు ప్రియమైన ధూపముగా స్వీకరించుము హరీ !

ఘోరమైన (సంసారమును} అంధకారమును నశింపజేయుటకు మూలమై శుభములను కూర్చునట్టి - బాగుగా వెళ్లించబడిన కాంతులు ఉమ్మడి ఈ దీపమును స్వీకరించుము స్వామీ!

కర్పూరము మొదలగు సుగంధ వస్తువులు చేర్చి సువాసన కల్గునట్లు చేసిన పవిత్రము నిర్మలమునైన జలమును సమస్త బీజములకు ప్రాణప్రదమైన దానిని పానీయముగా (త్రాగుటకు జలముగా) స్వీకరించుము శ్రీహరీ!

శరీరాలంకారములలో శ్రేష్ఠమైన సన్నని దారముతో కూర్చిన నానావిధ పుష్పములతో కూడిన పుష్పమాలను స్వీకరించుము.

వ్రతము చేయు ప్రదేశమున నుంచిన పదార్దములు పూజలోనుపయోగించినవి అన్నియు స్వామికి సమర్పించవలసినవే కనుక శ్రీహరి కర్పించవలెను.

ఓ పరమేశ్వరా! ఈ ఫలములు చెట్ల విత్తనములు (బీజములు} వంశవృద్ధి చేయునవి. కన్నుల కింపైన నాల్కకు రుచియైన ఈ ఫలములను బీజములను గ్రహింతువు గాక.

జయంతీవ్రతము చేయు వ్యక్తి కలశముపై మొదట ఆవాహన చేసిన దేవతలందరికి విడివిడిగా పూజ చేయవలయును. వారందరిని పూజించి పిదప భక్తితో మూడు మారులు దోసిలితో పూలు సమర్పించి నమస్కరించవలెను.

ప్రతము చేయువాడు ప్రధాన పూజ తరువాత పరివార పూజనిట్లు చేయవలెను. నందసునంద కుముదాది గోపాలకులను, గోపికలను, రాధాదేవిని, గణేశుని, కుమారస్వామిని, బ్రహ్మను, శివునీ, పార్వతిని, లక్ష్మిని, సరస్వతిని, దిక్పాలకులను, నవగ్రహములను, ఆదిశేషుని, సుదర్శన చక్రమును, గోలోకములో నుండు కృష్ణ పారదులను ఇట్లు సర్వదేవతలను పూజించి నేల పై సాష్టాంగ దండ ప్రణామములు చేయవలెను. బ్రాహ్మణులకు నివేదించిన ప్రసాదము నిచ్చి దక్షిణలిచ్చి భక్తిభావముతో జన్మాధ్యాయములో చెప్పబడిన కథను వినవలెను. దర్భల చాప పై కూర్చుండి జాగరణము (నిద్ర లేకుండ భజన సంకీర్తనలను చేయవలెను. తెల్లవారగనే స్నాన సంధ్యాది నిత్యకర్మలు చేసికొని శ్రీహరిని షోడశోపచారములతో పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి శ్రీహరి నామసంకీర్తనము చేయించవలెను.

నారద ఉవాచ :

నారదుడిట్లు పలికెను :

వేదవేత్తలలో శ్రేష్టుడవైన ఓ నారాయణమునీ! పురాతన సంహితను (వేదమును) వేదార్థమును బాగుగా ఆలోచించి వేదమందు చెప్పబడిన - సర్వజనులకు సమ్మతమైన సమాధానములు చెప్పుము. ఈ వ్రతము చేయవలసిన కాలనియమమెట్టిది? ఈ వ్రతమును దానికంగము ఉపవాస జాగరణములను చేసినందువలన ఏమిఫలము కల్గును? ఆనాడు భోజనము చేసినచో ఏమీ పాపము సంభవించును? అన్నిటిని తెలుపుమని అడిగెను.

శ్రీ నారాయణ ఉవాచ :

బ్రహ్మ అధి దేవతగా గల రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి తిథి ఏ అర్ధరాత్రి యందు కన్పించునో (తగిలియుండునో) అదియే జయంతీ వ్రతమునకు ముఖ్యకాలము. శ్రీహరి ఆ సమయముననే స్వయముగా (తన పూర్ణాంశతో) జన్మించెను (అవతరించెను).

జయమును పుణ్యమును కల్గించునది అగుట వలన “జయంతి” యని చెప్పబడినది. అది ఎరిగిన బుధుడు {పండితుడు. సజ్జనుడు) ఆ దినము ఉపవాసముండి వ్రతమాచరించి జాగరణ మొనర్పవలెను. వివాదరహితముగా సర్వబుధ సమ్మతముగా జయంతి వ్రతమున కీది ప్రధానమైన కాలముగా వేదవేత్తలు పల్కుదరని పూర్వము బ్రహ్మ చెప్పెను. ఆనాడెవడు ఉపవాసము ప్రతాచరణము జాగరణము చేయునో వాడు కోటి జన్మలలలో ఆర్జించిన పాపము నుండి విముక్తి పొందును. ఈ విషయమున సందేహము లేదు. రోహిణీ నక్షత్రముతో కూడియున్నను సప్తమీ తిథితో కూడియున్న అష్టమిని తప్పక విడువ వలయునే కాని సప్తమీ సహితాష్టమినాడు జయంతీవ్రతము చేయగూడదు. వేదవేదాంగములు ఎరుగని తత్త్వమైన దేవకీనందనుడు కృత్తికా వీధలేని రోహిణీ నక్షత్రమున జన్మించెను అన్నది విశేష లక్షణము. జయంతీవ్రతమాచరించిన వ్యక్తి రోహిణీ నక్షత్రము గడిచిపోయిన శుభ సమయములో పారణము (ఉపవాస కాలము తరువాత స్వీకరించు భోజనము) చేయవలెను. వ్రతము చేయు వ్యక్తి తిథీ చివర హరిని స్మరించి దేవపూజ చేసి పవిత్రమైన పారణము చేయవలెను. ఇట్టి పారణము జీవుల సర్వపాపములను నశింపజేయును. అన్ని విధముల ఉపవాసములందును దైవానుగ్రహము సిద్ధించుటకు మూలము సత్ఫలమిచ్చునది. ఉపవాస వ్రతమునకు ఒక అంగముగా నున్న పారణము (భోజనము) పగలే చెప్పబడినది. ఈ చెప్పిన ప్రకారముగా కాక ప్రత - ఉపవాసదీక్షలు పారణము ఇంకొక విధముగా చేసినచో ఫలము నశించును. ఒక్క రోహిణీ నక్షత్రమున తప్ప ఇతరత్ర రాత్రిపూట పారణము చేయరాదు (ఒక పక్షముగా జయంతీవ్రతోపవాసమునకు పారణము రాత్రి కాలమున అంగీకరింపబడినది) మధ్యరాత్రిని వదిలివేసి రాత్రియందు పారణము చేయవచ్చును. మరునాటి ఉదయము మొదటి జాములో దేవతార్చనము బ్రాహ్మణ భోజనము జరిపించి పారణమొనర్చుట ఉత్తమ పద్ధతిగా చెప్పబడినది.

(విద్ధయనగా సూర్యోదయము తరువాత కొంతకాలము ఒక తీథిగానీ నక్షత్రము గాని ఉండి ఆ తరువాత ఇంకొక తిథిగాని నక్షత్రముగానీ వచ్చినచో క్రమముగా ఆ తరువాతి తిథి నక్షత్రములు వేధ పొందినవి (విద్దలు) అందురు. సప్తమీ వద్దగల అష్టమీ, కృత్తికావిధ్ధగల రోహిణీ జయంతీ వ్రతాచరణకు పనికిరావనీ తాత్పర్యము).

రోహిణీ వ్రతమున తప్ప మిగిలిన అన్నిటికీ శాస్త్ర సమ్మతమైన పారణకాలమే ఆచరణయోగ్యము.

బుధ సోమవారములలో నొకదానితో కలిసి వచ్చిన జయంతీ లభించెనేని ఆనాడు జయంతీవ్రతమాచరించిన వ్యక్తి మరల తల్లి గర్భమున నివాసముండడు ఆ వ్యక్తికి పునర్జన్మ లేదనీ భావము}.

ఉదయకాలమున కొద్దిగా అష్టమీతిథి ఉండి మిగిలిన దినమంతయు నవమి తిథి, బుధసోమవారములలో నొకవారము, రోహిణీ నక్షత్రము కూడి వచ్చుట అరుదుగా సంభవించును. అట్టి పుణ్యకాలము నూరేళ్లకొకమారు లభించునో లభించదో! అట్లు లభించిననాడు నీయమవంతుడు జయంతీవ్రత మొనర్చినచో తన పూర్వులను తరువాతి వారిని కోటిమందినీ నరకము నుండి ఉద్ధరించును. సంపద లేక ఈ వ్రతమును చేయలేని భక్తజనులు ఒక్క ఉపవాసమాచరించినను లక్ష్మీవల్లభుడు సంతసించును.

భక్తిశ్రద్ధలతో షోడశోపచార పూజ చేసి రాత్రి యందు జాగరణ చేయుట వలన శ్రీహరి, జయంతీవ్రత ఫలమును ప్రసాదించును. ద్రవ్యలోభము చేయకుండ చక్కగా జరిపినవానికి మంచిఫలము సంభవించును. శక్తి ఉండికూడ ద్రవ్యలోభము చేసిన యెడల తదనుగుణమైన ఫలము పొందును.

తెలిసినవాడు అష్టమి తిథి, రోహిణి నక్షత్రములలో పారణము చేయకూడదు. చేసినచో పూర్వపుణ్యము ఉపవాసము వలన పొందిన ఫలము రెండు నశించును. తిథి ఎనిమిది పాలు, నక్షత్రము నాలుగు పాళ్లు పుణ్యమును చెరచును కావున ప్రయత్నించి తిథియునక్షత్రము (అష్టమి రోహిణీ) ముగిసిన తరువాత పారణము చేయవలెను. మధ్యరాత్రీకి తిథి నక్షత్రము ముగియుట సంభవించునేని బుధుడైనవాడు మూడవ దినము పారణము చేయును. (ఈ పరిస్థితిలో ప్రతదివసము కన్న ముందు దినమునకే తిథి నక్షత్ర స్పర్శ సంభవించును కనుక ఆనాడును ప్రతదీనమునాడును ఉపవాసము మూడవనాడు ఉదయము పారణమని తాత్పర్యము).

ఓ నారదా! రాత్రీకాలమున ఆరవముహూర్తము గడవగానే మహానీశాకాలము. అప్పుడు భుజించినచో బ్రహ్మహత్యాదోషము సంభవించును.

సూర్యుడు వెలుగుచుండు కాలమునకు దివసము (పగలు) అని వ్యవహారము. సూర్యోదయమునకు ముందు నాలు గడియల - కాలము సూర్యాస్తమయము తరువాత నాలు గడియల కొలను ఇవి రెండును సంధ్యాకాలములు అనబడును. రాత్రిలోనీ ఆద్యంతకాలములు సంధికాలము లేనందున ఇక మిగిలిన రాత్రికాలము మూడు జాములే కనుక రాత్రికి “త్రియామ" (మూడు జాములు కలది) అనీ పేరు ఏర్పడినది. అట్టి రాత్రిలో మహానిశ యందు (16 గడియలు గడచుకోలము) తాంబూలము నమలినినచో గోమాంస భక్షణము చేసినట్లు ఫలము భుజించినచో మలము భుజించినట్లు, జలము త్రాగినచో మూత్రపానము చేసినట్లు అగును. కావున సదాచారము గలవారు మహానిశలో ఏమియు స్వీకరించకూడదు. ఇక భోజనము మాట చెప్పనేల!

శుద్ధమైన జన్మాష్టమినాడు వ్రతము జాగరణము చేసిన వ్యక్తి నూరుజన్మలలో ఒనర్చిన పాపములనుండి విముక్తుడగును. సందేహము. లేదు. శుద్ధ జన్మాష్టమినాడు వ్రతము జాగరణము చేయజాలక కేవలము ఉపవాసము చేసినను ఆ వ్యక్తి బాల్యకౌమార యావన వృద్ధ దశలలోను ఏడు జన్మలలోను చేసిన పాపముల నుండి విముక్తి పొంది అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుననుటలో సందేహము లేదు.

శ్రీకృష్ణ జన్మదివసము నాడు ఏ నీచమానవుడు భుజించునోవాడు కామముతో తల్లిని బొందినవాడగును. నూరు బ్రహ్మహత్యలు చేసిన ఫలమునందును, గడచిన కోటి జన్మలలో వాడార్జించిన పుణ్యము నశించుట నిశ్చయము. వాడు అపవిత్రుడై దైవ పితృకర్మలొనర్చుటకు అనర్హుడు యోగ్యత లేని వాడు) అగును. మరణానంతరము వాడు సూర్యచంద్రులున్నంత వరకు శూలముల వంటి వాడీ కోరలు గల పురుగులతో భక్షింపబడుచు నరకమున నివసించును. ఆ నరకానుభవము తరువాత ఆ పాపి భారతమున జన్మించెనేని అరువది వేలయేండ్లు మలములో పురుగుగాను, ఆ తరువాత కోటి సహస్ర వరములు గ్రద్ధగాను ఆ వెనుక నూరు జన్మలు పందిగాను, నూరు జన్మలు క్రూరమృగము గాను, ఏడు జన్మలు నక్కగాను, ఏడు జన్మలు పాముగాను, ఏడు జన్మలు కాకిగాను గడపుచు ఆ వెనుక మూగవాడుగా, కుష్టువ్యాధిగల రోగిగాను జన్మనెత్తును. ఆ పిదప పశువధ చేయువాడుగాను పాముల బట్టువాడుగాను జన్మించును. ఆ పిదప చోరుడుగా ధర్మహీనుడుగా ఆ వెనుక చాకలివాడుగా తరువాత నూనెగానుగు నాడించువాడుగా జన్మలెత్తును. ఆ తరువాత దేవతంబళియై అనాచారవంతుడు అపవిత్రుడైన బ్రాహ్మణుడుగా పుట్టును.

ఉపవాసము చేయుటకు శక్తిలేనివాడు ఒక సద్బ్రాహ్మణునికీ భోజనము పెట్టవలెను. లేదా ఆ భోజన ద్రవ్యమునకు రెండింతలు ధనమునైనను ఈయవలెను. ఆ శక్తిలేనివాడు సహస్ర గాయత్రిని జపించవలెను. పన్నెండు పర్యాయములు ప్రాణాయామము చేయవలెను. ఈ విధముగా ఓ నారదా! ధర్మదేవత ద్వారా విన్న విషయము నీకు చెప్పితిని. జయంతీవ్రతము ఉపవాసము పూజలయొక్క నియమవిధులు పాటించనిచో ఏర్పడు దోషములను కూడ చెప్పితిని.

ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో నారాయణ నారద సంవాదములో శ్రీకృష్ణ జన్మాష్టమీ ప్రత, పూజా, ఉపవాసముల నిరూపణము అను ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.