4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
13 –కృష్ణాన్నప్రాశనవర్ణన, నామకరణ ప్రస్తావనములు
శ్రీనారాయణ ఉవాచ :
శ్రీనారాయణ మహర్షి ఇట్లు పలికెను:-
ఓ నారద మహామునీ! కృష్ణ మహిమను తెలుపునింకొక సంఘటనను చెప్పెదను వినుము. అది విఘ్నములను ఖండించునది. పాపములను నశింపజేయునది మరియు శ్రేష్ఠమై మహాపుణ్యములను సమకూర్చునది. ఒకసారి నందపత్ని (యశోద) ఆకలిగొని యున్న శిశువగు కృష్ణుని తన వక్షస్థలమున చేర్చుకొని బంగారు సింహాసనముందు కూర్చుండి
ఇంతలో నక్కడికి శిష్య సమూహములతో గూడి ఒక బ్రాహ్మణ శ్రేషుడు విచ్చేసెను. అతడు బ్రహ్మ తేజస్సుతో వెలిగి పోవుచుండెను. తెల్లని పలువరుస ప్రకాశించుచుండగా తెల్లని వస్త్రములు ధరించి యోగదండము గొడుగు తెల్లని స్ఫటికముల జపమాల ధరించి రూపము దాల్చిన జ్యోతిష గ్రంథము వలె వెలుగుచుండెను. వేదవేదాంగములపారము ముట్టినవాడు. పరమమంత్రమును జపించుచు, తలమీది జడల సమూహము మేటి బంగారు వన్నెలో మెరిసిపోవుచుండెను. శరత్కాల పూర్ణిమ నాటి చంద్రుని వంటి ముఖమండలము పద్మముల వంటి నేత్రములు తెల్లని శరీరచ్ఛాయ గలిగి యున్న ఆ యోగీంద్రుడు శంకరుని శిష్యుడు విష్ణువు యొక్క శుద్ధ భక్తుడు. ఆ మహానుభావుడు వ్యాఖ్యానముద్రతో (విషయబోధ చేయునప్పుడు కుడిచేతి బొటనవేలు చూపుడు వేలును కలిపి పట్టుకొనుట - వ్యాఖ్యానముద్ర) వేదమంత్రముల కనేక విధముల వివరణములను లీలగా చేయుచు శిష్యులకు పాఠము చెప్పుచుండెను. తేజస్సును బట్టి నాలు వేదములోక్కటీయే ఆకారము దాల్చినట్లు శాస్త్ర తత్త్వమును సిద్ధాంతీకరించుటలో నేరుగా సరస్వతీదేవి స్వరమా అన్నట్లు నైపుణ్యము గలిగియుండెను. రాత్రింబవళ్లు శ్రీకృష్ణపాదపద్మములందే ధ్యాన నిష్ఠ గల జీవన్ముక్తుడతడు. సర్వజ్ఞుడు సర్వము చూచువాడు సీదులకు ప్రభువు అతడు.
అతనిని చూచి యశోదాదేవి లేచి నిలబడి అతనికి నమస్కరించి పాదములు కడుగుకొనుటకు జలమును ఆవు పెరుగు తేనె కలిపిన మధుపర్కమను పదార్థమును సమర్పించి సింహాసనముపై కూర్చుండ బెట్టి సంతోషము చిరునవ్వులతో పిల్లవానితో మునికి నమస్కారము పెట్టించెను (ముని ముందు బోరగిలపడుకో బెట్టుట.
మునియు మనస్సులో శ్రీహరికి శత నమస్కారములు చేసి శిశువును మొక్కించినందుకు ప్రీతీలో వేదమంత్రములలో ఆశీస్పులిచ్చెను.
ఆమె శిష్యులకును నమస్కరించెను. వారామె నాశీర్వదించిరి .
వేరు వేరుగా ఆ శీమ్యలకును యశోదా దేవి భక్తితో పాద్యము మొదలగునవి ఇచ్చి అందరి పాదములు కడిగి పీఠములపై కూర్చుండ జేసి తానును కూర్చుండి ఒడిలో కొడుకునుంచుకొనీ భక్తితో తలవంచి చేతులు జోడించి వారినిట్ను ప్రశ్నించ బూనుకొనెను.
స్వాత్మారాములు (బ్రహ్మమును తపులోనే దర్శించుకొని ఆనందించువారు) మంగళమూర్తులు ఐన మిమ్ము ప్రశ్నించుటకు తగినంత దానీని కాకున్నను ప్రస్తుతము మీ మంగళకరమైన నామము నడుగుచున్నాను. అబలను తగిన బుద్ధి శక్తి లేని నా దోషమును క్షమింపవలెను. ఎల్లవేళలందును సజ్జనులు అజ్ఞానుల దోషములను క్షమింతురు.
అయ్యా! తామెవరు? పుణ్య శ్లోకులైన మహరులలో ఈ క్రింది వారిలో తామెవరో చెప్పుము ప్రభూ! ఆంగీరసుడు అత్రి మరీచి, గౌతముడు, క్రతువు, ప్రచేతసుడు, పులస్త్యుడు, పులహుడు, దూర్వాసుడు, కర్దముడు, వశిష్టుడు, గర్గుడు, జైగీషవ్యుడు, దేవలుడు, కపిలుడు, సనత్కుమారుడు, సనకుడు ననందుడు, సనాతనుడు, పంచశిఖుడు, ఆసురీ సౌభరి, విశ్వామిత్రుడు, వాల్మీకీ, వామదేవుడు, కశ్యపుడు, సంవర్తుడు, ఉతథుడు, కచుడు, బృహస్పతి, భృగువు, శుక్రుడు, చ్యవనుడు, నరనారాయణులు, సక్ద్ని పరాశరుడు, వ్యాసుడు, శుకదేవుడు, జైమిని, మార్కండేయుడు, లోమశుడు, కణ్వుడు, కాత్యాయనుడు, ఆస్తీకుడు, జరత్కారువు, ఋష్యశృంగుడు, విభాండకుడు, పౌలస్త్యుడు, అగస్త్యుడు, శరద్వంతుడు, ఆంగిరి, శమీకుడు, అరిష్టనేమి, మాండవ్యుడు, పైలుడు, పాణిని, కణాదుడు, శాకల్యుడు, శాకటాయనుడు, అష్టావక్రుడు, భాగురి, సుమంతుపు, వత్సుడు, జాబాలి, యాజ్ఞవల్క్యుడు, వైశంపాయనుడు, యతి, హంసి, పిప్పలాదుడు, మైత్రేయుడు, కరుషుడు, ఉపమన్యువు, గౌరముఖుడు, అరుణీ, ఔర్వుడు, కక్షివంతుడు, భరద్వాజుడు, దేపశీరుడు, శంకు కర్ముడు, శౌనకులు అని చెప్పబడు వారలలో తామెవరు? జవాబు పొందుటకు యోగ్యను కాకున్నను చెప్పదగును. దాసుడుగాని దాసురాలుగాని తమ ప్రభువును ప్రశ్నించుటకు సమర్థులే. ఎవరు ఎవరి సేవకు నియమింపబడిరో ఆ వ్యక్తులు వారిని ప్రశ్నింపక ఇతరులనెవరినీ ప్రశ్నింతురు.
అయ్యా! నేను ధన్యురాలనైతీనీ, సత్కార్యము లోనర్చినదాననైతిని. నా జీవితము ఫలవంతమైనది. మీ పాదపద్మముల ధూళిని స్పృశించుట వలన కోటి జన్మల పాపములు నశించిపోవును. మీ పాద జుటము తాకినంతలో ఈ నేల అప్పుడే పవిత్రమగును, మీరు వచ్చినంతలో మా యిల్లు పుణ్యభూమి యైనదీ. ఓ మహాజ్ఞానీ వేదశాస్త్రముల వలన ఏయే మహానుభావులు వేదసారభూతుడిగా తెలిసినకొనబడిరో అట్టివారిలో నోకవ్యక్తి నా పూర్వపుణ్యముల ఫలితముగా నాకు కన్పించెను. రూపము దాల్చిన వేదముల వలెనున్న మీ శిష్యులు గ్రీష్మ ఋతువులోని మధ్యాహ్న సూర్యుల వలె వెలుగుచున్నారు. ఈ గోకులమును నావంశమును తమ పాద ధూళిచే ఇప్పటిప్పటికే పావనమొనర్చుచున్నారు. ప్రసన్నమైన మనస్సులతో ఈ నాశిశువునకు ఆశీస్సులీయ తగును. సబ్రాహ్మణుల ఆశీర్వాదము నిండుగా స్వస్తి వాచనము (శుభములకు మూలము) అన్న వాక్కు నిశ్చయము. ఇట్లు నందుని గృహిణి పలికి ఆ ముని ముందు భక్తితో నిలచెను. ఆ సాధ్వి తన భర్తను (నందుని) తోడ్కొని వచ్చుటకొక మనుష్యుని పంపించెను.
శ్రీ గర్గ ఉవాచ :
యశోద వాక్కులు విని ఆ ముని పుంగవుడును అతని శిష్య గణములును పదిదిక్కులను వెళ్లించుచు నవ్విరి. స్వచ్ఛమైన జ్ఞానము గల ఆ మహాముని సంతసముతో హితమును కూర్చునది సత్యమైనది నీతిమంతము శ్రేష్ఠము వినువారికి ప్రీతిని కల్గించునదియైన మాటను ఆమెతో ఇట్లు పలికెను.
గర్గమహాముని పలికెను :
నీ మాట నీ వంశమున కుచితమైనది లోకజ్ఞానము కలది అమృతమయమైనది. ఏ వ్యక్తి ఏ వంశమున జన్మనెత్తునో ఆ వ్యక్తి అట్టివాడే అగును. మొత్తము గోపాలకులలో గిరిభానుడు సూర్యుడు. పద్మావతీ యను అతని భార్య లక్ష్మితో సమానురాలు. ఆమె కన్నకూతురువు నీవు. సంబంధుల యశస్సు (కీర్తి) ను వృద్ధిపొందించు యశోదవు. గోపాలకులలో శ్రేష్టుడగు నందుడు నీకు భర్తగా లభించినాడు. ఓ సుమంగ! నందుడెవరో నీవెవరో ఈ బాలుడెవరో ఎక్కడినుండి వచ్చినో అంతయు నేనెరుగుదును. ఏకాంత ప్రదేశమున నందుని వద్ద అన్ని విషయములు నీకు చెప్పుదును. నేను గర్గుడను. చిరకాలముగా యదువంశము వారికి పురోహితుడను. ఇతరులు చేయరాని ఒక కార్యమొనర్చుట కొఱకు వసుదేవుడు పంపగా నిక్కడకు వచ్చితిని.
ఇంతలో వార్త విన్నంతలోనే నందుడింటికి వచ్చి ఆగర్గమహామునికి అతని శిష్యులకు నేలమీద సాష్టాంగముగా పండుకొని లేచి శిరస్సు వంచి నమస్కరించెను. వారతనికి ఆశీస్సులు సమకూర్చిరి. ఆసనము మీది నుండి త్వరగా యశోద లేచెను. విద్వాంసులలో శ్రేష్ఠుడగు గర్గుడు యశోదానందులను గోనీ సుందరమైన లోపలి గృహములోని కేగెను. యశోద పుత్రునితో బాటు వెళ్లి ముని చెప్పబోవు విషయము గూర్చి ఆనందముగా నుండెను. ఓ నారదమునీ! అపుడు గరుడు జనులు లేని రహస్య ప్రదేశమున రహస్య వాక్యమీట్లు పలికిను.
శ్రీ గర్గ ఉవాచ :
గర్గమహాముని యిట్లు పలికెను :-
ఓయి నందుడా ! నీకు సుఖము కల్గించుమాట చెప్పేదను. వినుము. వసుదేవుడే కారణమున నన్ను పం పెనో దానిని వినుము. నీ పురిటింటిలో వసుదేవుడు ఈ శిశువును ప్రత్యర్పణము (ఒకటి తీసుకొని మరియొకటి ఇచ్చునది) చేసెను. ఈ కుమారుడును (చిన్నవాడు) ఆ పెద్దవాడును (బలరాముడు) ఆ వసుదేవుని పుత్రులే. ఇది నిశ్చయము. అతడిక్కడి నుండి తీసుకొని పోయిన శిశువు నీ బిడ్డ. కంసునికి భయపడి బాలునీ దెచ్చి ఇక్కడ దించి కన్యను మధురకు గొనిపోయెను. ఈ బాలునికి అన్నప్రాశన నామకరణములు చేయుటకై.
రహాన్యముగా నతడే నన్ను పంపెను. ఈ శిశువు శ్రీకృష్ణుడు) పరిపూర్ణ బ్రహ్మ స్వరూపుడు. మాయతో నీ భూమికవతరించి భూభారము తొలగించనున్నాడు. ఇతడు బ్రహ్మచేత సేవింపబడినవాడు. ఏ స్వామి వైకుంఠమున లక్ష్మీ వల్లభుడైన నారాయణుడో ఏ జగత్పిత శ్వేతద్వీప నివాసియగు విష్ణువో జన్మరహితుడైన అతడే గోలోకనాధుడును రాధికాపతియునగు శ్రీకృష్ణ భగవానుడు. కపిలముని నరనారాయణ ఋషులు అన్యులును అతని అంశలే. సర్వలేజస్సుల రాశీ రూపము దాల్చి వచ్చెనా యన్నట్లు వసుదేవునకు దర్శనమిచ్చి తరువాత ఈ శీశు రూపము ధరించెను. ఇపుడు మధురలోని పురిటింటి నుండి నీ గృహమునకు వచ్చినోడు,శ్రీహరి తన మాయా శక్తితో తల్లి (దేవకి) గర్భమును గాలితో నింపి, ఇతడు అయోని సంభవుడు కనుక (మనుష్య గర్భమున పడుట అందులో నుండి జన్మించుట అన్న విలేనివాడు) మహీతలమున ఇట్లు స్వయముగా ఆవిర్భవించెను. ఆవిర్భవించి తన ఆకారమును వసుదేవునకు చూపి అంతర్ధానమయ్యెను.
ఇతనికి (పరమాత్మకు) ఒక్కొక్క యుగమున ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క సోమముండును. తెల్లనివాడు, పచ్చనివాడు, ఎఱ్ఱని వాడు అని. ఇప్పుడు నల్లదనము పొందినాడు. సత్యయుగమున శుక్రవుడు, మిక్కిలి తీవ్రమైన తేజస్సుతో చుట్టబడినవాడు. త్రేతాయుగముననీతడు రక్తవర్ణుడు. ఈ విభుడు ద్వాపరమున పసుపు పచ్చని వన్నెవాడు, లక్ష్మీపతి కలియుగమున నల్లని కాంతీ గలవాడు తేజోరాశీ కూడ. ఇతడు పరిపూర్ణతమమైన పరబ్రహ్మము కనుక కృష్ణుడు అని చెప్పబడినాడు.
ఇక్కడ నుండి కృష్ణ శబ్దము యొక్క అనేకార్థములు చెప్పబడుచున్నవి. “క” అన్నది పరబ్రహ్మమును చెప్పును. ఋకారము (ఎ) అనంతుని (ఆదిశేషుని) చెప్పును. పకారము శివుని చెప్పును. నకారము ధర్మదేవతను చెప్పును. అకారము శ్వేతద్వీపపోసియైన విష్ణువును చెప్పును. విసర్గము (:) నరసారాయణార్థమును చెప్పును. ఇట్లు అన్ని తేజన్సుల రాశీ అన్ని మూర్తుల స్వరూపము గలవాడు సర్వమునకు ఆధారము అన్నిటికి మూలబీజము అగుట వలన కృష్ణుడు (కృష్ణ:) అని చెప్పబడినాడు.
కృష్ అన్నది కర్మనిర్మూలనమును (కర్మలను నశింపజేయుటను) తెలుపు మాట. న్ అన్నది దాస్యమును చెప్పుమాట. “ఆ” అన్నది దాతృ (ఇచ్చు) అర్థమును చెప్పుమాట. కర్మలను (జీవుల) నిర్మూలించి తన దాస్యము నిచ్చును కనుక పరమాత్మ "కృష్ణ” అని చెప్పబడినాడు.
కృష్ అన్నది జీవుని కర్మత్యాగమును తెలుపును. న్ అన్నది భక్తిని తెలుపును. ఆకారము ఫలప్రాప్తిని తెలుపును. ఇట్లు జీవుల కర్మయోగ భక్తి యోగదశల వలన లభించు మోక్షమును చెప్పుటను బట్టి "కృష్ణ" అను శబ్దము చెప్పబడినది .
“కృష్” అనునది సంసార విమోచనమును. న్ కారము ముక్తిని తెలుపును. అకారము దాతృ (ఇచ్చు) అను దాని వాచకము. ఇటు బంధత్యాగమును మోక్షమును ఇచ్చునది గనుక “కృష్ణ" అని చెప్పబడినది.
ఓ నందుడా ! భగవంతుని యొక్క కోటి నామములను స్మరించుట వలన ఏమి ఫలమో ఆ ఫలమును “కృష్ణ" అను నామస్మరణమున నరుడు పొందును. దేనిని స్మరించుట వలన దేనిని పలుకుట వలన దీనిని వినుట వలన కోటి జన్మల పాపములు నశించునో విష్ణువు యొక్క అన్ని నామములలో సారతమమైనది. శ్రేష్ఠతమమైనది. “కృష్ణ” అను సుందరమైన నామము ఇది మంగళమైనది భక్తి భావము కల్గిoచునది.
భక్తుడు కకారమునుచ్చరించుట వలన జన్మమరణము ఋ కారము భగవత్ దాస్యమును ప్రకారము నుచ్చరించుట వలన కోరదగిన భక్తిని, సకారము నుచ్చరించుట వలన కాలమున్నంత వరకు పరమాత్మతో కలిసి వసించుట, విసర్గనుచ్చరించుట వలన భగవంతుని సారూప్యమును ఇట్లు శ్రీకృష్ణ నామోచ్చారణ వలన సంసార బంధవిమోచనమై సామీప్య సాలోక్య సారూప్య సాయుజ్యములను చతుర్విధమోక్షములను పొందుననుమాటలో సందేహము లేదు.
ఓ గోకుల ప్రభూ ! కృష్ణ నామములోని కకారము పల్కినంత మాత్రమున యమ దూతలు వణికిపోదురు. ఋకారముచ్చరింపగనే నిలువలేక పారిపోదురు. షకారముచ్చేరించుట తోడనే పాతకములుసు నకారము పల్కగనే రోగములును అకారము పల్కుటలో మృత్యువును పారిపోగలవు. కృష్ణ నామము స్మరించుటకు పూనుకోనగనే – పల్కుటకు యత్నించగనే - వినుటకు తల పెట్టగనే ఆ నామోచ్చారణమునకు భయపడి అన్ని అమంగళములు పలాయనమై పోవును. ఇది సత్యము.
గోలోకము నుండి రథము తీసుకోని కృష్ణ సేవకులు భక్తుని వద్దకు పరిగెత్తుదురు (కృష్ణ నామము ఏనుట • అతనిని గోలోకమునకు కొని తెచ్చుట అన్నవి వారి ఉద్దేశములు).
విద్వాంసులకు భూమియొక్క ధూళికణములను లెక్కించుట సాధ్యము కావచ్చును. కానీ సాధువులకును భగవన్నామము యొక్క ప్రభావమును లెక్కించి చెప్పుట సాధ్యము కాదు. పూర్వము శంకరుని ముఖవచనము ద్వారా నామమహిమ విని యుంటిని. భగవంతుని కల్యాణగుణముల యొక్కయు నామము యొక్కయు ప్రభావము నా గురువు కొద్దిగా ఎరుగును. సృష్టికర్తయగు బ్రహ్మాయు అనంతుడును ధర్మదేవతయు దేవరులును మనువులును మానవులును, వేదములును, సాధువులును నామ మహిమ యొక్క పదునారవ భాగమును కూడ ఎరుగరు. ఓ నందుడా ! గురు ముఖము నుండి, విన్నంత వరకు నాకున్న జ్ఞానము బుద్ధిని బట్టి నీకుమారుని (శ్రీ కృష్ణుని) మహిమ నీకు చెప్పితిని.
కృష్ణుడు, పీతాంబరుడు, కంసధ్వంసి, విష్టరశ్రవసుడు, దేవకీ నందనుడు, శ్రీశుడు, యశోదానందసుడు, హరీ, సనాతనుడు, అచ్యుతుడు, అనంతుడు, సర్వేశుడు, సద్వరూపధరుడు, సర్వాధారుడు, సర్వగతి అందరు జీవులు పొందదగినవాడు) సత్వకారణకారణుడు, రాధా బంధువు, రాధికాత్ముడు, రాధికాజీవనుడు, రాధా ప్రాణము, రాధికేశుడు, రాధికారమణుడు, రాధికా సహచారి, రాధామానస పూరణుడు, రాధా ధనము, రాధికాంగుడు, రాధికాసక్తమానసుడు, రాధికా చిత్తచోరుడు, రాధాప్రాణాధికుడు, ప్రభువు, పరిపూర్ణతమమైన పరబ్రహ్మ, గోవిందుడు, గరుడధ్వజుడు, ఇవి కృష్ణ నామములు. ఇవి జన్మ మరణములను నశింపజేయునవి (ముక్తి నిచ్చునవి). శంభమైన చూపు గల నoదుడా ! నా వలన విన్న ఈ నామములను నీ హృదయమున నిలుపు కొనుము. నేను విన్న ప్రకారము నీ చిన్న కుమారుని నామములను నిరూపించితిని.
పెద్దవాడైన హరి (బలరాముడు) యొక్క నామముల సంకేతమును (అర్థ వివరణమును) నావలన వినుము. గర్భసంకర్షణము వలన (దేవకి గర్భము నుండి రోహిణి గర్భములోనికి పిండము మారినందుని సంకర్షణుడు అన్న నామము చెప్పబడినది. వేదములలో ఇతని మహిమకు అంతులేనందువలన అనంతుడు అని చెప్పబడినాడు, బలాతిశయము వలన బలదేవుడనియు, హలధారణము (నాగలి పట్టుకొనుట) వలన నితనికి హలీ అని పేరు వచ్చినది. నల్లని వస్త్రముల వలన శీతివాసుడు అనియు ముసలము అను ఆయుధము (రోకలి) ధరించుటచే ముసలి అనియు రేవతీ దేవితో సుఖించునందున (భార్యగా) రేవతీరమణుడనియు నాసమేర్పడినది. రోహిణీదేవి గర్భమున జనించినందున రౌహిణేయుడైనాడు ఆ మహాజ్ఞాని (మహామతి). ఇట్లుగా నేను విన్న జ్యేష్ఠ పుత్రుని నామములు తెలుపబడినవి.
ఇక నేను వెళుదును. నందుడా, నీ మందిరమున సుఖముగా నుండుము” అను గర్గ బ్రాహ్మణుని మాటలు విని నందుడు చేష్టలు లేక నిలిచెను. యశోదయు ఆశ్చర్యపడెను. బాలకుడు స్వయముగా నవ్వెను. నందుడు వినయముగా నమస్కరించి భక్తితో తన తలవంచి చేతులు చేర్చి దోసిలి పట్టి అతనితో నిట్లనెను.
శ్రీ నంద ఉవాచ :
నందుడిట్లు పలికెను :-
స్వామీ ! నీవు వెళ్లిపోయినచో ఈ శిశువులకు చేయవలసిన సంస్కారకర్మ ఏ మహాత్ముడు చేయును? స్వయముగా నీ శుభమైన దృష్టితో చూచి నామకరణ అన్నప్రాశన కర్మలు చేయుము. రాధాప్రాణాధికుడు” అని పదినామములు చెప్పితీవే వాటిలో “రాధ” అన్న వ్యక్తి ఎవరు ? ఎవరి కూతురు ? నందుని ఈ వాక్కులు విని గర్గముని నవ్వెను. మిక్కిలి దాగి ఉన్న రహస్య తత్త్వము నీకు చెప్పుదుననేను .
శ్రీ గర్గ ఉవాచ :
గర్గమహాముని యిట్లు పలికెను :-
నందుడా ! పురాతనమైన ఇతిహాసము చెప్పేదను వినుము. గోలోకమున జరిగిన ఈ వృత్తాంతమును శంకరుని ముఖతః నేను విని యుంటిని. శ్రీదామునకు రాధాదేవికి గోలోకమున పెద్ద కలహము జరిగెను. దైవికముగా ఏర్పడిన శ్రీరాముని శాపము శ్రీకృష్ణుని అర్ధాంగము నుండి (సగము శరీరము) సంభవించిన గోలోక నివాసిని. శ్రీహరికి అన్ని విధముల పోలీస్ సతీమణి, అయోనీ సంభవురాలు మూలప్రకృతి ఈశ్వరి యైన ఆమె శ్రీహరి ఆజ్ఞ వలన ఇప్పుడీ గోకులమున - తన మాయాశక్తితో తల్లి గర్భమును (కలావతి) కేవలము
వాయువుతో నింపి, జన్మించవలసిన కాలమున వాయువు బయటకు వచ్చువేళలో, తాను శిశురూపమును ధరించి శ్రీకృష్ణుని (శ్రీహరి గోలోక ప్రభువు) ఉపదేశముననుసరించి భూమి మీద ఆవిర్భవించినది ఈమె తండ్రి వృషభానుడు. తల్లి కళవతి .
శ్రీకృష్ణుని తేజస్సు యొక్క అర్థభాగము ఆకారము దాల్చిన ఆ సాధ్వీ గోకులములో శుక్ల పక్షమున - చంద్రకళ వృద్ధి పొందినట్లు పెరుగుచున్నది .
ఒక పరబ్రహ్మమూర్తియే రెండుగానైనది. భేదమన్నది వేద మందు నిరూపించబడినది. ఈ శిశువు స్త్రీ ఆ శిశువు పురుషుడో ఆ శిశువు స్త్రీ ఈ శిశువు పురుషుడో రెండు రూపములు చేజస్సు రూపము గుణము పరాక్రమము బుద్ధి జ్ఞానము సంపద అన్న వానిని బట్టి ఒకదానికొకటి సమానమైనవే. భూమి మీదికి ఇతని కన్న ముందామె వచ్చుట వలన వయస్సులో అమె పెద్దది. ఇతడామెను ఎల్లప్పుడు తలంచుచుండును. ఆమె ఈ ప్రియుని ఎప్పుడును స్మరించుచుండును. ఆమె ఇతని ప్రాణములతో నిర్మించబడినది. ఆమె ప్రాణముల చేత నితడు రూపము దాల్చిసాడు. ఇతడు (శిశువగు కృష్ణుడు) రాధ ననుసరించి గోకులమున వచ్చుట శ్రేష్ఠము .
పూర్వము తపస్సు చేసిన వారి ప్రార్థనను స్వీకరించీ నందున దానిని సార్థకము చేయుటకు కంసుని భయమన్నది ఒక మిషగా (బయటకు చెప్పు కారణము) చేసి వరదానమన్న ప్రతిజ్ఞను పాలించుటకే శ్రీహరి గోకులమునకు వచ్చినాడు. భయమునే శాసించు స్వామికి ఇతరుల వలన భయమెక్కడిది.?
రాధశబ్దము యొక్క వ్యుత్పత్తి (పదము యొక్క విశేషార్థము) సామవేదమున చెప్పబడినది. ఆ యర్థమును నారాయణుడు తననాభి కమలమందున్న బ్రహ్మకు చెప్పెను. ఆ బ్రహ్మ తన లోకమున శంకరునకు చెప్పెను. పూర్వము కైలాస పర్వత శిఖరము మీద మహేశ్వరుడు నాకు చెప్పెను. ఓ నందుడా ! దేవతలకు దుర్లభమైన ఆయర్థమును నీకు చెప్పెదను వినుము.
శ్రేష్ఠమై ముక్తినిచ్చు దీనిని సురలు అసురులు మునీంద్రులు వాంఛింతురు (తెలిసి కొనగోరుదురు)
“ర” కారము జన్మపరంపర వలన ఏర్పడు పాపమును పుణ్యపాప కర్మల వలన కలుగు న్వర్గ నరక రూపమైన శుభాశుభములను తెలుపును. “ఆ” కారము. గర్భవాసము (జన్మ) మృత్యువు (మరణము) రోగములను తొలగించుటను తెలుపును. "ధ” కారము ఆయుష్య హానిని, (ఆత్మదేహసంబంధముతో నుండు స్థితి నశించుట) దానిమీది “ఆ” కారము జీవునకు అనాది నుండి ఉన్న సంసార బంధము నశించుటను తెలుపును. ఇట్టి “రాధ” శబ్దమును విన్నను స్మరించిసను ఉచ్చరించినను భవబంధము నశించును (ఇదియొక అర్ధము).
“ర” కారము శ్రీకృష్ణ పాదపద్మములందలి నిశ్చలమైన దాస్య భక్తిని, ఎల్లరచే కోరబడు సదానందమును, అణిమ మొదలగు సర్వసిద్ధులను, పరమాత్మను చెప్పును. “ధ' కారము కాలతత్త్యమున్నంతవరకు జీవునకు పరమాత్మతో కలిసి వసించు స్థితిని, సాలోక్య సారూప్యములను, శ్రీహరితో సమమైన తత్త్వజ్ఞానమును ఇన్నింటిని ఇచ్చుటను తెలుపును. “ఆ కారము శ్రీహరియందున్నట్లు యోగధారణ బుద్ధిని, దాని వలన కలు యోగశక్తిని, తేజస్సును, సర్వకాలము హరిస్మృతిని ఇచ్చుటను తెలుపును. ఇంత శక్తి గల “రాధ” శబ్దమును వినుట వలన పలుకుట వలన స్మరించుట వలన ఆ పనులకు ప్రయత్నించినందు వలన అజ్ఞాన సమూహము పాపరాశి రోగములు శోకములు మృత్యువు యముడు వణకిపోదురు. ఇందు ఎట్టి సందేహము లేదు .
రాధా మాధవుల యొక్క (రాధా, కృష్ణ అను శబ్దముల యొక్క) కొద్దిపాటి వీవరణమేది నేను వినియుంటినో దానిని నాకున్న జ్ఞానమును బట్టి నీకు చెప్పితిని. సంపూర్ణముగా చెప్పుటకు సమర్థుడను గాను. ముందు ముందు సృష్టికర్త యగు బ్రహ్మపురోహితుడుగా ఆనందముతో అగ్నిసాక్షిగా బృందావనములో ఈ యుభయుం (రాధాకృష్ణులు) వివాహము జరుగగలదు.
(అవతార ప్రయోజనమైన దివ్యలీలను శ్రీకృష్ణ కథాసంగ్రహమును గర్గముని తెలుపుచున్నాడు). కుబేరుని పుత్రుల శాపమోక్షణము (మద్దిచెట్లు కూల్చుట) పాలు పెరుగు వెన్నెలు దొంగిలించి తినుట, ధేనుకాసుర సంహారము, అరణ్యమున తాళఫలములను భుజించుట, బకాసురుని, ప్రలంబాసురుని, గుఱ్ఱము రూపున వచ్చిన కేళి అను రాక్షసుని సంహరించుట, బ్రాహ్మణ స్త్రీలను (ముని పత్నులను) భర్తల నిర్బంధము నుండి విడిపించి వారిచ్చిన విందులు భుజించుట, ఇంద్రుని గురించీ గోపాలకులు తల పెట్టిన యాగమును ఆపుట, ఇంద్రుని వర్షబాధ నుండి గోకులమును రక్షించుట, గోపికల వస్త్రములపహరించుట, వారిచేత కాత్యాయనీ వ్రతము చేయించుట, వారికి తిరిగి వస్త్రము లిచ్చి వరము లిచ్చుట, వారి మనసులు హరించి వశము చేసికొనుట, మిక్కిలీ రమ్యమైన అందరికి పరమును వృద్ధి పరచునటువంటిదైన రాసోత్సవము, వసంతకాలమున రాత్రి నిండు చంద్రుడుదయించు వేళలో రానమండలమున నవ సంభోగములో గోపికల మనోరథములను దీర్చుట, ఆసక్తిగా వారితో కలిసి జలక్రీడలాడుట, శ్రీరాముని శాపమూలముగా గోలోకమందలి గోపాలకులను గోపికలను రాధను నూరు సంవత్సరములు వదిలి వియోగ మనుభవించుట, మధురకు ప్రయాణము, ఆకారణముగా గోపికలకు దుఃఖము పెరుగుట, వారికి ప్రబోధము చేసి అధ్యాత్మ విద్యనుపదేశించుట, అక్రూరునికి అతని రథాశ్వములకు వారిచేత పరిచర్యలు రక్ష ఏర్పరచుట, (అన్నవి గోకులముందు శ్రీకృష్ణుని బాలలీలలు).
అక్రూరుడు తనను తీసుకొని పోవుటకై తెచ్చిన రధము నెక్కి మధురా నగరికి పోవుట, తండ్రియగు నందుడు అన్నయగు బలదేవుడు గోపాలకులతో బాటు యమునా నదిని దాటుట, ఆ సందర్భమున యమున నీటిలో అక్రూరునకు తనను చూపుట, జ్ఞానబోధ చేయుట, నదిని దాటిన తరువాత సాయంకాల వేళలో మధురానగరమునంతటినీ దర్శించుట, మాలాకారుడు (పూలమాలలు సిద్ధము చేసి జీవించువాడు) తంతువాయుడు (వస్త్రములు నేసి జీవించువాడు) కుబ్జ (గూని పొట్టి ఐన గంధములు సిద్ధపరచు స్త్రీ) అను వారికి భవ బంధములు తొలగించుట, యాగమండపమును దర్శించి అందులో నున్న శివధనుస్సును విరచుట, కువలయాపీడమను గజమును చాణూర ముష్టికులను మలులను సంహరించుట, రాజదర్శనము చేయుట, కంసుని సంహరించుట, వెంటనే తల్లిదండ్రుల సంకెళ్లను విడిపించుట, మీకు (దేవకి వసుదేవులకు సందాదులకు జ్ఞానబోధ చేయుట, ఉగ్రసేనుని పట్టాభిషిక్తుని జేయుట, అతని భార్యలకు కోడండ్రకు జ్ఞానబోధ చేసి (కంసమరణము వలన కలిగిన) దుఃఖమును పోగొట్టుట (అన్నవి కుమార దశలో చేసిన కార్యములు) .
అన్నయగు బలరాముడు, తాను ఉపనయనము చేసికొనుట, సాందీపని గురువు ద్వారా విద్యాభ్యాసము చేయుట, ఆ గురువునకు చచ్చిన పుత్రులను బ్రతికించి యిచ్చుట, మరల మధురకు వచ్చుట, దుష్టుడైన యవనుని సైన్యములను వంచించుట, ముచుకుందునకు మోక్షప్రాప్తి, ద్వారకానగర నిర్మాణము, ఆసక్తితో యాదవ సమేతముగా ద్వారకా నగరమున ప్రవేశించుట, రాజస్త్రీలను వివాహమాడి వారితో క్లాపురము చేయుట, సౌభాగ్యవృద్ధి పుత్ర, పౌత్రవృద్ధి, శమంతకమణికి చెందిన అసత్యమైన అపవాదు వచ్చుట, దానిని తొలగించుకొనుట, పాండవులకు తోడుగా నిలుచుట, ధర్మరాజు యొక్క రోజసూయ యాగమును లీలగా నిర్వహించుట, భూభారమును తొలగించుట, పారిజాత వృక్షమును తెచ్చుట, ఇంద్రుని గర్వమణచుట, సత్యభామ వ్రతమును పూర్తిగావించుట, బాణాసురుని భుజములను నరికివేయుట, శివ సైన్యములను మర్దించి శివుని ఉద్రేకమునాపుట, బాణాసురుని బిడ్డతో బాటు ( ఉష) అనిరుద్ధుని బంధమును విడిపించీ తెచ్చుట, కాళీని కాల్చుట, కుచేల బ్రాహ్మణుని దారిద్ర్యమును పోగొట్టుట, మరియొక బ్రాహ్మణునికి చచ్చిన పుత్రులను తెచ్చియిచ్చుట, దుష్టజన సంహారము, తీర్థయాత్రలు చేయుట గోకులములోని నందయశోదలను దర్శించుట, రాధతో బాటు మరల ప్రజమునకు వచ్చుట, ద్వారకా నగర జననమునంతటీని ప్రయాణము చేయించుట, శ్రేష్టమైన నారాయణాంశతో భూలోకమున సర్వమునిట్లు నిర్వహించే ఈ నాధుడు (శ్రీకృష్ణుడు) జగన్నాధుడు రాధతో బాటు గోలోకమున కేగును. నీతో కలిసి నారాయణుడు వైకుంఠమును పొందును. (ఇక్కడ గోలోకమున జరుగ బోవునని చెప్పినాను) నరనారాయణ ఋషులిద్దరు ధర్మగేహమున కేగుదురు. విష్ణువు పాల సముద్రమునకేగును. ఓ నందుడా ! ఈ తీరుగా వేదముందు నిర్ణయించిన భవిష్యత్తు నీకు చెప్పబడినది.
ఓయీ ! ఎందుకొరకిక్కడకు నేను వచ్చినో దానిని వినుము. రాబోవు మాఘశుక్ల చతుర్దశినాడు శుభకాలమున (నీవీ బాలురకు అన్న ప్రాశస నామకరణములు అను) కర్మలు చేయుము. ఆనాడు గురువారము రేవతి నక్షత్రము, రేవతి శుద్ధమైన చంద్ర నక్షత్రము. చంద్రుడున్న మీనలగ్నమున లగ్ననాధుడు పూర్ణముగా దర్శనమగు దినమందు -ఉత్కృష్టమైన వణజీ యోగము మనోహరమైన శుభ యోగము కలిగియున్న సుదుర్లభమై అన్నిట శ్రేష్ఠమై ఉపయోగ కరమైన దినమున విద్వాంసులతో ఆలోచించి సంతోషయుక్తుడవై శుభకర్మ చేయుము అని చెప్పి గర్గమునీశ్వరుడు లోపలి యింటి నుండి బయటికి వచ్చెను. అది విని యశోదానందులు హర్షము పొంది ఆ శుభకార్యము చేయుటకు తగు ప్రయత్నములు చేసిరి.
ఇంతలో గర్గమునిని దర్శించుటకై గోపాలకులు గోపికలు బాలబాలికలు నందమందిరమునకు వచ్చిరి. గ్రీష్మఋతువులో మిట్ట మధ్యాహ్నము వెలుగుచున్న సూర్యుని తేజస్సుతో నతడు వెలుచుండెను. నందుని భవనములలోని అలంకార సామగ్రిని చిరునవ్వుతో చూచుచుండెను. యోగముద్ర ధరించి స్వర్ణసింహాసనము పై కూర్చుండి యుండెను. భూత భవిష్యత్తులను అప్రత్యక్షముగా నున్న వర్తమానమును జ్ఞాన నేత్రముతో చూచుచుండెను. మంత్రజవశక్తి వలన హృదయమున స్థిరపడి యున్న భగవంతుని చూచుచుండెను. బయట యశోద ఒడిలోనున్న తన హృదయముందున్నట్లే చిరునవ్వుతో నున్న శిశువును తన గురువగు మహేశ్వరుడొసగిన యోగము వలన ఏ రూపమును తాను చూడగలెనో అట్టి భగవంతుని దర్శించి నిండు తృప్తితో తన మనోరథము నెరవేరగా, పులకాంకురములు ఆనంద బాష్పములు కలవాడై భక్తి సాగరమున మునిగియున్న వానిని ధ్యాన యోగములో హృదయమందలి స్వామికి పూజను ప్రణామములను చేయుచున్న పానిని ఇటువంటి గర్గుని దర్శించి వారు (గొల్లలు) అతనికి ప్రణామములు చేసిరి. అతడు వారికాశీస్సులిచ్చెను.
మునీ ఆసనముందుండెను. వారు తమతమ యిండ్లకు పోయిరి.
నందుడానంద పూర్ణుడై అంతట దూరమందున్న బంధువులకు శుభపత్రికలు వ్రాయించి దూతలను పంపెను.
కుమారుని అన్నప్రాశన సందర్భమున నందుడు ఆసక్తితో పెరుగు పాలు నెయ్యి బెల్లము నూనె తేనే వెన్న మజ్జిగ శర్కరాజలపానకము అను పదార్ధములను విస్తారమైన కాల్వలలో (ఈనాటి ట్యాంకుల వంటి వాటిలో) నిండుగా నింపించెను. శాలి తండులములు (మేలిమి బియ్యము) ఎలైన నూరు పర్వతములు, రాసులు) అటుకులు నూరు పర్వతములు (రాసులు), అన్నిరకముల లవణములు ఏడు పర్వతములు, రాసులు) శర్కర యొక్క పర్వతరాసులు ఏడు, లడ్డూల పర్వతరాసులు ఏడు, పండిన పండ్లు పదహారు పర్వతరాసులు, జవ్వలపిండితో గోధుమల పిండితో వండిన లడ్డూలు అరి సెలు పర్వతమంతటి రాసులు, స్వస్తికమను పిండివంటలు అనేక పర్వతములు (రాసులు) కవర్ధకములను పర్వతరాసులేడు సిద్ధము చేయించేను.
గంధచూర్ణమీశ్రీతమై పరిమళించుచున్న మంచినీటితోను చందనము అగురు కస్తూరీ కుంకుమ పువ్వు వంటి పరీమళ పదార్థముల లోను నిండి కర్పూరాది తాంబూల ద్రవ్యములు గల ఒక విస్తార మందిరము ద్వారములు లేకుండ ఏర్పాటు చేయబడెను, నానావిధ రత్నములు బంగారము ముత్యములు అందమైన పగడములు సంతసముతో సమకూర్చబడెను. నానావిధములైన సుందర వస్త్రములు ఆభరణములు సిద్ధపరచెను.
భవనము యొక్క ముందు భాగమున (వాకిలి) చక్కగా కనపూడ్చి సుందరముగా చందనద్రవముతో అలికి అరటి బోదెలు నిలిపి సన్నని వస్త్రముతో గ్రుచ్చి లేత మామిడి ఆకుల తోరణములను అంతట వేలాడదీసెను. పండ్లు చిగుళ్లు చందనము అగురు కస్తూరీ పూల మాలలతో అలంకరించిన మంగళ పూర్ణకుంభములు అక్కడ పెట్టబడెను, పుష్పమాలలు ఉత్తమ వస్త్రములు రాసులు రాసులుగా (ఇంటిలో) విరాజిల్లుచుండెను. మధుపర్క ద్రవ్యములు (అతిథుల కొరకు) ఉత్తమాసనములు ఫలములు జలకుంభములు రాసులుగా నుండెను, కనులకు చూడముచ్చటగా నున్న అనేకరకములైన ఇతరత్ర లభించనీ వాద్యములు, ఢక్కలు దుందుభులు (నగారాలు) పటహాములు తప్పెటలు) మద్దెలలు మురజములు కొమ్ము వాద్యములు పిల్లన గ్రోవులు బూరలు కంచు తాళములు శరయంత్రములు మ్రోగించబడు చుండెను. విద్యాధర స్త్రీలు సృత్యము చేయు తుమ్మెదల వలె పొడుచు గుండ్రముగా తిరుగుచుండిరి. గంధర్వ నాయకులు రాగతాళములతో సంగీతము పాడుచుండిరి. స్వర్ణ సింహాసనము సమకూర్చుట రథములు తిరుగుట వలన పెద్ద ధ్వనీ ఎర్పడెను.
ఇంతలోనొక వార్తాహరుడు (బయటీచార్తలు చెప్పువాడు) సంతసముతో వచ్చి "అయ్యా! మీ బంధువులు గోపాలరాజులు గోపాలురు గుఱ్ఱముల మీద, ఏనుగుల మీద, రథముల మీద చేర వచ్చినారు. రత్నాలంకార భూషితులైన రాజ కుమారులు కూడ చేరవచ్చినారు. గీరిభానుడు తన అంతఃపుర స్త్రీలను దాసదాసీ జనమును అనేకములైన రథములను ఏనుగులను గుఱ్ఱములను పల్లకీలను వేలకు మించి తీసుకొని వచ్చినాడు. ఋషీంద్రులు ముని గణములు విద్వాంసులైన బ్రాహ్మణోత్తములు వంటిజసము (స్తోత్రములు చేయువారు) భిక్షకులు గుంపులు గుంపులుగా వచ్చినారు. ఇక గోపాల గోపికాజసము యొక్క సంఖ్యను లెక్కించుటకు ఎవరి తరము! నీవు బయటకు వచ్చి చూడవలసినది" అని విన్నవించెను .
ఆ మాట విని గోకుల రాజు (నందుడు) వారీనెదుర్కొని తీసుకొని వచ్చి తన ప్రాంగణములో కూర్చుండబెట్టి పూజామర్యాదలు చేసెను. ఋష్యాది గణములకు సాష్టాంగ నమస్కారములు చేసి శ్రద్ధతో వారికి పాద్యము మధుపర్కము మొదలగునవి సమర్పించెను, ఆ నందుని గోకులమంతయు సమకూర్చిన వస్తువులతో (పదార్దములతో) బంధువులతో నిండిపోయెను. ఒకరి మాట ఇంకొకరికి వినరానంత సందడిగా నుండెను. ఆ సమయమున కుబేరుడు శ్రీకృష్ణ ప్రీతి కొరకు సంతసముతో మూడు ముహూర్తముల కాలము బంగారు వాస కురిపించి గోకులమును పరిపూర్ణ మొనర్చెను. వచ్చిన బంధు వర్గము ఒక క్రీడగా నందుని సంపదను తలలు వంచి చూచి వేడుకను ఆశ్చర్యమును నటించిరి .
ప్రజ (గోకులమునకింకొక పేరు) నాధుడగు నందుడు స్నానమాడి ఉతికి ఆరవేసిన రెండు వస్త్రములు (దోవతి పై పంచె) ధరించి చందనము అగురు కస్తూరీ కుంకుమ పువ్వుల గంధములతో అలంకరింపబడినవాడై దినకృత్యములైన పూజాదులు చేసి పాదప్రక్షాళనము. చేసికొని గర్గముని యొక్క ఇతర ముని గణముల యొక్కయు ఆజ్ఞ తీసుకొని న్వర్లపీఠముపై శుభకర్మ చేయుటకై కూర్చుండెను.
మూడు మారులు ఆచమనము చేసి (అరచేతి గుంటలో నీరు పోసుకోని పుచ్చుకొనుట) గోవింద నామముస్మరించి వేదమంత్రములతో శాక్తముగా పుణ్యాహవాచనము చేసి బాలకుల సమూహమునకు భోజనము పెట్టించేను. సంతసముతో గర్గముని మాటననుసరించి శుభముహూర్తమున బాలకునికి కృష్ణ అను మంగళనామకరణము చేసి రక్ష కల్పించెను. జగత్పతియైన ఆ శిశువునకు సోమకరణము చేసి నెయ్యి తేనేతో బాటు భోజనము (అన్నప్రాశనము) పెట్టెను. మంగళవాద్యములు మ్రోగింప జేసెను. బ్రాహ్మణులకు వస్త్రములను భోజన పదార్థములను నానావిధములైన స్వర్ణాభరణములను ఇతర ధనములను దానము చేసెను. వందిమాగధులకు భిక్షుకులకు విస్తారముగా బంగారమిచ్చెను. మోయలేని ఆ ధనముతో వారు తిరిగి తమ స్థానములకు పోవుటకశక్తులైరి. బ్రాహ్మణులను బంధు వర్గమును భిక్షుకులను కన్నులకింపైన పక్వాన్నముతో నిండుగా భుజింపజేసెను. పెట్టండి పెట్టండి, తినండి తినండి అన్న శబ్దము ఎడతెగకుండ ఆ నంద గోకులములో పెద్దగా వినిపించెను.
ఆ ప్రజ నాధుడు రత్నములను వస్త్రములను బంగారు ఆభరణములను పగడములను శ్రేష్ఠములైన మణులను విశ్వకర్మ చేసిన సుందర స్వర్ణపాత్రలను గర్గముని వద్దకు తీసుకొని వెళ్లి భక్తితో సమర్పించి వినయము ప్రకటించెను. అంతే వినయముతో బంగారు మూటలను అతని శిష్యులకు దానమిచ్చెను. మిగిలిన బ్రాహ్మణ వర్గమునకును పరిపూర్ణముగా దానములు చేసెను.
శ్రీ నారాయణ ఉవాచ :-
నారాయణ ఋషి పలికెను :-
ఆ తరువాత గర్గమహాముని సంతనముతో శ్రీకృషసత్మకొని ఏకాంత ప్రదేశమునకు పోరు ఆ ప్రభువునకు నీండు భక్తితో నమస్కరించి స్తోత్రము చేసెను. శరీరమున పులకలెత్తగా కన్నుల నానంద బాష్పములు రాగా శ్రీకృష్ణుని పాద పద్మములపై భక్తితో శిరస్సునానీంచి చేతులు జోడించి ఇట్లు ప్రార్ధించెను.
శ్రీ గర్గ ఉవాచ :-
గర్గమహాముని యిట్లు పలికెను :-
ఓ జగన్నాథా ! భక్తుల భయములను నశింపజేయు శ్రీకృష్ణా ! నీవు నాయందనుగ్రహము గలవాడవు కమ్ము. నీ పాద పద్మములందు దాస్యము నాకిమ్ము .
భక్తుల కభయమొసంగు స్వామీ ! నీ పెంపుడు తండ్రి నాకు ధనమిచ్చినాడు. దానితో నాకేమి ఉపయోగము. నాకు నీయందు నిశ్చలమైన భక్తిని ఇమ్ము .
ఓ ప్రభూ! యోగము వలన సిద్ధించు అణిమాద్యష్ట సిద్ధుల మీదగాని, ముక్తిమీదగాని, జ్ఞాన తత్త్వమందు గాని, దేవతాదశయందు గాని నాకు కొంచెము కూడ కోరిక లేదు .
ఇంద్రి పదవి యందు గాని చాలకాలమనుభవించదగిన స్వర్గలోక ఫలముందు గాని, మనువుల పదవి యందు గాని నా మనస్సున వాంఛ లేదు. కేవలము నీ పాద సేవయే నాకు కావలసినది .
స్వామీ! నీ పాదములను సేవింపవలయునని తప్ప ఇతరమైన సాలోక్యసారూప్య సామీప్య సాయుజ్యములన్న మోక్ష దశలను పొందు కోరికయు నాకు లేదు. నేనవి స్వీకరింపను
పాతాళమందు గాని గోలోకమందు గాని నివసించవలయునన్న మనోరథము నాకు లేదు. ఇక నాకెడతెగని స్మృతి నీ పాదపద్మములందే నిలచియుండు గాక .
ఎన్ని జన్మల సుకృత ఫలము మూలముగానో శంకరుని నుండి నీ మంత్రమును పొందితిని. ఇక నిన్ను గూర్చిన సర్వతత్వము తెలిసెడి స్థితి గలవాడనై అన్నిటి యందు నిన్ను చూచువాడనై అంతట సంచరించెడి శక్తి నాకనుగ్రహించుము .
ఓ దయాసముద్రారా ! దీనబంధూ ! నాకభయమిచ్చి నీ పాదపద్మములందు భక్తిని కృపచేయుము. ఇక నన్ను మృత్యువేమీ చేయగలును ?
శంకరుడు నీ పాద పద్మములను సేవించుట వలన సర్వదేవతలకు ఈశ్వరుడు, మృత్యువును జయించిన వాడు, కాలునకే (యమునికి అంతకుడు యోగిజనులకు గురువును ఐనాడు.
ఓ పరంబ్రహ్మా ! ఎవని ఆయువులో ఒక్కదినమునే పదునాలుగు ఇంద్రులు పడిపోదురో అట్టి చతుర్ముఖ బ్రహ్మ నీపాద పద్మములను సేవించినందువలననే ఈ జగత్తులకు సృష్టికర్త ఐనాడు .
నీ పాద సేవ వలననే ధర్మదేవత జీవకోటి యొక్క సర్వకర్మలకు సాక్షియై జయించే శక్యము గాని కాలమునే జయించి జీవరక్షకుడును పుణ్యపాపకర్మల ఫలమిచ్చువాడును ఐనాడు.
వేయి ముఖములు గల ఆదిశేషుడు నాగరాజు) నీ పాదపద్మములను సేవించినందువలననే లోకకల్యాణము కొరకు గాను శివుడు తనే గళమున విషము ధరించిన విధముగా ఆ కర్మచేత తాను ధన్యుడైనట్లు భావించి ఈ విశ్వమంతటిని తన తలల పై మోయుచున్నాడు .
నీ దేవీ గణములో సర్వశ్రేష్ఠురాలును జగములకు సర్వసంపదలు కల్గించునదియు నగు లక్ష్మీదేవి తన తలవెండ్రుకలతో నీ పాదములను తుడుచుచున్నది.
సమస్త జగములకు జీవకోటికీ బీజరూపిణి (విత్తనము ఐనది)యు శక్తిస్వరూపిణి ఐన మూల ప్రకృతి నీపాదపద్మములను స్మరించి స్మరించి తనకు నియమించిన కార్యమునందు శ్రద్ధగలికియున్నది కదా.
సర్వదేవ స్త్రీ స్వరూపిణి ప్రాణులకు బుద్ధిశక్తిరూపిణి ఐన పార్వతీదేవి నీ పాద పద్మములను సేవించుట వలననే మంగళుడైన పరమేశ్వరుని తన ప్రియునిగా (పతి) పొందగలిగినది.
సర్వవిద్యలకు అధిష్టాన దేవత (నాయకురాలు) జ్ఞానరూపిణి యైన తల్లి (జ్ఞానము కల్గించునది) యగు సరస్వతీ దేవి ని పాదాంబుజమును సేవించియే సర్వజీవులకు పూజ్యురాలైనది .
నీ పాదములను సేవించిన కారణముగానే వేదమాత యగు సావిత్రీ దేవి (గాయత్రీ మాత) ముల్లోకములను పవిత్రమొనర్చుచున్నది. బ్రహ్మకు (సృష్టికర్తకు) బ్రాహ్మణ వర్గమునకు నీ పాద సేవచేతనే తమ వీధినిర్వహణ సాగుచున్నది.
రత్నములు తన గర్భమున గలదియు సర్వవిధములైన పంటలను జనింపజేయునదియు అగు భూదేవి నీపాద పాద పద్మముల సేవ వలననే ఈ జగత్తును మోయుటకు సమర్ధురాలగుచున్నది .
నా జ్ఞానాంశతో అవతరించినదియు తేజస్సుతో నీకు సాటియైనదియునగు రాధాదేవి నీ హృదయమున స్థానము సంపాదించియు నీపాద సేవ చేయుచున్నది. ఇక ఇతరుని మాట యేమి చెప్పలెను.
ఓ ప్రభూ! శివుడు మొదలగు దేవగణములు లక్ష్మి మొదలగు దేవీ గణములు ఎటు నీ వలన నాధుడు గలవారైనారో అట్లే నన్ను నాథవంతుని (నాథుడు గలవానినిగా జేయుము. పరమేశ్వరుడవగు నీ కృప నీ స్థాయికి సమానముగా నుండవలెను కదా ! స్వామీ ! నీ ధనమును స్వీకరించి ఇంటికి వెళ్లను. నీ పాద పద్మ సేవయందు అత్యాసక్తి గల సేవకునిగా నన్ను చేసి రక్షింపుము.
ఇట్లు (గర్గముని) స్తోత్రము చేసి కన్నుల నీరు బెట్టుకొని శ్రీహరి పాదముల మీద పడెను. శరీరము పులకరించగా భక్తితో మిక్కిలి దుఃఖించెను
భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు గర్గుని వాక్కులు విని నవ్వి అతనితో “నాయందు నీకు స్థిరభక్తి (ఎడతెగని స్మృతిధారి ఏర్పడుగాక” అని స్వయముగా పల్కిను.
గర్గమహర్షికృతమైన ఈ స్తోత్రమును ప్రాతఃకాలము మధ్యాహ్నము సాయంకాలము అను మూడు సంధ్యా సమయములందే సరుడు పఠించునో వాడు శ్రీహరి యందు దృఢమైన భక్తిని నిశ్చలమైన స్మృతిని (తదేకన్మరణను) శ్రీహరి దాస్యము చేయు భాగ్యమును పొందగలును. జన్మము మృత్యువు ముసలితనము రోగములు దుఃఖములు వ్యామోహము అనబడు శరీర సంబంధమైన సంకటముల నుండి దాటింపబడును. శ్రీకృష్ణ దాసులను (భక్తులను) సేవించుట యందు ఆసక్తిగలవాడగును. శ్రీహరి యొక్క వియోగము (సదా) అతనితో కలిసియుండి ఆనందమసుభవించును.
శ్రీ నారాయణ ఉవాచ :-
నారాయణ మహర్షి యిట్లు పలికెను :-
గర్గుడిట్లు శ్రీహరిని స్తుతించి ఆనందముతో ఆ శిశువును నందునకిచ్చెను. “ఇక ఇంటికి పోవుదును, నాకాజ్ఞ యిమ్ము గోపాలా”! అని పల్కిను, ఓహో ఆశ్చర్యము । మోహజాలము చేత చుట్టబడిన సంసారము విచిత్రమైనది. సంయోగము (కలయిక) వియోగము (ఎడబాటు) అన్నవి నరులకు సముద్రములోని నురుగువలె సంభవించునవి
గర్గుని వాక్కులు విని నందుడు భోరున నేడ్చెను. సజ్జనులకు సజ్జనులతో నెడబాటు (ఎడబాయుట - వియోగము) మరణమును మించి బాధాకరము కదా .
ఓ నారదా ! అందరు శిష్యులతో గూడి ప్రయాణమైన మునీంద్రునికి సందుడు మొదలగు గోపాలకులు గోపికలును పరమ భక్తితో నమస్కరించి వినయమును ప్రకటించి (ఎడబాటుకు) దుఃఖించుచుండిరి. ఆ సన్ముని వారికాశీస్సులిచ్చి సంతసముతో మధురకు పోయెను
ఋషులు మునులు బంధువర్గములు గోపాలకులు నందుడిచ్చిన నిండు ధనములతో తమ తమ గృహములకు పోయిరి, వందిజనులు (స్తోత్రముచేయుట వృత్తిగా గలవారు) పిండివంటలు పక్వాన్నములు వస్త్రములు మేలిజాతి గుణములు స్వర్ణభూషణములు గ్రహీంచి కోరికలు నిండుగా తీరి వెళ్లిపోయిరి. భిక్షుకులు గొంతు వరకు భుజించి బంగారము వస్త్రముల భారమెక్కువై నడువజాలక అలిసిపోవుచు సంతోషముతో పోయిరి. (నందునింటికీ శుభకార్యార్థము వచ్చి తిరిగి పోవువారితో) కొందరు మెల్లగా నడచుచుండిరి. మరికొందరు భూమిపై పడుకొనుచుండిరి. కొందరు లేచుచుండిరి. కొందరు త్రోవలో నిలిచిపోవుచుండిరి. కొందరు సంతోషముతో ఆగిపోయి అక్కడనే యుండిరి. కొందరు నవ్వుచుండిరి. భారవస్తువులను కొందరు నేలలో దాచి పెట్టుచుండిరి. కొందరేషదార్థములను ఇతరులకిచ్చి వేసిరి. కొందరు తమకిచ్చిన వాటిని పరులకు చూపుచుండిరి. కొందరు నృత్యము చేయుచుండిరి. కొందరు పాటలు పాడుచుండిరి. కొందరు బహువిధములైన పురాతన కథలను చెప్పుచుండిరి. మరుత్తరాట్, సగర మాంధాతృ చక్రవర్తుల యొక్కయు, ఉత్తానపాద నహుష నల చక్రవర్తుల యొక్కయు కథలను చెప్పుచుండిరి. శ్రీరాముని అశ్వమేధ విశేషములను రంతిదేవుని త్యాగకర్మను ఏయే రాజుల కథలను పెద్దల వాక్కుల ద్వారా వినియుండిరో వాటినన్నింటిని కొందరు చెప్పుచుండగా మరి కొందరు వినుచుండిరి. నిలిచి నిలిచి కొందరు వెళ్లిరి. అక్కడక్కడ నిద్రించుచు లేచుచు కొందరేగిరి. ఈ తీరుగా ఎల్లరును ప్రమోదము (సంతోషము) తో తమ తమ గృహములకు వెళ్లిరి
ఇట్లు శుభకార్యము జరిగినందుకు) నందుడు సంతసించెను. యశోద కుమారుని తన వక్షస్థలమున నుంచుకొని ఆనందించెను. ఆ దంపతులిటు కుబేర భవనమును పోలి సుందరముగా నున్న తమ మందిరమున నివసించిరి. ఈ తీరుగా బాలురైన బలరామకృష్ణులిద్దరు శుక్ల పక్షమందలీ చంద్రకళలవలె పెరుగుచు ఆవుల తోకలను గోడలను పట్టుకొని లేచి నిలబడుచుండిరి. వరుసగా ఒక దినము నాడు ఒక శబ్దములోని పావు భాగమును మరునాడు సగము భాగమును పలుకుటకు సమర్ధులగుచు తల్లిదండ్రులకు హర్షము పెంచుచు ఇంటను వాకిలిలోను నడచుచుండిరి.
ఓ నారదమునీ ! బాలుడైన శ్రీహరి (శ్రీకృష్ణుడు) మోకాళ్లతో ఇంటిలోను వాకిటను నడువ సమర్థుడై తరువాత ఒకటి రెండు అడుగులు వేయ శక్తిగలవాడయ్యేను. సంకర్షణుడు (బలదేవుడు) శ్రీకృష్ణుని కన్న ఒక యేడాది పెద్దపొడు కదా! ఇద్దరిట్లు దినదినము తల్లిదండ్రులకు ముదము పెంచుచు పెరుగుచుండిరి.
తమ మాయాశక్తితో బాలుర రూపములు ధరించి యున్న ఆ బాలురిద్దరు సంతోషముతో బాగుగా నడువ సమర్ధులై ఆ గోకులమందు
తిరుగుచు స్పష్టముగా వాక్యములు పలుకుచుండిరి.
ఓ మునీ ! గరుడు మధురలోని వసుదేవుని నివాసమునకు పోయెను. వసుదేవుడతనికి నమస్కరించి ఆ యిద్దరు పుత్రులకుశలమడిగెను. మహర్షి వారి కుశలమును అక్కడ జరిగిన సోమకరణాన్నప్రాశన మహోత్సవమును వసుదేవునికి చెప్పెను. అది విన్నంతలోనే అతడానంద బాష్పములలో మునిగి పోయెను.
ఆ మాటలు వినుచున్న దేవకీ దేవి కొడుకుల మీద ప్రేమతో మరల మరల ఆ వార్తలడిగీ వినీ ఆనంద బాష్పపూర్ణురాలై కూడ (వారి ఎడబాటుకు మాటి మాటికీ దుఃఖించెను. గర్గముని వారి నాశీర్వదించి స్వగృహమునకేగెను. వారిద్దరు కుబేర భవనమును బోలిన - తమ యింట నివసించిరి.
శ్రీ నారాయణ ఉవాచ :-
నారాయణ మహర్షి యిట్లు పలికెను :-
ఓ నారదా ! ఈ కథ జరిగిన కల్పమునందు నీవు ఉపబర్హణుడను గంధర్వరాజూగా నుంటివి. అప్పుడు నీకు ఏబది మంది భార్యలుండిరి. మంచి యువకుడవు. శృంగార క్రీడయందు నిపుణుడవగు నిన్ను వారందరు ప్రాణములకంటెనధికముగా చూచుకొనిరి. బ్రహ్మదేవుని శాపము వలన దాసీ పుత్రుడవైతివి. ద్విజునీ పోషణలో నుండి విష్ణుభక్తుల ఉచ్ఛిష్ట (తినగా మిగిలిన విస్తరిలోని ఆహారము) మును తినినందువలన ఈ జన్మలో బ్రహ్మపుత్రుడవైతివి. హరి సేవచేయుట చేత సర్వదర్శి (ఆన్ని చూడగలవాడు)వి, సర్వజ్ఞుడవు ఇతరులకు భగవన్నామము జ్ఞాపకము చేయువాడవు (ఎప్పుడును సోమన్మరణ వలన) గా వున్నావు. జన్మము మృత్యువు జురే (ముసలితనము) లను మిక్కిలి నశింపజేయునట్టి శ్రీకృష్ణుని నామకరణ - అన్న ప్రాశన కథను నీకు చెప్పితిని. ఇక తరువాతి చరిత్ర చెప్పుదును.
ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన శ్రీకృష్ణుని అన్నప్రాశన వర్ణన నామకరణ ప్రస్తావనను పదమూడవ అధ్యాయము సమాప్తము.
