4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

42 - సతీదేహ త్యాగము

వసిష్ఠ ఉవాచ - వసిష్ఠ మహర్షి అనెను-

తరువాత అనరణ్యుని కన్య లక్ష్మీదేవి నారాయణుని సేవించినట్లు మనోవాక్కాయములతో (త్రికరణశుద్ధిగా) భక్తిలో మునిని సేవించెను. ఒకప్పుడు ఆకాశగంగకు (దేవనదికి) చిరునవ్వు ముఖముతో స్నానమునకు పోవుచున్న ఆ పతివ్రతను తన మాయతో రాజ రూపము ధరించిన ధర్మదేవత త్రోవలో చూచెను. అతడు నవయౌవనముతో సుందరుడై మన్మథునితో సమానమైన కాంతిగలవాడై రత్నాభరణములు ధరించి సుందరమైన రత్నరథము మీద ఆ సుందరినీ చేరవచ్చి చూచి - ఆ ముని పత్నియొక్క మనస్తత్త్వమును తెలిసికొనుటకు ఆ సుందరితో ఇట్లు పలికెను.

ధర్మ ఉవాచ - ధర్ముడు అనెను :

మనస్సును హరించుచున్న ఓ సుందరీ! లక్ష్మీదేవి వలే రాజపురుషునకు యోగ్యమైనదానా! మంచి యావనమందున్న కామినీ! స్థిరమౌవనము గలదానా! జర (ముసలితనము) తో పీడింపబడుచున్న ఆ వృద్ధుని వద్ద నీవు శోభించుచు లేవు. చందనము అగురు గంధమును ధరించి ఒక రాజపురుషుని వక్షఃస్థలమందు చేరినచో మిక్కిలి శోభింతువు. బ్రహ్మమే సత్యమని తపస్సులో మునిగియున్న మృత్యువుకు దగ్గరపడిన ఆ విప్రుని విడిచి పెట్టి మన్మథుని చేత పీడింపబడుచున్న రతీ కార్యమందు శూరుడనైన రాజేంద్రుడనగు నన్ను చూడుము. పూర్వజన్మ పుణ్యము వలన ఒక స్త్రీ తోను సుందరియై సుందరుడైన పురుమని పొందినచో ఆ రసికుని యొక్క ఆలింగనము చేత ఆ పూర్వ పుణ్యము ఆ సౌందర్యము సఫలమగును. కావున వేయిమంది సుందరీమణులకు ప్రియుడను కామశాస్త్రమందు పండితుడను అగు నన్ను నీ సేవకుని జేసికొనుము. అటైనచో నా ప్రియురాండ్రనందరినీ విడిచి పెట్టుదును. జలము లేని ఏకాంతముగానుండు ప్రతి సుందర పర్వతము మీదను ప్రతినదమందును (పడమటికి ప్రవహించు నది) పుష్పించి మంచి వాసన గల పూలగాడ్పులు వీచెడీ ఉద్యానములలోను, ఇంపైన చందనపు గాలులు వీచెడి మలయ పర్వతమందలీ చందనారణ్యమందును నిండుకోరికతో కామినివైన నీతో విహరింతును, మన్మథజ్వరముతో తపించుచున్న నీకు శాంతిని కల్గించుటకు నేను సమర్థుడను. నాలో విహరించుము.. ఈ నీ జన్మను నఫలము చేయుము.

ఇట్లు పలుకుచు రథము నుండి దిగి తన హస్తమును పట్టుకోనుటకు ఆసక్తి పడుచున్న అతనితో ఆ పతివ్రత ఇట్లు పలికెను.

 పద్మోవాచ - పద్మాదేవి పలికెను :

“ఓరీ పాపకర్మయందు నిలిచిన నీచరాజా! దూరముగా తొలగిపొమ్ము. దూరముగా పొమ్ము. కామబుద్ధితో నన్ను చూతువేని వెంటనే భస్మమై పోదువు. తపస్సు చేత పావనమైన శరీరము గల పిప్పలాద మహామునిని వదిలి పెట్టి స్త్రీలకోడిపోయి తుచ్ఛరతియందు ఆసక్తుడవైన నిన్ను భజించ వలెనా? స్త్రీల చేష్టలచేత ఓడింపబడిన వ్యక్తిని ముట్టుకొన్నంతలోనే సర్వపుణ్యములు నశించిపోవును. మనో నిగ్రహము లేక స్త్రీలచేత జయింపబడిన పాపికంటే మించిన పాపాత్ముడు పాపులలో లేడు. నన్ను బ్రాహ్మణుని భార్యను తల్లివంటి - దానిని ఒక తుచ్ఛ స్త్రీ భావముతో పలుకుచుంటివి. ఈ కారణము వలన కొంతకాలమునకు నా శాపము వలన నీకు నాశమేర్పడగలదు” అప్పుడా పతివ్రతాశాపము వినగనే ఆ ధర్మదేవత రాజశరీరము వదిలి తన నిజశరీరము ధరించి వణికి పోవుచు పలికెను.

ధర్మ ఉవాచ - ధర్మడు పలికెను :

అమ్మా! నన్ను ధర్మజులకు పరమ గురువైన ధర్మదేవతగా తెలిసికొనుము. ఎల్లప్పుడు పరస్త్రీలను తల్లివలె భావించుచుందును, నీ మనస్సును తెలిసికొనుటకే నీ వద్దకు వచ్చితిని, నీ మన సెటువంటిదో నాకు తెలియును. ఐనను దైవప్రేరణ చేత ఇట్లు పలికితిని. ఓ సాధ్వీ! నీవు విధించిన శిక్ష (శాపము) విరుద్ధమైనది కాదు. నేను చేసినదానికి ఉచితమైనదే. మర్యాదకు విరుద్ధమైన దుష్టమార్గములో నడచు వారికి శిక్ష పరమేశ్వరుని చేత నిర్మించబడియే ఉన్నది. సర్వజీవులకు సంబంధించిన ధర్మమును జాతివర్ణములను బట్టి ఏర్పడిన వ్యక్తిగత ధర్మమును తెలిసికొనుటకును కాలమును సమకూర్చుటకును సమర్ధుడై విధాతను నియమించువాడగు ఆ శ్రీకృష్ణునకు నమస్కారము. - తగిన కాలములో లయకర్తయగు భవుని గూడ సంహరించుటకును సృష్టికర్తను లీలగా సృష్టించుటకు ఎవడు సమర్థుడో అట్టి కృష్ణునకు నమస్కారము. శత్రుమిత్రులను - వారి వలన కలుగు కలహము నంప్రీతిని సృష్టించుటకు నాశము చేయుటకు ఎవడు. సమర్థుడో అట్టి కృష్ణునకు నమస్కారము. శాపమిచ్చుటకును సర్వసుఖ దుఃఖములను కలిగించుటకును వరములిచ్చుటకును ఆపదలను సంపదలను కలిగించుటకును ఎవడు సమర్ధుడో అట్టి కృష్ణునకు నమస్కారము. ఎవని చేత ఈ ప్రకృతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విరాట్పురుషుడైన మహావిష్ణువు నిర్మింపబడిరో ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారము.

ఎవడు పొలను తెల్లనివిగా నీటిని చల్లదనము గల దానిగా అగ్నీని కాల్పుదానినిగా పురాతన కాలమందు చేసెనో, అట్టి కృష్ణునకు నమస్కారము. అతి తీవ్రమైన తేజస్సు నుండి వెలుపలికి వచ్చి తేజోరూపమైన ఆకారమునెవడు పొందెనో - లోక కల్యాణకరమైన గుణములచే శ్రేష్ఠుడై ఉత్పత్తి క్షయాది గుణరహితుడై (సత్వ రజస్తమస్సులు లేనివాడు) ఉండునో అట్టి కృష్ణునకు నమస్కారము. సర్వము తానై - సర్వ వ్యక్త సృష్టికి బీజమై - (విత్తనము) సమస్త జీవులలో అంతరాత్మయే - సర్వప్రాణులకు హితము కూర్చు బంధువై ఎవడున్నాడో అట్టి కృష్ణునకు నమస్కారము. ఇట్లు పలికి జగద్గురువైన ఆ ధర్ముడు ఆమె ముందు నిలిచియుండెను. ఆ సాధ్వి అతని వాస్తవ స్థితిని తెలిసికొని వెంటనే ఇట్లనెను.

పద్మోవాచ - పద్మాదేవి పలికెను :

ఓ విభూ! అందరికి ధర్మస్వరూపుడవు నీవు. సర్వజీవుల కర్మలకు ప్రత్యక్షసాక్షివీ నీవు. అందరి హృదయములలో అంతరాత్మవు, సర్వజ్ఞుడు సర్వతత్వములు తెలిసినవాడవు అగు నీవు మా మనస్సును తెలిసికొనుటకని ఈ నీ సేవకురాలినెట్లు మోసగించుచుంటివి? ఓ దైవమా! నీ విషయములో నేను చేసినది సో అపరాధమైనది, అజ్ఞానము వలన స్త్రీకి సహజమైన క్రోధ స్వభావము చేత నా వలన శపింపబడితివి. ఇప్పుడా శాపమునకు ఎటువంటి వ్యవస్థ (ఉనికి - కట్టుబాటు) సంభవించునో అని విచారించుచున్నాను. ఈ ఆకాశము దిక్కులు వాయువులు నశించినను కూడ ఒక సాధ్వి శాపమెన్నటికిని అనుభవమునకు రాక నశించదు. మరి నా శాపమును బట్టి నీవు (ధర్మము) నశించినచో అప్పుడు ఈ సృష్టియే నశించును కదా ఇప్పుడేమి చేయుటకును తోచని మూఢురాలనై ఉన్నాను, ఐనను నీకు కొన్ని వాక్యములు చెప్పుచున్నాను.

ఓ దేవరాజా! పున్నమీసాడు చంద్రునివలె నీవు సత్యయుగములో (కృతయుగము) నాల్గు పాదములతో ఆ యుగము మొత్తము రాత్రింబవళ్లు నిండుగా ప్రకాశింతువు. త్రేతాయుగమందు ఒక పాదము నీకు క్షయమగును. ద్వాపరయుగములో రెండు పాదము (ధర్మము)లుండును, ఇక నాల్గవదియైనే కలియుగములో ఒక పాలు నీధర్మముండును. కలియొక్క చివరి భాగమందు ఆ మాత్రపు ధర్మము కూడ (నాల్గవ పాదము) కప్పివేయబడును. (ధర్మము లోపించిపోవును) తిరిగి సత్యయుగము రాగా నీవు పరిపూర్ణుడు (లుపాదముల ధర్మము) కాగలవు. సత్యయుగములో నీవు సర్వవ్యాపకుడవు. (అందరిలో అంతట వ్యాపించి ఉందువు) ఇతర యుగములలో ఎక్కడనో ఒకచోట ఉందువు. ఎక్కడ నీకు స్థానముండునో నీకాధారముగా ఎవరుందురో చెప్పెదను వినుము.

విష్ణు భక్తుల యందు యతీశ్వరుల యందు బ్రహ్మచారుల యందు పతివ్రతల యందు బుధజనుల యందు వానప్రస్థుల యందు భిక్షా భోజనము చేయు విరక్తుల యందు ధర్మ స్వభావము గల: రాజుల యందు సత్పురుషుల యందు ఉత్తమ వైశ్యులందు బ్రాహ్మణ సేవచేయు శూద్రుల యందు సత్సంగము నందుండు వారియందు వీరియందు ఎల్లప్పుడు నీవు నీండుగా ప్రకాశించి ఉందువు. యుగయుగమందు ఎక్కడెక్కడ పుణ్యతములైన జనులుందురో ఆ ప్రదేశములే నీకాధారము (ఉండుస్థానము). రాగి మర్రి పూరేడు . వృక్షముల యందు తులసీ చందన వృక్షములందు. వ్రత దీక్షలు పట్టుకొను వారియందు ధర్మ పరీక్షచేయు వారియందు ధర్మరక్షకై శపథము పూనిన వారియందు గోవులు నివసించు శాలలయందు గోవుల మేతకై తిరుగు ప్రదేశములందు వివాహోత్సవములందు పూల వృక్షములయందు నీవుందువు. దేవాలయములందు పుణ్యతీర్ధములయందు సత్పురుషుల గృహములయందు వేదములను వేదాంగములను విను వారియందు పుణ్యనదులందు సజ్జనుల గోషులందు శ్రీకృష్ణ గుణ కీర్తనము నామ సంకీర్తనము జరుగు స్థలములందు వ్రతములు దేవ పూజలు.తపస్సు న్యాయ నిర్ణయము జరుగు స్థలములందు యజ్ఞము ధర్మసాక్ష్యము చెప్పువారు గల ప్రదేశములందు గోశాలలయందు గోవులయందు ఉన్నవాడవై లోకమును చూడగలవు. ఓ ధర్మదేవా! ఆ స్థలమందు కూడ కాలమును బట్టి (నా శాపమును బట్టి కూడ) కృశత్వము (నీవు బక్కచిక్కుట) సంభవించును.

పైన చెప్పినవి కాక ఇతర స్థలములలో నీకు కృశించుట సంభవించును కనుక నీవు పోగూడని స్థలములేవియో చెప్పెదను  వినుము.

జారిణులైన స్త్రీలయందు నరహంతకుల గృహములందు, సరహత్యలు చేయు నీచుల యందు, మూర్శల యందు, దుర్జనుల యందు, దేవతలయొక్క, గురువుల యొక్క బ్రాహ్మణుల యొక్క ఇష్ట బంధువుల యొక్క ఇతరుల చేత పోషింపదగీన స్థితిలో నున్న చిన్న పిల్లల యొక్క ధనములనపహరించు వారి యందు, సద్బుద్ధి లేని నరులయందు, వంచకులయందు, చోరులయందు, స్త్రీపురుషులు రమించు ప్రదేశములందు, జూదము మద్యపానము కలహము గల ప్రదేశములందు, సాలగ్రామములు సాధుజనులు పుణ్యనదులు పురాణ కథనము లేని ప్రదేశములందు, దొంగల స్నేహము గలవారియందు, అనవసరవాదము సాగుచున్న స్థలమందు, తాటిచెట్టు నీడ యందు, గరిష్టులున్నచోట, కత్తులమ్మీ కల్మష పదార్థములమ్మి జీవించు వారి యందు భక్తిభావన లేకుండా డబ్బు సంపాదనకై దేవతాపూజ చేయు పోరియందు గ్రామ పౌరోహిత్యము చేయు వారియందు, ఎద్దునెక్కి తిరిగాడు వారియందు, స్వర్ణాభరణములను చేయు కంసాలుల యందు జీవహింసతో జీవించు వారియందు, భర్తచేత తిరస్కరింపబడిన దుష్ట స్త్రీలయందు, స్త్రీల విలాసములకు వశులై మోహముతో ప్రవర్తించు పురుషుల యందు, ఒక వ్రత దీక్ష గాని సంధ్యావందనము గాని విష్ణు భక్తి గాని లేని బ్రాహ్మణుల యందు తమ కూతుళ్లను విక్రయించు వారి యందును తమ భార్యల నమ్ముకొను వారియందును, సాలగ్రామములను దేవ భూములను సర్థంథములను అమ్ముకోను వారియందును, మీత్రద్రోహిచేసిన మేలు మరచు కృతఘ్నుల యందును సత్యమైన మైత్రీ విశ్వాసములను భంగము చేయు వారియందును నీవు చేరగూడదదు.

తనను శరణుపొందిన దీనులను ఆశ్రయించి ఉన్న వారిని ఎవరు హింసింతురో (చంపుదురో) అట్టి నరుల యందు, ఎల్లప్పుడు అసత్యములు పలుకుటయే స్వభావముగా గల వారియందు, గ్రామపు పొలిమేరలను పంటభూముల పొలిమేరలను అపహరించి ఆక్రమించు వారియందు, కామక్రోధలోభములకు వశులై అసత్యసాక్ష్యము చెప్పు వారి యందు దానిని నిలుపుటకై గట్టిగా వాదించు వారియందు, పుణ్యకార్యములు చేయని వారియందు వాటి మీద పగబూను వారియందును - ఈ సంద్యస్థానములలో నీవుండరాదు. అక్కడి నీకధికారము లేదు. ఒకవేళ నీవక్కడ నీలిచినచో వెంటనే నా శాపవచనము సత్యమైనదని భావించుము. (అనగా నీవక్కడ కృశించిపోదువు). “తండ్రీ! నేను భర్త సేవకొరకు పోవుచున్నాను నీవును నీమందిరమునకు పొమ్ము” అని యిట్లు పలుకుచున్న సాధ్విలో బ్రహ్మపుత్రుడైన ధర్ముడు ప్రసన్నవదనుడై మిక్కిలి వినయ వాక్యములను పలికెను.

ధర్మ ఉవాచ - ధర్ముడు పలికేను :

అమ్మా! పతిభక్తిగల నీవు ధన్యురాలవు. నీకెల్లప్పుడు మంగళమగుగాక. నా రక్షణకు మూలమైనదోనా! నీకు వరమిచ్చుచున్నాను. గ్రహింపుము. నీ భర్త నీకు సాంసారిక సుఖము కూర్చగల సమర్థుడు యువకుడగుగాక. ఓ సాధ్వీ! అతడు మంచి రూపవంతుడు - గుణవంతుడు ఎల్లప్పుడు స్థిరమైన యావనము గలవాడగు గాక. నీవు కూడ విశేషమైన ఐశ్వర్యము గలదానవు స్థిరమౌవనవతివి కమ్ము - బిడ్డా! నీ భర్త మార్కండేయుని కంటే అధికముగా చిరంజీవి అగుగాక. కుబేరుని మించిన ధనవంతుడు ఇంద్రుని మించి అధికార సంపద గలవాడగు గాక, శివుని యంతటి విష్ణు భక్తుడు కపిలుని కంటే అధికమైన సిద్ధపురుషుడగు గాక. నీవు జీవిత మున్నంతకాలము స్వామి సౌభాగ్యము (ముత్తైదువతనము) కలదానవు కమ్ము. ఓ సాధ్వీ! నీ గృహములు- కుబేరుని భవనము కంటే అధిక సుఖైశ్వర్యములు కలవి అగుగాక. నీవు సద్గుణవంతులు చిరంజీవులైన పదిమందీ పుత్రులు కల తల్లివగుదువు గాక, వారు నీ భర్తను మించి యోగ్యులగుదురు". ఓ హిమవంతుడా! ధర్మరాజిట్లు పలికి నిలచియుండెను. ఆమె అతనికి ప్రదక్షిణ నమస్కారములు చేసి తన గృహమునకు పోయెను. ధర్మదేవత ఆమెకాశీస్సులిచ్చి తన మందిరమునకు పోయెను. అతడు జనులు నిండియున్న ప్రతి సభలో ఆ పతీవ్రతను గూర్చి చెప్పుచు ప్రశంసించెను. ఆ పద్మాదేవి యువకుడుగా మారినే తన భర్తతో ఏకాంతమున సుఖించెను. తరువాత ఆమెకు భర్తను మించిన గుణవంతులగు పుత్రులు పదిమంది కళిరి. ఓ పర్వతరాజా! నీకిట్లు పురాతనమైన ఇతిహాసము మొత్తము చెప్పితిని.

అనరణ్యుడు తన బిడ్డను కన్యాదానము చేసి సర్వసంపదలను రక్షించుకొనెను. నీవును అట్లే సర్వేశ్వరునకు నీ సుతనిచ్చి నీ బంధువర్గములను నీ సంపదలను కాపాడుకొనుము. నేటినుండి ఏడు దినములు గడిచిపోగా మిక్కిలి దుర్లభమైన శుభముహరాన్తమున్నది. మార్గశిర మాసము సోమవారమున లగ్నాధిపతి చంద్ర బుధులతో కూడి లగ్నముందుండగా - ఆ చంద్రుడును రోహిణీ నక్షత్రయుక్తుడై ఉండగా వధూవరులకు చంద్రతారాబలములు పరిశుద్ధముగా నుండగా ఆ లగ్నము దుష్టగ్రహములు గాని వారి దృష్టి గాని లేకుండ నుండి సర్వపుణ్య గ్రహములు దానిని చూచుచుండగా పతికి సౌభాగ్యము భార్యకు ముత్తైదువుతనము సత్సంతానమును సుఖమును జన్మజన్మల కీయగల, అత్యంతము భార్యాభర్తల ప్రేమ విచ్ఛేదము కాకుండనుండునట్టి మిక్కిలి శ్రేష్ఠమైన ముహూర్తములో ఆ దేవునకు నీకన్యను దానమొనర్చి ధన్యుడవు కమ్ము, శివుడు జగములకు తండ్రి. పార్వతి మూల ప్రకృతి జగములకు తల్లి. కనుక ఈ వివాహమును నిర్వహింపుము (అని పసిష్ఠ మహర్షి బోధించెను).

సర్వదేవతల యొక్క తేజస్సుస్వరూపముగా గల ఈమెను దేవతలందరు పూజింతురు

పూర్వ కల్పములో దేవగణముల యొక్క తేజోరాశి పదిదిక్కులను వెలిగించుచు దేవతల రక్షణార్ధము జగదంబగా ఆవిర్భవించెను (స్వయముగా పుట్టెను). ఆమె తేజస్పుచేత దైత్యులు కాల్చబడి పారిపోయిరి. మరికొందరు భూమిమీద బూడిద కుప్పలై పోయిరి (కాల్చబడిరి). కొందరు ఆ తేజస్సునుండి తమను కాపాడుకొనుటకు గుహలలో చొచ్చిరి. కొందరు రాక్షసులు మూర్చిల్లిరి. కొందరు ఓడిపోతీమని నోటిలో గడ్డి పెట్టుకొని ఆ ఈశ్వరినే శరణు పొందిరి. కొందరు ఆమె పైకి అస్త్రములను విసరిరి. కొందరు ఆమె తేజస్సు ముందు కదలలేక స్తంభించిపోయిరి. కొందరు చాలకాలమాతో యుద్ధము చేసి క్షేమకరమైన స్వర్గమునకేగిరి (చనిపోయిరి), ఆమె అనుగ్రహము వలన దేవతలు శత్రువుల లేనివారైరి. ఆ కల్పాంతములో కృష్ణ పరమాత్మయొక్క ఆజ్ఞచేత ఆ దేవి. దక్షుని పుత్రికగా జన్మించెను. ఆ దక్షుడు శూలపాణికి (శివునకు) ఆ దేవిని. ఇచ్చి శాస్త్రానుసారము వివాహము చేసెను. ఒకసారి మా తండ్రియైన బ్రహ్మయజ్ఞము చేయుచుండగా నిండైన దేవతల సభలో ఆ పరమేశ్వరునితో దక్షుడు పెద్దగా కలహించెను. ఆ సంఘటనకు కోపించిన త్రిలోచనుడు (మూడు కన్నులు గల దేవుడు) మాట్లాడక బ్రహ్మకు నమస్కరించి వెళ్లిపోయెను. దక్షుడు తన బలగముతో పాటు కోపముగా తన గృహమునకు పోయెను.

శంకరుని మీది కోపముతో దక్షుడు యజ్ఞసామగ్రిని సమకూర్చుకొని యజ్ఞమారంభించెను. ఆ యజ్ఞములో సర్వదేవతల కీయవలసిన యజ్ఞభాగమును (హోమ సమయములో ఆ దేవతా మంత్రము చెప్పి అగ్నిలో ఇచ్చేడు ఆహుతిని) దక్షుడు కేవలమసూయతో శివునికీయలేదు. అది చూచిన సతీదేవి ఎర్రని కన్నులతో తండ్రిని కోపించి అనేక విధములుగా బెదిరించి మనస్సు బాధపడుచుండగా ఆ యజ్ఞస్థానమునుంచి లేచి తల్లి వద్దకు పోయెను. త్రికాలజ్ఞురాలైన ఆ పరమేశ్వరి భవిష్యత్తులో జరుగనున్న సంఘటనలను తల్లికి చెప్పెను, యజ్ఞము భంగమగుననియు తన తండ్రికవమానము జరుగుననియు యజ్ఞస్థానము నుండి దేవతలందరు పారిపోదురనియు మునులు ఋత్విజులు (యజ్ఞము చేయువారు) పర్వతములు పర్వతరాజు అందరు చెల్లాచెదరయ్యెదరని శంకరుని సేనలకు జయము కల్గుననియు తాను మరణించుట, తన భర్త తన విరహబాధతో మనస్సు చెదరి లోకమంతట సంచరించుట కన్నీరు పెట్టి దుఃఖించుట, విష్ణువతనికి బోధచేయుట, తాను మరియొక్క రూపముతో శివుని పొందుట తామిద్దరు కలిసి విహరించుట మొదలగు నన్ని విషయములను చెప్పు సతీదేవి అక్కడి నుండి వెళ్లిపోయెను.

తన తల్లియును తోబుట్టువులును పోపలదని వారించినను దుఃఖించుచు యోగసిద్ధిపొందిన సతీదేవి యోగముతో వారందరికి కన్పించకుండ అదృశ్యరాలై గంగాతీరమునకు పోయి శంకరుని ధ్యానించి మనసా పూజించి అతని పాదపద్మములను స్మరించుచు ఆ దేహమును త్యజించి గంధమాదన పర్వతముయొక్క లోయలో నున్న తన శరీరమున ప్రవేశించెను. పూర్వము సర్వదైత్యుల సమూహమును సంహరించిన మూర్తియే ఆది. అప్పుడా సంఘటన చూచి దేవతలందరు అత్యాశ్చర్యముతో హా హా అని పలికిరి.. ఇక శంకర సైన్యములు పోయి దక్షయజ్ఞమును నాశము చేసి సతీదేవి మరణమునకు మిక్కిలి దుఃఖితులై యజ్ఞభూమిలో నున్న అందరికీ పరాభవము (అవమానము) కల్గించిరి. వెంటనే సర్వవృత్తాంతము శివునికి విన్నవించిరి. ఆ వార్త విన్న సంహారకుడైన శంకరుడు తన గణములతో గూడి దేవీ శరీరము పడి ఉన్న గంగానదీ తీరమునకు పోయెను.

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదములోని సతీదేవి యొక్క దేహత్యాగమనెడి నలుబది రెండవ అధ్యాయము సమాప్తము.