4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

47 - రాధాశ్రీకృష్ణ సంవాదము

నారద ఉవాచ - నారదుడనెను :-

విలాసక్రీడ తరువాత రాధాదేవి తన విభుడైన హరినేమని ప్రశ్నించాను. అతడేకథను చెప్పెను. ఓ దయానిధీ! చెప్పుదువుగాక!

శ్రీ నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను :

సుఖక్రీడ ముగించి రాధను ముందుంచుకొని మలయపర్వత మూలములో మర్రిచెట్టు క్రింద కూర్చున్న తన మనోహరుని రాధాదేవి చిరునవ్వు నవ్వుచు ఇంతవరకు రహస్యముగా నుండి వినెడి కోరికను కల్గించునట్టి ఇంద్రుని దర్పభంగకథను గూర్చి ప్రశ్నించెను.

శ్రీ రాధికోవాచ - రాధాదేవి అనెను :

శూలపాణీ యొక్క కీర్తిని, దైవికముగా ఏర్పడిన దర్పభంగమును, పార్వతి దర్పభంగమును వారి వివాహమును వింటిని. ఇప్పుడు ఇంద్రుని యొక్క దర్పభంగమును (గర్వభంగము) అట్లే క్రమముగా మిగిలిన వారి యొక్క గర్వభంగమును వినగోరుచున్నాను. శ్రీహరీ! జగద్గురూ! విస్తరించి చెప్పుమా.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను :

సురపతికైన దర్పభంగము లోకుల చేత వినబడినదే. సుందరీ! సుందరమును కర్ణామృతమునగు సాటిలేని ఆ కథను వినుము. పూర్వమీంద్రుడు గర్వముతో నూరు యజ్ఞములు చేసి శతమఖుడన్న నామము ధరించెను. దానితో సర్వదేవాధ్యక్షుడు సంపన్నుడు ఆయెను. తపస్సుల ఫలము వలన దీనదినమతని ఐశ్వర్యము వర్ధిల్లుచుండెను. దానికి తోడుగా బృహస్పతి ఒక సిద్ధమంత్ర దీక్షనిచ్చెను. ఇంద్రుడా మహామంత్రమును పుష్కర క్షేత్రములో నూరేండ్లు జపించి మంత్ర సిద్ధిపొంది కోరిక నిండినవాడయ్యెను. సంపదల వలన మూఢుడైన అతడు బ్రహ్మయొక్క వీవర్తన రూపమైన ఈ ప్రకృతిని ఆదరించక లక్ష్య పెట్టకుండెను. ఆ ప్రకృతి అతని శపించెను. అతి కోపము పొందిన గురువు యొక్క శాపమును కూడ ఇంద్రుడు పొందెను.

ప్రకృతి శాపము వలన బుద్ధి దెబ్బతిన్న (బుద్ధిమాలిన) ఇంద్రుడొకసారి తన సభలో బృహస్పతిని చూచి లేవలేదు, నమస్కరించలేదు. మదించి యుండెను. అప్పుడు బృహస్పతి కోపముతో నక్కడ నిలువక ఇంటికి వచ్చెను. అతడు తారాదేవి ముందుండక తపస్సునకడవి కేగెను. మానసికముగా దుఃఖితుడైన గురువు ఇంద్రుని సంపద తొలగి పోవుగాక అని పలికెను.

తరువాత (సంపదలు తొలగిన) ఇంద్రుడు మతిని పొంది నా ప్రభువు. (గురుదేవుడు) ఎక్కడ పోయెనని వేగముగా పీఠము నుండి లేచి తారాదేవి వద్ద కేగెను. తల్లికి నమస్కరించి భక్తితో చేతులు జోడించి వంగి భీషయమంతయు విన్నవించి మరల మరల పెద్దగా రోదించెను. పుత్రుని యొక్క దుఃఖమును చూచి తారాదేవి కూడ మిగుల దుఃఖించెను. చిన్నవాడా! ఇంటికేగుము. ఇప్పుడు గురువును దర్శింపజాలవు. ఈ దుర్దినములై పోయిన పిదప గురువును పొంది తిరిగి లక్ష్మిని పొందగలవు. దుర్బుద్ధిగలవాడా! తెలివితక్కువవాడా! ఇప్పుడు చేసిన కర్మల ఫలమనుభవించుము. దుగ్గినము ప్రాప్తించినప్పుడు గురువుల విషయమున దోషము (అపచారము చేయుట సుదీనము సంభవించినపుడు గురువును సంతోషపరచుట ఇది కాలమహిమ. ఇంద్రా! సుఖదుఃఖములకు కారణము సుదినము దుర్దినములే కదా! ఇట్లు పలికి పతివ్రతయగు తారాదేవీ విరమించెను.

ఇంద్రుడు స్నానము చేయుటకై దేవనదికేగెను. అక్కడ సుందర రూపము గల స్నానమాడుచున్న ఒక స్త్రీని చూచెను. చిరునవ్వులు - ఓర చూపులు గల ఆమె గౌతముని భార్యయగు అహల్య. ఇంద్రుడామె యొక్క విస్తారమైన పిరుదుల ప్రదేశమును మనోహరముగానున్న స్తనములను చూచి కామ భావము చేత మోహితుడై ఒడలు మరచెను.. తెలివికి రాగానే స్నానము వదిలి పెట్టి ఆమె భర్తయైన గౌతమునీ వేషము ధరించి ఆమెవద్దకేగెను. అట్లు చేరబోయి తడిబట్టలతో సున్న ఆమెను మన్మథ పీడితుడై తనవైపు లాగుకొనీ ఇద్దరి మనస్సులకీంపగునట్లు వివిధముగా శృంగార కర్మ ఆచరించెను. ఆ ముని కామిని సుఖమైన సంభోగము వలన కామాతిశయము చేత మూర్ఛపొంది జాడ్యము పొంది. చేష్టలు (ఏ కదలికలు) లేనిదయ్యెను. ఆ దేవరాజు కూడ నిశ్చేష్టుడై ఉండెను.

ఇంతలో మునీశ్వరుడైన గౌతముడు తపమొనర్చి ఇంటికి చేరవచ్చి ఆ యిద్దరు సంభోగించుచుండగా చూచెను. చూచిన ముని అగ్నివలె మండిపోవుచు కోపించి ఏజ్ఞానముతో అతి రోషముతో వారి రత్యానందమును భగ్నము చేసెను. ఇంద్రుడు తెలివి పొంది మునిరాజును చూచి భయముతో కాలస్వరూపుడుగా నున్న ముని పాదపద్మములను పట్టుకొనెను, భయముతో కాళ్లమీద పడిన ఇంద్రునితో కోపము వలన ఎర్రబడిన కన్నులు గల గౌతముడు నీతివచనములీట్లు పలికెను.

గౌతమ ఉవాచ - గౌతమ ముని అనెను :

ఇంద్రా! దేవతలలో శ్రేష్ఠుడా! కశ్యపప్రజాపతి పుత్రా! పండితుడా! జగత్కర్తయైన బ్రహ్మకు మునిమనుమడా! నీ బుద్ధి ఎట్లు ఇటువంటిదైనది. నీన్ను ఛీ కొట్టుచున్నాను. దక్ష ప్రజాపతీ నేరుగా నీ తాత (తల్లితండ్రి) తల్లియైన అదితిదేవి మహాపతివ్రత. కర్మలచేత సాధింపదగిన స్వభావము (తపస్సు మొదలగు కర్మలచేత నిగ్రహింపబడవలసిన వ్యక్తి స్వభావము) కులధర్మమునింత బాధ పెట్టుచున్నదే. వేదము తెలిసిన జ్ఞానివి కర్మచేత యోనిలుబ్ధుడవైతివి. (నీచకాముకుడవైతివి) దీని వలన నీ శరీరమందు వెయ్యి యోనులేర్చడుగాక. నిండు సంవత్సర కాలము ఎల్లవేళల యోని దుర్గంధము నీవు పొందుదువుగాక. తరువాత. సూర్యునారాధించగా అతని అనుగ్రహము వల నీయందలి యోనులు కన్నులు కాగలవు. ఓ. మూడుడా! ఏ కారణము వలన నీచేత. నా ప్రాణేశ్వరి చెడగొట్టబడెనో ఆ నా శాపము నీ గురువు యొక్క కోపము వలన నీవిప్పుడు భష్ట శ్రీకుడవు (సంపదలు భ్రష్టమైన దరిద్రుడవు) కమ్ము.

ఓ మూడుడా! బృహస్పతి మీది ఆదరము వలన నీ ప్రాణములపహరింపబడలేదు. మిక్కిలి తేజోవంతుడు నాకు దగ్గరి బంధువైన అతని బంధుత్వమందు భేదమేర్పడునన్న భయముతో ఆ పని చేయకుంటిని, లే లే దేవేంద్రా! నీ యిల్లు చేరబొమ్ము. శుభాశుభము . లేవైనను అవియన్నియు కర్మ వలననే ఉద్భవించుచున్నవి. గౌతముడు పలికిన మాటలను బట్టి ఇంద్రుడు పుష్కర క్షేత్రమునకు పొయి భక్తితో సూర్యారాధన చేసి శాపనిష్కృతిని (పరిహారమును) చేసుకొనెను.

పాదముల మీద పడిన అహల్యను గూర్చి మునిరాజిట్లు పలికెను. ప్రియురాలా! కోమరహితవైన నిన్ను ఇంద్రుడు కొమించెను. నేనది యంతయు ఎరుగుదును. నీవు వనములోనికేగి రాతిరూపును ధరించి చాలకాలముండుము. ఓ అధమురాలా! కామము లేకున్నను పరునికీ భోగ్యవైతివి. కోరిక వలన గాని కోరిక లేక కనీ పరుని వీర్యము ఏ స్త్రీ గర్భమున దైవికముగా పడునో అట్టి నీవు నాకిప్పుడు నీవు భోగ్యవు (అనుభవింపదగినదానవు) కావు. అహల్యా! దానికుపాయము చెప్పెదను వినుము.  కామము (వాంఛ) లేనందున స్త్రీ ప్రాయశ్చిత్తముతో పరిశుద్ధురాలగును, కామసుఖానుభవములో ఆమెను త్యజించవలెను. శారీరకర్మకు తగిన పాప ఫలానుభవము వలన ఆమె పరిశుద్ధురాలగును. పితృదేవతల శ్రాద్ధకమునకు గాని వైశ్య దేవాది దేవ కర్మల పాకమునకు గాని పూజకు గానీ ఆమె అర్జురాలు కాదు. కాముకురాలు అరవై వేల సంవత్సరములు కాల సూత్ర నరకము పొంది తన కర్మ క్షయము చేసికోవలెను సుమా!” ఇట్లు పలికిన భర్త వచనముల వలన భయపడి అహల్య భర్తకు నమస్కరించి నాథా నాథా అని ఏడ్చుచు అరణ్యమును పొంది అరువై వేల సంవత్సరములు .. శిలగా పడి ఉండి కర్మఫల భోగమనుభవించి శ్రీరామచంద్రుని పాదస్పర్శచేత వెంటనే పరిశుద్ధురాలయ్యెను. తరువాత ఆ అహల్య త్రిలోక మోహనమైన రూపము ధరించి గౌతముని సమీపమున కేగెను. గౌతమముని ఆ సుందరినీ పొందెను.

ఓ సుందరీ! విశేషమైన ఇంద్రుని వృత్తాంతమును వివరించి చెప్పెదను వినుము. అది పాపమును నశింపజేసి పుణ్యమునకు బీజమగునట్టిది సుమా! ఒకసారి గురువు యొక్క కోపము వలనను ప్రకృతిని తిరస్కరించి నందు వలనను నష్టబుద్ధియైన ఇంద్రునికి బ్రహ్మ హత్యా పాపమేర్పడెను. తన గురువును వదిలివేసి అదృష్టము లేక దైత్యుల చేత పీడింపబడి ఇంద్రుడు జగత్తునకు తండ్రియైన బ్రహ్మను శరణుపొందెను. అతని ఆజ్ఞననుసరించి విశ్వరూపుడను వానీని పురోహితునిగా చేసికొనెను. ఆ విషయములో బుద్ధిహతుడైన ఇంద్రుడు దైవ ప్రభావము వలన విశ్వరూపుని యందు విశ్వాసము (నమ్మకము) కలవాడై నష్టపడెను. దైత్యుల బిడ్డ కొడుకైన ఆ విశ్వరూపుని భావము (హృదయములోని ఆలోచనను) తెలిసికొని విమర్శ జ్ఞానముండి కూడ తొందరపడి వాడి బాణముతో వాని శిరస్సును లీలగా ఖండించెను.

విశ్వరూపుని తండ్రియైన త్వష్ట తన పుత్రునింద్రుడు సంహరించినందుకు వెంటనే కోపము పొంది (సభలో) ఇంద్రుని శత్రువైనవాడు వృద్ధిపొందుగాక యని పలికీ యజ్ఞము చేసెను. మంత్ర శక్తి వలన యజ్ఞకుండము నుండి వృత్రుడను మహాసురుడు జన్మించెను. ఆ వృత్రుడన్నవాడు కోపముతో శ్రమలేకుండ దేవతలను నిగ్రహించే (శిక్షతో అదుపులో పెట్టి)ను. అప్పుడు దధీచి మహాముని యొక్క ఎముకలను మిక్కిలి దారుణమైన వజ్రాయుధముగా నిర్మించి ఇంద్రుడు దేవకంటకుడైన వృత్రుని సంహరించెను. అపుడు నష్టబుధియైన ఇంద్రుని మీదికి బ్రహ్మహత్యా పాపము రక్త వస్త్రము ధరించిన వృత్రుని భార్య వేషమున తరుముకోని వచ్చెను. ఆ స్త్రీ ఏడు తాడిచెట్ల ఎత్తుగలదై కంఠము పెదవులు దవడలు ఎండుకపోయి సాగలి కోల యంతటి. నోటి కోరలతో ఇంద్రుని మిక్కిలి భయ పెట్టెను.

బుద్ధి కోల్పోయి పరిగెత్తుచున్న ఇంద్రుని వెంట దయాహీనయు ఖడ్గము ధరించినదియు బలవంతురాలైన ఆ శక్తి వేగముగా పరుగెత్తుచుండెను. ఇంద్రుడా ఫరాకృతిని చూచి తన గురువు యొక్క పాదములను స్మరించి స్మరించి తామర తూడులోని దారము ద్వారా మానన నరస్సున ప్రవేశించెను. బ్రహ్మ శాపము వలన అక్కడికి పోజాలక బ్రహ్మ హత్యా దోష శక్తి సరస్సు తీరమున గల మర్రి కొమ్మ పై నిలిచియుండెను.

ఇక స్వర్గములో నహుషుడన్న మానవపతి త్రిలోకేశుడు (ఇంద్రుడు) అయ్యెను. ఆ నహుషుడు దేవతలను శచీ దేవిని స్వాధీనపరచుడని కోరెను. స్వర్గపతియైనందున అతడు బలాధీకుడు దేవతలు అతని చేత పాలింపబడువారు కనుక దుర్బలులైరి. (అనగా శచీదేవిని కోరుట కూడదని చెప్పలేకపోయిరి). ఈ వార్తను విన్న శచీదేవి మిక్కిలి భీతురాలై గురుపత్నియైన తారాదేవిని శరణుపొందెను. తార తన భర్తనోత్తిడి చేసి తమ శిష్యునీ భార్యను రక్షించెను. బృహస్పతి శచీదేవి నోదార్చి మానస సరస్సు వద్దకేగెను. నష్ట బుద్ధియై పిరికీ తనముతో నున్న ఇంద్రునాహ్వానించెను.

బృహన్నతిరువాచ - బృహస్పతి అనెను :

“వత్సా! లేలెమ్ము, నేనుండగా నీకు భయమెందుకు? నేను నీ గురువును.  కంఠస్వరమును విని గుర్తించుము. భయము వదలుము" అను బృహస్పతి కంఠస్వరమును గుర్తించి సర్వసిద్ధేశ్వరుడైన ఇంద్రుడు సూక్ష్మరూపమును త్యజించి తన రూపమును ధరించెను. వెంటనే లేచి సంభ్రమముతో వచ్చి సూర్యుని వంటి తేజస్సు గలిగి, పూర్వకోపమును విడిచి సంప్రీతితో నున్న బృహస్పతికింద్రుడు నమస్కరించెను. భయముతో మనస్సు చెదిరీ తన పాదముల మీద పడి రోదించుచున్న శిష్యుని గురువు ప్రేమతో కౌగిలించుకొని ప్రేమతో కదిలిపోయిన మనస్సుతో రోదించెను. ఇట్లు తన మీద తుష్టినొంది ఏడ్చెడి బృహస్పతిని చూచీ సురేంద్రుడు భక్తితో శిరస్సు వంచి పులకించి పోయి అంజలీ పట్టి స్తుతించెను.

ఇంద్ర ఉవాచ - ఇంద్రుడనెను :

"ఓ దయానిధీ! భగవన్! నా దోషమును క్షమించి దయచూపుము. సత్ర్పభువు తన భృత్యుని అపరాధమును పట్టుకొనడు. తన భార్యలను తన శిష్యులను తన సేవకులను తన పుత్రులను, బలవంతుడు గాని బలహీనుడు గాని శిక్షించుట కెవనికి శక్తి యుండదు. మూడు కోట్ల దేవతలలో బుద్ధి హీనుడైన చిన్న వ్యక్తిని నేను. ఓ దేవగురూ! నీ అనుగ్రహము వలన నీ కృపచేత నేను పెంచి పోషించబడితిని. నన్ను సంహరించుటకును నీవు అధికారి, నేనెవడైనను నీ ముందు పురుగు వంటి వాడను. నీవు నేరుగా సృష్టికర్త పౌత్రుడవు మరియు. స్వయముగా సృష్టింప సమర్థుడవు”. ఇట్టి ఇంద్రస్తుతిని విని గురువు సంతోషించి ప్రేమతో ప్రసన్నమైన ముఖము చూపులు కలవాడై (క్రింది విధముగా) వచనములు పలికెను.

గురురువాచ - బృహన్నతి పలికెను :

“ఓ అదృష్టశాలీ! స్థిరముగా నుండుము. చలనము లేని సంపదను పొందుము. పూర్వము కంటే నాల్గింతలైన పరమైశ్వర్యమును పొంది అమరావతికేగి రాజ్యమేలుము. నా అనుగ్రహమువలన శత్రు సంహారమొనర్చి పోయి పతివ్రతయగు శచీదేవిని చూడుము”, ఇట్లు పలికి గురువు శిష్యునితో పోవుటకు ముందడుగు వేసి తనముందు భరించరాని ఘోరమైన బ్రహ్మహత్యారూపమును చూచెను. - దానిని చూచిన ఇంద్రుడు మిక్కిలి భీతుడై గురువును శరణుజొచ్చెను. బృహస్పతి కూడ మిక్కిలి భీతిల్లి మధుసూదనునిని . (శ్రీహరిని) స్మరించెను. ఇంతలో అల్పమైన అక్షరములు అనేకార్థములు కల అశరీరవాణి (ఆకాశవాణి - దేవవాణి) ఏర్పడెను (వాక్కు వినవచ్చెను). ఓ రాధా! ఆ వాక్కు ఇది. “ఓ గురూ! ఈ మాట విని సర్వవిధములైన అశుభములను వినాశము చేయునట్టి సంసార విజయమను దానిని ఉపదేశించి ఇప్పుడు శిష్యుని రక్షించుము".

అప్పుడు శిష్యునియందు ప్రేమగల గురువు తన శిష్యునికి నీ కవచమును (రాధాకవచము) ఉపదేశించి తన హుంకారము చేత అనాయాసముగా ఆ బ్రహ్మ హత్యను భస్మము చేసెను. తరువాత శిష్యుని వెంట బెట్టుకొని అమరావతికి పోయెను. గురువు చెప్పిన మాటను బట్టి ఇంద్రుడు తన శత్రువు చేత ఛిన్నాభిన్నము చేయబడిన నగరమును చూచెను. భర్త వచ్చుట విన్న శచి మిక్కిలి హర్షము గల మనస్సుతో వచ్చి భక్తితో గురువుకు తన కాంతునికి నమస్కరించెను. ఇంద్రుని రాక విని దేవతలందరు చేరవచ్చిరి. ఋషులు మునులు హరపరవశులైరి. అమరావతిని చక్కగా పునర్నిర్మించుటకు ఇంద్రుడు నియోగించగా శిల్పి అమరావతిని నిండుగా నూరేండ్లు నిర్మించెను.

శ్రేష్ఠమైన రత్నముల చేత నిర్మితమై నానా రత్నముల విచిత్రముల చేత అతిశయమై మనోహరముగా .సాటి లేనిదిగా నిర్మితమైన దానిని చూచి ఇంద్రుడు సంతుష్టుడు కాలేదు. ఇంద్రుని ఆజ్ఞ లేక విశ్వకర్మ తన గృహమునకు పోవుటకు సమర్థుడు కాకుండెను. అతని అభిప్రాయమును తెలిసికొన్న బ్రహ్మ తనంత తానుగా శిల్పితో నీ కర్మ పూర్తి అగువరకు రేపటి వరకు నీ పని ముగియును అని చెప్పెను. ఆ మాట విని శిల్పి తిరిగి శీఘ్రముగా అమరావతి కేగెను. బ్రహ్మ వైకుంఠమును చేరబోయి తల్లికి (లక్ష్మీదేవికి నమస్కరించి చెప్పెను.

విష్ణువు బ్రహ్మనూరార్చి. అతని గృహమునకు పంపి తాను బ్రాహ్మణ రూపము ధరించి అమరావతి కేగెను. ఒక దండము ఒక ఛత్రము తెల్లని వస్త్రము ఉజ్జ్వలముగా నున్న తిలకమును ధరించి మిక్కిలి పొట్టివాడు తెల్లని పలువరుస గలవాడు చిరునవ్వుతో మిక్కిలి మనోహరముగా నున్నవాడు వయస్సులో శిశువు బుద్ధిలో జ్ఞాన వృద్ధి చేత మిక్కిలి నేర్పు గలవాడు తాను బ్రహ్మను సృష్టించి సర్వసంపద లీచ్చినవాడు ఇంద్రుని ద్వారమందు నిలిచి ద్వారపాలునీతో “బ్రాహ్మణుడు ద్వారమందున్నాడు. త్వరగా నిన్ను చూడవచ్చినాడని చెప్పుము” అని పలికెను. వాడా వార్త ఇంద్రునకు తెలిపెను. ఇంద్రుడు వచ్చి బాలకులతో బాలికతో కూడియున్న బ్రాహ్మణ బాలకునీ మహోత్సాహముతో చిరునవ్వు నవ్వుచు తేజస్సుతో కూడియున్న వానిని - చూచి భక్తితో ఆ శిశురూప హరికి నమస్కరించెను. భక్తవత్సలుడైన ఆ హరి ప్రీతితో ఇంద్రునికాశీస్సులిచ్చెను.

ఇంద్రుడు మధుపర్కము మొదలగునవి ఇచ్చి పూజించి “ఎక్కడి నుండి నీరాక చెప్పుము” అని ప్రశ్నించెను. ఇంద్రుని వాక్కు విని బృహస్పతి తండ్రికి తండ్రి (విష్ణువు) అగు ద్విజబాలుడు మేఘధ్యనివలె గంభీరముగా నున్న వాక్కుతో పలికెను.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడనెను :

“ఓయీ! నిన్ను చూచుటకు కోరిన మాటను నిన్నడుగుటకు నేను ఇక్కడికి చేర వచ్చితిని.. అద్భుతమైన నగర నిర్మాణము గూర్చి విని యుంటిని. దీని నిర్మాణమునకు నీవెన్ని సంవత్సరములు పట్టునని అరెట్లుండవలెనని సంకల్పించితివి? ఎంతకాలము విశ్వకర్మ దానిని నిర్మించును ? ఇటువంటి నిర్మాణమయింద్రుని చేతను నిర్మించబడలేదు. ఇట్టి మంచి నిర్మాణమునకు విశ్వకర్మ సమర్థుడు కాడు”. బాలకుని మాట విని ఆ యింద్రుడు నవ్వి సంపన్మదముతో మిక్కిలి మదించి (ఐశ్వర్య గర్వముతో మిక్కిలి గర్వించి) తిరిగి బాలుని ప్రశ్నించెను.

ఓ చిన్నవాడా? ఎందరీంద్రుల సమూహమును. నీవు చూచితివి? లేదా వినియుంటివి? విశ్వకర్మ ఎటువంటివాడు. ఇప్పుడు నొకు చెప్పుము. శక్రుని మాట విని విప్రబాలుడు నవ్వి చెవికింపుగా అమృతము పంటి మాటనతనితో పలికెను.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడనెను :

నాయనా! నీ తండ్రియగు కశ్యప ప్రజాపతి నెరుగుదును. తపోనిధియైన (మీ తండ్రిని మించిన) మరీచి మునినెరుగుదును. విష్ణువు యొక్క నాభి కమలమందు జన్మించి ఆ పరమాత్మను స్తుతించి ఆపద నుండి విష్ణువు చేత రక్షింపబడిన బ్రహ్మనెరుగుదును. సత్వగుణయుక్తుడైన పరుడు విష్ణువు నెరుగుదును. జీవకోటి లేనట్టి భయానకమైన ప్రళయమును అప్పటీ ఒక్కటీగానైన సముద్రమును ఎరుగుదును. ఎన్నియో విధములైన సృష్టులను ఎన్నో కల్పములను ఎందరో ఇంద్రులను ఎరుగుదును. వారిని తెలిసికొనుటకెవడు సమర్థుడు? ఓసురనాథా ఈ భూమియందలి రేణువులకు సంఖ్య ఉన్నచో అట్టి సంఖ్య తెలిసినను ఇంద్రులకు సంఖ్యలేదని యే పండితులు తెలిసికొందురు. ఒక ఇంద్రుని ఆయుష్యము అధికార పదవి యొక్క కాలము డెబ్బది యొక్క యుగములు, అబ్బీ ఇంద్రులు ఇరువది యెనిమిది మంది పదవుల నుండి తొలగిపోయినచో ఆ కాలము బ్రహ్మకు ఒక రాత్రిపగలగును. అట్టి బ్రహ్మయొక్క ఆయుష్యము పై ప్రమాణము ప్రకారము ఒక వంద ఎనిమిది సంవత్సరములు. అట్టి బ్రహ్మలకే సంఖ్యానియయము లేనప్పుడు దేవేంద్రుల సంఖ్యకు ఇంతయని నిర్ధారణ ఎక్కడిది? ఎట్టిది?.

బ్రహ్మాండముల సంఖ్య. కాని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంఖ్యకాని (సృష్టిస్థితి లయకర్తలు) ఎక్కడ? మహావిష్ణువు యొక్క శరీరమందలి ఒక్క రోమకూపమందు ఉద్భవించిన స్వచ్ఛజలమందు బ్రహ్మాండము, ఈ సంసారములోని సముద్రములో కృత్రిమమైన ఓడవలె ఉన్నది సుమా. ఇట్లు మహావిష్ణు శరీరమందలి రోమముల యొక్క సంఖ్యా ప్రమాణముతో అసంఖ్యాకములైన బ్రహ్మాండములున్నవి. బ్రహ్మాండములలో ఎందరో దేవతలు నీతో సములు ఉండియే ఉన్నారు.

ఇట్లు మాట్లాడుచుండగనే పురుషోత్తముడక్కడ నూరు ధనుస్సుల పొడుగుగా వ్యాపించి చీమల బారును చూచెను. వరుసగా వచ్చుచున్న ఆ పంక్తిని చూచీ బ్రాహ్మణ బాలుడు పెద్దగా నవ్వెను. ఇంద్రుడు గంభీరముగా నుండి మౌనముగా నున్న బ్రాహ్మణ బ్రహ్మచారినీ అతని నవ్వును చూచీ అతడు చెప్పిన విషయమును వినీ మిక్కిలి ఆశ్చర్యము పొంది నోరెండుకొనిపోగా తిరిగి బ్రాహ్మణుని ప్రశ్నించెను.

ఇంద్ర ఉవాచ – ఇంద్రుడనేను-

ఓ బ్రాహ్మణి శ్రేష్ఠుడా! నన్ను గురించి ఏల నవ్వుచున్నావు. కారణము చెప్పుము. శిశురూపము ధరించిన గుణ సముద్రుడవు. కపట వేషముతో నున్న నీవు ఎవడవు? ఇంద్రుని మాటను విని బ్రాహ్మణ బాలుడు అధ్యాత్మవిద్యాసారము జ్ఞానబీజమునైన శ్రేష్ఠవాక్యమును అతనితో పలికెను.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడనేను :

చీమల బారు కనిపించినది. దీనికి గూఢమైన కారణమున్నది. నీ శోకమునకు మూలమైన దీనిని గురించి నన్ను ప్రశ్నించకుము, సంసారుల యొక్క సంసార వృక్షమూలమును (జన్మమరణ ప్రవాహమును) ఖండించునట్టిదియు సంసారము కంటే ఇతరమైన జ్ఞానమునకు (తత్వము) కారణమైనది ఇది. అజ్ఞానమును చీకటిచేత కప్పబడినదైనను జ్ఞానదీపము మిక్కిలి శ్రేష్ఠమైనది. సర్వవేదములలో ఇది దాచిపెట్టబడి యున్నది. సిదలకును దుర్లభమైనది, యోగులకు ప్రాణముతో సమానమైనది. మూఢుల అహంకారమును నశింపజేయునది అని పలికి ఆ బ్రాహ్మణ శ్రేష్టుడు నవ్వుచు ఆగిపోయెను. కంఠము పెదవులు దవడలు ఎండిపోయి (భీతితో) శక్రుడు మరల ప్రశ్నించెను.

శక్ర ఉవాచ - ఇంద్రుడనెను :

“రూపము ధరించిన జ్ఞానరాశివీ శిశువుగా వచ్చితివి. నీవెవడవు? నిన్నెరుగను. ఓ బ్రాహ్మణ బ్రహ్మచారీ! ప్రాచీన కాలమునుండి వచ్చుచు ఎప్పుడును నూతనముగా నుండునట్టి ఆ జ్ఞాన దీపమును గూర్చి నాకు తెలుపుము”. ఇంద్రుని మాట విన్న బ్రాహ్మణ  రూపమునున్న విష్ణువు యోగీంద్రులకును మిక్కిలి దుర్లభమైన జ్ఞానము గురించి చెప్పుటకొరంభించెను.

బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడనెను :

ఇంద్రా! ఈ చీమల బోరేదికలదో అందులో ప్రతియొక్కటి క్రమముగా సాచేత సృష్టింపబడినదే. ఈ జీవులందరు తమ కర్మమూలమున దేవలోకములో శక్రులుగా చేయబడియుండిరి. వీరందరిప్పుడు తమ కర్మ చేత క్రమముగా జంతు జన్మలు పొందుచు కాలము గడవగా చీమల శరీరములను పొందిరి, జీవులు తమ కర్మచేతనే ఆధి వ్యాధి భయములు లేని వైకుంఠమును; కర్మచేతనే బ్రహ్మ శివలోకములను, స్వర్గమును, అటువంటి భోగములో ఉన్న భూలోకమును, స్వకర్మను బట్టియే పాతాళమును పొందుదురు. ఆత్మ దుఃఖములకు ఏకకారణమైన ఘోర - నరకమును కూడ కర్మను బట్టియే పొందుదురు. కర్మ వలననే పంది జన్మను కర్మను బట్టియే క్షుద్రమైన కీటకాది జన్మలను, కర్మను బట్టియే కోడెలు గోపులు దున్నలు ఎనుములుగా పక్షులుగా ఆడపక్షులుగా, కర్మను బట్టియే పురుగుల జన్మను వృక్షలతా జన్మలను జీవులు పొందుచున్నారు. వాని వాని కర్మను బట్టియే సుఖవంతుడు దుఃఖవంతుడు ప్రభువు సేవకుడు అగుచున్నాడు. బ్రాహ్మణజన్మ దేవతాజన్మ ప్రేతజన్మ బ్రహ్మ జన్మ అన్నియు కర్మానుసారమే సంభవించును. వ్యాధికలవాడగుట, మిక్కిలి సుందరుడుగా నుండుట, అంగహీనుడు, అధికముగా అంగములు కలవాడునగుట కర్మను బట్టియే. సృష్టికర్త జీవులకు వారి వారి కర్మసూత్రముననుసరించియే ఫలమిచ్చుచున్నాడు. కర్మయన్నది జీవుని యొక్క స్వభావమును బట్టి సాధింపబడును. ఆ స్వభావమన్నది ఆభ్యాసము జీవముగా గలది.

ఇటు మొత్తము ఆధ్యాత్మిక సంబంధము గల వాక్కులు చెప్పబడినవి. ఈ తత్వజ్ఞానము నరకసముద్రమును దాటించునట్టి సారము. పుణ్యములను తద్ద్వారా సుఖములను ఇచ్చునది. ఇంద్రా! ఈ చరాచర ప్రపంచము (సంసారము) మొత్తము స్వప్నము వలె క్షణభోగము కలది. వాస్తవము కానిది. అందరు జీవులకు కాలయోగమును బట్టి మృత్యువు శిరస్సుమీదనే నిలిచియున్నది. జీవులందరికీ శుభాశుభములు నీటి బుడగల వలె క్షణికములే. ఇంద్రా! ఇట్లె సుఖదుఃఖముల చక్రము తిరుగుచునే ఉండును: పండితుడైనవాడీ చక్రము పై ఎక్కడు (సంసారములో ప్రవేశించడు), అని పలికి చిరునవ్వుతో బ్రాహ్మణుడు నీలిచెను.

ఆ ఉపదేశమునకాశ్చర్యము పొందిన దేవేంద్రుడు అప్పుడు తనను గొప్పగా భావించకుండెను. అంతకు ముందు గల గర్వము నశించెను). ఇంతలో అక్కడికొక మునీశ్వరుడు - అతి వృద్ధుడు గొప్ప యోగి జ్ఞానమును బట్టి వయస్సును బట్టి పెద్దవాడు (వృద్ధుడు) కృష్ణాజినమును జడలను ధరించి నొసట తిలకము ప్రకాశించుచుండగా ఎదురు రొమ్మున వెండ్రుకలసుడితో శిరస్సున కటముతో వచ్చెను. ఆ వక్షఃస్థలమందలి సుడిలో కొద్దిగా రోమములు పెరికివేయబడినట్లు స్పష్ట పడుచుండెను. అట్టి వృద్ధముని చేరవచ్చీ బాలుడు ఇంద్రుల మధ్య స్థలములో కదలనీ స్తంభము వలె నిలిచేను. మహేంద్రుడే మునిని చూచి సంతసముతో నమస్కరించి భక్తితో మధుపర్కాదులిచ్చి పూజించెను. కుశల ప్రశ్నవేసి వినయమును ప్రకటించెను. ఆదరముగా అతిథి దైవమన్న భావముతో స్తుతించెను. బ్రాహ్మణ బాలుడామునితో సంభాషణమారంభించి వినయ పూర్వకముగా తన శ్రేష్ఠమైన వాంఛితమును (కోరిన దానిని)  ఇట్లు చెప్పెను.

బాలక ఉవాచ - బాలకుడు పలికెను :

 “ఓ బ్రాహ్మణా! ఎక్కడి నుండి వచ్చితివి? నీ నామమేమి? ఇక్కడికెందుకు వచ్చితివి? ఏ కారణముగా ఇక్కడ నిలిచితివి? నీ తల పై కటము వక్షఃస్థలము వెండ్రుకల సుడి ఎట్లేర్పడినవి? ఉన్నతమైన వక్షఃస్థల మధ్య భాగమున కొంచెము వెండ్రుకలు పెరికినట్లుండుట ఏమి? మునీ! నా యందు దయయున్నచో సర్వము వివరించి చెప్పుదువు గాక. ఇదంతయు మీక్కిలీ అద్భుతముగానున్నది. వినుటకు నౌకాసక్తి ఏర్పడినది”, ఆ శిశు వాక్యములను విని తన వృత్తాంతమంతను ఇంద్రుని ఎదుట శిశువుకు మహాముని చెప్పెను.

మునిరువాచ - ముని పలికెను:

ఓ బ్రాహ్మణా! అల్పమైన ఆయుష్యము గల నేనెక్కడ గూడ గృహములను నిర్మించుకొనలేదు. నాకు వివాహము గాని జీవించుటకు ఆధారముగానీ లేవు. ఇప్పుడు భిక్షతో బ్రతుకుచున్నౌను. నా పేరు “లోమశుడు”. ఇక్కడికి వచ్చుటకు హేతువు బ్రాహ్మణదర్శనమే. వర్షము ఎండల నుండి ఉపశాంతి పొందుటకే కటమును శిరస్సున ఉంచుకొంటిని. ఇక వక్షఃస్థలమున వెండ్రుకల సుడి ఉండుటకు కారణము వినుము. ఇది సంసారమందున్న వారికి భయమును అట్లే శ్రేష్టమైన వివేకమును పుట్టించు సమాధానమిది. నా వక్షస్థలమున నున్న వెంట్రుకల సుడి నా ఆయుష్య సంఖ్యా ప్రమాణము తెలుపునది. ఒక్కొక్క ఇంద్రుడు పదవి నుండి తొలగి పోగా (ఇంద్రుని ఆయువు నిండగా) ఈ సుడిలోని ఒక్కొక్క వెండ్రుక రాలిపోవును. ఆకారణము చేత సుడిలోని కొన్ని రోమములు రాలిపోయినవి. నడుమ కొన్ని నీలిచియున్నవి. బ్రహ్మయొక్క ద్విపదార్ధకాలముందు నా మృత్యువు నిరూపింపబడినది. లెక్కకు మిక్కిలి సృష్టికర్తలు ఇంతవరకు ( నా ఎరుకలో) మరణించిరి. ఇంకను మరణింతురు. ఇక ఈ కొద్ది కాలము కొరకు భార్యతోకొడుకుతో గృహముతోనేమి ప్రయోజనము!? ఒక బ్రహ్మ పతనము చెందినప్పుడు శ్రీహరి యొక్క నేత్రములకొక రెప్పపాటు కలుగును. అందుకే నిరంతరము సాటిలేని అతని పాదపద్మములను ధ్యానించుచున్నాను. భక్తిముక్తులకన్న శ్రేష్ఠమైన శ్రీహరి దాస్యము దుర్లభము సుమా! స్వప్నము వంటి ఈ ఐశ్వర్యమంతయు ఆ స్వామి పాదభక్తికి ఆటంకమే. ఈ ఉత్తమ జ్ఞానమును నా గురువు శంకరుడు నాకుపదేశించెను. భక్తిలేనట్టి సాలోక్యాది చతుర్విధ భక్తినీ నేను స్వీకరించను. ఇట్లు పలికి ఆ లోమశముని శివుని సన్నిధికేగెను. శిశురూపమున నున్న శ్రీహరి (బ్రాహ్మణ శిశువు) అక్కడనే అంతర్ధానమయెను.

ఇంద్రుడీ సంఘటననంతటిని స్వప్నము వలె చూచి ఆశ్చర్యము పొందెను. సంపదయందున్న వ్యామోహములో గడ్డిపరకయంత కూడ నాకు పరమేశ్వరుని మీద లేనే లేదు కదా! అని తలచి ఇంద్రుడు విశ్వకర్మను పిలిచి ప్రియవాక్యములు పలికి రత్నములిచ్చి పూజించి అతని నింటికి పంపించెను. శచీదేవిని రాజ్యసంపదను వదిలి పుత్రునకు సర్వమప్పగించి వివేకము గలవాడై మృత్యువును కోరి భగవంతుని శరణు పొందుటకు పూసుకొనెను. భర్త జ్ఞానియగుట చూచి హృదయము బాధపడగా భయపడి శచీదేవి శోకముతో బృహస్పతిని శరణు జొచ్చెను. అన్ని విషయములు నివేదించి బృహస్పతినీ భర్త వద్దకు చేర్చి ఆ కామీని ఇంద్రునికి నీతిసారము బోధింపజేసెను. గురువు యొక్క నీతిసారమైన శాస్త్ర విషయమునకు జోడుగా ఆమె స్వయముగా భర్తకు దాంపత్య జీవితములోనీ రసమును సమకూర్చి పఠింపజేసెను. బృహస్పతి రాజనీతి శాస్త్ర విశేషమును బోధించగా ఓ బృందావన వినోదినీ! ఇంద్రుడప్పుడు రాజ్యమును పాలించెను. ఇట్లు మొత్తము ఇంద్రుని యొక్క దర్ప విమోచనము (గర్వమును విడచుట)ను చెప్పితిని, ఓ దేవీ! నీవు నేరుగా నందుడొనర్చిన గోవర్ధన పర్వతపూజా యజ్ఞములో ఇంద్రునకు జరిగిన దర్పభంగమును చూచితివి కదా! అనెను.

ఇది బ్రహ్మావైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన రాధా శ్రీకృష్ణ ప్రసంగ రూపముననున్న నలుబది ఏడవ అధ్యాయము సమాప్తము.