4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

2 – విరజా నద ప్రస్తావ వర్ణనము

శ్రీ నారాయణ ఉవాచ :

ఎవని ప్రార్థన మూలముగా కృష్ణుడు భూమండలమునకు వచ్చెనో, ఏయే కార్యములు చేసి ఆ విభుడు స్వస్థానమునకు తిరిగిపోయెనో, భూభ్రమును తొలగించుటకు ఏయే ఉపాయములు దుష్టుల వధించుట వంటి ప్రయత్నములు ఏమి చేసెనో అది యంతయు చక్కగా ఆలోచించే క్రమముగా నీకు చెప్పుదును.

మొదట హరి గోపవేషమును ధరించుట అవతరించుట) గోకులమునకు వేంచేయుటయు, రాధాదేవి గోపికయగుటకు గల కారణమును చెప్పెదను. ఇంతవరకే శంఖచూడ వధను సంక్షేపముగ చెప్పగా వినియుంటివి. ఇప్పుడు అదియంతయు వివరించెదను.

ఒకసారి గోలోకమున శ్రీరామునకు రాధాదేవికీ కలహము సంభవించెను. ఆమె శాపము వలన శ్రీదాముడు శంఖచూడుడై జన్మించెను. శ్రీరాముడు కూడ రాధాదేవికి “మనుష్య జన్మనెత్తి భూమి మీద గోకులములో గోపికపై చరించు” మని శాపమొసగెను. ఆ శాపమునకు భయపడి ఆమె శ్రీకృష్ణునితో శ్రీరాముడు నన్ను గోపీరూపమేతుమని శపించెను. ఓ భయభంజకుడా! నీవు లేకుండ నేనెట్లు బ్రతుకగలను. దీనికి ఏమి ఉపాయమో చెప్పుము. నీవు లేకుండ నాకు ఒక క్షణము నూరు యుగములగును. కనురెప్ప పాటు నీ యెడబాటు కలిగినను నా మనస్సు గ్రుడ్డిదగును. నాథా! శరత్కాల పూర్ణిమ నాటి చంద్రుని వంటి కాంతితో అమృతపూర్ణమైన నీ ముఖమండలమును నా కన్నులు అను చకోరపక్షులు రాత్రింబవళ్లు త్రాగుచున్నవి, నీవు నా ఆత్మవు. మనస్సువు, నాప్రాణములును నీవే. కేవలము నేను దేహమును మాత్రమే భరించుచున్నాను. నా కన్నులు నీవే. చూడగల శక్తివి కూడ నీవే. నౌ జీవనము, నా పరమ ధనము నీవే. జాగ్రత్ స్వప్నదశలందును నా మనస్సు నీయందే నిలిచి నీ పాదపద్మములనే స్మరించును. నాథా! నీ దాస్యము లేకుండ క్షణము కూడ జీవించలేను అనీ అనెను.

శ్రీకృష్ణుడు రాధాదేవి మాటలు విని ఆ ప్రియురాలిని వక్షస్థలమున చేర్చుకొని ఇట్లు బోధించి నిర్భయురాలిని చేసెను. “సుందరీ! నేను వరాహాకల్పమున భూమిపై అవతరింతును. నాతో పాటు నీకును మానవ జన్మ నిరూపితమైనది. గోకులమున అవతరించి అచటి అడవులలో విహరింతును. నీవు నా ప్రాణములకంటే అధికురాలవు. నేనుండగా నీకేమి భయము”, జగత్పతియగు శ్రీహరి ఇట్లు పలికి ఆమెనోదార్చెను. ఆ కారణముగా జగన్నాధుడు నందగోకులమున కేగెను. భయమునకు అంతకుడైన ఆస్వామికి కంసుని వలన భయమేమి? భగవన్మాయయే భయవేషమున రాధ వద్దకేగెను. తన ప్రతిజ్ఞా పాలనము కొరకు గోపవేషము ధరించి ఆ ప్రభువు రాధతో గోపాంగనలతో విహరించెను. బ్రహ్మచేత ప్రార్థించబడిన గోలోక కృష్ణుడు భువిపై అవతరించి భూభారము తొలగించి మరల గోలోకమునకు ఏగెను.

నారదుడు ఇట్లనెను :

రాధాదేవితో శ్రీదామునకు కలహమెట్లు సంభవించెనో పూర్వము సంగ్రహముగా చెప్పితిరీ. ఇపుడు వివరించి చెప్పుడు.

శ్రీనారాయణ ఉవాచ :

నారాయణ ముని ఇట్లు పలికెను ;

ఒకసారి గోలోకమున నిర్జన మహారణ్యమున రాసమండలమున శ్రీహరి రాధతో విహరించెను. రాధాసుఖ సంపర్కము వలన తనను పరులను ఎరుగనంత మైమరచెను. అట్లు విహరించిన శ్రీకృష్ణుడామెకు చెప్పకుండ వదిలివేసి విరజయను పేరుగల వేరొక గోపిక పొందుకోసము పోయేను. బృందావనములోని విరజ రాధతో సమానురాలగు సుందరి. ఆమె చెలికత్తెలు శతకోటి సంఖ్యగల సుందర గోపికలు. స్త్రీలలో ధన్యురాలు, మాన్యురాలు ఐన విరజ కృష్ణునకు ప్రాణాధికమైనది. రత్నసింహాసనమందు కొలువున్న ఆమె సమీపమున నున్న హరీని చూసెను. శ్రీహరియు శరదృతువునందలి చంద్రుని వంటి ముఖము కలదియు వంకర చూపులతో విలాసముగా తనను చూచుచు చిరునవ్వుతో తన మనస్సును హరించునదియు ఎల్లప్పుడు పదునారేండ్ల వయస్సుతో నవయౌవనము కలదై రత్నాలంకార శోభతోను తెల్లని వస్త్రములతోను, మన్మధ బాణముల చేత మిక్కిలి పీడితురాలై సర్వాంగములు పులకించియున్న ఆ విరజను చూచి, అచ్చటి రత్నమండపములోని పూలపాన్పుపై ఆమెతో విహరించెను. ఆ విరజయు కోటి మన్మధ సుందరుడగు ప్రాణేశుని వక్షస్థలమున చేర్చుకొని శృంగారకేళీలో తన్మయురాలై మూర్ఛపొందెను.


ఆళ్య ఊచు:

శ్రీహరి ఆమెతో, రత్నమండపముందుండగా చూచిన రాధాదేవి చెలులు ఆమెవార్తను నివేదించిరి. వారి మాటలు విని రాధ మూర్ఛిల్లినట్లే కోపించెను. ఎర్రతామరల వంటి కన్నులు గల ఆమె మిక్కిలి ఏడ్చెను. ఆమె పిదప ఇట్లు పలికెను. మీరు సత్యము చెప్పుచుంటిరేని, నాకతని చూప సమరులేని నాతోబాటు నడువుడు, ఆ కృష్ణునకు ఆ గోపికకు తగిన కర్మ ఫలమునందింతును, నేనామెను శిక్షించుచుండగా ఎవడు రక్షించునో చూచెదను. లోపల వక్రాలోచనలు గలవాడు పైకి చిరునవ్వులు చిందించువాడు పైన అమృతము, లోన విషకుంభమైనవాడు అగు హరిని ఆమె విరజ) తో పాటు నా యింటికి తీసికొని రండు. మీరా దాసుని పట్టి తేనిచో ఆ రమ్యమండపమునకే అతని వద్దకు నడవండి అనెను. రాధాదేవి వచనములు వీసి భయము చెందిన కొందరు గోపికలు చేతులు జోడించి భక్తితో శిరస్సులు పంచి ఆమె ముందు నిలబడి తమకు ప్రియమైన ఆమెతో విరజాసహితుడైన హరిని నీకు చూపింతుము అని చెలులు పలికిరి.

వారీ పలుకులు విని రాధాసుందరి అరువదిమూడు శతకోట్ల గోపికలతో బాటు రథమెక్కి పోయెను.

ఆ రథము శ్రేష్ఠమైన రత్నములతో నిర్మించబడినది. కోటి సూర్యుల ప్రభతో మణులతో నిర్మించిన మూడు కోట్ల శిఖరకలశములతో చిత్ర సమూహములతో ధ్వజములతో లక్ష చక్రములతో మనోహరముగా ఉండి మనస్సు వలె నడుచుచుండెను. శ్రేష్ఠమైన మణులతో నీర్మించిన కోటీ స్తంభములు మనోహరముగా విచిత్ర చిత్రములతో నిండియుండెను. స్తంభముల మధ్య భాగములు సింధూర వర్ణమణులతో వేలుగుచుండెను. రథచక్రములయొక్క పై భాగములందు రత్న నిర్మితములైన సింహములుండెను. నాలుగు లక్షల ఘంటలతోను ఆశ్చర్యము కల్గించు బొమ్మల సొగసుతోను రత్నసార నిర్మితములైన అనేక నివాసమందిరములతోను మణి కవాటములతోను వాటిపై విచిత్రములైన గుర్రపు బొమ్మల శోభతోను ఫై భాగములందు వెలుగుచున్న మణుల కలశములతోను ఆ రథము విరాజిల్లుచుండెను. అందు భోగద్రవ్యములు అలంకార సామగ్రితో కూడిన రత్నపాత్రలు కుంభములు రత్న నిర్మితశయ్యలు ఇంద్రనీలమణి నిర్మితములైన వేదికలు కుంకుమపువ్వు వన్నె గల అనేక సోపానములు (మెట్లు) శ్రేష్ఠములై వెలుచున్న శ్యమంతక కౌస్తుభమణులు పద్మాకారములతో కోటానుకోట్లు వెల్లుచుండెను. ఆ రథమున అక్కడక్కడ విచిత్రమైన అడవులు దిగుడు బావులు విశిష్టముగా ఉండెను. ఆ రథ ప్రమాణము సూరు యోజనముల ఎత్తు పది యోజనముల వెడల్పు కలిగియుండెను. పారిజాతములు, మొల్లలు, కరవీరము (గన్నేరు)లు, సంపెంగలు, నాగమల్లెలు, మల్లెలు, మాలతీ మాధవీ (బండి గురువింద పుష్పములు, కలీమీ పువ్వులు సుగంధములైన మాలాకోటులై సహస్రదళ పద్మముల మాలలును కలిగి ఆ రథము అద్భుతముగా వెలుగుచుండెను. చిత్రములైన పుష్పోద్యానములు, సరస్సులు, వనములు కలిగి రథములలో శ్రేష్ఠమై వాయువే వాహనముగా అది పోవుచుండెను. సుందర సూక్ష్మ వస్త్రముల చేత కప్పబడి వందల రత్న దర్పణములు శ్వేతచామరములు కోట్లకొలది వజ్రములతో చందనము అగరు కస్తూరి కుంకుమపువ్వుల ద్రవము పులిమిన పారిజాత పుష్పముల శయ్యలతోను కోటి రత్న శయ్యలతోను వజ్రాలంకారములతోను గంధము పూసిన కేసరి పులిమిన సంపెంగ పూల తలగడలతోను శృంగార యోగ్యములైన అద్భుత సుందర వస్తువులతోను కోటీ పతాకములు ఘంటలతోను ఆ రథము శోభించుచుండెను. ఓ నారదమునీ! ఇటువంటి రథము పై వెళ్లిన హరిప్రియయగు రాధాదేవి రత్నమండపము చేరగానే రథము దిగీ ద్వారము వద్దకు చేరెను.

లక్షమంది గోపజనులతో చిరునవ్వు గల ముఖముతో శ్రీ కృష్ణునకు ప్రియమైన సేవకుడగు శ్రీరాముడన్న గోపాలుడు ద్వారపాలకుడుగా నియమించబడియుండెను. ఎర్రదామరల వంటి కన్నులు గల రాధాదేవి కోపముగా అతనితోనిట్లనెను.

ఓ కాముకుని సేవకుడా! దూరమునకు తొలగిపొమ్ము. నీ ప్రభువుయొక్క ప్రేయసి నాకంటే ఎంత శ్రేష్ఠురాలో చూచెదను. ఆమె షూటలు విని మహాబలవంతుడుసు చేత బెత్తము ధరించిన వాడును అగు శ్రీరాముడు ఆమెకు అడ్డముగా నీర్భయముగా నిలిచి లోనికి పోనీయలేదు. వెంటనే రాధ చెలులు కోపముతో పెదవులు వణకగా అతని సేవకులతో పాటు శ్రీదాముని బలవంతముగా నెట్టివేసిరి.

ఆ గోపికల కోలాహల ధ్వని విని శ్రీహరి రాధాదేవి కోపమును తెలిసికొని అంతర్ధానమయ్యెను. రాధా శబ్దమును విని హరి అదృశ్యమగుట చూచి భయముతో ఖిన్నురాలైన విరజాదేవి యోగముతో ప్రాణములు విడిచెను. ఆమె వెంటనే నదీరూపము ధరించి ఎత్తు నుండి పల్లమునకు గోలోకమును గుండ్రముగా చుట్టి వచ్చుచు నానావిధ రత్నములకు నెలవై కోటి యోజనముల వెడల్పుతో పదికోట్ల యోజనముల పొడవుగా వ్యాపించెను.

ఇది శ్రీ బ్రహ్మవైవర్త్ర్త మహాపురాణములోని శ్రీ కృష్ణ జన్మఖండములో నారాయణ నారద సంవాదమందు విరజా నది యొక్క ప్రస్తావ వర్ణనము అను రెండవ అధ్యాయము.