4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

49 - అగ్నిదర్పమోచనము

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :

త్రిగుణ స్వరూపుడును తేజస్సు గలవాడు ఐన సూర్యుడు బ్రహ్మకు నమస్కరించి ప్రాణాపద తొలగిన సంతోష ప్రీతులతో వినయమును ప్రకటించెను.

ఇక అగ్నియొక్క ఉషాఖ్యానమును ఏకాగ్రతతో వినుము. ఇది పురాణములలో రహస్యముగా నుంచదగినది. కర్ణములకు అమృతము వంటిది. (వినుటకింపైనది). ఒకసారి భృగుమహర్షి తనను శపించినందువలన మిక్కిలి క్షోభనొందిన అగ్ని ముల్లోకములను భస్మముగా చేయుటకు పూనుకొనీ - తన కంటే ఇతరులు తుచ్ఛులు తానే గొప్ప తేజస్సు (పరాక్రమము) కలవాడుగా భావించి - తన జ్వాలను భయంకరముగా నూరు తాడిచెట్లంత ఎత్తుగా చేసి మండుచుండెను.

ఇంతలో విష్ణువక్కడికి లీలగా వచ్చి అగ్నియొక్క ఆ దాహకశక్తిని (కాల్చివేయు శక్తిని) ముందు నిలిచి నశింపజేసెను (హరించెను).


 

ఆ జనార్దనుడు తన మాయతో చిన్న శిశువై చిరునవ్వుతో భక్తితో తన కంఠమును వంచి వినయమును ప్రకటించెను.

శిశురువాచ - శిశువిట్లనెను:

ఓ అగ్ని భగవంతుడా! ఎట్లు ఇంతగా కోపించియున్నావు? కారణము చెప్పుము. ముల్లోకములను భస్మముగా చేయుటకు పూనుకుంటివి. ఈ పని వ్యర్ధమైనది. దీని వలన సాధించు ప్రయోజనమేమి లేదు). నీవు భృగువుచేత శపింపబడితివి కదా! ఆ భృగువును అణచివేయుము. ఒక్కని అపరాధమునకు ముల్లోకములను భస్మము చేయదగదు. ఈ విశ్వము బ్రహ్మచేత సృష్టింపబడినది. దీనికీ రక్షించువాడు స్వయముగా విష్ణువు. సంహరించువాడు భగవంతుడైన రుద్రుడు. ఇదియే క్రమము. అది అట్లు సాగవలెను. ప్రభువైన శంకరుడుండగా సృష్టిని నీవు భస్మము చేయుట ఎట్టి క్రమము? ఒకవేళ నీవాపనిని చేయదలచినచో మొదలు దీనిని రక్షించువాడైన హరినీ జయించి త్వరగా సంహారకర్మ చేయుము. ఇట్లు పలికి ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి తన ముందున్న మిక్కిలి ఎండిపోయిన ఒక్క గడ్డిపరకను చేతబట్టుకొని దానిని కాల్చుమని ఇచ్చెను.

కాల్చదగిన ఎండిన పదార్ధమును (ఎండిన గడ్డిపరకను) చూచి ఆగ్ని భయంకరుడైనాల్కలు చాచుచు (జ్వాలలను వ్యాపింపజేయుచు) - మేఘములో చంద్రుని కప్పినట్లు తన జ్వాలతో బ్రాహ్మణ బాలుని ఆవరించెను. (చుట్టుముండెను) కాని ఆ ఎండిన గడ్డి పరకను గాని ఆ శిశువు యొక్క శరీరమందలి ఒక్క రోమమును గాని అగ్ని కాల్చలేకపోయెను. అది చూచి అగ్ని సిగ్గుచెంది ఆ శిశువు. ముందర ఏ చేష్టలేక పొరిపోయెను. ఇట్లా బాలుడు (హరి) అగ్నియొక్క దర్పమును భంగము చేసి అంతర్ధానమయ్యెను. అగ్నీ తన ఆకారమును తగ్గించుకొని భయపడిన వానివలె తన స్థానమునకు పోయెను.

ఇట్లు అగ్నియొక్క దర్పభంగము చెప్పబడినది. వేరొకటి నిత్యనూతనమైన ఆఖ్యానము (ప్రత్యక్షముగా చూచి చెప్పబడు కథ)ను దేవతల దర్పమును విడిపించిన దానిని వినగోరుచున్నావు కదా!.

శ్రీరాధికోవాచ - రాధాదేవి పలికెను :

ప్రభూ! మిగిలిన దేవతల యొక్క దర్ప భంగమును కూడ క్రమముగా చెప్పుము. నీవు చెప్పెటి కథయను అమృతధారను విని (త్రావి) ఈ భూమి మీద ఎవడు చాలునని తృప్తిపడును?

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :

భగవంతుడును ప్రభువును ఐన శ్రీకృష్ణుడు రాధాదేవి వాక్కు విని మనస్సునానందపరచు పురాతన కథనొక దానిని చెప్పుటకారంభించెను.

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన అగ్నిదర్ప విమోచనమను నలుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.