4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

1 - విష్ణువైష్ణవగుణ ప్రశంసా ప్రస్తావము

శ్రీనారాయణ మునికి జీవులలో శ్రేష్ఠుడైన నరునకు సరస్వతీదేవికి వ్యాసునకు నమస్కరించి "జయ" సంహిత (వ్యాసమహర్షి రచన)ను పఠించవలెను.

నారద ఉవాచః

నారదుడిట్లు పలికెను :

ఓ పరమాత్మా! ఇంతకు ముందు బ్రహ్మదేవుడు చెప్పిన మిక్కిలి అద్భుతము మనోహరము ఐన బ్రహ్మఖండమును వింటీని. అతని ఆజ్ఞ వలన నీ వద్దకు వచ్చి అమృతము కంటే రుచియైన ప్రకృతి ఖండముసు - తెగనీ సంసార బంధమును ఖండించగల గణపతి ఖండమును నీవు చెప్పగా వింటిని. చలించు స్వభావము గల నా మనస్సు తృప్తిపడక ఇంకను మంచి విషయములు వినగోరుచున్నది.

జీవుల చావుపుట్టుకలను ముసలితనమును నశింపజేయగల శ్రీకృష్ణజన్మఖండము అన్ని తత్వములను ప్రకాశపరచును. కర్మబంధములను నశింపజేసి హరిభక్తిని కలిగించును. భవరోగములను కత్తిరించివేసి వెంటనే వైరాగ్యమును కలిగించును. ముక్తి బీజములు మొలకెత్తించి సంసార సముద్రమును దాటించును. పూర్వకర్మఫలములైన సుఖదుఃఖములు స్వర్గనరకములు అను రోగములను నశింపజేయు దివ్య ఔషధము. శ్రీ కృష్ణ పాదపద్మములు లభించుటకు సోపానమార్గము. విష్ణుభక్తులకు జీవనాధారము. లోకులందరికి పరమ పవిత్రమైన కథ. నీ భక్తుడను శిష్యుడను శరణు పొందినవాడను అగు నాకు అట్టి కథను వినిపించుము.

ఎవరు ప్రార్థించగా శ్రీకృష్ణుడు భూమండలమును చేరవచ్చెను. సర్వదేవతల అంశలు వొక్కటైన ఆ ప్రభువు స్వయముగా పరిపూర్ణతముడై - ఏ యుగములో - ఏ కారణము వలన - ఎక్కడ అవతరించెను. అతని తండ్రియైన వసుదేవుడెవరు? దేవకీ ఎవరు? చక్కగా మాయతో నటించుచు ఏ వంశమున జన్మించెను. ఆ హరి ఏ రూపముతో వచ్చి ఏమేమి చేసెను? పురుటింటినుండి గోకులమున (రేపల్లె)కు కంసునికి భయపడి పోవుట ఎందుకు? ఇతరుల భయములను తొలగించు పరమేశ్వరుడు పురుగు వంటి కంసునికి భయపడుట ఏమి? గోపాలక వేషముతో గోకులమున ఏమీ చేసినాడు? ఆ జగత్పతి గోపికలతో ఎందుకు విహరించినాడు? ఆ గోపికలెవరు? గోపాల బాలురు ఎవరు? యశోదానందులు ఎవరు? వారు ఏమి పుణ్యము చేసిరి? గోలోకమున నివసించు పుణ్యమూర్తి రాధాదేవి గోకులమున నివసించుటకు కారణమేమి? ప్రేమమూర్తియైన హరికి గోపికగా ఎట్లు లభించేను? ఎంతటి వారికిని ఏమి చేసినను లభించని పరమేశ్వరుని గోపికలు ఎట్లు పొందగలిగిరి? వారిని వదిలి పెట్టి అతడు మధురానగరికెట్లు పోయెను? పాపుల భారమును భరించలేని భూదేవి బాధలు ఎట్లు తొలగించి అవతారము చాలించెను. ఓ మహానుభావా! ఈ కథాశ్రవణ కీర్తనములు పుణ్యప్రదములు. అట్టి కథను నాకు చెప్పుము.

దుర్లభమైన భగవంతుని కథ సంసార సాగరము దాటించునావ, తల్లిగర్భమున ప్రవేశించుట కర్మఫలములనుభవించుట అను సంకెళ్ల బాధను ఛేదించు కత్తెర. పాపములనెడి కట్టెలను కాల్చివేయు అగ్నిజ్వాల. వినిన వారి కోటి జన్మల పాపములను నశింపచేయునది. శోకసాగరమునింకించి ముక్తినిచ్చునది. ఓ దయానిధీ! వినువారి చెవులకు అమృతము వలె మనోహరమైన ఈ అవతార కథా జ్ఞానమును నీ భక్తుడను శిష్యుడను అగు నాకు ప్రసాదించుము.

తపస్సు మంత్రజపము మహాదానములు తీర్థయాత్రలు వేదపఠనము ఉపవాసములు దేవతార్చనలు అన్నివిధముల యజ్ఞయాగములు జ్ఞానదానపుణ్యఫలమునకు పదహారవ వంతు కూడ సరిగావు. జ్ఞానార్జనము కొరకే తండ్రి (బ్రహ్మ) పంపగా మీ సన్నిధికి వచ్చితిని. అమృత సముద్రమును చేరవచ్చినవాడు ఇతర జలములు త్రాగగోరునా!

శ్రీనారాయణ ఉవాచ :

నారాయణ మునీ ఇట్లు పలికెను :

ఓ నారదా! నీవు ధన్యుడవు. రూపుదాల్చిన పుణ్యరాశీవీ అని గుర్తించితిని. ఓ కులపావనా! నీవు లోకసంచారము చేయుట లోకులను పావనము చేయుటకే. మాటలవలననే మనుష్యుని మనస్సు స్పష్టముగా తెలియవచ్చును. శిష్యుడు, భార్య, కూతురు, బిడ్డ, కొడుకు, పుత్రుడు, పౌత్రుడు, బంధువు అను వారీ హృదయము మాటలవలననే తెలియును. ఒక వ్యక్తి ప్రతాపము ఆపద మాటలతోనే గుర్తింపవచ్చును. స్త్రీ వృద్ధుడు శత్రువు విద్వాంసుడు అన్నవారీ హృదయములు కూడా అట్లే తెలియును.

నారదా నీవు జీవన్ముక్తుడవు, పవిత్రుడవు. విష్ణువు యొక్క శుద్ధ భక్తుడవు. నీ పాదధూళితో జీవకోటికి ఆధారమైన భూమిని పవిత్రము చేయుచున్నావు. నీ దర్శనముతో అందరినీ పావనులను చేయుచున్నావు. అందువలననే నీవు మంగళకరమైన పరీకథను వినగోరుచున్నావు. కృష్ణ కథలు ప్రచారమగుచోట సర్వదేవతలు, ఋషులు, మునులు సర్వతీర్థములు నివాసముండును. భగవత్కథ వీని ఆ సాధుపురుషులు ముక్తిని పొందుదురు. శుభకరమైన కృష్ణ కధలు జరిగిన చోటులు తీర్థయాత్రా స్థలములగును. కృష్ణ కథలను చెప్పు వ్యక్తి తన వంశపు సూరుతరములను, విన్నవారి నూరు తరములను అప్పుడే ఉద్దరించి పవిత్రులను చేయును. హరికథను గూర్చి ప్రశ్నవేసినపోడు ప్రశ్న వేసినందు వలన, విన్నవాడు వీన్నందువలన తనవంశమును తన బంధువులను పవిత్రము చేయుదురు.

నూరు జన్మల తపస్సు ఫలితముగా జీవుడు భారతదేశమున జన్మించును. అమృతము వంటి పరికథను అతడు విని తన జన్మను సఫలమొనర్చుకొనును. అర్చనము (పూజ) వందనము (నమస్కారము) మంత్ర జపము, సేవనము (సేవలు చేయుట) స్మరణము, కీర్తనము, గుణ శ్రవణము (భగవంతుని కళ్యాణ గుణములు వినుట), నివేదనము (నైవేద్యాదులు), దాస్యము (సేవకావృత్తి) అని భక్తి తొమ్మిది విధములు. నారదా! నవవిధ భక్తులాచరించి నరుడు జన్మసాఫల్యము పొందును. అతనికే విఘ్నములు ఏర్పడవు. పరమాయువు నశించదు. గరుడుని ముందుకు సర్పము రాజాలనట్లు అతని ముందుకు అపమృత్యువు రాజాలదు. అణిమాది అష్టసిద్దులు వెంటనే సిద్ధించును. శ్రీహరి అతనిని క్షణము కూడ విడిచి ఉండడు. శ్రీకృష్ణుని ఆజ్ఞతో సుదర్శన చక్రము అతని ప్రక్కలందు తిరుగుచు రాత్రింబగళ్లు రక్షించును. కనుక అతనికి ఆపద కలిగించుటకెవడు సమర్థుడు? మండుచున్న అగ్నీ వద్దకు మిడుతలు రాజాలనట్లు యమదూతలు కలలో కూడ అతని దగ్గరకు రాజాలరు. వ్యాధులు ఆపదలు దుఃఖములు విఘ్నములు అతనిని సమీపించవు. మృత్యువు కూడ తనకే మృత్యువు ఏర్పడునని భయపడును. ఋషులు, మునులు, సిద్ధులు, సర్వదేవతలు అతని యెడల సంతృప్తులగుదురు. కృష్ణానుగ్రహము వలన ఏ సందేహములు లేక అంతట సుఖముగా నుండును.

నీకెల్లప్పుడును కృష్ణుకథయందు ఆసక్తి ఎక్కువ. తండ్రి స్వభావము కొడుకునకు వచ్చునన్నది సత్యము. బ్రహ్మమానస పుత్రుడవగు నీయందు కృష్ణ కథాసక్తి యుండుట సాధారణమే. ఏ కులమున జన్మించునో ఆ బుద్ధి యేర్పడును. సృష్టికర్తయగు నీ తండ్రి శ్రీకృష్ణ పాదసేవాసక్తితో ఎల్లప్పుడు నవ విధ భక్తులు కొనసాగించును.

కృష్ణ కథలందు ప్రీతి కలిగి, వాటి స్మరణతో ఆనంద భాష్పములు శరీరము పులకరింత కలిగి మనస్సు దానియందే మగ్నమైయుండు వానిని బుధజనులు భక్తుడందురు. భార్యాపుత్రులు ఇతర సంపదలు అన్నియు శ్రీహరివే అని త్రికరణ శుద్ధిగా భావించు వానిని బుధజనులు భక్తుడందురు. జనులు లేని పుణ్య స్థలములలో నిస్సంగులై ఎవరు ఏకాంతముగా ప్రేమతో శ్రీహరి పాదపద్మములను ధ్యానింతురో వారే వైష్ణవులు. సర్వజీవులయందు దయ సర్వజగత్తు కృష్ణమయమున్న జ్ఞానము కల మహాజ్ఞాని విష్ణుభక్తుడనీ అంగీకరింపబడినది. ఎల్లప్పుడు నామసంకీర్తనము చేయువారు భగవద్గుణములను ధ్యానించువారు భగవన్మంత్రమును జపించువారు భగవత్కథలు వినువారు వైష్ణవ శ్రేష్ఠులు. తనకు ప్రియమైన లబ్ధపదార్ధములను ప్రీతిపూర్వకముగా శ్రీహరికి సమర్చించుటకు ఎవని మనస్సు త్వరపడునో, అర్పించి ఉప్పొంగునో ఆ భక్తుడు జ్ఞానులలో శ్రేష్ఠుడు. ఎవని మనస్సు కలలో గాని మెలకువలో గాని రాత్రింబగళ్లు శ్రీహరీ పాదపద్మములందే నిలిచి బాహిరముగా పూర్వకర్మ ప్రాప్తములైన సుఖదుఃఖాది భోగములనుభవించునో అతడే వైష్ణవుడు. గురుముఖమునుండి విష్ణుమంత్రము ఎవని చెవిలో పడునో ఆ వైష్ణవుడు మహా పవిత్రుడని విద్వాంసులు చెప్పుదురు. భక్తుడు తనకంటే ముందున్న ఏడుతరములవారిని తరువాతి ఏడు తరములవారిని మాతామహనీ (తల్లితండ్రీ)ని ఏడుతరముల వారిని, తనను గన్న తల్లిని, ఆమెను గన్న తల్లిని తన సోదరులను గూడ ఉద్ధరించును. భార్యను బిడ్డను బంధువును శిష్యుని బిడ్డ కొడుకును దాసదాసీ జనమును కూడ వైష్ణవుడుద్ధరించును.

పాపాత్ములు స్నానము చేసి తమలో విడిచిన పాపములను తొలగించుకొనుటకు అన్ని పుణ్యతీర్థములు వైష్ణవుల దర్శనమును స్పర్శను ఎల్లప్పుడు కోరుచుండును. వారి సాంగత్యము వలన వాటికంటిన పాపములు నశించును. ఆవు పాలు పిదుకునంత సమయము విష్ణుభక్తులెక్కడ నిలుతురో అక్కడ అంతసేపు అన్ని పుణ్యతీర్ధములు నిలుచును. జ్ఞానగంగయైన కృష్ణస్మృతి అంత్యకాలమున ఏర్పడిన వానికి ఏ ముక్తి లభించునో వైష్ణవుడు నిలిచిన చోట చచ్చిన పాపికి అట్టి ముక్తియే లభించును. తులసీవనములో, ఆవులమంది నిలిచినచోట, శ్రీకృష్ణ మందిరములో, బృందారణ్యములో, హరిద్వారములో, ఇతర పుణ్య స్థలములోని పవిత్ర జలములలో స్నానము చేయుట ఎట్లు పాపనాశకమో విష్ణు భక్తుని పై నుండి వీచిన గాలి కూడ అట్లే పాపనాశకము. మండెడి అగ్నిలో వేసిన ఎండుగడ్డి వెంటనే ఎట్లు మాడిపోవునో వైష్ణవ స్పర్శ వలన పాపుల పాపములును అట్లే నశించును. మార్గము వెంట నడచిపోవుచున్న భక్తుని దర్శించిన మానవులందరు గడచిన ఏడు జన్మలలోని పాపములను నశింపజేసికొనుట నిశ్చయము.

ఎవరు హృషీకేశుని, పుణ్యస్వరూపుడగు అతని భక్తుని నిందింతురో, గడచిన నూరు జన్మలలో వారు సంపాదించిన పుణ్యము నశించుట నిశ్చయము. మహా ఘోరమును భయంకరములనైన కుంభీపాక నరకములో ఆ పాపాత్ములు ఉడికింపబడుచు పురుగులు భక్షింపగా సూర్యచంద్రులున్నంత వరకు క్లేశములనుభవింతురు. అట్టి పాపుల దర్శనము పుణ్యనాశకము. పాపులను చూచిన దోషము హరించుటకు గంగాస్నానము సూర్యనమస్కారము కర్తవ్యములు. భగవన్నింద చేసిన పాపాత్ముడు వైష్ణవ స్పర్శతో ముక్తుడగును. హృదయములో నివసించి యున్న మధుసూదనుడే వాని పాపములను నశింపజేయును. ఓ నారదా! విష్ణు వైష్ణవుల గుణ విశేషములు ఇంత వరకు చెప్పితిని. ఇప్పుడు శ్రీహరి జన్మక్రమము చెప్పుదును వినుము.

ఇది శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణములోని శ్రీ కృష్ణ జన్మఖండములో నారాయణ నారద సంవాదమందు విష్ణు వైష్ణవుల యొక్క గుణ ప్రశంస, ప్రస్తావ వర్ణనము అను మొదటి అధ్యాయము.