బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
234 - ఆత్యంతి కలయ నిరూపణమ్
ఓ విప్రులారా! వివేకి యగు జీవుడు ఆధ్యాత్మికములు, ఆధి భౌతికము, ఆధి దైవికములు అను మూడు విధములగు తాపము వలని దుఃఖమును దోషమును గుర్తెరిగి వైరాగ్యముతో జ్ఞానము సంపాదించుటచే ఆత్యంతిక లయమును, మోక్షమును పొందును. వీనిలో ఆధ్యాత్మిక తాపము దైహికము మానసికము అని రెండు విధములు. శిరో రోగము, ప్రతిశ్యాయము, జ్వరము, శూల వ్యాధి, భగందరము, గుల్మము, ఆర్శస్సు, శ్వయథువు, శ్వాస వ్యాధి, ఛర్ది, అక్షి రోగములు, అతి సారము, కుష్ఠము, అవయవముల రోగములు, ఈ మొదలుగ దైహిక తాపము బహు విధములు. కామము, క్రోధము, భయము, ద్వేషము, లోభము, మోహము, విషాదము, శోకము, అసూయ, అవమానము, ఈర్ష్య, మత్సరము, తిరస్కారము మొదలుగ మానస తాపము అనేక విధములు ఈ రెండును కలిసి అధ్యాత్మిక తాపమన బడును. ఆత్మ అనగా ఇచట దేహమని యర్థము. పాంచ భౌతిక దేహముతో సంబంధించి నవి ఆధ్యాత్మికములు. పైవాని వివరము ఆయుర్వేదాది శాస్త్రముల నుండి తెలియ దగినవి. మృగములు, పక్షులు, మనుష్యులు, పిశాచములు, సర్పములు, రాక్షసులు, ప్రాకెడి ప్రాణులు మొదలగు వానిచే మానవునికి కలుగు తాపములు అధి భౌతికములు, భూతముల, ప్రాణుల వలన కలుగు నవి. చలి, ఉష్ణము, గాలి, వర్షము, నీరు, మెఱవులు వాని వలన కలుగు తాపము అధి దైవికము. గర్భము, జన్మము, ముసలి తనము, అజ్ఞానము, మృత్యువు, నరకము, మొదలగు వాని వలన కలుగు దుఃఖములు వేల కొలది విధములు. ఎట్లనగా, సుకుమార శరీరము కల జీవుడు తల్లి గర్భములో అనేక మలినములు క్రమ్మి యున్న గర్భములో మావిలో చుట్టబడి వెన్ను వీపు మెడ ఎముకలు వంగి చాల పుల్లనివి, కారపువి, చురుకైనవి, చాల వెచ్చనివి, ఉప్పనివి అగు ఆహారములు తల్లి తినగా అవి కలిగించు తాపము వలన చాల బాధ పడుచుండును. అవయవములు స్వేచ్ఛగా చాచలేక ముడువ లేక మల మూత్రముల రొంపిలో పండు కొనుచు ఊపి రాడక చైతన్య మున్నందున గడచిన వందల కొలది జన్మములను జ్ఞాపకము చేసి కొనుచు తన పూర్వ కర్మలకు బద్ధుడై దుఃఖము లనుభవించు చుండును. ఇది గర్భ దుఃఖము. ప్రసవ కాలపు గాలులచే తల క్రిందులుగా త్రిప్పబడి మలము రక్తము మూత్రము శుక్ర శోణితములు మొదలగు వానిచే నోరంతయు మలినము కాగా ప్రాజావత్యము అను ప్రసవ ద్వారపు గాలిచే ఎముకల సంధులు బాధ పడుచుండ తల్లి గర్భము నుండి ఎన్నో క్లేశములతో వెలుపలికి వచ్చును. ముళ్లు గ్రుచ్చు కొనినట్లు రంపముతో కోసినట్లు అవయవములు బాధ పడుచుండ క్రుళ్ళిన పుండులో నుండి బయట పడిన క్రిమివలె బయట పడి గోకి కొనుటకును అటు ఇటు దొరలుట కును శక్తిలేక ఇతురుల ఇచ్ఛకు లోబడి పాలు మొదలగు ఆహారము గ్రహించును. మలిన మగు ప్రక్కలపై పరుండియు పురుగులు దోమలు కుట్ట చున్నను తిను చున్నను వాటిని తిను చున్నను వాటిని తోలుకొన నైన లేకుండును. ఇటు వంటి జన్మ దుఃఖములను జన్మకు అనంతరము పొందు ఆధ్యాత్మికాది దుఃఖములను అంతు లేనివి. నరుడు అజ్ఞానాంధ కారముతో కప్పబడి మనస్సు మూఢమై నేను ఎక్కడి నుండి వచ్చితిని?? ఎవడను? ఎట్టివాడను? ఎక్కడికి పోవలెను? నన్ను ఏ బంధము బంధించినది? ఇది సకారణమా? అకారణమా? చేయదగిన దేది! తగని దేది? పలుకదగిన దేది? తగని దేది? ధర్మమేది? అధర్మ మేది? గుణము ఏది? దోషమేది ? అని యెరుగక పశువుల వలె ఆహార మైథునములు కయి మాత్రము ప్రాకు లాడుట అజ్ఞానము వలన కలుగు దుఃఖము. అజ్ఞానము తమో గుణ ధర్మము. దాని వలన నరులు చేయ వలసిన కర్మలను చేయక చేయరాని వానిని చేయు చుందురు.
కర్మల లోపము వలన మానవులకు నరక యాతనలు కలుగును. ఈ విధముగ అజ్ఞానులకు ఇహ లోకమునను పర లోకమునను దుఃఖములే. ముసలి తనమున దేహమును దేహావయవము లును శిథిలములై దంతములు కదలుచు ఊడుచు చర్మము ముడతలు పడి నాడులు నరములు తేలుచు దూరపు చూపు కనబడక కంటి పాపలు ఆకాశము లోనికి పెట్టి చూచుచు నాసికా రంధ్రముల నుండి వెంట్రుకలు వెలికి వచ్చు చుండ శరీరము వణకు చుండ ఎముకలు బయట పడి వెన్ను వంగి ఆకలి నశించి ఎక్కువ తినలేక తిన్నది జీర్ణము కాక పనులు చేయుటకు శక్తి లేక ఎంతో శ్రమతో నడచుట లేచుట కూర్చుండుట పనులు చేయుట కలిగి చెవులు సరిగా విన బడక కన్నులు సరిగా కనబడక నోట చొల్లు కారుచు ఇంద్రియ శక్తి తగ్గి చావుకు సిద్ధమై ఎప్పటి కప్పుడే విషయములు మరచుచు ఒక్కమాట పలుకుటకు చాల శ్రమ పడుచు దగ్గుతో ఆయాసముతో నిద్ర పట్టక లేచుటకు పండు కొనుటకు కూడ ఇతరులపై ఆధార పడుచు సేవకులు భార్య పుత్రులు కూడ అలక్ష్యము చేయు చుండగా శౌచము చేసి కొనుట కూడ శక్తి లేక ఏమో తిన వలెనని తిరుగ వలెనని కోరికలు మాత్ర మధికమై పరిజనులు కూడ ఎగతాళి చేయు చుండ చుట్టములు విసుగు కొనుచుండ తాను తన యౌవనములో శక్తి యున్నప్పుడు చేసిన పనులను ఏదో పూర్వ జన్మములో చేసిన పనులను వలె జ్ఞాపకము చేసికొనుచు ఇట్టి అనేక భాద లనుభవించును.
మరణ కాలమున కాళ్లు చేతులు మెడ శిథిల మగును. అంతలోనే శ్రమ అంతలోనే తెలివి బలము కలుగు చుండును. తన భార్య సంతానము ధనము ఇల్లు సేవకులు తన తరువాత ఏమగునో అని చింత ఱంపములతో కోయు చున్నట్లు మర్మ స్థానములలో రోగబాధ అస్థి సంధులలో యమ బాణములు గ్రుచ్చు కొన్నట్లు బాధ మెలికలు తిరిగి పోవుచున్న కనుగ్రుడ్లు కాళ్లు చేతులు కలిగి తన్ను కొనుట పెదవులు దౌడలు కంఠము ఎండి పోవుచు గురగుర లాడుచు కంఠము నుండి శ్వాస ఆడక బాధ అకలి దప్పులచే బాధ పడుచు యమ భటులచే బాధ నొందుచు ఎంతో క్లేశముతో ప్రాణములు బయటికి పోవు చుండును. తరువాత యాతనా దేహములో ప్రవేశించును. నరకములో యమ కింకరులు పాశములతో కట్టుట, కర్రలతో కొట్టుట, యమ దర్శనము భయంకర మగు మార్గములు చూచుట మండు చున్న ఇసుక, అగ్ని యంత్రములు శస్త్రములు మొదలగు వానితో భయంకర బాధలు ఱంపములతో కోయుట మూసలలో వేసి క్రాచుట గొడ్డళ్లతో పగుల కొట్టుట భూమిలో పాతి పెట్టుట శూలముల పై గ్రుచ్చుట పులి నోటిలో వేయుట గ్రద్దలచే తిని పించుట నూనెలో ఉడికించుట కారపు అడుసులో నాన వేయుట ఎత్తు నుండి పడ వేయుట. ఒడిసెలలతో కొట్టుట మొదలైన యాతనలు జీవులు తాము చేసిన పాపానుసారము అనుభవింతురు. ఇంతే కాదు. స్వర్గమునకు వెళ్లిన వారికి కూడ ఆ పుణ్యము పూర్తి కాగానే క్రిందికి పడి పోవలెనను భయము వెంటాడును. కనుక అచ్చటను సుఖము లేదు.
పిమ్మట మరల గర్భ ప్రవేశము పుట్టుట కడుపులో గాని పుట్టుచు కాని పుట్టిన తరువాత ఏదో సమయమున బాల్యము ననో యౌవనము ననో మరణించుట ఇట్టి జన్మ మరణ పరంపర సాగును. ఈ సంసారములో ఏది సుఖమునకు కారణమో ఆదే దుఃఖమునకు కారణము. కనుక దార పుత్త్ర థనాదుల యందు మక్కువ పెంచు కొనక ఈ తెలిపిన తాపత్రయముల లోని దోషములను గుర్తించి ముక్తి కొరకై యత్నించుట ఒక్కటియే ఈ బాధను తొలగించుటకు ఔషధము. కనుక వివేకులు అందుకే యత్నింపవలెను. కర్మా చరణము జ్ఞానము ఈ రెండును ముక్తికి సాధనములే. ఆగమములో చెప్పిన శబ్ద బ్రహ్మోపాసనము వివేకము వలన కలిగెడి బ్రహ్మ తత్త్వ జ్ఞానము అని జ్ఞానము కూడ రెండు విధములు. శబ్ద బ్రహ్మ తత్త్వమున కృతార్థు డైనచో పర బ్రహ్మత్వము ప్రాప్తించును. పరా అపరా అను రెండు విద్యలు ఎఱుగ వలసి యున్నది అని అధర్వణ వేదీయ మగు మండ కోపనిషత్తు చెప్పు చున్నది. వానిలో ఋగ్వేదాది వేదప్రోక్త మగు కర్మానుష్టానము అపరావిద్యా. అక్షర తత్త్వమగు పర బ్రహ్మమును అందించునది పరావిద్యా. పరబ్రహ్మ తత్త్వము అవ్యక్తము అజరము అచింత్యము అవ్యయము అనిర్దేశ్యము అరూపము అపాణి పాదము సర్వగతము సత్యము భూతయోని వ్యాప్యము వ్యాప్తము. ఈ తత్త్వమును సూరులు మాత్రమే ఎల్లప్పుడును దర్శింప గలరు. ఆ తత్త్వమే విష్ణు భగవానుడు. భూతముల యొక్క ఉత్పత్తిని నాశనమును వాటి రాకడను పోకడను విద్యను అవిద్యను ఎఱిగిన మహానుభావుడు భగవానుడన బడును. హేయము లగు దుర్గుణములు కాని దోషములు కాని ఏవియు లేక జ్ఞాన శక్తి బలైశ్వర్య వీర్య తేజస్సులను ఆఱు శక్తులు కలవాడే భగవాను డనుబడును. ఆపరమాత్ముని యందు సమస్త భూతములను అతడు సమస్త భూతముల యందును ఆవసించును. అతడు సర్వాత్మకుడు అందు చేతనే ఈ పర తత్త్వమునకు వాసుదేవుడని పేరు. పూర్వము మహర్షులు చేసిన ప్రశ్నమునకు సమాధానముగా ప్రజాపతియే ఈ వాసుదేవ పదమునకు అర్థమును ఇట్లు వ్యాఖ్యానించి తెలిపెను. అందు చేతనే జగములను నిర్మించు వాడు. వాటి స్థితి వ్యవస్థ చేయువాడు కూడ ప్రభువగు వాసుదేవుడే. అతడు సర్వ భూతము లకును ప్రకృతి మూల తత్త్వమును సమస్త దోషములకును గుణములకును అతీతుడు. సర్వావరణము లకును అతీతుడు. అఖిలాత్ముడు. ఈ భువ నాంతరాళ మంతయు అయన చేతనే అవరింప బడి యున్నది. అతడు సమస్త కళ్యాణ గుణాత్మకుడు స్వశక్తి లేక మాత్రము చేతనే సమస్త భూత సృష్టిని చేయువాడు. తన ఇచ్చచేత తన కిష్టములగు గొప్ప రూపమల ధరించి సమస్త లోకములకు హితమును సాధించును. తేజో బలైశ్వర్య వీర్య శక్తి జ్ఞానములకు రాశి. పరమైన వాటికంటె వరుడు. ఈ వరావరుని యందు ఎట్టి క్లేశములును లేవు. అతడు ఈశ్వరుడు వ్యష్టి సమష్టి రూపుడు, వ్యక్త రూపుడు, అవ్యక్త రూపుడు, సర్వేశ్వరుడు. సర్వ ద్రష్ట సర్వశక్తి యగు పరమేశ్వరుడు. సమస్త దోష రహితమును శుద్ధమును వరమును నిర్మలమును ఏక రూపమును నగు ఆ మహా తత్త్వమును ఏది తెలుప గలదో చూప గలదో లభింప జేయగలదో అది మాత్రమే జ్ఞానమన బడును. మిగిలిన దంతయు అజ్ఞానము.
ఈ అధ్యాయములో పై శ్లోకములకు చెప్పబడిన విషయము తాత్త్వికము గనుక దానినిట వివరింప సాధ్యము కాదు. తత్త్వము నెఱిగిన పెద్దల వలనను వేదాన్త శాస్త్రాధ్యయనము చేతను తెలిసికొని తరింప దగినది.
