బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
32 - మార్తాండ జన్మ శరీర లిఖన వర్ణనమ్
దివాకరుడు శాశ్వతుడు, నిర్గుణుడు నని తెల్పితివి. తరువాత పండ్రెండు మూర్తులతో జన్మించినట్లు తెల్పితివి. తేజో రాశియైన యా వెల్గు స్త్రీ గర్భమందె ట్లున్నది. ఎట్లు పుట్టెను. ఇది మాకు పెద్ద సంశయము. దయుంచి దానిని తీర్పుడు.
దక్షునకు సౌందర్యవతులు ప్రసిద్ధలు నయిన అరువది మంది కుమారై లుండిరి. వారు అదితి, దితి, దనువు, వినత మొదలైన వారు. అందు పద ముగ్గురను గశ్యపున కిచ్చెను. వారి పుత్ర పౌత్ర దౌహిత్ర సంతతి యనంతము. అదితి సంతతి దేవతలు దితి సంతానము దైత్యులు. వారన్యోన్యము గలహించిరి. దాన ముల్లోకములు నా కుల మగుటకు వగచి యదితి సూర్యు నారాధించెను. ఆమె సూర్యు నిట్లు స్తుతించెను.
సూక్ష్మము పుణ్యము స్వచ్ఛమునైన పరమ తేజస్సును ధరించు నీకు నమస్కారము. తేజో వంతులకు నీశ్వరుడును దేజస్సులకు నాధార భూతుడు శాశ్వతుడునై జగదుపకారము నకై తీవ్ర రూపము దాల్చిన నిన్ను స్తుతించెదను. ఓ గ్రహావతి! ఎనిమిది మాసములు (ఆదాన మాసములు) జలరూప మయిన రసమును గ్రహించుటకు దీవ్ర రూపముం దాల్చు నీకు వినత నయ్యెదను. అగ్నీ షోములతో గూడి త్రిగుణాత్మకమై ఋగ్వజుసామ రూప వేద త్రయీ రూపమైన నీ స్వరూప నీ విశ్వమును తపించు చున్నది. అట్టి నీకు నమస్కారములు. ఓ సనాతన మూర్తి! నీ త్రయీ రూపము కంటె పరమై ఓం కారము చేత అభినంహిత మైన (వర్ణింప బడిన) స్థూలము సూక్ష్మము నైన యా నీ రూపమునకు నమస్కారము.
ఇట్లు నిరాహారమై యహర్నిశము నా భగవానుని స్తుతించెను. చిర కాలమునకా సూర్య భగవాను డామెకు ప్రత్యక్ష మయ్యెను. ఆమె యాక సమంతట నాపరించి పుడమి కవతరించిన యా జ్వాలామయ మూర్తిని జూచి మిక్కిలి జడుపంది స్తుతించెను.
ఓ దివాకర! జగత్తున కెల్ల మొదటి వాడా! నీ స్వరూపము చూడ లేకున్నాను. నేను చూడగల్గు నట్లు ప్రసన్నుడ వగుము. నీ భక్తులగు నా బిడ్డలను రక్షింపుము.
అంతట సూర్య భగవానుడా తోజో మండలము నుండి వెలువడి అగ్ని తప్తమైన రాగివలె నెఱ్ఱగా సాకారముగ దర్శనమిచ్చి నమస్కరించు నామెతో నభీష్ట వరము కోరు మనియె. ఆమె శిరసు వంచి మోకాళ్ళ మీదవ్రాలి నమస్కరించి వరదు డయిన స్వామినిట్లు కోరెను.
గ్రహరాజా! నా యెడను నా పుత్రుల యెడను ప్రసన్ను డవుగమ్ము. ప్రబలురైన దైత్య దానవులు త్రిభువనములను హరించి యజ్ఞ భాగములను తామే యనుభవించు చున్నారు. అందుచే మా యెడల ప్రసన్నుడవై నీ యంశమున వారికి భ్రాతవై జన్మించి యా శత్రువులను నశింప జేయుము. నా కుమారులు మరల యజ్ఞ భాగముల ననుభవించి ముల్లోకములకు ప్రభువులగు నట్ల నుగ్రహింపుము. శరణన్న వారి దుఃఖమును హరించు వాడవు, వారి కార్యము జక్కబెట్టు వాడవునని పేరొందితివి. ఉదకములను హరించు సూర్య భగవానుడు ప్రపన్నుడై యామెతో నిట్లనియె.
నేను నీ తపస్సునకు సంతోషించితిని. నీకు వేయియవ వంతు తేజస్సుతో కుమారుడనై జనించి నీ బిడ్డలకు శత్రువు లయిన వారి నందరను నశింప జేసెదను.
అని సూర్య భగవాను డంతర్ధాన మందెను. ఆమె కోరిక సఫలమై తపస్సును చాలించెను.
అవ్వల నొక సంవత్సరమునకు నుషుమ్న యను కిరణ రూపమున నదితి గర్భమందు నామె కోర్కె సఫల మొనర్ప సూర్యుడు ప్రవేశించెను. అమె కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతముల నాచరించెను. అంతట కశ్యపుడు కుపితుడై “నిత్యోపవాసములం జేసి నీ గర్భ మారణము చేసి కొందువా” యన నామె యిట్లనియె.
అంత నామెయు కుపితయై ఈ గర్భాండముం జూడుము. ఇది మారితము కాలేదు. గాక శత్రుమారకము గాగలదు. అని పలికి గర్భమును పనివడి విసర్జించెను. అట్లు జారిన యామె గర్భము తేజస్సులచే జాజ్వల్యమాన మయ్యెను. కశ్యపుడు భాస్కర వర్చస్వి యగు నామూర్తింగని ప్రణతుడై యాదరముతో తొలి పల్కుల స్తుతించెను. అంతట నా గర్భాండము వెలువడి పద్మపత్ర మట్టి యరుణ ప్రభల దీపించుచు నలు దెస లుద్దీపింప జేయుచు నొకమూర్తి ప్రత్యక్ష మయ్యెను. అవ్వల నంతరిక్షము నుండి యమ్ముని సత్తముం గూర్చి య శరీరవాణి సజలజలద గంభీరమ్ముగా నిట్లు పలికెను.
ఈ యండము మారితమని నీవంటివి. ఓ కశ్యపు మునీంద్రా! అందు వలన నీ మూర్తి మార్తండుడను బేరం బరగును. ఇతడు యజ్ఞ భాగముల హరించు చున్న నసురులను సంహరించును. ఆ యాకాశవాణి వాణి నాలించి గీర్వాణులు హర్షించిరి. దానవులు దిగులొందిరి. శతక్రతు వంతట నసురుల యుద్ధమునకు పిలిచెను. మార్తాండునిచే జూడ బడిన దానవు ల్లెల నిస్తేజస్కులై దహింప బడి భస్మమై పోయిరి. దేవతలు మార్తాండుని పెక్కు భంగుల వినుతించిరి. సురలు మార్తండుడు స్వాధికారముం బడసి యజ్ఞ భాగము లందిరి. ఇనుండు క్రిందు మీదును దన కిరణములచే కడిమి పూవువలె భాసించుచు నగ్ని గోళమట్లు పెలుంగుచు నస్ఫుటమైన యాకారము దాల్చెను.
అంత మునులు కదంబముకుళ మట్లెఱ్ఱగ కన్నెఱ్ఱ యైన యమ్మూర్తి యెట్లు దర్శనీయ మయ్యె నానతిమ్మనిరి.
(ఇక్కడ 49వ శ్లోకము నుండి 81వ శ్లోకము వరకు గల కథ ఈ పురాణములో నాఱవ యధ్యాయము నందు చూడ వచ్చును. కావున నిచట తాత్పర్యము వ్రాయబడ లేదు.)
సర్వ లోకములకు నాభి స్థానమైన సూర్యుడు తరణి పట్టు నప్పుడు పరిభ్రమించుట వలన సముద్రములు పర్వతములు వనములతో గూడిన భూమి యాకాశ మంటెను. చంద్రాది గ్రహా నక్షత్ర సహితమైన యాకాశ మెల్ల చిమ్మ బడి వ్యాకులమై భూమికి దిగి పోయెను. సముద్ర జలము సంక్షోభించెను. చరియలు పగిలి మహా పర్వతములు బ్రద్దలై పోయెను. ధ్రువునాధారముగా గొన్న యఖిల జ్యోతిర్ని వాసములు (లోకములు) రశ్మి (కిరణము శ్లేష రజ్జువు) బంధములు తెగి క్రింద బడినవి. చక్ర భ్రమణ వేగమున బుట్టిన వాయువులచే జెదరి మహా మేఘములు గర్జిల్లుచు విడి పోయెను. సూర్య భ్రమణము వలన విక్షిప్త ములైన భూమ్యాకాశ పాతాళ ప్రపంచము మిక్కిలి వ్యాకుల మయ్యెను. ఇట్లు ముల్లోక మాకుల మగుట గని బ్రహ్మతో గూడ దేవతలు భాస్కరు నిట్లు స్తుతించిరి.
దేవత లకాది దేవుడవై యావిర్బ వించితివి. భూమి యొక్క విభూతి కెల్ల నీవా ధారము. నీవే సృష్టి స్థితి లయ కార్యము లందు ముమ్మూర్తు లగుదువు. జగత్పతీ నీకు మంగళ మగుగాక! నీవు తాపము వర్షింతువు. జగత్పతీ! జయము జయమని యింద్రాదులు సప్తర్షులు వివిధ స్తోత్రములచే వాలఖిల్యాదులు వేద సూక్తములచే స్తుతించిరి. దేవతల కెల్ల మొదటి వాడు (దేవతలకు ముఖ స్థానీయుడు) అగు నగ్ని భగవానుడు సంతోషముతో తరణి బట్టు బడుచున్న తరణిని నాథ! మోక్ష మందిన వారికి నీవు మోక్ష స్వరూపుడవు. ధ్యాన నిష్ఠులకు పరమ ధ్యేయమైన వస్తువవు. సర్వ భూతములకు నీవు పరమ గతివి. కర్మకాండ ప్రవర్తనులకు నీవే గతివి. పూజ్యుడవు. దేవేశ! మాకు శం = సుఖము అస్తు = కలుగు గాక! ద్విపదే = రెండు పాదాలు గల జీవ కోటికి మాకు సుఖ మగుత. చతుష్పదే. నాలుగు పాదములు గల పశుజాతికు సుఖ మగుగాక అని వేద సూక్తార్ధములతో విద్యాధర గణములు యక్ష రాక్షస నాగ కులములు తలలు వంచి చేతులు జోడించి మనసునకును వీనులకును నింపుగ స్తుతులం బలికిరి. సర్వ భూతాధార నీ తేజస్సు భూత జాలము సహింప గలదగు గాక! అవ్వల హాహా హూహూ నామక గంధర్వులు నారద తుంబురులు షడ్జమధ్యకుమ గాంధార రూప గానత్రయ విశారదులు గావున సూర్య పరమాత్మను గాంధర్వ విధితో సంకీర్తనము సేయ నారంభించిరి.
తానమూర్ఛనాది వివిధ సంగీత ప్రయోగములచే బహు సుఖముగ వారు పాడిరి. విశ్వాచి ఘృతాచి ఊర్వశి తిలోత్తమ మేనక సహజన్య రంభ మొదలైన యప్సర స్త్రీ మణులు నర్తనము సేసిరి. హావ భావ విలాసములచే నభిన యించిరి. వీణావేణు మృదంగ ఝర్ఝరపణవ పుష్కర పటహ ఆనక దేవ దుందుభి శంఖాది వివిధ వాద్యములు శతము సహస్రముల మ్రోయించిరి. పాటలు పాడు గంధర్వులచే నాటలాడు నప్సరోగణ ములచే తూర్యవాదిత్ర ఘోషములచే సర్వ కోలాహల మయ్యెను. ఆ సమయమున వేల్ఫు లెల్లరు జేతులు మొగిచి భక్తితో వంగి సహస్రాంశునకు బ్రణామములు సేసిరి.
అంతట సర్వ స్వర్గ సమావేశము నందా కోలాహల మందు విశ్వకర్మ (దేవశిల్పి) మెల మెల్లన రవి బింబమును యంత్ర మెక్కించి చెక్క నారంభించెను. ఆయనచే భానుడా జానువుగ (మోకాళ్ళ దనుక) నిపుణముగ లేఖనము సేయబడి తస యభినందనము లేనందున యంత్రము నుండి దింప బడెను. తేజోహాని వలన గలిగిన రూపమును నిషేధింప లేదు. అందు వలన నాయన రూపము చక్కని వానికెల్ల చక్కనిదై మిక్కిలి శోభించెను. హేమంత వర్ష గ్రీష్మ ఋతువులకు హేతువైన వాడును త్రిమూర్తులచే స్తుతింప బడు వాడునగు భానుమూర్తి యొక్క ఈ స్వరూప తక్షణములు (చెక్కుటను) విన్న యాతడు ఆ యుస్సమాప్తిలో సూర్య సాలోక్యము నందును. ఓ ముని సత్తములార! సూర్యుని జన్మ వృత్తాంతము ఆయన పరమోత్తమ రూపమును నేను సంకీర్తించితిని.
