బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

51 - పురుషోత్తవర్ణనమ్‌

ఇంద్రద్యుమ్నునితో పరమేశ్వరు డిట్లనియె. రాజా! యక్ష గంధర్వాదులు మహేంద్ర బ్రహ్మా రుద్రాదులలో నే నెవ్వడను గాను, పురుషోత్తమునిగా నన్నెఱుంగుము. సకల పాపములు హరించు ననంత బల పౌరుషములు గలవాడను. అనంతడను అశేష భూత కోటికి నారాధనీయుడను. ఎవరిని జ్ఞాన గమ్యుడని వాసుదేవుడని యోగులు పేర్కొందురో. వేదాంతములు వెల్పునో యట్టి యోగ గమ్యమగు వస్తువును నేను త్రిముర్తులు నేనై యున్నాను. దిక్పాలు లందురు నేనే. అఖిల చరాచర జగత్తును నేను. నా కంటె నన్యము లేదు. నీ యెడల సంప్రీతిం గంటిని. వర మర్ధింపుము నా దర్శనము పుణ్యము చేయని వానికి కలనైన గాదు. నీవు ధృఢ భక్తి సంపన్ను డగుటచే ప్రత్యక్షము నన్ను జూచితివి. అని స్వామి యన భూమిపతి మేను పులకింప నా దేవుని పలు విధంబుల స్తుతించెను.

ఓ లక్ష్మీనాథా! పీతాంబరధారీ! శ్రీనివాసా! నమస్కారము. ఆది పురుషుడు సర్వేశ్వరుడు సర్వతో ముఖుడు సనాతనుడు నగు విష్ణు దేవుని నమస్కరించెద. శబ్దములకు అతీతుడు గుణాతీతుడు భావాతీతుడు నిర్లిప్తుడు నిర్గుణుడు సూక్ష్మమైన వాడు. సర్వజ్ఞుడు శంఖ చక్ర గధా ముసల ధారియు నీలోత్పల దళ శ్యాముడు. వర ప్రదాత. శేష శాయియు క్షీర సాగర శయనుడు, సర్వ పాపహారియు నగు హృషీకేశుని నమస్కరించెద. మోక్ష కారణ భూతుడవు వ్యాపకుడవు, నాశ రహితుడవు దేవ దేవుడవు నగు నిన్ను నమస్కరించెద.

ప్రాంజిలియై ప్రణామ మాచరించి వినయమున రాజిట్లు పలికెను. “జగన్నాధ! దేవాసుర గంధర్వ యక్షరక్ష స్సిద్ద సాధ్య విద్యాధర నాగ గుహ్యక కిన్నరాదులు సర్వశాస్త్ర పారగులు సన్యాసులు యోగులు వేదార్థ చింతనులు మోక్షమార్గ విదులు ఏ పరమ పదుమును ధ్యానింతురో నిర్గుణము నిర్మలము శాంతము నైన దేనిని బొంద గోరుదురో యట్టి పదమును నీ ప్రసాదమున నంద గోరుదును.

 “ఓ రాజా! మంచిది నీకు శుభమగు గాక. నీ కోరిన స్థానము నందుము. నా అనుగ్రహమున నది నీకు లభించును. సందేహము వలదు. పది వేల తొమ్మిది వంద లేండ్లు నీవు రాజ్య మేలుదువు గాక. ఆ మీద నా దివ్య పదము గాంతువు. నీకీర్తి శాశ్వత మగును. “ఇంద్రద్యుమ్న సరస్సు” అను పేరు నీ తీర్థము యజ్ఞాంగ సంభవము. ఇందు స్నానము చేసిన జీవి యింద్ర లోకము వడయును. ఇచ్చట పిండ ప్రదానము చేసిన నిరువది తరముల వారు స్వర్గముం గాంతురు. అచ్చట నప్సరసలచే గంధర్వ గాన మాలాపించు బూజింప బడి పదునల్గు రింద్రులు పాలించు నంత కాలము విమాన మధివసించి నీవు విహరింతువు. ఈ సరస్సునకు దక్షిణ దిశ నైఋతి మూల నొక మఱ్ఱి చెట్టున్నది. దాని దరి నొక మండపము కలదు. దాని చుట్టు మొగలి పొదలున్నవి. వివిధ తరు సంకుల మట కొబ్బరి మొదలగు తోటలు సంపెంగ పూల తోటలు చాలా గలవు. ఆషాడ శుక్ల పంచమి పితృ దేవతాకమయిన మఘా నక్షత్రమందు మండపమున వేంచేవు జేసి యేడు రోజులు నిలిపి నృత్య గీత క్రీడా వినోదములచే నర్చించి సువర్ణ దండములగు చామరములచే నీచోపులిచ్చుచు రత్న భూషిత వ్యజనము లచే వీచుచు నొక స్తంభము నట ప్రతిష్ఠించి బ్రహ్మచారి యతి స్నాతకులు గృహస్థులు వాన ప్రస్థులు నానా విధ స్తోత్ర పాఠములచే ఋగ్యజుస్సామము లచే మమ్ము (బలరామ కృష్ణులను) స్తుతింతురు. ఇట్లు మమ్ము దర్శంచి భక్తితో మ్రొక్కిన భక్తులు పది వేలేండ్లు వైకుంఠమున వసించును. సర్వ భోగము లందును నా పుణ్యము ననుభవించి తిఱిగి ఈ యిలపై విప్రులై జనించి కోటీశ్వరులై చతుర్వేదులై విరాజిల్లుదురు.

అని యిట్లు హరి యాతనికి వరమిచ్చి విశ్వకర్మతో కనుమఱు గయ్యెను. ఆ ఱేడానంద భరితుడై కృతార్థుడ నైతి ననుకొని బలరామ కృష్ణులను సుభద్రను దేవ విమాన మట్టి రథము నెక్కించి యూరేగించి పురోహిత మంత్రి సామంతాదు లతో చక్కని పవిత్ర ప్రదేశ మందు శుభ లగ్నమున ప్రతిష్టించి యథావిధిగ నర్చించి యాచర్య ఋత్విగ్జ నంబులను భూరి దక్షిణలచే సత్కరించెను. ఆ మీద బెక్కు జన్నములు చేసెను. కృతకృత్యుడై ఐహిక భోగములను విడిచి విష్ణుపద మందెను. ఇది ఈ పురుషోత్తమ క్షేత్ర మహిమ. మఱి యేమి విన వలతురన మును లిట్లనిరి. పురుషోత్తమ క్షేత్రయాత్ర యేపుడెట్లు చేయ వలెను! పంచతీర్థ విశేష మేమి! అందొక్కొక్క తీర్థ స్నానంబు వలనను, దానముల వలను దేవదా దర్శనంబు వలన నేయే ఫలము లభించును? దెలుపు మని వేడిరి.

 కురుక్షేత్ర మందు నిరాహారియై యెంటి కాలిపై నిల్చి డెబ్బది వేలేండ్లు చేసిన తపస్సు యొక్క ఫల మీ క్షేత్రము నందు జ్యేష్ఠ శుద్ద దశమి నాడుపవాస ముండి జగన్నాథు దర్శించి నంత మాత్రాన గల్గును. జ్యేష్ఠ మందే పంచతీర్థ యాత్ర సేసి శుద్ద ద్వాదశి నాడు పురుషోత్తముని దర్శంచ వలెను. దానిచే విష్ణు లోకమును శాశ్వతముగ పొందును. దూరమున నుండి యేని పురుషోత్తముని దిన దినము కీర్తించిన జాలును. విష్ణు పురము నందును హరి చేతిలోని చక్రము నల్లంత దూరమందుండి యేని ఆలయమును పరి భాగమందున్న దానిని జూచి నమస్కరించిన యాతడు పాపా విముక్తు డగును.