బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

207 - పౌండ్రక వాసుదేవ వర్ణనమ్‌

మానుష మూర్తియై శౌరి యింద్రుని శంకరుని సర్వ దేవతలను లీలా మాత్రముగ గెలిచి మహత్కార్యము నొనరించెను. దేవతలు తెలియక చేసిన చేతలకు విఘాతము సేసిన హరి యింకను జేసిన లీలలను దెలుపుము. మాకు విన వేడుక యగుచున్న దన వ్యాసులిట్లనిరి.

“మునివరు లార! తెలుపు చున్నాను. ఆదరముతో వినుడు. కృష్ణుడు నరావతారమున వారణాసి నగరమును గాల్చి వైచెను. పౌండ్రక వాసుదేవుడు ప్రజలు తనతో వాసుదేవు డొకడు భూలోకమున సంచరించు చున్నాడు, నిజముగ నవతరించిన వాడవు నీవెయని పలుకు చుండ వాడు వాసు దేవుడను నేనే. అవని నవతరించితిని ననుకొనెను. దాన స్మృతి దప్పి వాడు విష్ణు చిహ్నములైన శంఖ చక్ర గదాదులను నయోమయముగ జేయించుకొని పెట్టుకొని కృష్ణునకు దూతను గూడ బంపెను.

ఆ పంప బడిన దూత వాని మాటలగ కృష్ణునికిట్లు చెప్పెను. “ఓ మూఢ! చక్రాది చిహ్నములను నీ పెట్టు కున్న వాసుదేవ డనెడి నా పేరును సర్వమును విడిచి నీవు బ్రతుక దలతు వేని నాకు ప్రణతుడ వగుము”.

అన నవ్వి దూతతో భగవంతుడు

“నా చిహ్నమగు చక్రమును నీ యెడల విడిచెదను. అని యంటి నని నా మాటగ నీవేగి పౌండ్రకునికి జెప్పుము. నీ మాట లోని మంచి తనము నాకు దెలిసినది. చేయదగిన దేదో చేయుము నేను నా చిహ్నములను దాల్చియే నీ పురమునకు వచ్చెదను. నా చిహ్న మయిన చక్రమును నీ కొఱకు వద లెదను గూడ. సందేహము లేదు. ఆజ్ఞా పూర్వకముగ రమ్మని నీ వన్న మాటను రేపే విలంబము లేకుండ నీ కప్పగించెదను. నీ శరణము (దిక్కు)న కేతెంచి నీ వలన మఱి యే కొంచెము భయము లేకుండ జేయ వలసిన పని చేసెదను.” అని పరిహాస గర్భముగ తెలుప బడి దూత చనినంతట స్మరణ మాత్రమున వచ్చి వ్రాలిన గరుక్మంతు నెక్కి త్వరితముగ హరి తత్పురమున కేగెను.

కాశిరాజు హరి ప్రయత్నమును విని యపుడు పౌండ్రకుని పక్షమున సర్వ సైన్య పరివారముతో పార్ణిగ్రాహియై (మడమలం ద్రొక్కికొని) వచ్చెను. ఆంతట నీ పౌండ్రక వాసు దేవుడు పెను బలముతో కాశిరాజు బలము తోడను గేశవున కెదురు నిలిచెను. హరి యున్నత రథ మందున్న వానిని శంఖ చక్ర గదాహస్తు డైన వానిని నొక హస్తమున పద్మముం బట్టిన వానిని వనమాలా ధరుని శార్ఙ్గమను విల్లు చేకొన్న వానిని బంగారపు నగిషీ చెక్కిన టెక్కము గల వానిని నురమున శ్రీవత్స చిహ్నమును దాల్చిన వానిని (శ్రీవత్సాకారముగ పచ్చబొట్టు పొడిచి కొన్నాడని యర్ధము) కిరీట కుండల ధారిని పీతాంబరుని పౌండ్రకుని గని మధువైరి భావ గంభీరముగ నవ్వెను.

చతురంగ బలముతో గదా శూల శక్త్యాది సర్వాయుధము లతో నెదిరించిన వానితో గృష్ణుడు యుద్ధము జేసెను. శార్గ ధనుర్ముక్తము లైన యగ్ని జ్వాలలచే ధారుణము లైన గదా చక్ర పాతములచే క్షణములో వాని సైన్యమును హత మొనర్చెను. కాశిరాజు సత్వమును గూడ క్షయింప జేసి తన చిహ్నములం దాల్చియున్న యమ్మూఢునితో భగవంతుడిట్లనియె.

పౌండ్రక! దూత ముఖమున నీవు పంపిన కబురంతయు విన్నాను. నా చక్రాది చిహ్నములను వదలు మని కదా నీ యాజ్ఞ. అది యట్లే నిర్వహించినాను. ఇదిగో చక్రము. గద యిదిగో వదలు చున్నాను. గరుత్మంతు డిడుగో. నీ ధ్వజ మందెక్కు గాక! అని పలికి పలికిన క్షణమున హరి వదలిన చక్రముచే వాడు చీల్చబడెను గదచే హతుడై పడెను. గరుత్మంతుని చే గరుత్మంతు డయ్యెను. అనగా రెక్కలు వచ్చి నట్లై యాకశమున కెగిరి పోయెను నన్నమాట. అంతట లోకము హాహాకార మొనరించెను. మిత్రున కుపకారముగ కృతజ్ఞతగ కాశిరాజు వాసుదేవునితో దలపడెను. హరి శార్ఙ్గ ధనుర్ముక్తము లైన యమ్ములచే వాని శిరము నరికి లోకమున కచ్ఛేరువు గల్గించుచు హరి కాశి పురికి విసరి వెసెను. శౌరి పౌండ్రకుని గూల్చి పరివారముతో కాశి రాజుం జంపి ద్వారవతికి వచ్చి స్వర్గమున కేతెంచిన యమరు డట్లు విలసిల్లెను.

కాశిపతి రాజధాని యందు బడిన వాని తలంజూచి యిదేమి యెవని చేతనైనది యని జనము విస్మయ మందెను. వాసుదేవునిచే నా కాశిరాజు హతుడయ్యె నని యెరిగి వాని కొడుకు పురోహితునితో నేగి విశ్వేశ్వరుని సంతోష పరచెను. (స్తుతించెను) శంకరుడు ఆ విముక్త మహా క్షేత్రమున వానిచే తోషితుడై యారాజు సుతుని వరము గోరు కొమ్మనియె. వాడు స్వామి! నాతండ్రిం గడ తేర్చిన కృష్ణుని గడతేర్పుటకు మహేశ్వర! నీ యనుగ్రహమున కృత్యయను దారుణ శక్తి లేచుగాక యనెను.

ఇట్లే యగునని యనినంత వాని యగ్నిహోత్ర శాల యందలి దక్షిణాగ్ని నుండి మహా కృత్య లేచెను. అగ్నిజ్వలా భయంకర మైన ముఖము మంటలెగయుచున్న కేశ కలాపముతో కృష్ణా! కృష్ణా!యని కోపముతో నది ద్వారవతి వంక జనెను. ఆ రౌద్ర మూర్తిని వికృతమగు కన్నుల దానిని ద్వారకా వాసి జనమెల్ల జూచి జగముల కెల్ల శరణమైన మధు వైరిని శరణొందెను.

కాశిరాజు వృషభ ధ్వజు నారాధించి యీ మహా కృత్యను గృష్ణుని చంపుటకు బుట్టించెను. అగ్ని జ్వాలల తోడి జడలచే నాకులయైన యీ యుగ్ర శక్తిని సంహరింపుము.

అను జనఘోష చదరంగ మాడుచు విని యాటగ నగ్ని మాలాజటిలయై జ్వాలలం గ్రక్కు చునున్న యతిభీషణ మైన యా కృత్యను విష్ణు చక్రము సుదర్శనము వెను దరిమెను మహేశ్వర దేవతాక యగు యాకృత్య హరిచక్ర విధ్వస్తయై వేగమున బరువెత్తెను. దానిని చక్రము వెంబడించెను. అపుడా కృత్య విష్ణు చక్రముచే ప్రభావము గోల్పడినది వారాణసిం బ్రవేశించెను. అవ్వల కాశిరాజు సైన్యము అంతువడని ప్రమథ గణ సైన్యము సర్వ శస్త్రాస్త్రములతో జక్రమున కెదురు సనెను. శస్త్రాస్త్రాఘాత బహుళమైన యా సైన్యము నెల్ల దహింప జేసి యశేష కాశీ నగరమును నిండ చతురంగ బలముతో రాజ భృత్యులతో పౌరులతో దుర్గములతో కోష్ఠములతో గాల్చి గృహప్రాకార తోరణము లందు మంటలు అలము కొన సత్వర మా చక్రము వారనాసిం గాల్చెను. అక్షీణమైన కసితో సాద్య సాధనకారకములు శేషింపమి నా సుదర్శనా యుధము దీప్తి మంతమై విష్ణు హస్తమున కేతెంచెను.