బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

12 - సోమోత్పత్తి వర్ణనమ్‌

పితృ కన్యయగు విరజ యందు మహాతపస్వి యగు సహుషుని కింద్ర తుల్యులైన యార్వురు కుమారు లుదయించిరి. వారు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, యాతి, నుమాతి అనువారు. అందు యయాతి రాజయ్యెను. అప్పరమ ధార్మికుడు కకుత్ద్స కన్యను గోవు యనునామెను వివాహ మాడెను. యతి మునియై మోక్ష మార్గ మందుండి బ్రహ్మీ భావ మందెను.

యయాతి సోదరు లైదుగురు రాజ్యముం గెల్చుకొని ఉశనసుని (శుక్రుని) తనయను దేవయానిని భార్యగ గైకొనెను. మఱియు వృషపర్వుడను నసురుని కుమార్తె శర్మిష్ఠం గూడ పత్నిగ గైకొనెను. దేవయాని యదువును తుర్వసుని గనెను. శర్మిష్ఠ ద్రుహ్యుని అనువును-పురపును గాంచెను. దేవేంద్రు డాతనికి (యయాతికి) ప్రీతుడై, దివ్యమైన, భుజకీర్తిని దివ్యములు మనోజవము లైన తెల్లని యశ్వముల బూన్చిన స్వర్ణమయ మైన రథము నొసంగెను.

ఆ రథముతో విజయ యాత్ర సేసి యుద్ధము నందజేయుడై యయాతి ఆరు దినములలో మహీమండల మెల్ల జయించెను. దేవ దానవుల నిగ్రహించెను. సంవర్తవసు నామక మైన ఆ రథము కౌరవుల దాయెను. కురు వంశీయుడును. కురు వంశీయుడును పరీక్షుతుని కుమారుడును నగు జనమేజయుని నుండి గర్గ శాపమున నారథ మంతరించెను.

బాలుడైన గర్గుని కుమారుని జనమేజయుడు కాల వశమున చంపి బ్రహ్మహత్యా పాపము నందెను. దానిచే లోహగంధియై (ఇనుప వాసన గొట్టు మేను గలవాడై) యా రాజర్షి యిందందు వెఱ్ఱిఫరుగులు పెట్టుచు పౌర జానపద పరిత్యక్తుడై దుఃఖ సంతప్తుడై శాంతి నెచటను పొంద డాయెను. ద్విజ శ్రేష్ఠుడగు శౌనకుని శరణ మందెను. జ్ఞానియైన శౌనకుడు పవిత్రతకై అతనిచే నశ్వమేధము జేయించెను. అవబృధ స్నానము కాగాసే యతని దుర్వాసన పోయెను. అయ్యయాతి దివ్య రథము చేది రాజునకు జిక్కగ నింద్రుడు తుష్టుడై దానిని కొనివచ్చి బృహద్రధున కిచ్చెను. బృహద్రధ నుండి యది యాతని కొడుకునకు జరాసంధునికి దక్కెను. భీముడు వానిని చంపి యాయ రథమును వాసు దేవున కర్పించెను.

సహుషి నూనుడగు యయాతి నసాగరము సప్త ద్వీపము నగు వసుంధర నెల్ల గెలిచి యైదు భాగముల సేసి పుత్రుల కొసంగెను. తూర్పు దిశను జ్యేష్టుడగు యదువును, నడుమ పూరుని నభిషేకించెను. అగ్నేయమున తుర్వసు నుంచెను. వారిచే నీ విశ్వంభర నేటికిని ధర్మముతో పరిపాలింప బడుచున్నది. బ్రాహ్మణులారా! ఆ దేశముల గూర్చి ముందు చెప్ప గలను.

యయాతి తన ఐదుగురు కుమారులు దురంధరులు రాజ్య భారము వహించగా వార్ధక దశలో ధనుర్భాణ సన్యాసము జేసి భూమి యందు సంచరించుచు సంప్రీత మనస్కు డయ్యెను. ఇట్లు భూవిభాగము చేసి యాతడు తన కుమారుని యదుపుం జూచి నా ముసలితన మీవు గ్రహించి నీ యౌవనము నాకిమ్ము నా ముసలి తనమును నీ యందుంచి నీ రూపములో యువకుడవై కార్యాంతరము వలన నీ భూమిపై నంచరింతును. ఆ యయాతితో యదువిట్లు బదులు పలికెను.

ఒక బ్రాహ్మణునికై నేనిత్తునని ప్రతిజ్ఞ జేసిన భిక్ష నింతదాక యీయ లేదు. అది చెల్లింపక నీ జరా భార మెట్లు స్వీకరింప గలను? అదిగాక ముదిమి యందన్నపాన నిమిత్త మయిన దోషము లనేకములు గలవు. కావున నీ ముసలి తనము నేను గ్రహింప నుత్సహింపను. రాజా! నా కంటెను ప్రియతములైన పుత్రులు నీకనేకులు గలరు. ధర్మజ్ఞా! నీ జరా భారము గ్రహింప మరొక్కని కోరుకొమ్ము. అనవిని వక్తలలో శ్రేష్ఠుండగు యయాతి కోపవశుడై తనయుని గర్హించుచు నిట్లనియె.

దుర్బుద్ధీ! నన్ను నిరాకరించిన, నీకు మరి యాశ్రమమేమి యున్నది? ధర్మమేమి యున్నదిరా! నేను నీకు దేశికుడను గద! నీ సంతతికి రాజ్య ముండదు సందేహము లేదని శపించెను. అట్లే కొడుకు లందరి నడిగెను. వారు నల్వురు కాదని నంత నిట్లే శపించెను ఐదవ వానిం బూరుని గూర్చి యదే మాట చెప్పెను.

ఆ పూరుడు తండ్రి ముదిమిని స్వీకరించి తండ్రికి దన యౌవన మొసంగెను. దాన యయాతి భూమి యందు తిరుగుచు, కామముల యంతయును వెనకుచు విశ్వాచితో గూడి చైత్ర రధోద్యాన మందు స్వేచ్చా విహారము లొనరించుచు పెక్కు కాలము క్రీడించెను. తృప్తుడైన తరువాత వచ్చి పూరున కాతని యౌవన మిచ్చి వేసి తన ముదిమిం దాను గ్రహించెను.

మునిశ్రేష్టు లారా! ఆ సమయమున యయాతిచే గానము చేయబడిన గాధ (అనుభవము) ల విన్నవాడు, తాబేలు తన అవయవములను లోపలికి ముడుచు కొనిన విధముగ తనకు కలిగిన కామము (కోరిక) లను సంకోచింప చేసి కొనును. ఒకప్పుడును కోరికల యనుభవముచే కామము తీరదు. పైగా హవిస్సుచే అగ్ని పెంపొంది నట్లు పెంపొందును. భూమి యందు గల ధాన్య సంపద, బంగారము, పశువులు, స్త్రీలు ఇవన్నియు నొక్కనికి గూడ తృప్తి నీయ జాలవని తెలిసిన వాడు మోహ పడడు. ఎపుడు సర్వ భూతములపై త్రికరణము (మనస్సు, వాక్కు, శరీరము) లచే పాపాలోచన చేయడో; అపుడా జీవుడు బ్రహ్మయే యగును. ఎప్పుడెవ్వడెవ్వరి వల్ల గాని జడియడో, తన వలన నెవ్వరు గాని జడియ కుందురో, ఎప్పుడెవవ్వ డేదియు కావలయునని గాని యక్కర లేదని గాని యనడో యపుడాతడు బ్రహ్మ భావ మందును, దుర్మతులకేది వదిలించు కొన రానిదో, యేది నరునికి ముదిమి కదిపిన కొలది తాను ముదిమి గొనదో, ఏది ప్రాణాంతక మయిన రోగమో ఆ తృష్ణ (ఆశ) అను దానిని వదిలించు కొన్న వానికే సుఖము. జరితుడైన కొలది కేశములు జర్జిరితము లగును. జుట్టు నెఱియును దంతములు జరితము లగును కాని ధనాశ, జీవితాళ మాత్రము జరితములు గావు. లోకమున కామ సుఖము గాని దివ్య మయినది అనగా స్వర్గాది తేజోమయ లోకములలో గల్గు సుఖము గాని తృష్ణాక్షయము వలన గలుగు సుఖము యొక్క పదునారవ కళకేని సరి కాదు.

అని చెప్పి రాజర్షి యైన యయాతి భార్యతో నడవి బ్రవేశించెను. (వాన ప్రస్థాశ్రమము స్వీకరించెను.) చాల కాలము విపుల తప మొనరించి అంత మందు భృగుతుంగ (పర్వత శిఖర) మందుండి నిరాహారియై మేను విడచి పత్నితో స్వర్గమున కేగెను. సూర్యుడు కిరణములచే నావరించి నట్లాతని వంశీయులు రాజర్షు లయిదుగు రఖిల భూమండల మావరించిరి. పృష్టి కుల వర్ధనుడై నారాయణుడు శ్రీకృష్ణుడుగ నవతరించిన, రాజన్యులచే పొగడ్త గాంచిన యదు వంశమున కీర్తించెదను. వినుడు! బ్రాహ్మణోత్తము లారా! ఈ యయాతి చరితము నిత్యము వినునతడు స్వస్థుడు, సంతానవంతుడు, ఆయుష్మంతుడు, కీర్తిమంతుడు కాగలడు.