బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
34 - రుద్రాఖ్యానమ్
సర్వాంతర్యామి యైన రుద్రుడు ఉమా దేవికి ప్రియము చేయువాడై సర్వ దేవతలను సిద్ధ విద్యాధరులను ఋషులను గంధర్వ నాగ యక్షాదులను మఱి యజ్ఞమునకు వచ్చిన యందఱిని పారద్రోలి సర్వ శ్రేష్ఠ పదార్థములతో నిండిన యజ్ఞమును సర్వ సంభారములతో నశింప జేసెను. స్వామి ప్రతాపమున కడలి యింద్రాదులు శాంతి కరవై కైలాసమున కేగి వరదుడైన యా శూలపాణిని దక్ష యజ్ఞ ధ్వంసకుడైన భగవంతుని శరణందిరి. అప్పుడు పరమశివు డేకామ్రక (కాంచీ) క్షేత్ర మందు సర్వకామ ప్రదుడై యుండెను.
సర్వ భూత హితాభిలాషి యైన శివు డేల యా యజ్ఞమును సంహరించెను. సర్వ దేవతలు నందలంకరించి యున్నారు గదా స్వల్ప కారణమున నట్లు జరిగినదని మే మనుకొనము. మీ వలన విన మిక్కిలి గుతూహల మగు చున్నది.
దక్షుని కెనమండుగురు కూతుండ్రు. వారందరు వివాహితులు. వారిని తండ్రి రావించి తన యింట సత్కరించెను. వారును బుట్టింట నాదరమంది వసించిరి. వారిలో బెద్దది యగు సతి యను శివుని భార్యను దక్షుడు రుద్రుని ద్వేషించి పిలువ డయ్యెను. అందుల కల్లుడు పరమేశ్వరుడు నైజముగ దన ప్రభావమున దానున్న వాడు గావున నా మామగారి యెడ నేకొంచెము వినయము చూప డయ్యెను. సతీ దేవి తండ్రి గృహమునకు జెల్లెండ్రందరు వచ్చిరని యెఱింగి తానును బిలువ కున్నను నట కేగెను. తండ్రి అందరు కూతురుల కంటె నామెను హీనముగ జూచి వారి కంటె తక్కువగ నాదరించెను. అంతట సతీ దేవి కినుక గొని తండ్రితో నిట్లనియె.
నా కన్న నీ కన్యలు చిన్నలు. నేను పెద్ద ఆడ పడుచును. నన్ను బూజింప వైతివి. అంతే కాదు అలుసు సేసితివి. నేనిందఱిలో పెద్దను యోగ్యత లోను బెద్దను. నన్ను సత్కరింప దగిన వాడవు.
అని సతీ దేవి యన విని దక్షుడు కన్నెఱ్ఱ చేసి యిట్లనియె.
ఆ నా కన్నియలు నీ కన్న నన్నివిధములు మిన్నలు. యోగ్యలు. వారి భర్తలు గూడ నాకెంతేని గూర్తురు. బ్రహ్మిష్ఠులు వ్రతనిష్ఠులు ధర్మిష్ఠులు. యోగ నిష్ఠులు గుణ గరిష్ఠులు నిటలాక్షుని కంటె పలు విధముల నందఱు మెచ్చ దగిన వారు. వారు వశిష్ఠుడు అత్రి పులస్త్యుడు అంగిరుడు పులహుడు క్రతువు భృగువు మరీచి అనువారు. పశుపతి వారితో గూడ స్పర్థ గొనును. వారును నాతనిని ద్వేషింతురు. అందు వలన నిన్ను నేను గౌరవింపను. నాకు శివుడు ప్రతికూలుడని మూఢ బుద్ధియైన దక్షు డామెతో ననెను. శాపమునకు దాను గురి కావలసిన విధి ననుసరించి యిట్లు ఋషులను నల్లుని దూలనాడెను. అంత నా దేవి కోపము దెచ్చికొని తండ్రితో నిట్లనియె.
త్రికరణముల చేత పరిశుద్ధురాల నైన నన్ను గర్హించితివి. కావున నీ వలన వచ్చిన యీ దేహము నిదిగో విడుచు చున్నాననెను.
అని ఆ యవమానము సైవనేరక దుఃఖముతో నా దేవి దక్షున కిట్లనియె
ఈ మేను విడిచి మఱియొక్క ఉపాధితో వెలుగొందుచు నేను పొరపాటు పడని దాననై ధర్మ నిష్ఠనై పరమేశ్వరునికి ధర్మ పత్ని నయ్యెదను గాక.
అని యక్కడనే కూర్చుండి, దుష్టుడగు దక్షుని సాధించుటకు తాన తన యందగ్ని ధారణ చేసెను.
ఆ అగ్ని వాయు ప్రేరితుడై యామె అన్ని యవయము లందుండి వెలువడి యామెను భస్మ మొనరించెను. శూలపాణి యామె నిర్యాణ వార్త విని తండ్రి కూతుండ్ర యా సంవాదము నున్న దున్నట్లు దెలిసి కొని భగవంతుడా శంకరుడు దక్ష వినాశమునకై కుపితు డయ్యెను.
అట్లు కోపించి శంకరు డిట్లనియె. ఓ దక్షా! పిలువని పేరంటముగ వచ్చి సతీ దేవి నీచే నవమానితు రాలైనది కావున నీ తక్కిన కూతుళ్లు మగలతో నుత్తమరాండ్రు గావున వైవస్వత ద్వితీయ మన్వంతరమున నీ మహర్షులు అయోనిజులై నీ యజ్ఞమునకు వత్తురు. చాక్షుష మన్వంతరమున బ్రహ్మ గావించు సత్రయాగ మందు హోమము జరుగగా నిట్లు జరుగును. అని సప్తర్షులను శపించి రుద్రుడు దక్షునికిట్లు శాప మిచ్చెను. చాక్షుష మన్వంతరమున ప్రాచీన బర్హిపౌత్రుడు ప్రచేతసుని పుత్రుడు వైదక్షుడను నీ పేరుతోనే మారిష యందు నీవు జనింతువు ఆమారిష వృక్షములకు కన్యయై జనించును. నే నక్కడ గూడ దుర్బుద్ధివగు నీకు ధర్మ కామార్థ యుక్తము లయిన నీ కర్మాచరణము లందు మఱి మఱి విఘ్నములు గావింతును ఇట్లు శప్తుడై యా దక్షుడును రుద్రున కెట్లు ప్రతిశాప మిచ్చెను.
ఓ క్రూరుడా! నా కొఱకు ఈ మహర్షులను గూడ తూల నాడితివి. కావున యజ్ఞము లందు దేవతలతో బాటు నిన్నెవ్వరును యజింపరు. ఒక వేళ నీకాహుతి యిచ్చినను, (రుద్రుని కిచ్చిన యాహుతి యనంతరము) పవిత్రులగుట కుదక స్పర్శ గావింతురు. యుగాంతము వరకీ లోకముననే నీవుందువు. దేవతలతో బాటు పూజ నీ కుండదనెను.
దేవతలు తమలో గల చతుర్వర్ణముల వారితో గలిసి భుజింతురు. వారితో గలిసి నేను భుజింపను. వేరే భుంజితును. అన్ని లోకములకు మొదటిది భూలోక మందురు. ఆ లోకమును నా యంతట నేనొక్కడనే ధరింతును. నీ యాజ్ఞతో గాదు. (నీ యాన అక్కర లేదు) ఈ కర్మ భూమిని ధరించి నంతట నెల్ల లోకములు శాశ్వతముగ సుస్థిరములై నిలువ గలవు. అందుచే నే నీ భూలోక మందే యుందును. అదియు నీ యాజ్ఞ చేత గాదు. అని రుద్రుడనెను.
అమిత తేజో మూర్తి యగు రుద్రునిచే నిట్లు దక్షుడు నొవ్వనాడ బడి స్వాయంభువ మూర్తిని విడిచి (ప్రజాపతత్వము గోల్పోయి) మనుజులం దిక్కడ మానవ లోకమున జనించి దక్షుడను పేరుతోనే గృహస్థుడై యజ్ఞము లందు యజమానుడై దేవతలతో గూడ నెల్ల యజ్ఞముల నాచరించెను.
ఆ మీదట సతీ దేవి వైవస్వత మన్వంతరము రాగానే హిమవంతునికి మేనక యందు “ఉమా” నామ్నియై అవతరించెను. ముందు సతియను పేరంది యా మీద “ఉమ” అను నామమందెను. శంభుని కీమె సహధర్మ చారిణి. ఆయన యీమె నెన్నడును విడిచి యుండడు. మరీచి కుమారుడైన కశ్యపుని అదితి నారాయణుని శ్రీదేవి, ఇంద్రుని శచీదేవి, విష్ణుని కీర్తి, సూర్యుని ఉష, వశిష్ఠు నరుంధతియు నట్లు శంకరు నీమె యెన్నడును విడువదు. పరమేశ్వరున కీమె నిత్యానపాయిని. మున్నిట్లా దక్షుడును చాక్షుష మన్వంతర మందు బ్రహ్మ గావించిన యజ్ఞము నందు ప్రాచీన బర్హికి పౌత్రుడుగను బ్రచేతసులకు పుత్రుడు గనునై మారిష యందు జనించెను. ఇది మునుపు త్రేతా యుగమున వైవస్వత మనువు కాలమున బ్రహ్మ వరుణ దేవతాకమైన మూర్తి ధరించి గావించిన యజ్ఞము నందు దక్షుని జన్మము జరిగినది. అల్లుడు మామలకు కలిగిన యీ విరోధము జన్మాంతరమును పొందినది. కావున నుత్తము లొండొరులు విరోధము పెట్టుకొన గూడదు. శుభా శుభకర్మ ఫలములచే భావితుడై (అనగా ప్రారబ్ధమునకు అధీనుడై) యుండు జీవుడు ఆ కారణముచే జాత్యంతర మందు పుట్టి నపుడు వానికిని పూర్వ జన్మ ఖ్యాతి (యోగ్యత) రాదు. ఆ పుట్టువులో కార్యాకార్య విఛక్షణత యున్నను తొల్లిటి కర్మానుభవ మెంత వారికిని దప్పదన్న మాట.
బ్రహ్మ పలుకులు విని మును లిట్లనిరి. దక్ష కన్య సతీదేవి రోషము గొని మేరు విడిచి పర్వతరాజింట జనించె గదా! అపుడు మఱల నా భవానికి భపునితో సమావేశ మెట్లయినది. వారికా ఘట్టము నందు జరిగిన సంవాదమేమి? ఆ మహా పుణ్య జన్మ మందు స్వయంవర మెట్లయ్యె వారి కల్యాణ మహోత్సవ మచ్చెరువు గొల్పునది గదా! అదెల్ల సవిస్తరముగ నానతీయ దగుదువు. అ పుణ్య కథ మనోహరము మేము విన గుతూహల పడు చున్నామన బ్రహ్మ యిట్లనియె.
ఓ ముని వర్యులార! పాప హరమగు నా ఉమా శంకర కల్యాణము పవిత్రము. కామ ఫలదము. ఒకప్పుడు తన యింటి కరుదెంచిన కశ్యప మహర్షిని హిమవంతుడు పుణ్య యశఃకరమగు నొక వృత్తాంతము నిట్లడిగెను. మునీ! ఏమి చేసిన నక్షయ పుణ్య లోకములు గల్గును? పరమోత్తమ ఖ్యాతి దేని వలన వచ్చును? సత్పురుషు లెవ్వరెట్లు పూజింప వలసి యుందురది యాన తిమ్మన కశ్యపు డిట్లనియె.
నీ తెల్పిన భాగ్యమెల్ల సంతానము వలన గలుగును. నేను (చతుర్ముఖ బ్రహ్మ) పరమర్షు లెల్లరు సంతాన లాభముచే ఖ్యాతి గన్నారము. గిరీంద్ర! నీవు చూచుట లేదా! మఱి యడిగెద వేమి? మున్ను నేను గన్న వృత్తాంతమిదె చెప్పెద వినుము. వారణాసి కేగుచు నాకాశ మందున్న యొక నూతన దివ్య విమానము గాంచితిని. దానికి గ్రిందుగ నొక గుంట నుండి యొక యేడుపు ధ్వని విన్నాను. నా తప శ్శక్తిచే దాని నెఱింగి యచట కేగి దాగి నిలిచితిని. అటనొక పవిత్ర మూర్తి తపస్వి తీర్థముల సేవించి యభిషేకము గావించుకొని యా దారి నేగుచు నొక బెబ్బులికి బెదరి యాగుంట దరికి పరువిడి వచ్చెను. అక్కడ నొక అవురు గడ్డికాడను బట్టుకొని వ్రేలాడు మునుల గాంచెను. అట్లుగని యార్తుడై దుఃఖించు చున్న వారల నెవ్వరు మీరు ఈ గడ్డి దుబ్బు నూతగొని మొగములు క్రిందికి వాల్చి వ్రేలాడు చున్నారు. మీ దుఃఖమునకు విముక్తి గలుగ గలదు చెప్పుడు. అన పితరు లిట్లనిరి.
మేము పుణ్య కర్ముడవగు నీ తండ్రులము, తాతలము, ముత్తాతలమును. నీ పాప కర్మముచే మేమిట్లు క్లేశపడు చున్నాము. ఈ గుంట గుంట గాదు నరకమే. నీవే యీ అవురు గడ్డి దుబ్బు. నిన్నే యూత చేసికొని వ్రేలాడు చున్నాము. నీవు బ్రతికినన్నాళ్ళు మేమిచ్చట నిట్లుందుము. నీవు మరణించి నంతట మేము నరకము పాలగుదుము. నీవు పెండ్లి సేసికొని గుణవంతుని పుత్రుని గంటివేని మే మీ పాపము నుండి ముక్తు లగుదుము. మఱి యే తపస్సు యొక్క తీర్థముల యొక్క ఫలమునను మాకు విముక్తి రాదు. బుద్ధిమంతుడవు గావున నీ పితరులను మమ్మీనరక భయము నుండి తరింప జేయుము. అన గశ్యపు డనియె.
అట్ల చేసెదనని యాతడు వృషభ వాహను నారాధించి యాగర్తము నుండి పితరుల నుద్ధరించి శివుని ప్రమథ గణముల నాయకులం గావించెను. తాను సువేశుడను పేర బలశాలియై రుద్రుని గణ నాయకుండయ్యె. కావున నో శైలేంద్ర! తీవ్ర తపస్సు సేసి గుణ శాలియైన సంతానముం గనుము. పరమ సుందరిని గూతురుం గాంచుము.
ఇట్లా ఋషిచే దెలుప బడి కొండఱేడు నియమమూని అనుపమ మయిన తపస్సు గావించెను. దాన నాకు సంతుష్టి గల్గినది. వెంటనే నేనాతని కడ వ్రాలితిని. నీ తపమ్మునకు మెచ్చితిని. వరమిచ్చెద నడుగు మంటిని.
సర్వ గుణాలంకారుం గుమారుం గోరెవ నాయెడ సంతుష్టు డైతివేని అనుగ్రహింపుమని శైల రాజనియె.
ఆతని మాట విని యాతని మదికనువైన వర మిచ్చితిని. ఓ శైల రాజ! ఈ తపః ప్రభావమున నీ కొక కన్య యుదయించును. దాన నీవు పరమ శోభనమైన కీర్తి నొందెదవు. ఎల్ల వేల్పులు నిన్నర్చింప కోటి తీర్థములకు నెలవై పావనుడవై దేవతల కెల్ల పూజనీయుడ వయ్యెదవు. ఆ కన్నియ నీకు పెద్ద కూతురగును. మరి ఇద్దఱు కన్యలు కలుగుదురు.
బ్రహ్మ యన్నట్లు హిమవంతుడు మేన యందు కన్యకం గాంచెను. మేనాదేవి యందు హిమవంతుడు మఱి కొంత కాలమునకు అపర్ణ ఏక పాటల ఏక పర్ణ అను కన్యల వడసెను. ఆకు కూడ తినక అపర్ణయు మఱ్ఱియాకు నొక దానిని తిని యేక పర్ణయు పాటలమను చెట్టు నాకొకటి తిని నీడను నిలువక ఏక పాటలయు తపస్సు చేసిరి. ఇట్లు వారు వే యేండ్లు తపస్సు గావించిరి. అప్పుడు తల్లి మేనమాతృ ప్రేమతో ఉ+మా తపస్సు వద్దు చాలింపు మనియె. అట్లు తనను నిషేధించు చున్నను దీవ్ర తపంబు గావించి నందున అదే పేరుతో అనగా “ఉమా” అను పేరుతో దేవతలకు బూజనీయయై ప్రఖ్యాతి నందెను. చరా చరాత్మక మైన యీ జగత్తు త్రికుమారీకము అనగా నీ ముగ్గురు కుమార్తెలతో (శక్తులతో) నిండినది. వీరి తపో వృత్తాంతమును భూమి యెంత వఱకు ధరించునో అనగా ఈ చరిత్ర భూలోకము నందు వాడబడి నంత కాలము తపోమూర్తులైన యీ ముగ్గుర శక్తులు యోగ భూమిక యందుండి స్థిర యౌవనులై లోక మాతృకలయి బ్రహ్మచారిణులై తమ తపస్సుచే నెల్లప్పుడు లోకముల ననుగ్రహింతురు. వారిలో జ్యేష్ఠురాలు (పెద్దది) శ్రేష్ఠురాలు గూడ. మహా యోగ బలముతో గూడి మహేశ్వరుని బొందినది.
భృగు కుమారునికి ఏకపర్ణ భార్యయయ్యె. ఆమె దేవలుడను పుత్రునిం గనియె. ఆ మువ్వురు కుమారికలలో మూడవ యామె ఏకపాటల అలర్కుని కుమారుడగు జైగీషవ్యునిం బెండ్లాడినది. ఆమెకు శంఖ లిఖితులను నిద్దరు పుత్రులు అయోనిజులు గల్గిరి. నేకేను దెల్పిన ఉమాదేవి పరమ సుందరి. ఆమె తపన్తీ వ్రత చేత ముల్లోకములు పొగలు గ్రమ్ముట చూచి నేను (బ్రహ్మ) ఆమెతో దేవీ కళ్యాణివి నీవు తపస్సుచే లోకముల నేల తపింప జేయుదువు. నీ చేత నీ జగత్తు సృష్టింప బడినది. నీవదానిం బట్టించిన దానవు. నీవు దీనిని నశింప జేయ దగదు. నీ తేజముచే నీ లోకముల నన్నిటిని ధరించు చున్నావు. ఓ జగన్నాతా! నీవు కోరునదేమో మా కిపుడిక్కడ తెలు మన దేవి నేనెందుల కీ తపస్సు చేయు చున్నానో నీవే యెఱుంగుదువు. మఱి నన్నేల ప్రశ్నింతు వనెను.
అంతట నేనామె కిట్లంటిని. ఎవని కొఱకు నీవీ తపస్సు చేయు చున్నావో యాతడు తానేవచ్చి యిచట నిన్ను వరింప గలడు. నీకు దగిన వాడాశర్వుడు. సర్వ లోకేశ్వరుల కీశ్వరుడు. మే మాయన వశము లోని కింకరులము. ఆ దేవదేవుడు స్వయంభువు. ఆయన ఉదార రూపుడు. విలక్షణ రూపుడును. ఆయనకు సమాన రూపుడు మఱిలేరు. కొండల మీద వసించు వాడతడు. చరాచర సృష్టి కీశ్వరుడాయన. మొట్టమొదటి వాడు. ఊహ కందని వాడు. ఇంద్రుని కీడగు వర్చస్సుతో నిందు బింబము భరింప కుండ ఆదిశేష సమానమైన వర్చస్సుతో భీకరమగు రూపముతో నీ దరికి తాన రాగలడు.
