బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
59 - శ్వేతమాధవ మాహాత్మ్య వర్ణనమ్
అనంత వాసుదేవ మూర్తిని సేవించన వారు పాప ముక్తులై పరమపద మందుదురు. ఈ స్వామిని నేనును నింద్రుడును సేవించినాము. అటుపై విభీషణుడు రాముడు సేవించిరి శ్వేత గంగ యందు స్నానము చేసి శ్వేత మాధవుని మత్య్సమూర్తి యైన మాధవుని దర్శించిన యతడు శ్వేత ద్వీపమున కేగును.
శ్వేత మాధవుని మహాత్మ్యమును చెప్పుడు. శ్వేత మాధవుని విగ్రహమును ప్రతిష్టించిన వారెవరు? అని అడిగిరి.
కృతయుగ మందు బుద్ధిమంతుడు ధర్మజ్ఞుడు శూరుడు సత్య సంధుడు వ్రత నిష్ఠుడునైన శ్వేతుడను రాజు యొక్క రాజ్య మందు మానవులు పదివేల సంవత్సరముల యాయుర్దాయము గల్గి యుండిరి. కొంత కాలమునకు కపాల గౌతముడను ఋషి పండ్లు కూడ రాని స్థితిలో మరణించిన తన కుమారు నెత్తుకొని రాజు నొద్దకు గొని వచ్చెను.
వానింజూచి యా శిశువును యమ లోకము నుండి తిరిగి తీసికొని రానిచో నేడు రోజులలో చితి యెక్కెద నని ప్రతిజ్ఞ చేసెను.
అట్లు చేసి వేలకొలది. పద్మములతో మహా దేవుని పూజించి శివ మంత్రములను జపించెను. అతని భక్తికి మెచ్చి మహేశ్వరు డుమాదేవితో సాక్షాత్కరించెను. అంతియ కాదు నీ భక్తికి సంతుష్టుడ నైతి ననెను. శరత్కాల మందలి చంద్రబింబ మట్లు మొల్ల మొగ్గల వలె తెల్లగ నున్న విభూతి దాల్చి శార్దూల చర్మమూని, చంద్ర శేఖరుడునై దర్శన మిచ్చిన ఫాలాక్షుని దర్శించి నమస్కార మొనరించి శ్వేతుండిట్లనియె.
స్వామీ! నాయందు ప్రసన్నుడ వైతినేని, కాల వశుడైన ఈ బ్రాహ్మణ శిశువు బ్రతుకు గాక! ఆకాల మృతుడైన యీ బాలుని సంపూర్ణా యుష్మంతుని క్షేమ వంతుని జేయుమని కోరెను.
శ్వేతుని యా పలుకులు విని శివుడా నందము వడి కాలమును నియమించి సర్వభూత భయంకర మైన యముని శాశించి మృత్యుముఖ గ్రస్తుడైన నా బాలుని జీవింప జేసెను. మహాదేవుడు. గౌరితో ముని కుమారుని సర్వ జగత్తును క్షేమ సంపన్న మొనర్చి యంతర్థాన మయ్యెను.
ఆ శ్వేత నృపతి వృత్తాంతమును సవిస్తరముగా దెల్పుమని యుడగ జగత్ర్పభు విట్లు పలికెను.
ఈ కథ సర్వజీవ హితకరము. మాధవుని మహాత్మ్యము సర్వ పాప ప్రణాశనము. సర్వకామ ఫల ప్రదము. నేను ఋషుల వలన వింటిని. భయ దుఃఖములను హరించు నీ దివ్య కథను వినుడు. శ్వేతుడు వేలేండ్లు చక్కగ పాలించి లౌకిక వైదిక ధర్మ విచారణ చేసి దక్షిణ సముద్ర తీర మందలి క్షేత్రముల కేగి కృష్ణాష్టమి నాడు సలక్షణ మైన విష్ణు ప్రాసాదమును నిర్మించెను. అది నూరు ధనస్సుల పరిమాణము గలది. శ్వేతశైల మయమైన భగవన్మూర్తిని మాధవుని మూర్తి నందు స్వయముగా ప్రతిష్ఠించెను. బ్రాహ్మణులకు తపస్వినులకు దీనులకు ననాధులకు నమ్మాధవుని సన్నిధిని దానముల నొనరించి స్వామి యెదుట పుడమిపై వ్రాలి ప్రణవ పూర్వకమైన ద్వాదశక్షర మంత్రమును జపించుచు నొకమాసము మౌన వ్రతుడై నిరాహారుడై యవ్విష్ణు పదమందు సమాధి నిష్ఠు డయ్యెను. జపాంత మందు దేవేశ్వరు నిట్లు స్తుతించెను.
ఈ స్తోత్రము విష్ణునామ మధురము, సరళము, సులభార్ధము.
మఱియు నిట్లనియె. ప్రభో! నన్ను నరకము నుండి యుద్ధరింప గల బంధువు నీకంటె లేడు. కాయికమలము మానసిక మలము నను వాని కంతము లేదు. వానిని క్షాళనము సేయ నీకంటె నెవ్వరు లేరు. సర్వ సంగముల నెడలి నిన్ను జేరితిని. నీతో నెన్నడును నాకు సంగము గలుగు గాక. అది యాత్మ లాభము (స్వరూప దర్శనము) కొఱకు సమర్ధ మగుగాక. ఈ సంసార మపార కష్ట భరిత. నేను తాపత్రయ పరితప్తుడను. నిన్ను శరణు సొచ్చితిని. దారేషణ పుత్రేషణలచే మాయా మోహితుడనై లొభాది గుణములచే ఆకర్షితుడనై నిన్ను శరణందితిని. సాంసారిక సుఖ మించుకైన లేదు. యజ్ఞేశ్వరా! మనసు నీవంక ప్రవర్తించి నిష్కామ మైన ఆత్యంతిక సుఖము (మోక్షము) బొందుదును గాక. వివేక శూన్యుడనై యున్నాను. జగత్తు వ్యక్తావ్యక్తము. ఓ గోవిందా! రక్షింపుము. సంసారము నుండి యుద్ధరింపుము. మోహరస మయము దుస్తరము నైన భవాబ్ధిలో మునిగిన నన్నుద్ధరింప గలవాడు ఓ పుండరీకాక్ష! నీ కంటె మఱి గనబడడు.
ఇట్లు శ్వేతునిచే వినుతుడై యా పురుషోత్తమ క్షేత్రమందు జగద్గురువు హరి సర్వ దేవతలతో సాక్షాత్కరించెను. ఆ మూర్తి నీల మేఘుడు. పద్మనేత్రుడు. తేజోమండ లాంతర్గతుడు. ఆయన వామ హస్తమున పాలవెల్లి చందమామ వొలె పాంచజన్య మను శంఖము వెలుగొందు చుండెను. గదా శారజ్గ ఖడ్గ ధరుడై గరుడ ధ్వజుడు వచ్చి రాజా! నీబుద్ధి స్వచ్ఛ మైనది. భక్తిభరిత మైనది. ఓ పుణ్యశాలి! ప్రసన్నుడ నైతిని. అభీష్ట వరమును గోరుమన
శిరసు వంచి తద్గత మనస్కుడై స్వామి పరమామృత వాక్యములను విని శ్వేతు డిట్లనియె. ప్రభో! నేను భగవద్భక్తుడ నేని బ్రహ్మ లోకము కంటెను మీదిది, విమలము, విరజము శుద్ధము సంసార సంగ రహితము అవ్యయము నగు విష్ణు పదమును నీ యనుగ్రహమున నందగోరు చున్నాను అని విన్న వించెను.
దేవ, ముని,సిద్ధ, యోగి గణముల కందని పరమ రమ్య మైన స్థానమునకు నీవు వెళ్ళ గలవు. రాజ్యాసనము, రాజ్యా మృతము, నుపాసించి సర్వ లోకములు దాటి నాలోకమున కేగ గలవు. నీకీర్తి త్రిలోక వ్యాప్త మగును. ఎల్లప్పుడు నా సాన్నిధ్యము కలుగును. ఇది శ్వేత గంగయని దేవ దానవులు గానము చేయుదురు. ఈ శ్వేత గంగా జలమును గుశాగ్రము చేత స్పృశించినా భక్తులు సమాధి నిష్ఠులై స్వర్గమున కేగ గలరు. ఈ శ్వేత మాధవ విగ్రహము వెన్నెల కాంతి మించును. శంఖము గోక్షీరము వలె అచ్ఛమైనది. ఈ మూర్తి సదా అఘ వినాశిని. తెల్ల తామర పూల వలె మెఱయు నేత్ర శోభ గలది. ఈ ప్రతిమకు నమస్కరించి సర్వ లోకములను దాటి నా లోకమందు ననేక మన్వంతరములు దేవ సుందరీ పరివృతుడై మధురముగ గానము చేయ బడు కీర్తి గలవాడై సిద్ధ గంధర్వ సేవితుడై నా భక్తులతో నతడు విపుల భోగముల ననుభవించును. అట నుండి పుడమిపై బ్రాహ్మణుడై వేద వేదాంగ వేత్తయై భోగియై, సమృద్ధుడై, శుచియై, యదృష్ట వంతుడై, రూప వంతుడై పుత్ర పౌత్రాదులతో సుఖించు పురుషోత్తమును మరల జేరి యా వటమూల మందు జేరి యీ సముద్ర మందు హరి స్మరణ చేయుచు దేహమును వదిలి శాంత పద మందును.
