బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
176 - అనంత వాసుదేవ మాహాత్య్యమ్
భగవంతుని కథను ఎంత విన్నను మాకు దృప్తి కలుగట లేదు. అనంత వాసుదేవుని మహిమను దాము వర్ణించి నారు. కాని యందలి రహస్యమును విస్తరించి పలుకుడు అన బ్రహ్మ యిట్లనియె.
ముని శ్రేష్ఠులార! పరమ సారమైన అనంత వాసుదేవుని మహిమ భూలోక వాసుల కందనిది. ఆది కల్పమందు అవ్యక్త జన్యుండ నగు నేను విశ్వకర్మం బిలిచి యిట్లంటిని. ఆతడు దేవశిల్పి శ్రేష్ఠుడు విశ్వకర్మ లందరికి నగ్రేసరు డయిన పనివాడు. వాసుదేవుని ప్రతిమను శిలామయ మైన దానిం జేయుము. దానిం దర్శించి ఇంద్రాది దేవతలు మనుష్యాది భూలోక వాసులు దానవుల వలన, రక్షస్సుల వలన గలుగు భయము తొలగి స్వర్గముంబొంది సుమేరు శిఖర మందెల్ల కాలము నా వాసుదేవు నారాధించి యే యడ్డును లేక నివశింప గలరు.
ఇట్లేను తెలుప విని విశ్వకర్మ యాక్షణము యొక్క ప్రతిమం దయారు సేసెను. శంఖ చక్ర గదలం గొని శ్రీవత్స చిహ్నము వనమాలయుం దాల్చి తెల్ల దామర పూవులట్టి నేత్రములు గల్గి కిరీటము భుజకీర్తులు ధరించి పీతాంబరము గట్టకొని మణి కుండలము మెఱయ శోభించు నందమగు విగ్రహమది నిర్మింజేసి రహస్య మంత్రములచే నేనే యొక పుణ్య లగ్నమందు ప్రతిష్ఠ సేసితిని. ఆ సుముహూర్తమునకు దేవరాజు వేల్పులం గూడి యైరావత మెక్కి బ్రహ్మ సదనమున కేగి స్నాన దానాదు లొనరించి యా విగ్రహమును మఱి మఱి పూజించి తన నగరమునకు తిరిగి వచ్చెచు. అచట నవ్విగ్రహము నర్చించి త్రికరణములను నియమించు కొని వృత్రుడు సముచియ మొదలుగా గల యసురులం జంపి ముల్లోకముల నేలెను.
రెండవ త్రేతా యుగము రాగా మహావీర్యుడు రావణుడు పుట్టెను. పది వేలేండ్లు నిరాహారియై జితేంద్రియుడై యసాధ్య మైన ఉగ్ర తపముల జేసెను. దాన నేను సంతుష్టుడనై దేవతలకు దైత్యులకు నాగులకు రాక్షస్సులకును నీవవధ్యు డగుదువని వర మిచ్చితిని. యమ కింకరులకు కూడ వాడవధ్యుడయ్యె. వాని కొడుకింద్రజిత్తు మేఘ నాదుడను పేరొంది యింద్రునిం గెల్చి స్వర్గ రాజ్యము వడసె. రావణు డమరావతిని స్వాధీనము సేసుకొని యింద్ర గృహమందు వాసుదేవ మూర్తిని యింత మున్ను వర్ణించినయ యాకృతిని దర్శించెను. అంతట నట గెల్చుకొన్న రత్నములను (శ్రేష్ఠము లగు సామగ్రిని) వదలి వేసి యా వాసుదేవ విగ్రహ మును విమానము మీద లంకకు గొని తెచ్చెను.
అప్పుడు మంత్రియు నగరాధ్యక్షుడయి యున్న విఖీషణుడు ధర్మమూర్తి గావునను నారాయణ భక్తి పరాయణుడయి నందున నింద్ర భవనము నుండి దిగి వచ్చిన యా విష్ణు విగ్రహముం గని మేను పులకరించి యచ్చెరువంది తల వంచి నమస్కరించి సంతుష్టాం తరంగుడై ఇప్పుడు నా జన్మము ధన్య మయ్యె. ఇప్పుడు నా తపస్సు ఫలించినది. అని మఱిమఱి సాలి మ్రొక్కి పెద్దన్న యగు రావణుని కడకేగి దోసిలొగ్గి ప్రభూ! ఈ ప్రతిమను నాకు బ్రసాదింపుము. దీని నారాధించి సంసార సముద్రముం దాటెదను. అన దశాననుడు తీసికొను మిదిగో విగ్రహము. దీనితో నేనేమి చేయుదును. సర్వభూత కారణుడగు బ్రహ్మ నారాధించి ముల్లోక విజయము గావించితి ననియె.
విభీషణు డచ్చెరువు గొలుపు నామూర్తిని గ్రహించి నూట యెనిమి దేండ్లు పూజించి జరా మరణములు లేని స్థితిని (చిరంజీవిత్వమను) అణిమాది విభూతులను బడసి లంకా రాజ్యా ధిపతియై యభీష్ట భోగముల ననుభవించు చున్నాడు.
అనవిని మును లహో! చాల యాశ్చర్య కరమైన కధ వింటిమి. అయ్యనంత వాసుదేవ ప్రభావమింకను విస్తరముగ తెలుపుమన బ్రహ్మ యిట్లనియె
అయ్యెడ నా రాక్షసుడు దశ కంఠుడు దేవ గంధర్వ కిన్నరుల వోడించి లోకపాలుర నవని పాలు రందపస్వులను సిద్ధులను గెలిచి వారి యిల్లాండ్ర గొనితెచ్చి తన రాజధాని యందు లంకలో ననుంచి సీతాదేవి యెడ మోహ వివశుడై బంగారు లేడి రూపు (మారీచు) నితో బయలు దేరి సీత నపహరించెను. అంత కోపించన రాముడు లక్ష్మణునితో గూడి యుద్ధము నందు రావణునిం జంపుటకై తొలుత వాలిం జంపి సుగ్రీవుని వానర రాజ్యమంద భిషిక్తుని గావించెను. అంగదుని యువరాజుం జేసెను. హనుమదాది కపి వీరులతో కొండలం బడవైచి సముద్రమునకు సేతువుం గట్టి సేనలతో వార్థిదాటి అనుపమ మైన రణ మొనరించి ప్రహస్త నికుంభ కుంభకర్ణాదుల నింద్రజిత్తునుం జంపి రావణం బరిమార్చి అగ్ని శోధనము సేసి జానికిం గ్రహించి విభీషణునికి లంకా రాజ్య మొసంగి యటనున్న వాసుదేవ మూర్తింగొని పుష్పక మెక్కి యవలీలగ లీలామానుష మూర్తి రామచంద్ర మూర్తి యయోధ్య కేతెంచి భక్త వత్సలుండ రామచంద్ర ప్రభువు భక్తి భరితు నిందమ్ముని భరతుని పిన తమ్ముని శత్రుఘ్నుని సర్వ సామ్రాజ్యధినేత లట్లు గౌరవించి సనాతన వాసుదేవ మూర్తి నారాధించి పదనొకండు వేలేండ్లు అయోధ్యను బాలించి యా విష్ణు విగ్రహమును సముద్రుని కొసంగెను. అట్లొసంగుచునో వారిథీ! నీవు ధన్యుడవు. ఈ మూర్తి రక్షణము నీ పని. నీవు సర్వరత్న నిధివి అనెను.
అనియె ద్వాపర యుగ మందు జగన్నాధుండు హరి భూదేవి ప్రార్థనచే ఆమెకు గల్గిన భావ వైకల్యమును వారింప వసుదేవు కులము నంద వతరింపగా సర్వాభిష్ట ప్రదమగు నీ విగ్రహమును సర్వలోక క్షేమము కొఱకు మరి కారణాంతరము నను “పురుషోత్తమము” అను పుణ్యక్షేత్ర మందు సముద్రుడు నీళ్ళ నుండి తానుగా నీ మూర్తిని పైకి లేవ నెత్తెను.
అప్పటి నుండి ముక్తిద మయిన యా క్షేత్రమున నీ మూర్తి వెలసి యున్నది. భక్తితో నీ సర్వేశ్వరుని త్రికరణములను నిగ్రహించి యారాధించు భక్తులు పరమ పద మందుదురు. ఈ అనంత వాసుదేవు నొకమారేని దర్శించి నమస్కరించిన యతడు దశాశ్వమేధ రాజసూయ ఫల మందును. ఆ మీద కామగ విమాన మెక్కి సూర్య సమాన వర్చస్సుతో చిఱు గంటలు మ్రోయ నానంద భరితుడై విష్ణులోక మేగును. ఇరువది యొక్క తరముల వారి నుద్ధరింప గలడు. దేవ గంధర్వ గీయామాను డగును. ప్రళయ పర్యంతము నచట ననంత భోగములను భవించి పుణ్యానుభవ మయిన తరువాత నీ యవని కేతెంచి చతుర్వేద విదుడై వైష్ణవ యోగమున మోక్షము లంబిందును. అనంత వాసుదేవుని మహిమ యిది నేను గీర్తించితిని. ఓ ముని వరులారా! వందలేండ్లు వర్ణించిన నిది తుదముట్ట స్తుతింప శక్యము గాదు.
